breaking news
lakkavarm
-
పెళ్లి వ్యాన్ బోల్తా... ముగ్గురి పరిస్థితి విషమం
గూడెంకొత్తవీధి : వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ పెళ్లి వ్యాను అదుపుతప్పిన ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం వివరాలివి. మండలంలోని గాలికొండ గ్రామానికి చెందిన వధువు, లక్కవరం గ్రామానికి చెందిన వరుడికి బుధవారం రాత్రి వివాహం జరిగింది. ఓ వ్యానులో గాలికొండ నుంచి లక్కవరం గ్రామానికి రాత్రి వారంతా చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం విందు భోజనం అనంతరం స్వగ్రామానికి పయనమయ్యారు. బూసుల ఘాట్ రోడ్డులో బొలేరో వాహనం బ్రేకులు ఫెయిలై అదుపుతప్పింది. ప్రమాదంలో గుమ్మాలగొంది గ్రామానికి చెందిన కాకూరి నర్సింగరావు(45), బత్తునూరు గ్రామానికి చెందిన శ్రీహరి(18), శామ్యూల్(20)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో జి.కె.వీధి పీహెచ్సీకి తరలించగా వైద్యాధికారి రామ్నాయక్ వైద్య చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కొరకు చింతపల్లికి తరలించారు. అక్కడ నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. మిగిలిన 15 మంది కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. వాహనంలో ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని, ఘాట్లో రక్షణ గోడ లేకుంటే లోయలోకి దూసుకుపోయి పెను ప్రమాదం సంభవించేదని బాధితులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సమీర్ తెలిపారు. (చదవండి: వర్షం కోసం గంగాలమ్మ పండగ) -
సముద్ర తాబేళ్లు స్వాధీనం
మోతుగూడెం: రామచంద్రపురం నుంచి చింతూరు మండలం పొల్లూరు మీదుగా ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 338 సముద్ర తాబేళ్లను లక్కవరం ఎఫ్ఆర్ఓ జి.ఉషారాణి స్వాధీనం చేసుకున్నారు. ఆమె విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరం అటవీ రేంజ్లోని 1977 టేకు ప్లాంటేషన్ వద్ద అటవీ బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఇద్దరు వ్యక్తులు జీపులో తాబేళ్లను తరలిస్తూ కంటపడ్డారు. ఆ వాహనాన్ని వెంబడించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా, ఏడు మూటల్లో కట్టిఉన్న తాబేళ్లు లభించాయి. వారిని విచారణ చేయగా.. రామచంద్రపురం నుంచి పొల్లూరు మీదుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్టు తెలిపారు. తాబేళ్లను స్వాధీనం చేసుకుని, పొల్లూరు గ్రామానికి చెందిన మడ్డు గంగునాయుడు, కొల్లు సత్యనారాయణను అరెస్టు చేశారు. దాడిలో డీఆర్ఓ ఎం.జాన్సన్ పాల్గొన్నారు.