breaking news
Hastavasi
-
హస్తవాసి మారదా?
‘ఉపాయం లేనివాణ్ణి ఊళ్లోంచి వెళ్లగొట్టాలి' అంటారు. అందుకే అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో జనం కాంగ్రెస్ను చావుదెబ్బ కొట్టారు. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఇంటిదారి పట్టించడంతోపాటు ఇతరచోట్ల సైతం చేతికి చోటు లేదని తేల్చారు. పర్యవసానంగా కాంగ్రెస్లో ఇప్పుడు కొందరికి ‘ధైర్యం’ వచ్చింది. ఇలాగైతే ఎలా అన్న ప్రశ్నలు మొలకెత్తడం మొదలైంది. ‘ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకుందామ’ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన పిలుపును పరిహసిస్తూ ‘ఆత్మ పరిశీలనలూ, అంతర్మథనాలూ చాలు. ఇది కార్యాచరణకు దిగవలసిన సమయం’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గుర్తుచేశారు. పార్టీకి పెద్దాపరేషన్ అవసరమని కూడా అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మామూలుగా కాదు...కనీవినీ ఎరుగని రీతిలో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ... అప్పటినుంచీ అంతూ దరీ తోచక చీకట్లో తడుములాడుతోంది. పార్టీ శ్రేణుల్ని ఉరికించగల సామర్థ్యం ఉన్న సారథి లేక... పదునైన వ్యూహం జాడ కనబడక అక్కడింకా పొద్దుపొడవ లేదు. దిగ్విజయ్ వ్యాఖ్యలు దీనికి తార్కాణం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి తగిలిన దెబ్బ సామాన్యమైనది కాదు. తమిళనాట ఆ పార్టీది మూడో స్థానం. పశ్చిమబెంగాల్లో రెండో స్థానమే అయినా విజయభేరి మోగించిన తృణమూల్కు అది ఎన్నో యోజనాల దూరం. వామపక్ష శ్రేణుల దయవల్ల అక్కడ గతంకన్నా రెండు సీట్లు అదనంగా సంపాదించి లాభపడినా... తన ఓట్లను మాత్రం వారికి బదిలీ చేయలేకపోయింది. ఫలితంగా వామపక్షానికి దక్కినవి 33 మాత్రమే! చెప్పుకున్న సంకల్పానికి కట్టుబడి ఒంటరిగా పోటీచేసినా ఇంతకన్నా మెరుగ్గా ఉండేవాళ్లమని ఇప్పుడు సీపీఎం శ్రేణులు బాధపడుతున్నాయి. ‘బెంగాల్ లైన్’తో భంగపడ్డామని భావిస్తున్నాయి. ఆ మూలనున్న చిన్న రాష్ట్రం పుదుచ్చేరి ఒక్కటే తెలిసో, తెలియకో కాంగ్రెస్ను ఆదరించింది. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆరుచోట్ల ఉప ఎన్నికలు జరగ్గా అందులో ఒక్కటంటే ఒక్కటే కాంగ్రెస్కు లభించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న యూపీలో పరిస్థితి మరింత ఘోరం. అక్కడ ఉప ఎన్నికలు జరిగిన రెండుచోట్లా ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కాంగ్రెస్ క్షీణ దశలో ఉందన్న సంగతి ఈ రెండేళ్లుగా అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ వ్యవధిలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా బిహార్ మినహా అన్నిటా ఆ పార్టీ ఓటమే చవిచూసింది. మూడేళ్లక్రితం రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసినప్పుడు ‘ఈసారి చూసుకోండి... నా తడాఖా’ అని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ జబ్బలు చరిచారు. ‘ఎవరూ ఊహించని స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేస్తాన’ని మాటిచ్చారు. కానీ ఇప్పటికీ దాని జాడ లేదు. ఏడాదిగా రాహుల్ శ్రమిస్తున్నట్టే కనబడుతున్నారు. అయితే అదంతా మాటల శ్రమే. చేతలు మాత్రం సున్నా. వీలైనచోటల్లా ప్రధాని నరేంద్రమోదీపై నోరుచేసుకోవడమే పోరాటమని ఆయన భ్రమపడుతున్నారు. పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని సరిచేయడం సంగతలా ఉంచి తనకంటూ సొంత టీంను ఏర్పాటుచేసుకోవడానికే ఆయనకు సమయం చిక్కడంలేదు. జనం విశ్వాసాన్ని చూరగొనేవరకూ పార్టీ కష్టపడుతూనే ఉంటుందని తాజా ఫలితాల తర్వాత రాహుల్ చెప్పడం బాగానే ఉన్నా... అదెలా ఉంటుందో, ఉండాలో ఆయనకు బోధపడిన సూచనలు కనిపిం చడం లేదు. సోనియాగాంధీ పద్దెనిమిదేళ్లుగా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ తాత్సారం చేసి, తారాట్లాడి రాహుల్ ‘పూర్తికాలపు’ బాధ్యతలు స్వీకరించి కూడా మూడేళ్లు కావస్తోంది. కానీ ఆయనింకా రాజకీయాలకు ‘బయటి వ్యక్తి’గానే ఉన్నారు. అస్సాం ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఆ రాష్ట్రంనుంచి వచ్చిన పార్టీ యువ నాయకుడు హిమంత్ శర్మకు ఎదురైన అనుభవమే ఇందుకు సాక్ష్యం. పార్టీ వ్యూహం గురించి తాను చెబుతున్న విషయాలను లక్ష్యపెట్టకుండా కుక్కపిల్లతో ఆటల్లో మునిగిన