నమోదు కాని సంస్థల
- స్టాక్ టిప్స్ను నమ్మద్దు
- ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసిన సెబీ
ముంబై: నమోదు కాని సంస్థల నుంచి వచ్చే షేర్ల టిప్ల ఆధారంగా ట్రేడింగ్ చేసి మోసపోవద్దని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఇన్వెస్టర్లను హెచ్చరించింది. తమ వద్ద నమోదు కాని సంస్థలు ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఇతర మీడియా సాధనాల ద్వారా పంపించే స్టాక్ మార్కెట్ టిప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సెబీ సూచించింది. ఈ సంస్థలు పంపించే షేర్ల రికమండేషన్లను నమ్మవద్దని సూచించింది. ఈ తరహా నమోదు కాని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
ఇప్పటివరకూ ఇలాంటి ఏడు సంస్థలపై చర్యలు తీసుకున్నామని వివరించింది. తమ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రీసెర్చ్ ఎనలిస్ట్ల అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, ఇలా నమోదైన సంస్థల వివరాలు తమ వెబ్సైట్లో పొందుపరిచామని సెబి తెలిపింది. ఈ సంస్థల టిప్స్ ఆచరించే ముందు అవి నమోదై ఉన్నాయో లేదోనన్న స్టేటస్ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించింది.