breaking news
Hi-Tech Technology
-
రిటర్న్ల ప్రాసెసింగ్ ఒక్క రోజులో..!
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్లను ప్రాసెస్ చేయటంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి కేంద్రం ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించి రూ.4,242 కోట్ల ఆదాయపు పన్ను (ఐటీ) ఫైలింగ్ ప్రాజెక్ట్కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు డెవలపర్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం (ఐటీ) ఇన్ఫోసిస్ను ఎంపికచేసింది. ప్రాజెక్టు 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుంది. మూడు నెలలు ప్రాజెక్టు పరీక్షా సమయం. అటు తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ చెప్పారు. అంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం విలేకరులకు పియూష్ గోయెల్ తెలిపిన వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► ప్రస్తుతం రిటర్న్లు ఫైల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ సమయం 63 రోజులు పడుతోంది. తాజా వ్యవస్థ అమలోకి వచ్చిన తర్వాత ఈ సమయం కేవలం 24 గంటలకు తగ్గిపోతుంది. దీనితో రిఫండ్ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. ► కేబినెట్ ఆమోదముద్ర వేసిన ఆదాయపు పన్ను శాఖ ఇంటిగ్రేటెడ్ ఈ ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ 2.0 ప్రాజెక్టు రూపకల్పనకు బిడ్డింగ్ ప్రాసెస్లో ఇన్ఫోసిస్ను ఎంపిక చేశారు. ► ప్రస్తుతం ఉన్న వ్యవస్థ విజయవంతమైనదే అయినప్పటికీ, తాజా వ్యవస్థ మరింత ట్యాక్స్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి పారదర్శకతనూ పెంపొందిస్తుంది. అన్ని స్థాయిల్లోనూ ఆటోమేషన్ సౌలభ్యం ఏర్పడుతుంది. ► ఆదాయపు పన్ను శాఖ ప్రమేయం ఏమాత్రం లేకుండా పన్ను చెల్లింపుదారుల అకౌంట్లోకి డైరెక్ట్గా రిఫండ్స్ జారీ అవుతాయి. ► ప్రస్తుత సీపీసీ–ఐటీఆర్ 1.0 ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికిక్యాబినెట్ మరో రూ.1,482 కోట్లను మంజూరు చేసింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.1.83 లక్షల కోట్ల రిఫండ్స్ జరిగాయి. నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు రూ.22,594 కోట్లు అస్సోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు కేంద్ర క్యాబినెట్ రూ.22,594 కోట్ల కేటాయించింది. ఈశాన్య భారత ఇంధన అవసరాలను తీర్చడానికి వీలుగా కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. 1999లో నెలకొల్పిన ఈ రిఫైనరీలో భారత్ పెట్రోలియం(బీపీసీఎల్)కు 61.65 శాతం వాటా ఉంది. ఏడాదికి ప్రస్తుతం 3 మి. టన్నుల క్రూడ్ రిఫైన్ చేస్తోంది. ఈ సామర్థాన్ని 6 మి. టన్నులకు పెంచడం క్యాబినెట్ ప్రస్తుత నిర్ణయ ఉద్దేశమని పియూష్ గోయెల్ తెలిపారు. 48 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు కింద పారాదీప్(ఒడిస్సా) నుంచి నుమాలిగఢ్కు క్రూడ్ ఆయిల్ పైప్లైన్ను నిర్మిస్తారు. నుమాలిగఢ్ నుంచి సిలిగురి (పశ్చిమ బెంగాల్) వరకూ ప్రొడక్ట్ పైప్లైన్ ఏర్పాటవుతుంది. ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.6,000 కోట్లు ప్రభుత్వరంగంలోని ఎగ్జిమ్ బ్యాంక్ (ఎక్స్పోర్ట్– ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కార్యకలాపాల విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. ఈ బ్యాంకుకు తాజా మూలధనంగా రూ.6,000 కోట్లు కేటాయించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి రీక్యాపిటలైజేషన్ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రభుత్వ బ్యాంకులకు జారీ అయ్యే తరహాలోనే ఈ రీక్యాపిటలైజేషన్ బాండ్లు జారీ అవుతాయి. ప్రస్తుత (రూ.4,500 కోట్లు), వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో (రూ.1,500 కోట్లు) బ్యాంకుకు రెండు విడతల్లో బ్యాంకుకు తాజా మూలధనం అందుతుంది. బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ.10,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచడానికి కూడా క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. -
మా వాటాలో 50 శాతం అమ్మేస్తాం
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ప్రమోటర్లు కంపెనీలో తమకున్న వాటాలో 50% వరకు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించే ఆలోచనతో ఉన్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్సే్చంజ్లకు తెలిపింది. దీపావళి వారాంతంలో కంపెనీ ప్రమోటర్లు సుభాష్చంద్ర, అతని కుటుంబం, సలహాదారులతో ముంబైలో సమావేశమై అంతర్జాతీయంగా మీడియా స్వరూపాలు మారిపోతున్న క్రమంలో తమ వ్యాపార వ్యూహాలను సమీక్షించినట్టు పేర్కొంది. కంపెనీలో ఎస్సెల్ హోల్డింగ్స్కు ఉన్న వాటాల్లో 50% పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలియజేసింది. ఎస్సెల్ గ్రూపు నిధుల కేటాయింపు అవసరాల కోసం, అదే సమయంలో పెద్ద ఎత్తున టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో, టెక్నాలజీ మీడియా కంపెనీగా పరిణామం చెందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తమ నిర్ణయం వెనుక ఉద్దేశాలను వివరించింది. సరైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామి ఎంపిక అన్నది వేగంగా మారిపోతున్న టెక్నాలజీలకు అనుగుణంగా కంపెనీని మార్చివేయడంలో సాయపడుతుందని అభిప్రాయపడింది. ఇందు కోసం గోల్డ్మ్యాన్ శాక్స్ సెక్యూరిటీస్ (ఇండియా)ను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గాను, లయన్ట్రీని అంతర్జాతీయ సలహాదారుగాను నియమించుకోవాలని నిర్ణయించింది. సెప్టెంబర్ త్రైమాసికం చివరికి జీల్లో ప్రమోటర్ల గ్రూపుకు 41.62% వాటా ఉంది. మంగళవారం నాటి షేరు క్లోజింగ్ దర రూ.438.20 ప్రకారం ప్రమోటర్ల వాటాల విలువ రూ.17,517 కోట్లు చేస్తుంది. -
సేంద్రియ పాల విప్లవానికి బాటలు..!
‘అక్షయకల్ప’ వ్యవస్థాపకుడు డా. జి.ఎన్.ఎస్. రెడ్డితో ‘సాగుబడి’ ముఖాముఖి పాడి రైతులు మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కొత్త పోకడలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే, పాడిని నమ్ముకొని జీవిస్తున్న లేదా పాడి రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న చిన్న, సన్నకారు రైతులు ఎవరికి వారు తమంతట తాము అత్యాధునిక సాంకేతికతలను, కొత్త పోకడలను అందిపుచ్చుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయం.ఒంటరిగా చేయలేనిది కలసికట్టుగా కదిలితే అసాధ్యం కాబోదు. ముఖ్యంగా.. ఉత్తమ ప్రమాణాలతో కూడిన సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టగలిగితే చిన్న, సన్నకారు పాడి రైతుల భవితకు ఎటువంటి ఢోకా ఉండబోదని నిపుణులు, కర్ణాటకకు చెందిన డాక్టర్ గుడ్డహట్టి నంజుండ శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. స్వావలంబనే ప్రాతిపదికగా సేంద్రియ ఆవు పాల ఉత్పత్తిని చేపట్టి స్థిరమైన అధిక నికరాదాయాన్నిచ్చే దిశగా చిన్న, సన్నకారు రైతులకు ఆయన మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతికతలను, నిర్వహణ సామర్ధ్యాన్ని, మార్కెటింగ్కు సంబంధించిన మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేశారు. డా. జి.ఎన్.ఎస్. రెడ్డి పశువైద్యంలో పట్టా పొందాక భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్(బి.ఎ.ఐ.ఎఫ్.)లో 30 ఏళ్లపాటు సేవలందించి ఉపాధ్యక్షుడి హోదాకు ఎదిగి.. 2010లో బయటకు వచ్చారు. ఆ తర్వాత తుమ్కూర్ జిల్లా తిప్తూరులో ‘అక్షయకల్ప’ సంస్థను నెలకొల్పారు. ఇప్పటికే 150 మంది గ్రామీణ సేంద్రియ పాడి రైతాంగానికి వెలుగుబాట చూపారు. వికేంద్రీకృత పద్ధతిలో చిన్న, సన్నకారు రైతుల చేత సేంద్రియ ఆవు పాల ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ సంస్థ దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ఆయన విశేష కృషికి గుర్తింపుగా 2013లో ప్రతిష్టాత్మకమైన అశోక ఫెలోషిప్నకు ఎంపికయ్యారు. సేంద్రియ పాల వినియోగంపై నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో డా. జి.ఎన్.ఎస్. రెడ్డితో ‘సాగుబడి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. ► సేంద్రియ పాల ప్రత్యేకత, ఆవశ్యకత ఏమిటి? పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలేమిటి? సేంద్రియ పాలే అసలైన పాలు. సేంద్రియ పద్ధతుల్లో పెరిగిన పశుగ్రాసాన్ని తింటూ.. స్వేచ్ఛగా తిరుగాడుతూ, వత్తిడి లేని వాతావరణంలో పెరిగే ఆవుల నుంచి పరిశుభ్రమైన పద్ధతుల్లో సేకరించే యాంటీబయోటిక్స్, హార్మోన్లు, రసాయనిక అవశేషాల్లేని స్వచ్ఛమైన పాలే సేంద్రియ పాలు. పాలల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. హార్మోన్ల వల్ల బాలికలు ముందుగానే రజస్వల అవుతున్నారు. పశువులకు మేపుతున్న కృత్రిమ దాణా ద్వారా అఫ్లోటాక్సిన్లు పాలలోకి చేరి వినియోగదారుల కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాల్లేకుండా.. సబ్బు, డిటర్జెంట్, ఆయిల్స్, సోడా తదితరాలతో కలుషితం కానివే అసలైన అర్థంలో సేంద్రియ పాలు. ► పరిమిత వనరులు కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఈ ప్రమాణాలను అందిపుచ్చుకోగలుగుతారా? గ్రామీణ చిన్న, సన్నకారు రైతులు తమంతట తాము ఒంటరిగా సుస్థిరమైన సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టడం.. డెయిరీ నిర్వహణ నుంచి మార్కెటింగ్ వరకు అన్ని పనులూ ఒంటరిగా, సొంతంగా చక్కబెట్టుకొని నిలవగలగడం కష్టమే. ఈ అవరోధాలను అధిగమించడానికి దోహదపడే లక్ష్యంతోనే నేను బి.ఎ.ఐ.ఎఫ్.లో నుంచి బయటకు వచ్చి, 2010లో ‘అక్షయకల్ప’ను కర్ణాటకలోని తుమ్కూర్ జిల్లాలో స్థాపించాను. గాంధీజీ స్వావలంబన భావాలకు అనుగుణంగా గ్రామీణ చిన్న, సన్నకారు రైతులకు గౌరవప్రదమైన, స్థిరమైన ఆదాయాన్ని అందించే సేంద్రియ డెయిరీపై వినూత్న నమూనాను రూపొందించాను. ఇప్పటికే కర్ణాటకలోని 150 మంది పాడి రైతులు మా నమూనా ప్రకారం సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టి, సుస్థిరమైన నికరాదాయం పొందుతున్నారు. 50 కిలోమీటర్ల పరిధిలో ఎంపికచేసిన రైతుల చేత బైబాక్ ఒప్పందం ద్వారా సేంద్రియ పాలను ఉత్పత్తి చేయించి.. లీటరు రూ. 35 చొప్పున రైతుకు చెల్లిస్తాం. పాలను మేమే సేకరించి.. బెంగళూరులో లీటరు రూ. 70కి విక్రయిస్తున్నాం. ► సేంద్రియ పాలను రైతుల నుంచి కొని మీరే మార్కెట్ చేస్తారా? అవును. చిన్న, సన్నకారు రైతు 25కు మించకుండా సంకరజాతి ఆవులతో సేంద్రియ డెయిరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రైతుకు కనీసం 5 ఎకరాల సొంత పొలం ఉండాలి. బోర్లలో 3 ఇంచుల నీరుండాలి. 50% దేశీ లక్షణాలున్న నాణ్యమైన సంకరజాతి ఆవులను అందిస్తాం. ఇవి కనీసం 10 లీటర్ల పాలు ఇస్తాయి. 15 రకాల పశుగ్రాసాలను, పశుగ్రాసానికి పనికొచ్చే చెట్లను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ఆవుల పేడ, మూత్రం ద్వారా సాగు చేయిస్తాం. ఆవుకు రోజుకు 40 కిలోల పచ్చిమేత, కిలో ఎండుమేత వేస్తాం. కృత్రిమ దాణా వాడాల్సిన అవసరం లేదు.. రైతుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పాలు పితికే యంత్రాలను, పాలను పితికిన వెంటనే నిల్వచేసే చిల్లింగ్ యంత్రాలను, బయోగ్యాస్ ఉత్పత్తి వ్యవస్థను ప్రతి రైతు క్షేత్రంలో ఏర్పాటు చేస్తాం. పరిశుభ్ర వాతావరణంలో యంత్రాలతో పితికినప్పుడు పాలను పాశ్చురైజ్ చేయనవసరం కూడా లేదు. అనుదిన కార్యక్రమాల నిర్వహణలోనూ మా నిపుణులు రైతులకు వెన్నుదన్నుగా ఉంటారు. రైతు స్వయంగా వ్యవసాయ క్షేత్రంతో మమేకమై ఉండి, ఆవులను ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధతో చూసుకోవాలన్నది ముఖ్యమైన నియమం. అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉండి పూర్తిగా పనివాళ్ల మీద ఆధారపడే రైతులను మేము ప్రోత్సహించం. ► రైతు ఎంత పెట్టుబడి పెట్టాలి? ప్రాజెక్టు వ్యయం రూ. 25 లక్షలు. రైతు తన సొంత డబ్బు రూ. 5 లక్షలు పెట్టుబడి ఉండాలి. మిగతా రూ. 20 లక్షలను బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తాం. త్రైపాక్షిక ఒప్పందం మేరకు.. నెల నెలా రుణం కిస్తీని మేమే బ్యాంకుకు చెల్లిస్తాం. ∙ ► ఆవులపై వత్తిడి లేకుండా పెంచడం అంటే? పశువులను కిక్కిరిసిన షెడ్లలో, చిత్తడిగా అపరిశుభ్ర వాతావరణంలో రోజంతా కట్టేసి ఉంచడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అలాకాకుండా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా షెడ్ను డిజైన్ చేశాం. స్వేచ్ఛగా తిరగడానికి కొంత స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తాం. 25కు మించి ఎక్కువ ఆవులు ఒక డెయిరీలో పెట్టనివ్వం. కాబట్టి, ఆవులు ఒత్తిడి లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యదాయకంగా పెరుగుతాయి. పాలను చేతితో పితకటం ఉండదు కాబట్టి శుద్ధంగా ఉంటాయి. ఆవులకు వచ్చే వ్యాధులు కూడా 5%కి తగ్గిపోతాయి. సాధ్యమైనంత వరకు మూలికా వైద్యం మా సంస్థే చేయిస్తుంది. ► మొలకగడ్డిని వాడరా? మొలక గడ్డి ఆవుకు రోజుకు ఒకటి, రెండు కిలోలకు మించి పెట్టకూడదు. విత్తనాలు మొలిపించిన వారం రోజుల్లో మేతగా వేస్తాం కాబట్టి అందులో నీరు ఎక్కువ ఉంటుంది. పీచు నాసిరకంగా ఉంటుంది. ఎక్కువ వేస్తే పశువుకు జీర్ణం కాదు. ► మీతో కలిసి పనిచేసే రైతులకు ఆదాయ భద్రత ఎలా ఉంటుంది? రైతు స్థిమితంగా ఆవుల బాగోగులను చూసుకుంటే చాలు. మార్కెటింగ్కు సంబంధించిన ఒత్తిడి ఉండదు. బయోగ్యాస్ను ఉత్పత్తి చేసుకుంటాం కాబట్టి విద్యుత్ ఖర్చు చాలా తక్కువ. లీటరు సేంద్రియ పాల ఉత్పత్తి ఖర్చు రూ. 