రాహుల్ తీరును చూసి విస్తుపోయిన ఆ నాయకుడు ఇక్కడినుంచి నిష్ర్కమించడం మంచిదని నిర్ణయించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొరత లేదు. సీఎంలుగా, కేంద్రమంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు ఆ పార్టీలో బోలెడుమంది ఉన్నారు. అందరితోనూ చర్చిస్తూ ఎవరి శక్తిసామర్థ్యాలేమిటో విశ్లేషించుకుని, ఎవరికి ఏ పని అప్పగించాలో నిర్ణయించుకుని కదిలిస్తే శ్రేణుల్లో కాస్తయినా ఉత్సాహం వస్తుంది. వారిలో ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. ముఠాలుగా విడిపోయి కలహించు కుంటున్నవారిని దారికి తెస్తే పార్టీ ప్రతిష్ట కాస్తయినా నిలబడుతుంది. అందుకు భిన్నంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే యూపీలో పార్టీని గట్టెక్కించే బాధ్యతను ఒక కన్సల్టెంటుకు అప్పగిస్తే, అందుకు కొంత ఫీజు చెల్లిస్తే అన్నీ అతగాడే చూసుకుంటాడని రాహుల్ భావించారు. మరి ఇన్ని వేలమంది నేతలంతా ఏం చేస్తారు? ఆయనను ఆకాశానికెత్తే పనిలో నిమగ్నమై ఉంటారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నెత్తికెత్తుకున్నప్పుడు తాను మాట్లాడిందేమిటో గుర్తుండి ఉంటే కాంగ్రెస్ను రాహుల్ ఈ దుస్థితికి చేర్చేవారు కాదు. రాజకీయాల్లో వారసత్వ సిద్ధాంతానికి తాను వ్యతిరేకమని అప్పట్లో ఆయన చెప్పారు. పార్టీలన్నిటినీ కొంతమంది వ్యక్తులే శాసిస్తున్నారని, ఈ స్థితి మారాలని పిలుపునివ్వడంతోపాటు కాంగ్రెస్లో అలాంటి ధోరణుల్ని అంగీకరించబోనని చెప్పారు. తీరా ఈ మూడేళ్ల ఆచరణా గమనిస్తే వాటన్నిటినీ ఆయన యధాతథంగా కొనసాగిస్తున్నారని అర్ధమవుతుంది. అభ్యర్థుల ఎంపికలోనూ, పార్టీ పదవుల పంపకంలోనూ భజన పరులకే చోటిస్తున్నారని వెల్లడవుతుంది. తప్పులు చేసుకుంటూ పోవడం తప్ప వాటినుంచి నేర్చుకోవాలని, సరిదిద్దుకోవాలని రాహుల్ అనుకోవడం లేదు. బిహార్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక బీజేపీ చురుగ్గా కదిలి తన లోపాల్ని సరిచేసుకోగలిగింది. తన వ్యూహాన్ని సవరించుకుంది. ఫలితంగా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ దిశగా మరికొన్ని అడుగులు వేయగలిగింది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికలు వచ్చే ఏడాది...కర్ణాటక, మేఘాలయ, మిజోరాం ఎన్నికలు ఆ మరుసటి సంవత్సరం రాబోతున్న తరుణం లోనైనా ఇల్లు చక్కదిద్దుకోవాలని కాంగ్రెస్కు అనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఇలాంటి స్థితిలో ఆ పార్టీకి ఓటమి తప్ప ఒరిగేదేముంటుంది? -
డిస్క్ వాపుతో రిస్క్ ఉంటుందా?
హస్తవాసి కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45. ఇటీవల రొటీన్ రక్త పరీక్షలు చేయించుకున్నాను. అందులో నా కొలెస్ట్రాల్ 350కి పైనే ఉందని అని చెప్పారు. నేను మద్యం, మాంసాహారాలకు చాలా దూరంగా ఉంటాను. అయినప్పటికీ నాలో కొలెస్ట్రాల్ ఇంత ఎక్కువగా పెరగడానికి కారణం ఏమిటి? - జీవన్, కొత్తగూడెం రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీద మాత్రమే కాదు... జన్యుపరమైన అంశాలపైన కూడా ఆధారపడుతుంది. జన్యుపరమైన అంశమే కారణమై ఉన్నవారిలో ఏలాంటి ఆహార నియమాలూ పాటించకపోతే కొలెస్ట్రాల్ మరింతగా పెరగవచ్చు. కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణాలు ఏవైనా దాని వల్ల భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీరు స్టాటిన్స్ అనే కొలెస్ట్రాల్ తగ్గించే మందులను డాక్టర్ సలహాపై క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. నా వయసు 35 ఏళ్లు. మా కుటుంబంలో చాలామందికి గుండె జబ్బులు ఉన్నాయి. మా నాన్నగారికి కూడా గుండెజబ్బు ఉంది. నాకు కూడా గుండెజబ్బు ఉందేమోనని అనుమానంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - కనకరత్నం, గుంటూరు మీరు చెప్పినదాన్ని బట్టి మీ కుటుంబ చరిత్రలో గుండెజబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. మీదింకా చిన్న వయసే కాబట్టి ప్రస్తుతం మీది వట్టి ఆందోళన మాత్రమే అనిపిస్తోంది. అయినా మీరు ఒకసారి దగ్గర్లో ఉన్న కార్డియాలజిస్ట్ను కలిసి మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్తో పాటు ఈసీజీ ఎకో, టీఎమ్టీ టెస్టులు చేయించుకుని జబ్బు లేదని నిర్ధారణ చేసుకోండి. ఆ తర్వాత రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ లాంటి వ్యాయామాలు చేయండి. మంచి జీవనశైలితో జీవించండి. మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. - డాక్టర్ శ్రీనివాసకుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజెన్స్ హాస్పిటల్స్, శేరిలింగంపల్లి, హైదరాబాద్. ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ ఎవరో అకస్మాత్తుగా ముందుకు పడిపోతుండగా, వాళ్లను పడిపోకుండా ఆపే ప్రయత్నంలో నా వీపు మధ్యభాగం బెణికింది. ఈ సంఘటన ఆర్నెల్ల కిందట జరిగింది. అప్పట్నుంచి నాకు వీపు మీద నొప్పి వస్తూ, అది మోకాలి కింది వరకూ పాకుతోంది. ఫిజియోథెరపీతో నొప్పి తగ్గింది. అయితే ఇప్పుడు గమనించిన అంశం ఏమిటంటే... నా ఎడమకాలి కంటే కుడికాలు తొందరగా అలసిపోతోంది. నేను టేబుల్ టెన్నిస్ ఆడుతుంటాను. ఈ మధ్య రెండు నిమిషాలు నిలబడితే చాలు... నొప్పి వచ్చి అది కాలి కిందవైపునకు పాకుతోంది. డాక్టర్ను కలిస్తే ఎల్4, ఎల్5 వెన్నుపూసల మధ్య వాపు వచ్చినట్లు తెలుస్తోంది, మళ్లీ ఫిజియో చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. అయినా ఈ నొప్పి నుంచి ఉపశమనం కలగడం లేదు. పైగా ఒక్కోసారి వెన్ను మధ్యన నొప్పి వస్తోంది. ఈ డిస్క్ వాపు సమస్య పూర్తిగా తగ్గుతుందా? దయచేసి వివరించండి. - సుధాకర్రెడ్డి, హైదరాబాద్ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ తన స్థానం నుంచి జరిగి, అది కాలికి వెళ్లే నరాలను నొక్కుతుండటం వల్ల మీకు ఈ నొప్పి వస్తుండవచ్చు. అందువల్లనే మీకు కాలిలోకి పాకుతున్నట్లు నొప్పి వస్తోందనిపిస్తోంది. ఇలాంటి నొప్పులు మాటిమాటికీ తిరగబెడుతుంటాయి. మీరు సందేహిస్తున్నట్లుగా మీ వెన్నునొప్పికీ, కాలిలోకి పాకే నొప్పికీ సంబంధం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఫిజియోథెరపీ, కొన్ని నొప్పి నివారణ మందులు వాడటం (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్-ఎన్ఎ స్ఏఐడీ), వేడి కాపడం పెట్టడం, టెన్స్, అల్ట్రాసౌండ్ చికిత్సలతో ఇది తగ్గవచ్చు. ఒకవేళ కొందరిలో ఈ ప్రక్రియలతో నొప్పి తగ్గకపోతే చివరి ప్రయత్నంగా సర్జరీ అవసరం కావచ్చు. కానీ చాలామందిలో సాధారణ ఫిజియోథెరపీతోనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంటుంది. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజియోథెరపిస్టును కలిసి, వారు సూచించిన ఫిజియోథెరపీ ప్రక్రియలను అనుసరించండి. అలాగే కొంతకాలం పాటు మీరు బరువులు ఎత్తకపోవడం, జాగింగ్ చేయకపోవడం, అకస్మాత్తుగా పక్కలకు తిరగకపోవడం, దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మీ వ్యాయామాల్లో భాగంగా ఈత చాలా మేలు చేస్తుంది. వాకింగ్ కూడా మంచిదే. - ఆర్. వినయ కుమార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ, కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ ఈఎన్టి కౌన్సెలింగ్ నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు. - సీ.ఎస్.రావు, రావులపాలెం ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. టాబ్లెట్ వేసుకుంటే జలుబు తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - సుకుమార్, విజయవాడ మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు భాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. - డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ . మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
పడతులూ తెలుసుకోండి ఈ పధ్నాలుగు వ్యాధులను...
పురుషుడితో పోలిస్తే మహిళల్లో జరిగే అనేకానేక జీవక్రియలు అత్యంత సంక్లిష్టాలు. యుక్తవయసుకు వచ్చిన నాటి నుంచి యువకుల్లో ఒకటి రెండు హార్మోన్లు మాత్రం పనిచేస్తే చాలు. అదే యువతుల్లో అయితే వారి జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అనేక హార్మోన్లు అవసరం. మళ్లీ ఈ హార్మోన్లన్నింటి మధ్యా సమన్వయం కావాలి. అందుకే మహిళ తాలూకు ఆరోగ్య నిర్వహణ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ఈ కింద పేర్కొన్న అంశాల్లో కొన్ని మహిళలకు మాత్రమే వచ్చే అనారోగ్యాలతో పాటు... అందరిలోనూ కనిపించే ‘రక్తహీనత’,‘థైరాయిడ్ వ్యాధులు’ వంటివీ ఉన్నాయి. అయితే అవి పురుషుల్లో కంటే మహిళల్లోనే అత్యధికం. ఈ నెల 8వ తేదీ ‘మహిళా దినోత్సవ’సందర్భంగా మహిళల్లో అత్యధికంగా కనిపించే 14 ప్రధాన ఆరోగ్య సమస్యలు, వాటి నివారణలు, చికిత్సలు సంక్షిప్తంగా... 1- పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఏమిటీ సమస్య: మహిళలకు ఓవరీలో నీటితిత్తులు ఎక్కువగా వస్తుంటాయి. మహిళల్లో అత్యధికంగా వచ్చే ఈ సమస్యను ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమస్య మహిళల్లో అనేక అవరోధాలను కల్పిస్తుంది. రుతుక్రమం సక్రమంగా రాకపోవడం గర్భధారణలో ఆటంకాలు హార్మోన్ల అసమతౌల్యత గుండె, రక్తనాళాల సమస్యలు. ఎందుకు వస్తుంది: పురుష హార్మోన్ అయిన ఆండ్రోజన్ పాళ్లు మహిళల్లో పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనికి జన్యుపరమైన అంశాలే కారణమని భావిస్తున్నారు. దుష్పరిణామాలు: ముఖంపై అత్యధికంగా మొటిమలు రావడం చుండ్రు అవాంఛిత రోమాలు కొందరిలో పురుషుల్లో లాగా బట్టతల స్థూలకాయం అండం విడుదలలో సమస్యలు నెలసరి సరైన సమయంలో రాకపోవడం ఎదుర్కొనేది ఎలా: జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు... అంటే వేళకు తినడం, నిద్రపోవడం, ఆహారంలో కృత్రిమ ప్రాసెస్డ్ ఫుడ్ - చక్కెరపాళ్లను తగ్గించుకోవడం, పొట్టుతో ఉండే ఆహారం, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినడం వంటివి. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. అయితే దీనివల్ల వచ్చే సమస్యలను అధిగమించడానికి చికిత్స చేయించుకోవాలి. కొందరిలో అవసరాన్ని బట్టి అండం విడుదల కావడానికి, చక్కెర తగ్గడానికి మందులు వాడాల్సి రావచ్చు. మామూలుగా తగ్గకపోతే ‘ఒవేరియన్ డ్రిల్లింగ్’ అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించాల్సి రావచ్చు. 2- మొటిమలుబ (ఆక్నే) ఏమిటీ సమస్య: ఈ సమస్య యువతీ యువకులు ఇద్దరిలోనూ కనిపించినా యువతుల్లోనే ఎక్కువ. అలాగే మరిన్ని కారణాలు (హార్మోన్ల అసమతౌల్యత వంటివి) కూడా మహిళల్లో ఈ సమస్యకు దోహదం చేస్తాయి. పైగా అందంగా కనిపించే అంశంలోనూ ఇవి మహిళలను ఒకింత ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తాయి. ఎందుకు వస్తుంది: హార్మోన్ల అసమతౌల్యత మహిళల్లో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ పాళ్లు పెరగడం పీసీఓఎస్ దుష్పరిణామాలు: ముఖంపై గుంటలు పడడం గొంతు భారీగా (మగ గొంతుకలా) మారడం కండరాలు మృదుత్వాన్ని కోల్పోయి మగవారిలా దృఢంగా/గరుకుగా మారడం, రొమ్ముల పరిమాణం తగ్గడం. ఎదుర్కొనేది ఎలా: ముఖాన్ని గాఢత తక్కువైన (మైల్డ్) సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై జిడ్డుగా ఉండేలా మేకప్ వేసుకోకూడదు. రోజుకు రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని స్క్రబ్తో రుద్దుకోకూడదు. వెంట్రుకలు జిడ్డుగా ఉండేవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయాలి. ముఖం కప్పేలా కాకుండా, కాస్త నుదురు కనపడేలా జుట్టును దువ్వుకోవాలి. మొటిమలను గిల్లడం, నొక్కడం చేయకూడదు. జిడ్డుగా ఉండే కాస్మటిక్స్ వేసుకోకూడదు. కాస్మటిక్స్ వాడాలనుకుంటే ‘నాన్-కొమిడోజెనిక్’ తరహావి మాత్రమే వాడాలి. అప్పటికీ తగ్గకపోతే మొటిమలను నివారించే మందులను డాక్టర్ సలహా మేరకే వాడాలి. మందుల షాపుల్లో అమ్మే మొటిమలను తగ్గించే మందుల్ని ఎవరంతట వారే వాడకూడదు. ఎందుకంటే అందులో బెంజోయిల్ పెరాక్సైడ్ / సల్ఫర్ / రిజార్సినాల్ / శాల్సిలిక్ ఆసిడ్ అనే రసాయనాలు ఉండవచ్చు. అవి బ్యాక్టీరియాను చంపి, ముఖాన్ని తేమగా ఉంచే నూనెగ్రంథులను నాశనం చేయవచ్చు, పైపొరను దెబ్బతీయవచ్చు. ముఖం ఎర్రబారవచ్చు. మొటిమలు వచ్చేవారు ముఖానికి కాస్త లేత ఎండ తగిలేలా జాగ్రత్త తీసుకుంటే ఆ చిన్న జాగ్రత్తే చాలావరకు అవి రాకుండా నివారిస్తుంది. 3- రక్తహీనత (అనీమియా) ఏమిటీ సమస్య: ఇది అందరిలో కనిపించే సమస్యే అయినా భారతీయ మహిళల్లో మరీ ఎక్కువ. రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ) లేకపోవడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. ఈ ఎర్రరక్తకణాలే మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళుతుంటాయి. వాటి సంఖ్య తగ్గడం ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. ఎందుకు వస్తుంది: మహిళల్లో రుతుస్రావం వల్ల ప్రతి నెలా రక్తం పోతుంది కాబట్టి అది రక్తహీనతకు దారితీయడం చాలా సాధారణం. కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తం పోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం కూడా రక్తహీనతకు కారణం. లక్షణాలు: వేగంగా అలసట కొద్దిపాటి నడకకే ఆయాసం తలనొప్పి కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, అవి చల్లగా మారడం పాలిపోయినట్లుగా ఉండడం ఛాతీనొప్పి త్వరగా భావోద్వేగాలకు గురికావడం చిరాకు/కోపం స్కూలుకెళ్లే వయసు వారు అక్కడ తగిన సామర్థ్యం చూపలేకపోవడం. ఎదుర్కొనేది ఎలా: ఐరన్ పుష్కలంగా లభించే ఆహారమైన ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, కొబ్బరి, పప్పుచెక్కలు (చిక్కీ)తో పాటు మాంసాహారులైతే గుడ్లు, కాలేయం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. ఏదైనా తిన్న వెంటనే కాఫీ, టీ తాగితే, అవి జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోకి ఇంకకుండా చేస్తాయి. కాబట్టి, తినగానే వాటిని తీసుకోవద్దు. డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి. 4- రొమ్ము క్యాన్సర్ ఏమిటీ సమస్య: మహిళల్లో అత్యధికంగా కనిపించే మరో రుగ్మత రొమ్ము క్యాన్సర్. రొమ్ము కణజాలాల్లో క్యాన్సర్ కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే రొమ్ము క్యాన్సర్. ఈ క్యాన్సర్ కణాలు ఒక గడ్డ (ట్యూమర్)లా కనిపించవచ్చు. అవి దగ్గర్లోని ఇతర కణజాలాలకు పాకి, పక్కనే ఉన్న లింఫ్నోడ్స్కు వ్యాపించి శరీరమంతా విస్తరించనూ వచ్చు. రొమ్ము క్యాన్సర్లో ప్రధానంగా ఈ కింది రకాలు ఉంటాయి. అవి... డక్టల్ కార్సినోమా: రొమ్ము క్యాన్సర్ వచ్చిన ప్రతి పదిమందిలో ఎనిమిది మంది సమస్య ఈ తరహాకు చెందినదే. లోబ్యులార్ కార్సినోమా: ప్రతి పదిమందిలో కేవలం ఒకరికే ఈ తరహా క్యాన్సర్ కనిపిస్తుంది. లక్షణాలు: లక్షణాలు కనిపించకముందే ఆమెలో క్యాన్సర్ ఉందని తెలుసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే... రొమ్ములో లేదా బాహుమూలాల కింద గట్టిగా ఉన్న కండ... గడ్డలా చేతికి తగులుతుండటం రొమ్ము ఆకృతిలో, పరిమాణంలో మార్పురావడం చనుమొన నుంచి స్రావాలు రావడం (ఇవి పాలు కావు) చనుమొన ఆకృతిలో మార్పురావడం... అంటే అది లోపలికి కుంచించుకుపోయినట్లుగా మారడం రొమ్ము చర్మంలో మార్పులు... అంటే చనుమొన, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలోనూ, రొమ్ము మీద దురద రావడం, ఎర్రబారినట్లుగా కనిపించడం, పొలుసులు ఊడినట్లుగా అవుతుండటం, సొట్టపడినట్లుగా ఉండటం. ఎదుర్కొనేది ఎలా: రొమ్ముక్యాన్సర్ చికిత్సలో ఒకటి కంటే ఎక్కువ ప్రక్రియలను అనుసరించాల్సి రావచ్చు. ఎన్ని, ఎలాంటి ప్రక్రియలు అనుసరించాలి అన్న అంశం... క్యాన్సర్ ఏ దశలో ఉందన్న విషయంతో పాటు... ట్యూమర్ పరిమాణం ఎంత, అది ఏ రకమైన క్యాన్సర్, అది వచ్చిన మహిళ మెనోపాజ్ దశకు చేరిందా లేదా, ఆమె సాధారణ ఆరోగ్యపరిస్థితి... వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, నిర్ణీతంగా క్యాన్సర్ కణాలను మాత్రమే నిర్మూలించే టార్గెట్ థెరపీ వంటి ప్రక్రియలతో చికిత్స చేస్తారు. 5- ఎండో మెట్రియాసిస్ ఏమిటీ సమస్య: ఎండోమెట్రియాసిస్ అనే ఈ జబ్బు కేవలం మహిళలు, యువతుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా వారిలో రుతుస్రావం మొదలై... అది కొనసాగుతున్న సమయంలోనూ వస్తుంది. ఇందులో గర్భసంచీలో ఉండే లోపలిపొర (ఎండోమెట్రియమ్) కేవలం లోపలికే పరిమితం కాకుండా అన్ని అంతర్గత అవయవాల్లోకి పెరుగుతుంది. ఫలితంగా అది అండాలను, ఫెలోపియన్ ట్యూబ్స్ను, పొత్తికడుపులో ఉండే ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు: కొందరిలో ఎండోమెట్రియమ్ పొర బయటకు తక్కువగా పెరిగినా పొత్తికడుపు కింది భాగంలో లేదా నడుములో నొప్పి ఉండవచ్చు. కొందరిలో అది ఎంతగా బయటకు పెరిగినా వారిలో ఎలాంటి నొప్పీ ఉండకపోవచ్చు. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలు ఏమిటంటే... రుతుస్రావ సమయంలో తీవ్రమైన నొప్పి నడుము, పొత్తికడుపులో నొప్పి సెక్స్లో విపరీతమైన బాధ మలవిసర్జన / మూత్రవిసర్జన బాధాకరంగా ఉండటం రుతుస్రావం సమయంలోనే గాక... ఇతర సమయాల్లోనూ చుక్కలు చుక్కలుగా రక్తస్రావం తీవ్రమైన అలసట గర్భధారణ జరగకపోవడం (ఇన్ఫెర్టిలిటీ) నీళ్లవిరేచనాలు / మలబద్ధకం / కింది నుంచి గ్యాస్ పోవడం / వికారం (రుతుస్రావ వేళ ఈ వికారం ఎక్కువ). ఎదుర్కొనేది ఎలా: దీనికి చికిత్స దశల వారీగా జరుగుతుంది. ఉదాహరణకు ఒక దశ చికిత్సకు సరైన స్పందన లభించకపోతే ఆ తర్వాతి దశకు వెళ్లాల్సి ఉంటుంది. మొదటి దశలో: నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులతో రెండో దశలో: కనీసం మూడు నెలల పాటు గర్భనిరోధక మాత్రలతో మూడో దశలో: ఎండోమెట్రియమ్ పొర పెరుగుదలను అరికట్టే జీఎన్ఆర్హెచ్-అగొనిస్ట్ అనే మందుతో నాలుగో దశలో: ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా పొత్తి కడుపు భాగంలో చిన్న గాటు పెట్టి, ఎండోమెట్రియమ్ పొరను చూస్తూ... కనిపించిన మేరకు తొలగిస్తారు. 6- మూత్రంలో ఇన్ఫెక్షన్ ఏమిటీ సమస్య: మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అన్నవి పురుషుల్లోనూ కనిపించినా... మహిళల్లో చాలా ఎక్కువ. మూత్రంలో ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించకపోతే అది మూత్రాశయానికీ, మూత్రపిండాలకూ హాని కలిగించవచ్చు. ఒక్కోసారి ఈ ఇన్ఫెక్షన్ రక్తంలోకి పాకి అన్ని అవయవాలకూ వ్యాపించి, ప్రమాదకరంగానూ పరిణమించవచ్చు. ఎందుకు వస్తుంది: బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సిస్టైటిస్ (బ్లాడర్ ఇన్ఫెక్షన్) పైలోనెఫ్రైటిస్ (కిడ్నీ ఇన్ఫెక్షన్) యురెథ్రైటిస్ (మూత్రాశయం నుంచి మూత్రద్వారం వరకు ఉండే మూత్రనాళంలో మంట, ఇన్ఫెక్షన్). లక్షణాలు: మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట పొత్తికడుపులో, నడుములో, నడుము పక్కభాగాల్లో నొప్పి చలి, వణుకు జ్వరం చెమటలు పట్టడం వికారం / వాంతులు మాటిమాటికీ మూత్రం వస్తున్నట్లు అనిపించడం మూత్రంపై నియంత్రణ కోల్పోయి ఒక్కోసారి చుక్కలు చుక్కలుగా పడటం మూత్రం నుంచి ఘాటైన వాసన విసర్జించే మూత్రం పరిమాణంలో మార్పులు (ఎక్కువ లేదా తక్కువ) మూత్రంలో రక్తం, చీము పడటం సెక్స్లో మంట, నొప్పి ఎదుర్కొనేది ఎలా: వ్యాధి నిర్ధారణ తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగిన మందులు వాడతారు. ఒకవేళ మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తుంటే మూత్రపిండాలను, గర్భసంచి (యుటెరస్)ను, మూత్రాశయాన్ని ఎక్స్-రే తీసి పరీక్షించే ఇంట్రావీనస్ పైలోగ్రామ్ (ఐవీపీ) అనే ప్రత్యేకమైన పరీక్షలనూ, అవసరాన్ని బట్టి పూర్తి మూత్ర విసర్జక వ్యవస్థను పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ను, ఒక టెలిస్కోప్ వంటి సాధనంతో బ్లాడర్ లోపల పరీక్ష చేయాల్సి వచ్చే ‘సిస్టోస్కోపీ’ వంటి పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఇది సాధారణ యాంటీ బయాటిక్స్తోనే ఇది తగ్గుతుంది. పరిస్థితి ముదిరితేనే కనిపించే లక్షణాలను బట్టి ఇతర చికిత్సలు అవసరమవుతాయి. 7- థైరాయిడ్ సమస్య ఏమిటీ సమస్య: మానవ దేహంలో సరిగ్గా మెడ భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది ప్రథానంగా థైరాక్సిన్ (టీ4) అనీ, ట్రై అయడో థైరమిన్ (టీ3) అనే హార్మోన్లను స్రవిస్తుంటుంది. ఈ రెండూ శరీరంలోని అనేక జీవక్రియలను నియంత్రిస్తుంటాయి. ఈ హార్మోన్లను స్రవించే ఈ గ్రంథి అతిగా పనిచేసినా, లేదా పనిచేయకపోయినా సమస్యలు వస్తుంటాయి. థైరాయిడ్ సమస్యలను ప్రధానంగా ఇలా విభజించవచ్చు. హైపర్ థైరాయిడిజం (థైరాయిడ్ అతిగా పనిచేయడం) హైపో థైరాయిడిజం (థైరాయిడ్ పనిచేయకపోవడం) హైపర్ థైరాయిడిజం: హైపర్ థైరాయిడిజం కండిషన్లో థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసి థైరాక్సిన్ హార్మోన్ను ఎక్కువగా స్రవిస్తుంటుంది. హైపర్ థైరాయిడిజం లక్షణాలు: ఎంత తిన్నా సన్నగానే ఉండటం, బరువు పెరగకపోగా... తగ్గడం. గాయిటర్ (మెడ దగ్గర ఉండే థైరాయిడ్ ఉబ్బినట్లుగా ఉండటం. దాంతో మెడ దగ్గర ఉబ్బి కనిపిస్తుంటుంది). కళ్లు ఉబ్బినట్లుగా ఉంటాయి. దురదలు పెట్టడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉద్వేగంగా ఉండటం, త్వరగా కోపం రావడం నిద్రపోవడంలో ఇబ్బందులు, ఎప్పుడూ అలసటగా ఉండటం గుండె వేగం పెరగడం, గుండె స్పందనల్లో క్రమబద్ధత లేకపోవడం, వేళ్లు వణుకుతూ ఉండటం చెమటలను ఎక్కువగా పట్టడం, కొద్దిపాటి వేడిమిని కూడా భరించలేకపోవడం కండరాలు బలహీనంగా మారడం త్వరగా మలవిసర్జన ఫీలింగ్స్ కలగడం. హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఉన్నప్పుడు విధిగా పరీక్షలు చేయిచుకుని, ఆ రుగ్మత ఉన్నట్లు తేలితే తప్పనిసరిగా మందులు తీసుకోవాలి. లేకపోతే అది ఒక్కోసారి గుండె పనిచేయకపోవడానికి (హార్ట్ఫెయిల్యూర్)కు దారితీయవచ్చు. లేదా ఎముకలు పెళుసుగా మారిపోవడం (ఆస్టియోపోరోసిస్) జరగవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయకరమైన థైరాయిడ్ స్టార్మ్ కండిషన్కూ దారితీయవచ్చు. నిర్ధారణ పరీక్ష : రక్తంలో థైరాయిడ్ హార్మోన్ల మోతాదులను పరీక్షించడం ద్వారా హైపర్ థైరాయిడ్ కండిషన్ను నిర్ధారణ చేస్తారు. థైరాక్సిన్ హార్మోన్ (ప్రధానంగా టీ4 హార్మోన్) మోతాదులు పెరిగి ఉండటం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. ఎదుర్కొనేది ఎలా: యాంటీ థైరాయిడ్ మందులు ఇవ్వడం రేడియో యాక్టివ్ అయొడిన్ ద్వారా చికిత్స శస్త్రచికిత్స బీటా బ్లాకర్స్ ఉపయోగించడం హైపో థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం, లేదంటే చాలా తక్కువగా పనిచేయడాన్ని ‘హైపో థైరాయిడిజం’ అంటారు. లక్షణాలు: తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం మానసిక వ్యాకులత (మెంటల్ డిప్రెషన్) చల్లగా అనిపించడం బరువు పెరగడం (రెండు నుంచి నాలుగు కిలోల వరకు) చర్మం పొడిగా మారడం, మలబద్ధకం మహిళల్లో రుతుక్రమం సక్రమంగా రాకపోవడం గర్భిణుల్లో మరింత జాగ్రత్త: గర్భిణుల విషయంలో థైరాక్సిన్ పాళ్లు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. నిర్ధారణ పరీక్షలు : రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ గ్రంథి స్రవించే టీ4 హార్మోన్ పాళ్లు సాధారణంగా ఉన్నాయా లేదా అని పరీక్షిస్తారు. టీఎస్హెచ్ పాళ్లలోనూ మార్పులు రావచ్చు. ఎదుర్కొనేది ఎలా: లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స అందిస్తారు. 8- ఆస్టియో పోరోసిస్ ఏమిటీ సమస్య: భారతీయుల్లో చాలా ఎక్కువ. అందులోనూ మహిళల్లో! మెనోపాజ్ దాటాక కనీసం 40% మందిలో కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది: మన అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు పెరుగుతుంటాయి. బాల్యం, కౌమారంలో ఉండే ఈ ఎముకల పెరుగుదల యౌవనం తర్వాత ఆగిపోయాక కూడా దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు బలంగా, గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. మహిళల ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్- ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల రుతుక్రమం ఆగిన మహిళల్లో ఇది మరీ ఎక్కువ. (ఎముకలను బలంగా ఉంచడానికి ఈస్ట్రోజెన్ దోహదపడుతుంది). రుతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ పరిణామం మహిళల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే. లక్షణాలు: ఇది వస్తుంది అని తెలుసుకోడానికి అవసరమైన లక్షణాలు ముందే కనిపించేందుకు అవకాశం లేదు. కారణం... ఎముకలు శరీరంలో లోపల ఉంటాయి కాబట్టి అవి పలచబడడం, పెళుసుగా మారడాన్ని గమనించడం సాధ్యం కాదు. అందుకే ఇది నిశ్శబ్దంగా వచ్చే పరిణామం. ఇలా ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయాలకే ఎముకలు విరగడం కనిపిస్తుంది. అంటే... ఏదైనా చిన్నపాటి ప్రమాదానికే ఎముక పుటుక్కున విరిగిపోతుంటే దాన్ని ‘ఆస్టియో పోరోసిస్’గా గుర్తించవచ్చు. దీనికి సంబంధించి మరికొన్ని లక్షణాలు ఏమిటంటే... ఒళ్లు నొప్పులు ఎముకలు, కీళ్ల నొప్పులు అలసట చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడం ఆస్టియోపోరోసిస్ - నిర్ధారణ: రక్తపరీక్ష, ఎక్స్-రే, బీఎమ్డీ (బోన్ మాస్ డెన్సిటీ - అంటే ఎముక సాంద్రత నిర్ధారణ చేసే పరీక్షల ద్వారా రోగిలో దీన్ని నిర్ధరించవచ్చు.) ఎదుర్కొనేది ఎలా: ప్రాథమిక నివారణ చర్యలు ఆస్టియోపోరోసిస్ కండిషన్ను ఆలస్యం చేస్తాయి. ఫలితంగా రిస్క్ తగ్గుతుంది. దాంతోపాటు... క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇవ్వడం - డాక్టర్లు ప్రాథమిక చికిత్సగా క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇస్తారు. అంటే... 