breaking news
Illegitimate
-
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధాలేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధాలేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్ షేర్ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్ది రూ.12.40 కోట్లు. కానీ చంద్రబాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లుగా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లుగా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరిటేజ్ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కువగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.ఆ నోటీసులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్ చేయటం తప్ప ఆదాయానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వలేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్ ముసుగు వేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారికంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్ షేర్లకు అంత విలువ లేకపోయినా వాటి పేరిట చూపిస్తే సరిపోతుందని ఈ పన్నాగం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్రబాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొక్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.బోనస్, స్ప్లిట్.. ఏమీ లేకుండానేనిజానికి 2019 తరువాత హెరిటేజ్ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. అంటే ఐదేళ్లలో హెరిటేజ్ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే.... సెక్షన్ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా. -
అక్రమ సంతానం సహజ సంరక్షకురాలు తల్లే!
కేస్ స్టడీ రంజని, ప్రవీణ్లు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో సహోద్యోగులు. రెండేళ్ల నుండి వారిద్దరికీ ఒకరికొకరికి పరిచయం. ప్రవీణ్ ఆదర్శభావాలు గల వ్యక్తి. ఎప్పుడూ మహిళలు, వారి హక్కులు, వారి అభ్యున్నతి మొదలగు విషయాలు గురించి చక్కగా మాట్లాడేవాడు. అతని ఆదర్శాలకు అట్రాక్ట్ అయి రంజని అతని పట్ల ప్రేమ పెంచుకుంది. ప్రవీణ్ కూడా ఆమె పట్ల ప్రేమ పెంచుకున్నాడు. ఇరువురూ వివాహం చేసుకుందామని, కొంతకాలం పాటు హాయిగా గడిపి ఆ తర్వాతే వివాహమని అనుకున్నారు. ఫలితం రంజని గర్భవతి. షరా మామూలే. ప్రవీణ్ ప్రవృత్తి మేడి పండులాంటిదే. పైగా అతడు ముందే వివాహితుడనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. రంజని మనసు దిటవు చేసుకొని ప్రవీణ్ను పక్కన పెట్టింది. పండంటి పాపను కన్నది. 3 ఏళ్లు గడిచింది. హఠాత్తుగా ప్రవీణ్ నుండి కోర్టు నోటీసులు వచ్చాయి పాపను తనకు అప్పగించాలని, తాను పాపకు తండ్రిని/సహజ సంరక్షకుడినని. దిగ్భ్రాంతికిలోనై రంజని లాయర్ను సంప్రదించింది. తమకు పెళ్లే కాలేదని, పైగా ప్రవీణ్ అప్పటికే వివాహితుడని, ఒక బాబు కూడా ఉన్నాడని లాయర్ ముందు భోరుమంది. ‘హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ ఆర్ట్ 1956’లోని సెక్షన్ 6 మైనర్ పిల్లల సహజ సంరక్షకుల గురించి తెలియచేస్తుంది. మైనర్ బాలుడు, అవివాహిత బాలిక యొక్క సహజ సంరక్షకుడు తండ్రి. తండ్రి తర్వాత తల్లి సహజ సంరక్షకురాలు 5 సం॥లోపు వయసు గల పిల్లల కస్టడీ తల్లికే ఇవ్వాలి అక్రమ సంతానం బాలుడైనా, బాలికైనా సహజ సంరక్షకురాలు తల్లి అవుతుంది. తల్లి తర్వాతే తండ్రి నేచురల్ గార్డియన్ అవుతాడు. ఇక్కడ రంజని ‘పాప’ అక్రమ సంతానమవుతుంది. కనుక ప్రవీణ్కు కస్టడీ ఇవ్వరు. తను నేచురల్ గార్డియన్ కాడు. అంతేగాక 5 సం॥వయసు కనుక తల్లే కస్టడీ పొందుతుంది. చట్టం గురించి తెలుసుకున్న రంజని ఊపిరి పీల్చుకుంది. కానీ తమ తప్పుకు, తొందరపాటుకు, అనాలోచిత చర్యలకు పాపకు ‘అక్రమసంతానం’ అనే చట్టపరమైన ముద్ర పడబోతుందని కృంగిపోయింది.