breaking news
Janmabhumi - our village program
-
‘జన్మభూమి’లో జలజగడం
దేవరాపల్లి : మండలంలోని వాకపల్లిలో సోమవారం జన్మభూమి-మాఊరు కార్యక్రమ నిర్వహణకు వచ్చిన అధికారులకు ప్రజల నుంచి చుక్కెదురైంది. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదని, ఇప్పుడు గ్రామంలోకి వచ్చి ఏం సాధిస్తారంటూ బీసీ కాలనీ వాసులు అధికారులను రానీయకుండా గ్రామ శివారులోనే రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. గ్రామస్తులను ఎంత నచ్చజేప్పినా వినకపోవడంతో గత్యంతరం లేక వెనుదిరిగారు. కానీ వెళ్లినట్టే వెళ్లి చోడవరం మీదుగా వాకపల్లి గ్రామానికి సుమారు 40 కిలోమీటర్లు దాటి అడ్డదారిలో ముప్పుతిప్పలు పడుతూ వచ్చి గ్రామస్తుల ఆగ్రహానికి గురయ్యారు. జన్మభూమి సభ వద్దకు గ్రామస్తులంతా వచ్చి అధికారులను చుట్టుముట్టి నినాదాలు చేశారు. తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాల్సిందేనని, లేకుంటే ఇక్కడి నుంచి కదలనీయబోమని వారితో వాగ్వాదానికి దిగారు. దీనిపై తహశీల్దార్ వై.ఎస్.వి.వి.ప్రసాదరావు స్పందిస్తూ త్వరలోనే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇచ్చి వారి నుంచి వినతిపత్రం తీసుకున్నారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో వేచలం వైద్యాధికారి జి.అనీషా, పశు వైద్యాధికారి కె.వి.వరప్రసాద్, వ్యవసాయాధికారి డి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
‘వర్ల’ వస్తే జన్మభూమిని అడ్డుకుంటాం
రిమ్మనపూడి(పామర్రు) : ప్రజాప్రతినిధి, అధికారులను కాదని టీడీపీ నాయకుడు వర్ల రామయ్యను వేదికపైకి ఆహ్వానిస్తే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాలను అడ్డుకుంటామని స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన హెచ్చరించారు. మండలంలోని రిమ్మనపూడి గ్రామంలో సోమవారం జన్మభూమి కార్య క్రమం జరిగింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంల్రు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వెళ్లిపోయారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వెంటనే స్పందించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్మభూమిలో ప్రొటోకాల్ పాటించాలని, సంబంధం లేని వారిని వేదికపైకి ఆహ్వానించవద్దని అధికారులకు సూచించారు. ఎటువంటి సంబంధం లేకపోయినా జన్మభూమి కార్యక్రమంలో వర్ల రామయ్య పాల్గొంటున్నారని విమర్శించారు. ఆయన పాల్గొనడాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తే వారిని బయటకు పంపాలని వర్ల రామయ్య పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్నిచోట్ల వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు దిగడం దారుణమన్నారు. సీఎం చద్రబాబు మాటలను కూడా ధిక్కరిస్తున్న వర్ల రామయ్య వల్ల జన్మభూమి కార్యక్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ఇప్పటికైనా మంత్రులు, టీడీపీ నాయకులు స్పందించి వర్ల రామయ్యను జన్మభూమిలో పాల్గొనకుండా చూడాలని హితవుపలికారు. ఎంపీడీవో రామనాథం టీడీపీ నాయకులతో కలిసి సభాస్థలి నుంచి వెళ్లిపోవడంపై కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. వృద్ధురాలికి గాయం.. పరామర్శించిన ఎమ్మెల్యే జన్మభూమి సందర్భంగా జరిగిన తోపులాటలో తులశమ్మ అనే వృద్ధురాలిపై పలువురు పడిపోయారు. ఆమె కాలికి గాయమైంది. స్థానిక వైద్యులు చికిత్స చేశారు. తులశమ్మను ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పరామర్శించి పింఛను సొమ్ము రూ.1,000ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బీవీ రాఘవులు, కొలుసు ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
పింఛన్దారుల గగ్గోలు
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జన్మభూమి- మాఊరు’కి అడుగడుగునా అటంకాలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీ మేరకు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని రైతులు, డ్వాక్రా మహిళలు నిలదీస్తున్నారు. అర్హత ఉన్నా తమను పింఛన్ల జాబితాలో నుంచి ఎలా తొలగించారని అధికారులు, టీడీపీ నాయకులపై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల టీడీపీ నాయకులకు, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం తాజాగా, చీరాలలో ఇద్దరు నేతల మధ్య ప్రొటోకాల్ రగడ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు స్పందించి ఇరుపక్షాలను కట్టడి చేయాల్సి వచ్చింది. జిల్లాలో ‘జన్మభూమి - మాఊరు’ కార్యక్రమం నిర్వహణ ప్రభుత్వ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఈనెల రెండోతేదీ నుంచి జిల్లామంత్రి శిద్దా రాఘవరావు జన్మభూమిని ప్రారంభించారు. ప్రధానంగా ‘ఎన్టీఆర్ భరోసా’ పేరిట పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారుల ఆందోళనకు జన్మభూమి