15కు దాటదు. రైతుకు మేం రూ. 35 చెల్లిస్తాం. సేంద్రియ డెయిరీ ప్రాంగణంలో పండ్ల చెట్లు, ఇతరత్రా మార్గాల ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నాం. 5 ఎకరాల భూమిలో 25 ఆవులు పెట్టుకున్న రైతుకు నెలకు అన్ని ఖర్చులూ పోను రూ. లక్ష నికరాదాయం స్థిరంగా ఏడాది పొడవునా వచ్చేలా ప్రణాళికలను అమలు చేస్తున్నాం. సాధారణంగా పాడి రైతులు కృత్రిమ దాణా కొనుగోళ్లకే ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంటారు. అందువల్ల నిజానికి చిన్న, సన్నకారు పాడి రైతులకు చేకూరే ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ దుస్థితి నుంచి బయటపడి, స్థిరంగా గౌరవప్రదమైన నికరాదాయం పొందే అత్యుత్తమ మార్గాన్ని పాడి రైతులకు మేం చూపిస్తున్నాం. ► మీరు చెప్పేదాన్ని బట్టి.. దగ్గరి ప్రాంతాల్లో ఉండే రైతులే సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టి.. ఒకే సంస్థ ద్వారా మార్కెటింగ్ చేయాలి. విడిగా ఒక రైతు సేంద్రియ పాల ఉత్పత్తి చేపట్టాలంటే ఎలా? మేం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను రైతుల చేత అమలు చేయిస్తాం. ఆవుల ఎంపిక, పోషణ, యంత్రాల నిర్వహణ, పాల నాణ్యత.. తదితర అంశాలన్నిటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. ఒంటరిగా ఒకే రైతు ఇవన్నీ చూసుకోవడం కష్టం. అందుకే బెంగళూరు పరిసరాల్లోని 50 కిలోమీటర్ల పరిధిలోని పాడి రైతులతోనే మేం ఒప్పందం చేసుకొని, సేంద్రియ పాలు ఉత్పత్తి చేయిస్తున్నాం. పాలతోపాటు ఇతరత్రా పాల ఉత్పత్తులను కూడా అమ్ముతున్నాం. కాబట్టే, రైతుకు లీటరు పాలకు రూ. 35 చెల్లిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాలకు కూడా ‘కల్పసిరి’ పేరిట సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టబోతున్నాం. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ఎవరైనా ముందుకొస్తే వాళ్లతో కలిసి పనిచేస్తాం. ఈ నగరాల పరిధిలో ఇప్పటికే డెయిరీ ఫామ్స్ నిర్వహిస్తున్న రైతులకు మాతో కలవాలని ఆసక్తి ఉంటే.. వారికి కూడా సేంద్రియ పాల ఉత్పత్తి పద్ధతులను అలవాటు చేస్తాం. ► ఈ 3 నగరాలకు దూరంగా ఉన్న ఇతర ప్రాంతాల రైతులకు కూడా సేంద్రియ పాల ఉత్పత్తిలో శిక్షణ ఇస్తారా? మేం ఒప్పందం చేసుకున్న రైతులకు మాత్రమే తొలుత 8 రోజుల శిక్షణ ఇస్తాం. ఇతర రైతులు ఆసక్తి ఉంటే మా పరిధిలోని సేంద్రియ డెయిరీ ఫామ్స్ను సందర్శించి అవగాహన పెంచుకోవచ్చు. ఒత్తిడి లేని వాతావరణంలో ఆవుల పెంపకం, గ్రామీణ రైతుకు కూడా ఉద్యోగస్తుల మాదిరిగా స్థిరంగా గౌరవప్రదమైన నికరాదాయం పొందేందుకు సహాయపడటంతోపాటు.. అన్ని విధాలా ఆరోగ్యదాయకమైన సేంద్రియ పాలను చైతన్యవంతులైన వినియోగదారులకు అందించడమే మా అంతిమ లక్ష్యం. ∙ ► ఎ2 మిల్క్ను అందించే దేశీ ఆవులను మీరెందుకని ప్రోత్సహించడం లేదు..? దేశీ ఆవుల ద్వారా పాల దిగుబడి తక్కువగా ఉంటుంది. రైతుకు గిట్టుబాటు కాకపోవచ్చు. పాల దిగుబడి తగ్గినా పర్వాలేదని రైతు అనుకుంటే గిర్ వంటి దేశీ ఆవులను కూడా ఈ పద్ధతిలో పెంచుకోవచ్చు. (డా. జి.ఎన్.ఎస్.రెడ్డిని 099000 92392 నంబరులో లేదా dr.gnsr@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. http://blog.akshayakalpa.org) ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
డేటా తెలిస్తే దోపిడీనే..
బెంగళూరులో నకిలీ క్రెడిట్ కార్డుల ముఠా అరెస్టు జయనగర (బెంగళూరు): క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించి అత్యాధునిక టెక్నాలజీతో నకిలీ కార్డులు చేసి దండుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. శ్రీలంక పౌరునితో పాటు ముగ్గురిని శనివారం బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ ప్రవీణ్సూద్ తెలిపారు. శ్రీలంకలోని జాఫ్నా నివాసి దివ్యన్, బెంగళూరుకు చెందిన నవాజ్ షరీఫ్, నదీమ్ షరీఫ్ అనే ముగ్గురు కలిశారు. దివ్యన్ స్నేహితుడు టౌమ్జో అనే వ్యక్తి పేరుతో జాలహళ్లిలోని ఓ ఖరీదైన అపార్టుమెంట్లో ఫ్లాట్ తీసుకుని నకిలీ క్రెడిట్ కార్డుల దందా నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. సీసీబీ డీసీపీ రామ్నివాస్ ఆధ్వర్యంలో దాడి జరిపి వీరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 144 క్రెడిట్ కార్డులు, 36 బయటి రాష్ట్రాల దుకాణాల కార్డు స్వైపింగ్ మిషన్లు, 16 నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు, ల్యాప్టాప్తోపాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా మోసం చేసేవారు అమెరికా, జపాన్ తదితర దేశాల్లోని పౌరుల క్రెడిట్ కార్డు దారుల సమాచారాన్ని ఇంటర్నె ట్లో సేకరిస్తారు. అమెజాన్, అలీబాబా తదితర షాపింగ్ వెబ్సైట్ల నుంచి ఖాళీ మ్యాగ్నటిక్ స్వైప్ కార్డులను పొందేవారు. వాటిలోకి తాము తస్కరించిన విదేశీ పౌరుల కార్డుల సమాచారాన్ని లోడ్ చేస్తారు. క్రెడిట్కార్డు ప్రింటింగ్ మిషన్ సాయంతో ఆ కార్డులపై అచ్చం అసలైన కార్డులపై ఉన్నట్లుగానే ఖాతా నంబర్లను ఉబ్బెత్తుగా ముద్రించేవారు. అనంతరం పుదుచ్చేరి, హరియాణా, ముంబై తదితర నగరాల్లోని ఏజెంట్ల ద్వారా దుకాణదారుల నుంచి అంతర్జాతీయ క్రెడిట్కార్డు స్వైపింగ్ మిషన్లను తెప్పించి వాటిలో నకిలీ క్రెడిట్ కార్డులను స్వైప్ చేసి నగదును వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించేవారు. అం దులో దుకాణదారులు, ఏజెంట్లు, నిందితులు వాటాలు వేసుకుని పంచుకునేవారు. కాగా, దివ్యన్ అక్రమంగా చెన్నైకు వచ్చాడు. అతనిపై అక్కడ రెండు చీటింగ్ కేసులున్నాయి. మరో వంచకుడు నదీమ్పై బెంగళూరులో చీటింగ్ కేసులు విచారణలో ఉన్నా యి. బాధితులు సుదూర ప్రదేశాల్లో ఉండడం, ఫిర్యాదు చేయడం సాధ్యం కాకపోవడంతో దుండగుల వంచన నిరాఘాటంగా సాగిపోయిందని కమిషనర్ సూద్ చెప్పారు. కొందరు బాధితులు క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయగా, మరికొందరు నిర్లక్ష్యంగా ఉండిపోయి భారీగా డబ్బు పోగొట్టుకున్నారు.