breaking news
Jumbling system
-
ఇన్విజిలేటర్లకూ జంబ్లింగ్
విజయనగరం అర్బన్: పదోతరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించే టీచర్లపై చర్యలకు సిద్ధమవుతోంది. పరీక్షల్లో ఇప్పటివరకు ఇన్విజిలేషన్ నిర్వహించే ఉపాధ్యాయులకు ఏ పరీక్షకు ఏ గది కేటాయించేది ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు నిర్ణయించేవారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆయా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఉపాధ్యాయులను మచ్చిక చేసుకుని తమకు నచ్చిన వారిని ఆయా పాఠశాలల విద్యార్ధులున్న ఫలానా గదిలో వేయాలని లాబీయింగ్ చేసుకునే వారు. చాలా పాఠశాలల్లో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ తతంగంతో తీవ్రంగా నష్టపోయేవారు. మాస్ కాపీయింగ్ కూడా జోరుగా సాగేది. అయితే వీటన్నింటికి అడ్డుకుట్ట వేసేందుకు ఈ ఏడాది ఈ విధానానికి పాఠశాల విద్యాశాఖ స్వస్తి పలికింది. ఈ మేరకు ఆదేశాలు జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. రోజూ పరీక్ష నిర్వహణకు అరగంట ముందు చీఫ్ సూపరింటెండెంట్ ఆయా పరీక్ష కేంద్రాల్లో లాటరీ తీసి ఇన్విజిలేటర్కు ఏ గది వచ్చిందో తెలియజేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేస్తున్న నూతన విధానంతో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతున్నందున విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు మాత్రం గంట ముందుగానే పరీక్ష కేంద్రాల విధులకు హాజరు కావాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజులకోసారి ఇన్విజిలేటర్ల మార్పు.. ఇన్విజిలేటర్లకు లాటరీ ద్వారా గంట ముందు గదులను కేటాయించడంతో పాటు మూడు రోజులకోసారి పరీక్ష కేంద్రాన్ని మార్చుతారు. తాజాగా ఉన్నతస్థాయిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇన్విజిలేటర్ను మూడు రోజులకోసారి కచ్చితంగా పాఠశాలలను మార్చాలని నిర్ణయించారు. అదే విధంగా పరీక్షల నిర్వహణలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాల అధికారులు, పర్యవేక్షకులుగా వెళ్లే వారు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కఠన చర్యలు అనుభవించాల్సి వస్తుంది. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజవైతే కఠిన చర్యలు తప్పవు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదుతో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా తప్పదు. ఈ నెల 15 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఇది తప్పనిసరిగా అమలు చేస్తున్నామని పరీక్షల రాష్ట్ర పరిశీలకులు, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ బీ.భాస్కరరావు, డీఈఓ జి.నాగమణి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పది పరీక్షల ఏర్పాట్లపై వారు వివరించారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి.. పరీక్ష కేంద్రాలకు ఇన్విజిలేటర్ గంట ముందే వెళ్లాలి. విద్యార్థిని నిశితంగా తనిఖీ చేసి 30 నిముషాల ముందు గదిలోకి పంపాలి. ఓఎంఆర్ షీట్లో విద్యార్థి వివరాలను పూర్తి చేసే సమయంలోనూ జాగ్రత్తలు వహించాలి. 137 పరీక్ష కేంద్రాలకు 1,515 మంది ఇన్విజిలేటర్లు.. జిల్లాలో ఈ నెల 15 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు 30,248 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. బాలురు 15,009, బాలికలు 15,239 మంది ఉన్నారు. మరో 264 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 137 పరీక్ష కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. వీటిలో స్టోరేజీ పాయింట్స్ మూడు కిలోమీటర్ల దూరం ఉన్న సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలు 37 ఉన్నాయి. మొత్తం 1,515 మంది ఇన్విజిలేటర్లను, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 137, చీఫ్ ఇన్విజేటర్లు 137 మంది, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తారు. అలాగే స్టోరేజ్ పాయింట్స్ 37, పంపిణీ రూట్స్ 16 ఏర్పాటు చేశారు. నేలపై కూర్చొనే పరీక్ష కేంద్రం ఉండదు.. జిల్లాలో పది పరీక్షలు నిర్వహిస్తున్న 137 కేంద్రాలలోనూ అభ్యర్ధులకు బెంచీలను ఏర్పాటు చేస్తున్నాం. చెంచీలు లేని పరీక్ష కేంద్రాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశాం. ఎక్కడా నేలకూర్చొని రాసే పరిస్థితి లేదు. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు రెండు రోజుల ముందే వెళ్లి తాగునీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటారు. విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నాం. ఇందుకు అన్ని వసతులు, సదుపాయాలు ఉన్న పాఠశాలలనే పరీక్ష కేంద్రాలుగా గుర్తించాం. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సరఫరాను పరిగణలోకి తీసుకున్నాం. ప్రతి కేంద్రం వద్ద మట్టి కుండలను ఏర్పాటు చేసి అందులో మినరల్ వాటర్, ప్రతి పరీక్ష గదిలో రెండు ఫ్యాన్లు ఉండేలా ఏర్పాట్లు చేశాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు.. పాఠశాలలకు పంపిన హాల్ టికెట్లను యాజమాన్యాలు ఇవ్వని పక్షంలో ‘బీఎస్ఈ.ఏపీ.బీఓవీ.ఇన్’ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. ఫిర్యాదులు, సూచనలు స్వీకరించడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫోన్ నంబబర్ ‘08922–252253, 9493313271, 8179928099 (బొబ్బిలి డివి జన్)లకు సూచనలు, ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు. అందుబాటులో ఆర్టీసీ సర్వీసులు.. పట్టణాలకు దూరంగా ఉన్న 37 సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలకు రవాణా ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ సేవలను అందుబాటులో ఉంచాం. ఈ మేరకు ఆర్టీసీ ఆధికారులను విద్యాశాఖ అధికారులు కోరారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు.. సమస్యాత్మక కేంద్రాలుగా జిల్లాలో ఆరింటిని గుర్తించారు. పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లోని డోకిశీల, చినమేరంగి, టిక్కబాయి, రేగిడి, కొత్తవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏ, బీ పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ పక్కా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్ కంటిన్యూ
-
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
22వ తేదీ వరకు నాలుగు దశలుగా నిర్వహణ తుస్సుమన్న సీసీ కెమెరాల నిబంధన, పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన బోర్డు? సాక్షి, హైదరాబాద్: ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా, పకడ్బందీగా జంబ్లింగ్ విధా నం అమలు చేస్తామంటూ ఊదరగొట్టిన ఇంటర్మీ డియెట్ బోర్డు చివరకు చేతులెత్తేసింది! కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి మొదట్లో రూపొందించిన నిబంధనలను పక్కన పెట్టే సింది!! సీసీ కెమెరాలు ఉంటేనే ప్రాక్టికల్స్కు పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామన్న నిబంధనను తొలగించి నేటి నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టి కల్స్కు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ల్యాబ్ సదుపాయాలు పెద్దగా లేని కొన్ని కాలేజీలు మినహా మిగతా కాలేజీల విద్యార్థులు దాదాపుగా తమ కాలేజీల్లో ప్రాక్టికల్స్కు హాజరయ్యేలా చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపి స్తామన్న ఒక్క నిబంధన అమలుతో ప్రాక్టికల్స్ నిర్వహణకు సిద్ధమైంది. ప్రైవేటు యాజమాన్యా లు, ఓ మంత్రి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే బోర్డు జంబ్లింగ్ను, సీసీ కెమెరాలు ఉండాలన్న నిబంధనలను తొలగించినట్లు విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లోని పరీక్ష కేంద్రాల్లో అబ్జర్వర్లుగా ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఉండాలంటూ పెట్టిన నిబంధననూ తొలగించాలంటూ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. పరీక్షలు ప్రారంభమైతే ఈ నిబం ధన విషయంలో ఏం చేస్తుందనేది తెలియనుంది. నాలుగు దశల్లో 