breaking news
Juliet
-
జూలియట్ మళ్లీ ఆడుకుంది!
న్యూఢిల్లీ: హుషారుగా గెంతుతూ చలాకీగా తిరుగుతూ తమ కుటుంబంలో భాగమైపోయిన ఏడేళ్ల శునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్లీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సవిధానంతో పోగొట్టారు ఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు. రెండేళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్యవిధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది. ఏమిటీ సమస్య? ఏడేళ్ల బీగల్ జాతి శునకం జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. గుండెలో ఎడమ ఎగువ కరి్ణక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కరి్ణకలోకి లీక్ అవుతోంది. దీంతో గుండె కొద్దికొద్దిగా కుంచించుకుపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యువు ఒడికి చేరే ప్రమాదముంది. దీంతో విషయం తెల్సుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకొచి్చంది. చిన్న జీవాలకు గుండె ఆపరేషన్లు చేయడంలో శర్మ నిష్ణాతునిగా పేరొందారు. ‘‘ అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచి్చంది. ట్రాన్స్క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్(టీఈఈఆర్) విధానంలో మే 30న జూలియట్కు గుండె ఆపరేషన్ చేశాం. ఓపెన్ హార్ట్ సర్జరీలాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్తో పని ఉండదు. గుండె కొట్టుకుంటుండగానే ఆపరేషన్ చేసేయొచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషీన్ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తాం’’ అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి రెండు రోజులకే జూలియట్ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఆటుకుంటూ కుటుంబంలో మళ్లీ సంతోషాన్ని నింపింది. ఈ తరహాలో 80 శాతం మరణాలు భారత్సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80 శాతం ఉండటం గమనార్హం.శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన రెండో ప్రైవేట్ వైద్య బృందం వీళ్లదేనని ఆస్పత్రి పేర్కొంది. -
రోమియో... జూలియట్
గ్రౌండ్ అప్ ఈవారం విశేషాల రౌండప్ ఒకే హాస్పిటల్లో, పక్క పక్క వార్డులలో 18 గంటల తేడాతో రోమియో, జూలియట్లు జన్మించిన ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. మార్చి 19న ఆదివారం నాడు యు.ఎస్.లోని కోస్టల్ కరొలినా హాస్పిటల్లో మధ్యాహ్నం 2 గంటల 6 నిముషాలకు రోమియో జన్మించాడు! తర్వాతి రోజు ఉద్యం 8 గంటల 14 నిముషాలకు జూలియట్ జన్మించింది. ఈ సంగతి వారిద్దరి తల్లిదండ్రులకు తెలియదు. కేసీ క్లేషల్ట్ అనే మహిళా ‘న్యూబార్న్ ఫొటోగ్రాఫర్’ ఎప్పటిలా హాస్పిటల్లో కొత్తగా పుట్టిన పిల్లల్ని ఫొటోలు తీసేందుకు వచ్చినప్పుడు ఈ అపురూపమైన సందర్భంగా గురించి తెలిసింది. అది కూడా అనుకోకుండా. యు.