కార్యక్రమం వేదికగా మారుతోంది. మొదటిరోజు కొండపి, ఒంగోలు నగరంలో నిర్వహించిన సభల్లోనే అసంతృప్తులు గళం విప్పాయి. వికలాంగులు, వృద్ధులు, వితంతు పింఛన్ల జాబితా తప్పుల తడకగా ఉందని.. భూమిలేని నిరుపేదలను సైతం ధనవంతులుగా చూపారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరికి ఆధార్ కార్డు సీడింగ్ లేదంటూ జాబితాలో నుంచి పేర్లను తొలగించడంపై స్థానిక అధికారులను నిలదీస్తున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. రేషన్కార్డుల్లేవని, వయస్సు ధ్రువీకరణ పత్రాలు చూపడం లేదంటూ పేర్లను తొలగించిన వారంతా వేదికల వద్దకు వచ్చి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే అధికారులను నిలదీస్తున్నారు. ఒంగోలులోని త్రోవగుంటలో శనివారం జరిగిన జన్మభూమిలో ఒకరిద్దరు తమకు పింఛన్ల పంపిణీలో అన్యాయం జరిగిందని చెప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. వారికి అవకాశమివ్వకుండానే నగరపాలక సంస్థ సభను మొక్కుబడిగా జరిపి వెళ్లారు. అదేవిధంగా అద్దంకిలో లాంఛన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మంత్రి ప్రసంగం ముగియగానే... ఒకరిద్దరికి మాత్రమే పింఛన్లు అందించి మమ అనిపించారు. జిల్లాలో పరిస్థితిదీ... అసలే బ్యాంకుల్లో బకాయిలు తీరక.. కొత్తరుణాలు పుట్టక.. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులు ప్రభుత్వ కార్యక్రమాలంటేనే భగ్గుమంటున్నారు. మండలాల్లో జన్మభూమి - మాఊరు కార్యక్రమానికి హాజరవ్వాలని స్థానిక నేతలు కోరడానికే భయపడే పరిస్థితి నెలకొంది. రైతులు, డ్వాక్రామహిళలు, పింఛన్దారుల నుంచి నిరసనలను ముందస్తుగా గుర్తించిన అధికారపార్టీ నేతలు ప్రతీ కార్యక్రమ వేదికల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఒకట్రెండు చోట్ల నిరసనకారులు వేదిక వద్దకు రాగానే పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టేస్తున్నారని.. ప్రజాసమస్యల్ని వినేనాధుడు లేనప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలెందుకంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభమై మూడు రోజులు గడిచినా.. ఇంతవరకు ఏఒక్క మండలంలోనూ అధికారిక పింఛన్ల జాబితాను బహిరంగంగా ప్రకటించకపోవడం గమనార్హం. ముందుగా ఒకరిద్దరు అధికారపార్టీ అనుకూలురైన లబ్ధిదారులను పిలిపించి సిద్ధంచేసి.. వేదికలపై వారికి మాత్రమే పింఛన్ సొమ్ము అందించి మమ అనిపిస్తున్నారు. మూడోరోజు శనివారం జన్మభూమి కార్యక్రమాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలంలో నిర్వహించగా, అర్హులైనవారందరినీ పింఛన్ జాబితాలో నుంచి తొలగించడంపై స్థానిక ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరనప్పుడు జన్మభూమి కార్యక్రమం అనవసరమంటూ బహిష్కరించారు. జన్మభూమిని అధికార పార్టీ నాయకులు టీడీపీ కార్యక్రమంగా భావిస్తున్నారని ఆయన స్థానికంగా విలేకరుల సమావేశంలో ఆదివారం దుయ్యబట్టారు. అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు, మార్కాపురం రూరల్లోనూ వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కందుకూరులోని కేతవరంతో పాటు కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్పురం, పామూరు మండలాల్లో రైతులు, డ్వాక్రాసంఘాల సభ్యులతోపాటు పింఛన్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. అద్దంకి నియోజకవర్గంలోని ధర్మవరంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్వయంగా స్పందించి పింఛన్ల జాబితా అవకతవకలపై నిలదీశారు. తలలు పట్టుకుంటున్న అధికారులు అధికారపార్టీ ఆర్భాటంగా నిర్వహించ తలపెట్టిన ‘జన్మభూమి - మాఊరు’ కార్యక్రమం అధికారులకు తలనొప్పిగా మారింది. కార్యక్రమాల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలోనే ప్రతీ రెవెన్యూ డివిజన్కు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఒంగోలుకు సీనియర్ ఐఏఎస్ ఉదయలక్ష్మి, కందుకూరుకు మరో సీనియర్ ఐఏఎస్ కరికాలవళవన్తోపాటు మార్కాపురానికి సీనియర్ ఐఎఫ్ఎస్ కె.గోపీనాథ్ను పంపగా... జిల్లాస్థాయిలో మాత్రం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించడం మరిచారు. ప్రస్తుతం మండలాల్లోని ఎంపీడీవోలే ఈకార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభల్లో అధికారపార్టీ నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల ప్రొటోకాల్ సమస్యతో ఎంపీడీవోలు సతమతమవుతున్నారు. తాజాగా, ప్రొటోకాల్ రగడ నేపథ్యంలో చీరాలలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పోతుల సునీత వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలాఉంటే, గ్రామసభల్లో ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించే మార్గాల్లేక.. వారికి సరైన సమాధానాలు చెప్పలేక అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.