22 వరకు నిర్వహణ ఇంటర్ ప్రాక్టికల్స్ను బోర్డు ఈ నెల 3 నుంచి 22 వరకు 4 దశలుగా నిర్వహించనుంది. దీని కోసం 1,682 కేంద్రాలను (జనరల్ 1,373, వొకేషనల్ 309) ఏర్పాటు చేసింది. ప్రాక్టికల్స్కు ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలే జీలకు చెందిన 3,19,185 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ విద్యా ర్థులు 1,56,021 మంది, బీపీసీ విద్యార్థులు 91,687 మంది, జియోగ్రఫీ విద్యార్థులు 350 మంది, వొకేషనల్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 39,044 మంది, వొకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 32,083 మంది హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 5,248 మంది ఎగ్జామినర్లను ఇంటర్ బోర్డు నియమించింది. ఆన్లైన్లో ప్రశ్నపత్రం... ఆన్లైన్ ద్వారా ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసే విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. tsbie.cgg.gov.in నుంచి పరీక్షకు అరగంట ముందుగా ఎగ్జామినర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. పరీక్ష పూర్తి కాగానే మూల్యాంకనం చేసి మార్కులను వెంటనే అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. -
జంబ్లింగ్తో విద్యార్థులకు తీవ్ర నష్టం
విజయవాడ : జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థి పూర్తిస్థాయిలో నష్టపోతాడని ఏపీ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్.. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం విజయవాడలోని గేట్వే హోటల్లో మంత్రిని అసోసియేషన్ ప్రతినిధులు కలిసి మెమొరాండం అందజేశారు. పూర్వ పద్ధతినే కొనసాగించాలని కోరారు. జంబ్లింగ్ విధానం వల్ల ఒక కాలేజీలోని విద్యార్థి మరో కాలేజీలో పరీక్షలు రాయాల్సి ఉంటుందని, అక్కడి పరిస్థితులు, పద్ధతులు అర్థం చేసుకునేలోపే పరీక్ష సమయం ముగిసే అవకాశం ఉందని వారు చెప్పారు. ఇదే స్థానిక కాలేజీలో అయితే ప్రాక్టికల్ నిత్యం నిర్వహించే గదుల్లోనే పరీక్షలు జరుగుతాయని, అందువల్ల విద్యార్థి త్వరితంగా పరీక్ష పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. యాజమాన్యాల మధ్య ఉండే పొరపొచ్చాలు కూడా విద్యార్థుల పరీక్షలపై ప్రభావం చూపిస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ,రాష్ట్రస్థాయిలో జరిగే ప్రధానమైన పోటీ పరీక్షల్లో ఈ మార్కులు కీలకంగా మారే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు ఈ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలంటే వెంటనే జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి గంటా స్పందిస్తూ అన్ని విషయాలు విద్యాశాఖ కమిషనర్తో చర్చించాలని సూచించారు. మంగళవారం సాయంత్రం సమగ్రంగా చర్చించేందుకు యాజమాన్యాల ప్రతినిధులను ఆహ్వానించారు. ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన ప్రతినిధుల్లో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బైరపునేని సూర్యనారాయణ, కార్యదర్శి పీవీ రమణ, రాష్ట్ర కమిటీ నాయకులు వై.వెంకటేశ్వరావు, కేవీ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. సుమారు 300 మంది కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు రాష్ట్ర నలుమూల నుంచి విజయవాడకు తరలివచ్చారు. -
జంబ్లింగ్ విధానం ఎత్తి వేయాలంటూ...
పిడుగురాళ్ల: ఇంటర్ మీడియట్ లో నిర్వహించే ప్రాక్టికల్ పరిక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలంటూ.. విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాలలను బహిష్కరించి సుమారు 800 మంది విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రం జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేసిందని.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ విధానం కొనసాగించడం సరైంది కాదని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు పట్టణంలోని అన్ని కళాశాలలను బహిష్కరించి విద్యార్థులు ధర్నా చేశారు.