ఎస్.లో ఇంకా ఇతర పాశ్చాత్య దేశాలలో సాధారణంగా బిడ్డ పుట్టకముందే ఒక పేరు అనుకుంటారు. అలా... ‘మీ అబ్బాయి పేరు ఏమిటి? అని కేసీ అడిగినప్పుడు ఈ వార్డు దంపతులు ‘రోమియో ఆర్కెంజల్ హెర్మాండజ్’ అని చెప్పారు. ‘మీ అమ్మాయి పేరు ఏమిటి?’ అని అడిగినప్పుడు ఆ పక్క వార్డు దంపతులు ‘జూలియట్ ఎవాంజిలిన్ షిప్లెట్’ అని చెప్పారు. ఇకనేం ఇద్దరి పేర్లలో రోమియో, జూలియట్లు ఉన్నాయని, ఇద్దరినీ రోమియో–జూలియట్లలాగే ముస్తాబు చేసి, షేక్స్పియర్ కాలం నాటి కావ్య నాయికానాయకులు గుర్తుకు వచ్చేలా ఫొటోలు తీశారు కేసీ. ఎంత ముద్దుగా ఉన్నారో చూశారుగా! టైటానిక్ ట్రిప్! అట్లాంటిక్ సముద్ర గర్భంలో ఉపరితల జలాలకు 4 వేల మీటర్ల అడుగున చిక్కుకుని ఉన్న టైటానిక్ ‘శకల నౌక’ దగ్గరికి... వచ్చే ఏడాది మే నెల నుంచి ఔత్సాహికుల వన్ టైమ్ సాహస యాత్ర మొదలౌతోంది! ఎనిమిది రోజులపాటు భద్రమైన ఒక మానవ జలాంతర్గామిలో సాగే ఈ టైటానిక్ యాత్రను లండన్ ట్రావెల్ కంపెనీ ‘బ్లూ మార్బుల్ ప్రైవేట్’ నిర్వహిస్తోంది. కెనడా లోని న్యూఫౌండ్ల్యాండ్ నుంచి ఈ టైటానిక్ సందర్శక ప్రయాణికులు బయల్దేరుతారు. టిక్కెట్ ధర మనిషికి లక్షా 5 వేల 129 డాలర్లు! సుమారుగా 68 లక్షల 20 వేల రూపాయలు. 1912 ఏప్రిల్లో ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నుంచి యు.ఎస్.లోని న్యూయార్క్కు బయల్దేరిన టైటానిక్ నౌక మార్గం మధ్యలో మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. నౌకలో మొత్తం 2,224 మంది ప్రయాణీకులు (నౌక సిబ్బందితో కలిసి) ఉండగా, వారిలో 1500 మందికి పైగా మరణించారు. నౌక మునిగిన 93 ఏళ్ల తర్వాత రాబర్ట్ బల్లార్డ్, ఆయన అన్వేషకుల బృందం న్యూఫౌండ్లాండ్ దగ్గరి సెయిట్ జాన్స్కు 380 నాటికల్ మైళ్ల దూరంలో టైటానిక్ ప్రధాన శకలాన్ని కనుగొంది. ఇప్పుడు అక్కడికే మనవాళ్ల ప్రయాణం. పాదాక్రాంతం ఎడమవైపు ఉన్న ఆవిడ నికోలా స్టర్జన్. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ (ప్రధాని). కుడివైపు ఉన్న ఆవిడ థెరిసా మే. బ్రిటన్ ప్రధాని. ఇటీవల ఇద్దరూ గ్లాస్గోవ్లో కలుసుకున్నారు. గ్లాస్గోవ్ స్కాట్లాండ్లో ఉంటుంది. ‘ఐరోపా సమాఖ్య’ (ఇ.యు.) నుంచి గత ఏడాది బ్రిటన్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు బ్రిటన్ నుంచి విడిపోతానని స్కాట్లాండ్ పట్టుపట్టింది (స్లాట్లాండ్ 1707 నుంచి యు.కె.