నేపాల్ నుంచి మరో 65 మంది రాక
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా నుంచి బతుకుదెరువు కోసం వలస వెళ్లిన జిల్లా వాసులు మరికొందరు శుక్రవారం సాయంత్రం స్వస్థలాలకు చేరుకున్నారు. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి తదితర గ్రామాలకు చెందిన వారు ఏటా నేపాల్కు వెళ్తుంటారు. అయితే ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం ధాటికి ఆ దేశం కకావికలమైన నేపథ్యంలో వారంతా భయాందోళనలకు గురై తిరుగుముఖం పట్టారు.
ఇప్పటికే కొందరు స్వస్థలాలకు చేరుకోగా శుక్రవారం గర్రెపల్లికి చెందిన 65 మంది రైలులో భారత అధికారుల సాయంతో రామగుండం చేరుకున్నారు. అక్కడినుంచి అధికారులు సమకూర్చిన బస్సులో స్వగ్రామానికి చేరుకున్నారు. వారందరికీ తలా రూ.1000తో పాటు 50 కిలోల బియ్యం అందజేయనున్నట్లు ఎమ్మార్వో రజిత తెలిపారు.