breaking news
jp agarwal
-
అంతా జేపీ వల్లే!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పందించారు. పార్టీలో ఉన్న అంతర్గత కలహాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆమె సోమవారం మీడియాకు తెలిపారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె ఆభిప్రాయపడ్డారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ ఆగర్వాల్ సహకరించకపోవడం వల్లే దారుణ పరాజయాన్ని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, నగరవాసులు చెత్త పాలనను కోరుకోరని, అయితే అది ఇప్పుడు ఎన్నికల్లో జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు, ధరల పెరుగుదల, అవినీతి కుంభకోణాలకు మీరు బలయ్యారా అన్న విలేకరుల ప్రశ్నను ఆమె సమాధానమిస్తూ ఆ వ్యవస్థలో తాను కూడా ఒక భాగమేనన్నారు. అయితే భవిష్యత్ రాజకీయం గురించి ఇంకా ఆలోచించలేదని ముక్తసరి సమాధానమిచ్చారు. అప్పుడే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశమేమి లేదన్నారు. అయితే తొలిసారిగా పోటీచేసిన ఆప్ని తాము తక్కువగా అంచనా వేశామని అంగీకరించారు. బీజేపీనే తాము ఈ ఎన్నికలలో ప్రత్యర్థిగా పరిగణించామన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో ప్రత్యర్థి పార్టీలు ప్రజలను తప్పుదారిపట్టించాయని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి విద్యుత్ చార్జీలను తగ్గిస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చి చూపాలంటూ ఆమె ఆప్కి సవాలు విసిరారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె చెప్పారు. జాతీయ సమస్యలు ఎన్నికలపై ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన అరవింద్ కేజ్రీవాల్కు ఏ సలహా ఇస్తారని ప్రశ్నించగా, అతను తనకన్నా చాలా తెలివైనవారని అభిప్రాయపడ్డారు. -
ఇందిరాగాంధీకి ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 96వ జయంతిని రాజీవ్భవన్లో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ అగర్వాల్ నేతృత్వంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడారు. పేదలు, బలహీన వర్గాలు, వృద్ధులు, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నో కార్యక్రమాలు రూపొందించారని గుర్తుచేశారు. దేశంలోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పారదోలేందుకు ప్రవేశపెట్టిన ఇరవై సూత్రాల పథకం దేశవ్యాప్తంగా ఎన్నో ఫలితాలు ఇచ్చిందని అగర్వాల్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతికొద్ది మంది నాయకుల్లో ఇందిరాగాంధీ ఎప్పటికీ ఉంటారన్నారు. పరిపాలనలో ఆమె ధైర్యంగా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. ప్రధానమంత్రిగా దేశభవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని జైప్రకాశ్ అగర్వాల్ వివరించారు. కార్యక్రమంలో డీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేశ్మాలిక్, మున్సిపల్ కౌన్సిలర్ రమేశ్దత్, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ముఖ్య ప్రతినిధి దినేశ్ త్యాగి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఢిల్లీని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలను ఇందులో వివరిస్తామని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ‘మెట్రో, రోడ్ల విస్తరణ ద్వారా ప్రజరవాణా వ్యవస్థను అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతాం. అనధికార కాలనీలను మరింత అభివృద్ధి చేస్తాం. విద్య, వైద్యం, మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమంపై మా పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది’ అని ఆయన వివరించారు. -
తనకు బదులు తనయుడు
మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది నేతలు తమ వారసులను బరిలోకి దింపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. డీపీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్, బీజేపీ సీనియర్ నాయకుడు వీకే మల్హోత్రా వంటి హేమాహేమీలతోపాటు పలువురు నాయకులు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని రాజకీయ పార్టీలు వివిధ అంశాలు, సమీకరణాలను సరిచూసుకుంటున్నాయి. ఎవరికి సీటిస్తే ఎంత లాభం.. ఎంత నష్టమో అంచనా వేసుకుంటూ ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. తలపండిన నేతలు తమ రాజకీయ వారసత్వాన్ని సంతానానికి అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఢిల్లీ రాజకీయాలలో వేళ్లూనుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మాత్రమే పరిమితమైందనుకుంటే పప్పులో కాలేసినట్లే. కొత్తగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వారసత్వ రాజకీయాలకు అతీతమైనదిగా కనిపించడం లేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కొడుకులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నేతల జాబితా కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలతోనే మొదలుకావడం విశేషం. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జై ప్రకాశ్ అగర్వాల్ తన కుమారుడు ముదిత్ అగర్వాల్ కోసం పాత ఢిల్లీలో ఒక నియోజకవర్గాన్ని గాలిసున్నారని సమాచారం. బీజేపీ శాసనసభపక్ష నేత విజయ్కుమార్ మల్హోత్రా కూడా తన పుత్రుడు అజయ్ మల్హోత్రాను ఎన్నికల బరిలోకి దించాలనుకుంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి తన కుమారుణ్ని నిలబెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు.. కాంగ్రెస్ నేతలు చౌదరి ప్రేమ్సింగ్ తన తనయుడు ప్రమోద్సింగ్ కు అంబేద్కర్నగర్ టికెట్ ఇప్పించాలనుకుంటున్నారు. ఎంపీ మహాబల్ మిశ్రా తన కుమారుడు వినయ్మిశ్రాను ద్వారక నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. సజ్జన్కుమార్ తన పుత్రుడు జగ్సర్వేశ్ను సంగంవిహార్ నుంచి, ముఖేష్ శర్మ తన కుమారుడు అంకిత్ శర్మను వికాస్పురి నుంచి, పర్వేజ్ హష్మీ తన తనయుడు ఫర్హాన్ హష్మీని ఓఖ్లా నియోజకవర్గం నుంచి నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత మదన్లాల్ ఖురానా తన కుమారుడు హరీష్ ఖురానాకు రాజోరీ గార్డెన్ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు ప్రవేశ్ వర్మ ముండ్కా నియోకవర్గం నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఎన్నికల బరిలోకి ప్రవేశించిన ఆమ్ఆద్మీ పార్టీ కూడా సీమాపురి నియోజకవర్గం నుంచి ధర్మేంద్ర కోలీని అభ్యర్థిగా ప్రకటించింది. ఇటీవల మరణించిన సంతోష్ కోలీ సోదరుడే ధర్మేంద్ర కోలీ. సంతోష్ కోలీ మరణంతో ఆమె స్థానంలో సోదరుడు ధర్మేంద్ర కోలీకి టికెట్ ఇచ్చినట్లు ఆమ్ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కూడా అయిన చౌదరి ప్రేమ్సింగ్, చాందినీచౌక్ ఎమ్మెల్యే ప్రహ్లాద్సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకేశ్ శర్మ తమ కుమారులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ఇది వరకే పార్టీ అధిష్టానాన్ని సంప్రదించినట్టు సమాచా రం. బీజేపీ నుంచి వీకే మల్హోత్రాతోపాటు తిలక్నగర్ ఎమ్మెల్యే ఓపీ బబ్బర్ కూడా తమ కొడుకులకు ఈసారి అవకాశం ఇప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ ఇది వరకే దక్షిణ ఢిల్లీ ఎంపీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ దివంగ త నాయకుడు లలిత్ మాకెన్ కుమారుడు అజయ్మాకెన్ కేంద్రమంత్రిగా పనిచేస్తున్నారు. ‘సజ్జన్కుమార్, మహాబల్ మిశ్రా, ముకేశ్ శర్మ వంటి నేతలు తమ కుమారులను ఇదివరకే ర్యాలీలు, ఆందోళనలు ద్వారా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తండ్రులు రాజకీయాల్లో ఆరితేరినందున వీళ్లంతా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి సొంతంగా అనుచరగణాలు ఉన్నాయి’ అని పేరుచెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అన్నారు. ఈసారి తాను పోటీకి దూరంగా ఉంటున్నందున, కుమారుడికి అవకాశం ఇవ్వాలని మల్హోత్రా బీజేపీ అగ్రనాయకత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఈ విషయమై స్పందిస్తూ కేవలం నాయకుడి కొడుకు అయినంత మాత్రానా టికెట్లు ఇవ్వబోమని, గెలుపు అవకాశాలను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ పార్టీలో ఇప్పటి వరకు ఏ ఒక్క నేత కూడా కుమారుడికి టికెట్ కోసం తనను సంప్రదించలేదని జేపీ అగర్వాల్ అన్నారు.