లో భాగంగా ఉంది). ఈ సమస్యను చక్కబరచుకోవడం కోసమే ఈ ఇద్దరు ప్రధానమంత్రులూ ఇలా ఒకచోట కూర్చున్నారు. విషయం చాలా సీరియస్ అని తెలుస్తూనే ఉంది కదా. అయితే దాన్ని వదిలేసి, బ్రిటన్ పత్రిక ‘డైలీ మెయిల్’ వీళ్లిద్దరి కాళ్లపై దృష్టిని కేంద్రీకరించింది! ఎవరి కాళ్లు అందంగా ఉన్నాయో చెప్పండి అని పేద్ద హెడ్డింగ్ పెట్టింది. పైగా ఈ దేశాధినేతల కాళ్ల విలక్షణతను కూడా వర్ణించింది. నికోలా కాళ్లు... ఏక్దమ్ ఫ్లర్టీ అట! టాంటలైజింగ్లీ క్రాస్డ్ అట!! ఎ డైరెక్ట్ అటెంప్ట్ ఎట్ సెడెక్షన్ కూడానట! కవ్వించేలా, ఆశపెట్టి వేధించేలా, – ఎట్ ద సేమ్ టైమ్– వ్యామోహం మూతి పగలగొట్టేలా ఉన్నాయని దీనంతటికీ అర్థం. ఇక థెరిసా మే. పొంచి ఉన్న తీవ్రవాది బుద్దిగా దగ్గర పెట్టుకున్న ఆయుధాల్లా ఉన్నాయట ఈవిడ కాళ్లు! జనం డెయిలీ మెయిల్ను ఎలా తిడుతున్నారంటే... మాటల్లో చెప్పలేం. మహిళలను కించపరిచే వెర్రిరాతల్ని రాయడం తక్షణం మానుకోవాలని ఫోన్ చేసి మరీ... తలా ఒకటి అంటిస్తున్నారు. ట్విటర్లోనైతే ఇక చెప్పలేం. తిట్లే తిట్లు. కరుణ రసం రేయాన్కు తొమ్మిదేళ్లు. అకస్మాత్తుగా ఇటీవల ఒక రోజు న్యూ మెక్సికోలోని ఒక రోడ్డు పక్కన నిమ్మరసం అమ్మడం మొదలు పెట్టాడు! రేయాన్కి రిచర్డ్ శాంఛెజ్ అనే తాతగారు ఉన్నారు. ఆ తాతగారిని బతికించుకోడానికే రేయాన్ ఇలా వ్యాపారిగా అవతారమెత్తాడు. తాతగారికి రెండు రకాల క్యాన్సర్లు! అవి రెండూ మూడో స్టేజ్లో ఉన్నాయి. డాక్టర్లు ఆయనకు సర్జరీ చేసి కడుపులోని కణితి తొలగించారు. ఇక మిగిలింది కీమో థెరపీ ఇవ్వడం. దానికి డబ్బులు కావాలి. కనీసం 5 వేల డాలర్లన్నా కావాలి. అంత మొత్తం తాత దగ్గర లేదు. మనవడే సంపాదించడానికి పూనుకున్నాడు. నిమ్మరసం అమ్మి అంత డబ్బూ సంపాదించాడు. చిన్న పిల్లవాడు... పెద్ద బిజినెస్మ్యాన్లా లెమన్ అమ్మడం చూసి ముచ్చట పడినవారితో, వాడి కథ విని హృదయం ద్రవించిన కస్టమర్లతో ఆ రోడ్డంతా కిక్కిరిపోయింది. ఇంకెవరైనా అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టేవారే కానీ, రేయాన్ని చూశాక.. ‘అమ్ముకో’ అని స్పెషల్ పర్మిషన్ కూడా ఇచ్చారు! మహానుభావుడు కర్నాటకలో లీటరు పెట్రోలు 76.28 రూ. లీటరు డీజిల్ 63.16 రూ. పెట్రోలు కన్నా డీజిలు 13.12 రూ. తక్కువ. (నిన్నమొన్న తగ్గిన రేట్లకు ముందు ధరలు). అయితే ఇదే డీజిలు మంగుళూరు ఎమ్మెల్యే మొహియుద్దీన్ బవా చేత లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది! ఈ మధ్య ఆయన కోటీ 65 లక్షల రూపాయలు పెట్టి వాల్వో ఎక్స్సి90 టి8 హైబ్రిడ్ ఎక్సెలెన్స్ లగ్జరీ కారు కొన్నారు. అది పెట్రోల్ కారు. తన కొడుకు పేరిట కొన్నారు. ఆ పుత్రరత్నం కారును తీసుకెళ్లి, పెట్రోల్ కొట్టమని చెప్పి ఎవరితోనో హస్క్ కొడుతూంటే... పెట్రోల్ బంక్ కుర్రాళ్లు దీనికి డీజిల్ కొట్టేశారు. బండి స్ట్రక్ అయిపోయింది. దాన్ని వేరే ఇంకో వెహికల్లో రిపేర్ కోసం బెంగుళూరు తరలించారు. ఇంత జరిగినా ఎమ్మెల్యే గారికి కొడుకు మీద కానీ, పెట్రోల్ బంకు కుర్రాళ్ల మీద గానీ కోపం రాలేదు! పొరపాట్లు మనుషులు చేయకపోతే, మిషన్లు చేస్తాయా అని నవ్వుతూ అంటున్నారు! నాట్ ఓకే క్రియేటివిటీ కొన్నిసార్లు వికటిస్తుంది. నార్త్ కరోలినాలోని ఒక ఆభరణాల కంపెనీ తన ప్రచార హోర్డింగ్లో ఇలాగే మితిమీరిన క్రియేటివిటీని ప్రదర్శించి, అప్రతిష్ట తెచ్చుకుంది. ‘సమ్టైమ్స్ ఇట్ ఈజ్ ఓకే టు త్రో రాక్స్ ఎట్ గర్ల్స్’ అని ప్రధాన కూడలిలో ఆ కంపెనీ పెట్టించిన హోర్డింగ్... ఇప్పుడు ఆ కంపెనీ మీదే రాళ్లు పడేలా చేస్తోంది. పాపం ఆ కంపెనీ ఉద్దేశం మంచిదే. అమ్మాయిలకు... అమూల్యమైన రాళ్లు, రత్నాలను కానుకగా ఇవ్వండి అని చెప్పడం. కానీ చెప్పిన విధానమే బాగోలేదు. ‘కొన్నిసార్లు అమ్మాయిల మీద రాళ్లు విసరడం కూడా మంచిదే’ అని సృజనాత్మకంగా రాయించింది! ‘ఉద్దేశాలను పిల్లలు అర్థం చేసుకోలేరు కదా, ఆ మాటల్ని ఉన్నవి ఉన్నట్లే తీసుకుంటే ఎంత ప్రమాదం’ అని ఆ బోర్డును చూసినవాళ్లు చికాకు పడుతున్నారు. తిక్క మనిషా?! బాబ్ డిలాన్ తనకు వచ్చిన నోబెల్ బహుమతిని స్వీకరించడానికి నేటికీ స్వీడన్ వెళ్లలేదు! ఆయన గనుక ఈ జూన్ 10 లోపు స్వీడన్లోని స్టాక్హోమ్కి వెళ్లి చిన్న స్పీచ్ అయినా ఇవ్వకపోతే నోబెల్ బహుమతి ద్వారా ఆయనకు వచ్చే 9 లక్షల 10 వేల డాలర్ల నగదు రాకుండాపోతుంది! పెద్ద స్పీచ్ అక్కర్లేదు. ఓ చిన్న పాట కచేరి, ఓ వీడియో, కనీసం ఓ పాట... ఏదైనా సరే, నోబెల్ సందర్భాన్ని గుర్తుచేస్తూ ప్రదర్శిస్తే చాలు ఈ నగదు బహుమతికి ఆయన యోగ్యుడైనట్లే. ఇది సంప్రదాయం కూడా. ఏటా విజేతను అక్టోబర్లో ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్10న విజేతకు బహుమతిని ప్రదానం చేస్తారు. ఏ విజేతైనా స్టాక్హోమ్కు వెళ్లలేని పరిస్థితి ఉంటే... డిసెంబర్ పది నుంచి ఆరు నెలల లోపు వెళ్లి తీసుకోవాలి. కానీ నేటికీ బాబ్ డిలాన్ స్పందించలేదు! నిజానికి అవార్డు విషయంలో మొదటి నుంచి ఆయన పెద్ద ఉత్సాహంతో లేరు! నోబెల్ కమిటీవాళ్లు అవార్డును ప్రకటించిన చాలా కాలం తర్వాత ఎప్పుడో డిలాన్ థ్యాంక్ గివింగ్ నోట్ మాత్రం పంపారు. అంతే తప్ప నోరు తెరిచి ధన్యవాదాలు తెలియజేయలేదు! ఏప్రిల్ 9న స్వీడన్లోని లుండ్లో డిలాన్ కచేరీ ఉంది. బహుశా అప్పుడేమైనా పెద్ద మనసుతో నోబెల్ను స్వీకరిస్తాడేమో చూడాలి. అయితే ఆ కచేరీ... నోబెల్ అవార్డుల ప్రకటనకు చాలా ముందే ఖరారైనది కావడంతో ఒక వేళ డిలాన్... లుండ్కి వచ్చినా, బహుమతి తీసుకోకుండా అటునుంచి అటే వెనక్కు వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. ఏంటో ఈ తిక్క మనిషి! తొమ్మిది లక్షల పది వేల డాలర్లంటే మాటలా?! ఐదు కోట్ల 90 లక్షల రూపాయాలకు పైమాటే! వేడి భోజనం... వెచ్చటి కబుర్లు! ఈయన పేరు జార్జి లాఫ్టస్. వయసు 100. ఇక ఈయన భార్య ఫిలిస్. ఈమె వయసు 94. ఫిలిస్కు జార్జితో 17 ఏళ్ల వయసులో 1940 ఆగస్టు 10న పెళ్లయింది. ఈ ఏడాది వీళ్లు తమ 77వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. బ్రిటన్లో ప్రస్తుతం జీవించి ఉన్న జంటల్లో ఇంత దీర్ఘకాలం ఆరోగ్యంగా, అనందంగా ఉన్న జంట వీళ్లే కావచ్చు. ఎంత దీర్ఘకాలం అంటే.?. పదహారు మంది ప్రధానమంత్రుల ప్రమాణ స్వీకారాలను వీళ్లు చూశారు. రెండేళ్ల క్రితం వీళ్ల 75వ పెళ్లి రోజుకు బ్రిటిష్ మహారాణి రెండవ ఎలిజబెత్ అభినందన లేఖ కూడా పంపారు. ఇంతకీ ఏమిటి వీళ్ల దాంపత్య విజయ రహస్యం? సింపుల్. వేడి వేడిగా భోజనం చేస్తారట. వెచ్చటి కబుర్లు చెప్పుకుంటారట!రుచికరమైన తిండి, శుచికరమైన సంభాషణ ఉంటే భార్యాభర్తల లైఫ్ హ్యాపీగా ఎన్నేళ్లయినా సాగిపోతూనే ఉంటుందట! -
మరోసారి జయం రవితో
జయం రవి, హన్సికల కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇంతకుముందు ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేసిన హన్సిక ఈసారి ఏకంగా ఆయన్ని రోమియో చేసి తను జూలియట్గా మారనుంది. వీరిద్దరు తాజాగా నటించనున్నట్లు చిత్రానికి రోమియో జూలియట్ అనే టైటిల్ను నిర్ణయించారు. నవ దర్శకుడు లక్ష్మణ్ మెగా ఫోన్ పడుతున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో, హీరోయిన్లపై ఫొటో షూట్ చేశారు. నటి హన్సిక మాట్లాడుతూ ఈ ఏడాది తన కాల్షీట్స్ డైరీ ఫుల్ అయిపోయిందన్నారు. అయినా రోమియో జూలియట్ కోసం కాల్షీట్స్ అడ్జెస్ట్ చేసి కేటాయించానని చెప్పారు. కారణం చిత్ర స్క్రిప్ట్ అన్నారు. ఇది సీరియస్గానో, ఎమోషనల్ గానో ఉండే చిత్రం కాదన్నారు. అదే విధంగా ఒరిజినల్ రోమియో జూలియట్గా ఈ చిత్రానికి సంబంధం ఉండదని వివరించారు. ఇది మోడ్రన్ రోమియో జూలియట్ల కథ అని తెలిపారు. లవ్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం సాధారణ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుందని అన్నారు. వచ్చే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్టు హన్సిక వెల్లడించారు. ఇంతకుముందు జయంరవితో జత కట్టిన ఎంగేయుమ్ కాదల్ ఆశించిన విజయం సాధించలేదు. ఈ సారన్నా జయం రవి, హన్సికలు హిట్ పెయిర్గా నిలుస్తారో లేదో చూడాల్సిందే. ఈ చిత్రాన్ని మద్రాసు ఎంటర్ ప్రైజస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్నారు. సంగీత బాణీలు ఇమాన్ అందిస్తున్నారు.