breaking news
JNUSU polls
-
జేఎన్యూ ఎన్నికల్లో వామపక్షం క్లీన్ స్వీప్
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్యూఎస్యూ) ఎన్నికల్లో వామపక్ష కూటమి తన ప్రాబల్యాన్ని నిలుపుకుంది. కీలకమైన నాలుగు పోస్టులనూ కైవసం చేసుకుంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ), డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డీఎస్ఎఫ్)ల కూటమి ఈ ఎన్నికల్లో క్యాంపస్పై తమ ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నాయి. దాదాపు దశాబ్ద కాలం తర్వాత గత ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీ పోస్టును దక్కించుకున్న ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీకి ఈ దఫా ఆ ఒక్క పోస్టు కూడా నిలుపుకోలేక పోవడం గమనార్హం. ఏఐఎస్ఏ తరఫున ప్రెసిడెంట్ పదవికి పోటీ పడిన అదితి మిశ్రా, ఏబీవీపీకి చెందిన వికాస్ పటేల్పై 449 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి కిఝాకూట్ గోపికా బాబు ఎన్నికయ్యారు. డీఎస్ఎఫ్ అభ్యర్థి సునీల్ యాదవ్, ఏఐఎస్ఏకు చెందిన డానిష్ అలీ జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులకు ఎన్నికయ్యారు. మొత్తం అర్హులైన 9,043 మంది విద్యార్థులో 67 శాతం మంది ఓటేశారు. గతేడాది 70 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. -
'ద్రోహులు నశించాలనే హోమాలు'
న్యూఢిల్లీ: పట్టుమని పదిరోజులు సజావుగా క్లాసులు నడిచాయో లేదో జేఎన్ యూలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనబోతోంది. ఈ దఫా నెలకొనే ఉద్రిక్తతలకు కారణం దేశద్రోహమో మరో వివాదమోకాదు.. విద్యార్థి సంఘం ఎన్నికలు! ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టుడెంట్ యూనియన్(జేఎన్యూఎస్యూ) ఎన్నకలు సెప్టెంబర్ లో జరగనుండగా కోలాహలం అప్పుడే మొదలైంది. ప్రస్తుత జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ తదితరులు జేఎన్ యూలో నిర్వహించిన అఫ్జల్ గురు సంస్మరణ సభతో చెలరేగిన వివాదం ఆ తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తర్వాతి ఎన్నికలు కీలకంగా మారాయి. సీపీఐ అనుబంధ ఎస్ఎఫ్ఐకి కంచుకోట అయిన జేఎన్ యూలో పాగావేసేందుకు పలు సంఘాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జేఎన్ యూఎస్ యూ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు హిందూ విద్యార్థి సేన (హెచ్ వీఎస్) బుధవారం వెల్లడిచేసింది. ఈ సందర్భంగా జేఎన్ యూ హెచ్ వీఎస్ అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ జాతివ్యతిరేక అల్లర్లతో వర్సిటీ అపవిత్రమైందని, పెద్ద ఎత్తున నిర్వహిస్తోన్న ప్రార్థనల ద్వారా వర్సిటీ పవిత్రతతను కాపాడుతున్నామని అన్నారు. 'పవిత్రత కోసం ప్రార్థనలు చేస్తున్నట్లే దేశద్రోహులు నశించాలని హోమాలు కూడా నిర్వహించాం. ఇక ముందు కూడా అలాంటి క్రతువులు చేస్తూనేఉంటాం'అని విష్ణు గుప్తా వ్యాఖ్యానించారు. సైద్ధాంతి విబేధాలు ఉన్నప్పటికీ తాము నిర్వహిస్తున్న ప్రార్థనలు, హోమాలను ఇతర సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, హెచ్ వీఎస్ కార్యక్రమాలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ మద్దతు పలుకుతున్నారని ఆయన చెప్పారు. జేఎన్యూఎస్యూ ఎన్నికల్లో కీలకంగా భావించే నాలుగు పదవులకు (అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి) తీవ్రమైన పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో అధ్యక్ష స్థానంతోపాటు రెండు పదవులను ఎస్ఎఫ్ఐ గెలుచుకోగా, కార్యదర్శి పదవి ఏబీవీపీకి దక్కింది.


