breaking news
Justice G. Rohini
-
మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లేదు
• గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా లింగ వివక్ష • ఇప్పటికీ మహిళలకు నిర్ణయాధికారాలు లేవు • కుటుంబాల్లో ఆడ, మగ పిల్లలిద్దరినీ సమానంగా చూడాలి • మహిళా పార్లమెంటులో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి సాక్షి, అమరావతి: మహిళా సాధికారిత కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారికి ఆర్థిక స్వేచ్ఛ లభించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే స్థాయికి మహిళలు ఎదగాలన్నారు. జాతీయ మహిళా పార్లమెంటులో రెండో రోజైన శనివారం ఆమె మాట్లాడారు. శతాబ్దాల నుంచి మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఇప్పటికీ నిర్ణయాధికారాలు వారికి ఉండడం లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో వచ్చిన మహిళా రిజర్వేషన్ల వల్లే తాను జడ్జినయ్యానని చెప్పారు. స్త్రీ, పురుష సమాన త్వం గురించి వేదికలపై మాట్లాడుకుం టున్నా.. వాస్తవంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. పనిచేసే చోట వేధింపులు, సౌకర్యాల కొరత ఇబ్బందికరం గా ఉందన్నారు. తాను నగరంలో పుట్టలేదని, తన తండ్రి ఇంజనీరుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేయడంతో ప్రభుత్వ స్కూళ్లలోనే చదివానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తానిక్కడ ఉండడానికి తన కుటుంబమే కారణమని చెప్పారు. తన తల్లితండ్రులు తనను, తన అన్నదమ్ములను వేర్వేరుగా చూడలేదన్నారు. కుటుంబాల్లో ఆడ, మగపిల్లలిద్దరినీ సమానంగా చూడాలని సూచించారు. ప్రతి విద్యార్థికి తల్లే మొదటి గురువని చెప్పారు. ఐక్యరాజ్య సమితితో ఒప్పందం ఐక్యరాజ్య సమితి మహిళా విభాగంతో ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు చేసే నిధులకు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం సహకారం అందించనుంది. ఈ సందర్భంగా సమితి మహిళా విభాగం ప్రతినిధి ఆసా టొర్కెలెన్స్ మాట్లాడుతూ.. స్త్రీ పురుష సమానత్వంతోనే సమాజాలు ఆర్థికంగా వృద్ధి చెందుతాయని, లింగ వివక్ష ఉన్న సమాజాలు వృద్ధి చెందలేవన్నారు. çసదస్సులో ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. మహిళా శక్తిని వినియోగించుకోలేకపోయాం అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మహిళలను ఒక శక్తిగా సద్వి నియోగం చేసుకోవడం లో విఫలమయ్యామని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు. అన్ని రంగాల్లోనూ వారిని నిర్ణయాత్మక శక్తులుగా తీర్చిదిద్దాల్సి వుందన్నారు. మనిషికి జన్మనిచ్చే మహిళ చివరికి ప్రేక్షకురాలిగానే ఉండిపో తోందని, ఈ పరిస్థితి మారాలన్నారు. పనిచేసే చోట మహిళలపై అత్యాచారాలు దేశంలో మహిళలపై అరాచకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా కన్సల్టెంట్ ఎడిటర్ సాగరికా ఘోష్ అన్నారు. నిర్భయ కేసు తర్వాత రేప్ అనే పదం నిర్వచనమే మారిపోయిందని తెలిపారు. పనిచేసే చోట మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనివిధంగా మహిళల మిస్సింగ్ కేసులు భారత్లో ఎక్కువగా ఉంటున్నాయని, ఇది చాలా బాధాకరమన్నారు. అమెరికాలోనూ లింగవివక్ష ఉంది అమెరికాలోనూ ఇంకా లింగ వివక్ష ఉందని, ఇటీవల అక్కడ జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమని హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్, ఏపీ సీఎం కోడలు నారా బ్రహ్మణి చెప్పారు. తన ఇంట్లో మహిళలకు గౌరవం ఇస్తారని, ఎన్టీఆర్ మనవరాలిగా పుట్టడం, సీఎం చంద్రబాబు కోడలినవ్వడం గర్వించదగిందన్నారు. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేసిందీ ఆయనే అన్నారు. శనివారం మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా జస్టిస్ రోహిణికి జ్ఞాపికను అందజేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. చిత్రంలో చక్రపాణి, గవర్నర్ నరసింహన్, కోడెల నిస్వార్థంగా సేవ చేసే గుణం మహిళలదే: డీకే అరుణ సాక్షి, అమరావతి: సమాజంలో నిస్వార్థంగా సేవ చేసే గుణం ఒక్క మహిళకే దక్కుతుందని మాజీ మం త్రి, ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శనివారం మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరై ఆమె ప్రసంగిం చారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న ప్పటికీ మహిళగా రాజకీయాల్లో విజయవంతంగా ముందుకెళ్తు న్నానన్నారు. ప్రతి ఒక్క మహిళా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణించాలని కోరారు. మహిళలు రాజకీయాల్లో ముందు వరుసలో ఉన్నప్పటికీ హింస తగ్గలేదని పేర్కొన్నారు. మహిళలకు స్వాతంత్య్రం, సమానత్వం ఇంకా రాలేదన్నారు. పొగడ్తలు సరే.. రిజర్వేషన్లు కల్పించండి: అల్కా లాంబా సాక్షి ప్రత్యేక ప్రతినిధి–అమరావతి: ‘‘మహిళలు దేవతా స్వరూపులనీ, మహాలక్షు్మలని, ఆదిశక్తులని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాశానికెత్తేస్తే సరిపోదు.. ప్రధాని మోదీకి చెప్పి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్సభలో ఆమోదింపజేయాలి’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ (చాందినీ చౌక్) ఎమ్మెల్యే అల్కా లాంబా డిమాండ్ చేశారు. మహిళా పార్లమెంటు సదస్సు రెండో రోజు ‘మీరే హీరోలు’ (బీ యువర్ ఓన్ హీరోస్) అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ తొలి రోజు సమావేశాల్లో వెంకయ్య చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూనే చురకలంటించారు. పోరాడండి, సాధించుకోండి! కెన్యా జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జోస్ (పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘భారతీయ మహిళ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. మనకు ఏదీ బంగారు పళ్లెంలో పెట్టి ఇవ్వరు. అత్యున్నత స్థాయికి చేరేందుకు పోరాటం చేయాలి. చదువే ఇందుకు ఆయుధం. చదవండి, పోరాడండి. అత్యున్నత స్థాయికి చేరండి’’ అని కెన్యా జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ జోస్ చెర్నో లబోసో పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ నియామకాల్లో ఇప్పటికే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, చట్టసభల్లో అమలు చేయడమే తమ ముందున్న సమస్య అని డాక్టర్ జోస్ పేర్కొన్నారు. సత్తా నిరూపించుకోవాలి ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ (పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘హనుమంతుడి మాదిరే మహిళలకున్న శక్తి ఏమిటో వాళ్లు తెలుసుకోవాలి. వాళ్ల సత్తాను నిరూపించుకోవాల్సిన సమయమి దే..’ అని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అభిప్రాయపడ్డారు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్న తరుణంలో సమాజం వారి కి అండగా నిలవాలన్నారు. మహిళలు ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మహిళా పార్లమెంటు లో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రస్తుత పార్లమెంటులో 400 మందైనా మహిళలు ఉండాలని చెప్పారు. -
ఐటీ చెల్లింపులో హెచ్ఎండీఏకు ఊరట
అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దుచేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు హైకోర్టు ఊరటనిచ్చింది. హెచ్ఎండీఏకు వ్యతిరేకంగా ఆదాయపు పన్నుశాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ చల్లా కోదండరామ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. బ్యాంకు ఖాతాల జప్తునకు జారీ చేసిన ఉత్తర్వులను సైతం ఎత్తివేసింది. అయితే ఆదాయపు పన్నుశాఖకు రూ. 10 కోట్లు చెల్లించాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. భూముల అమ్మకానికి సంబంధించి వచ్చిన ఆదాయంపై 2003-04, 2006-07 నుంచి 2008-09 వరకు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ. 664.68 కోట్లు పన్ను రూపేణా చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేయగా, హెచ్ఎండీఏ దాదాపు రూ. 180 కోట్లు చెల్లించింది. మరో రూ. 480 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ తరువాత ఆదాయపు పన్నుశాఖ మరో రూ. 160 కోట్లు వసూలు చేసింది. మిగిలిన మొత్తాల కోసం ఆదాయపుపన్నుశాఖ ఒత్తిడి చేస్తుంటే, ట్రిబ్యునల్ నుంచి హెచ్ఎండీఏ స్టే పొందింది. అయితే రూ. 10 కోట్లు చెల్లించాలని ట్రిబ్యునల్ షరతు విధించింది. తరువాత విచారణ సమయంలో మరో రూ. 15 కోట్లు చెల్లించాలని హెచ్ఎండీఏను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇదే సమయంలో ఐటీ అధికారులు హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ హెచ్ఎండీఏ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది. తాము విక్రయించిన భూములు సొంతవి కావని, ప్రభుత్వం తరఫున తాము ఏజెంట్గా మాత్రమే వ్యవహరిస్తూ లావాదేవీలు జరిపామని హెచ్ఎండీ తరఫున సీనియర్ న్యాయవాది కృష్ణ కౌండిన్య కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం... రూ. 15 కోట్లు చెల్లించాలంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే రూ. 10 కోట్లు చెక్కు రూపంలో ఇవ్వాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. అలాగే ఈ మొత్తం కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగాల్సిన వాదనలు యథాతథంగా జరగాలని, ఎటువంటి వాయిదాలూ కోరరాదని హెచ్ఎండీఏకు స్పష్టం చేసింది.