60 ఏళ్లు దాటిన వారికి ప్రతిరోజూ 1500 ఎంజీ క్యాల్షియమ్నూ, విటమిన్-డిని రోజూ 10 నుంచి 15 మిల్లీ గ్రాములు ఇస్తారు. డిస్ఫాస్ఫోనేట్స్ - ఇవి ఒక రకం మందులు. వీటినే డిస్ఫాస్ఫోనేట్స్ అని కూడా అంటారు. ఎముక తనలోని పదార్థాన్ని కోల్పోయే ప్రక్రియను ఇవి ఆలస్యం చేస్తాయి. ఫలితంగా ఎముక సాంద్రత తగ్గే వేగం మందగిస్తుంది. దానివల్ల ఎముక మరింత కాలం దృఢంగా ఉంటుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) - రుతుక్రమం ఆగిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ను తిరిగి భర్తీ చేసే ఈ చికిత్స ప్రక్రియను కూడా అవసరాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ హెచ్ఆర్టీ వల్ల కొన్ని దుష్ర్పభావాలు కూడా కనిపిస్తాయి. అంటే... రొమ్ముల సలపరం, మళ్లీ రుతుస్రావం మొదలుకావడం, బరువు పెరగడం, మూడ్స్ మాటిమాటికీ మారిపోవడం, పార్శ్వపు తలనొప్పి రావడం వంటివన్నమాట. కాబట్టి రోగి కండిషన్ను బట్టి హెచ్ఆర్టీ అవసరమా, కాదా అన్నది డాక్టర్లే నిర్ధరిస్తారు. క్యాల్సిటోనిన్ - ఈ మందులను డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. టెరీపారటైడ్ - ఇది ఆస్టియో పోరోసిస్ చికిత్స ప్రక్రియలో సరికొత్త మందు. 9- ప్రీ-మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఏమిటీ సమస్య: ఇది మహిళల్లో రుతుస్రావం ముందర కనిపించే ఆరోగ్యసమస్య. ఎందుకు వస్తుంది: ఈ సమస్యకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు. అయితే అనేక అంశాలు దీరికి దోహదపడతాయి. ఉదాహరణకు ప్రతి నెలా రుతుస్రావం వచ్చేందుకు ఉపయోగపడే అనేక హార్మోన్లలో మార్పులు మిగతావారి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ‘పీఎమ్ఎస్’ కనిపించవచ్చు. కొందరిలో మెదడు రసాయనాల్లోని మార్పులూ ఇందుకు దోహదం చేస్తాయి. ఒత్తిడి, ఉద్వేగ భరితమైన సమస్యలూ (డిప్రెషన్) పీఎమ్ఎస్కు కారణాలే. లక్షణాలు: మొటిమలు రావడం రొమ్ము వాపు లేదా ముట్టుకుంటే మంటగా మారడం (టెండర్నెస్) అలసట నిద్రపోవడంలో ఇబ్బంది కడుపులో ఇబ్బంది / కింది నుంచి గ్యాస్పోవడం / మలబద్ధకం లేదా నీళ్ల విరేచనాలు తలనొప్పి వెన్నునొప్పి కీళ్లనొప్పులు కండరాల నొప్పులు టెన్షన్ / త్వరగా కోపం రావడం / వేగంగా భావోద్వేగాలకు గురికావడం / మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం / తరచూ వెక్కివెక్కి ఏడ్వటం యాంగ్జైటీ లేదా డిప్రెషన్ ఎదుర్కొనేది ఎలా: దీనికి చికిత్స మూడు మార్గాల్లో జరుగుతుంది. మొదటిది జీవనశైలిలో మార్పులు: ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే... ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం తాజాపండ్లు తినడం ఉప్పు, తీపి, కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం (ప్రధానంగా పీఎమ్ఎస్ ఉన్నప్పుడు) ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవడం యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటివి చేయడం. రెండోది మందులు తీసుకోవడం: ఇలాంటి సమయాల్లో నొప్పులు తగ్గడానికి వీలుగా ఇబూప్రొఫెన్, కీటోప్రొఫెన్, న్యాప్రోగ్రెన్, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకోవడం. మూడోది అల్టర్నేటివ్ థెరపీ: పీఎమ్ఎస్ ఉన్నవారు అదనంగా కొన్ని విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లు తీసుకోవాలి. 10- యూరినరీ ఇన్కాంటినెన్స్ ఏమిటీ సమస్య: మూత్రం వస్తున్నప్పుడు దానిని ఏ మాత్రం నియంత్రించలేక టాయ్లెట్కు వెళ్లాల్సి వచ్చే పరిస్థితిని ‘యూరినరీ /అర్జ్ ఇన్కాంటినెన్స్’ అంటారు. టాయ్లెట్కు చేరేలోపే మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతుంది. పరిస్థితి మరింత దిగజారేదెప్పుడు: ఈ సమస్య ఉన్న మహిళలు కెఫిన్ ఎక్కువగా తీసుకున్నా (కాఫీలు ఎక్కువసార్లు తాగినా), టీలు, కోలా డ్రింకులు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నా, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా... పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కొందరు మహిళల్లో రుతుస్రావం ఆగిపోయాక (మెనోపాజ్ తర్వాత) అది ఇంకా పెరుగుతుంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడంతో యోని లోపలి పొరలు కుంచించుకుపోవడం (వెజైనల్ అట్రోఫీ) వల్ల ఈ స్థితి వస్తుందని భావన. ఎదుర్కొనేది ఎలా: అర్జ్ ఇన్కాంటినెన్స్ను అధిగమించడానికి కొన్ని సాధారణ జీవనశైలి మార్గాలు ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అవి... త్వరగా టాయిలెట్కు వెళ్లడం కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించడం తగినంతగా ద్రవాహారం తీసుకోవడం ఒకవేళ స్థూలకాయులైతే బరువు తగ్గించుకోవడం. మూత్రవిసర్జనపై నియంత్రణకు శిక్షణ: దీన్నే బ్లాడర్ ట్రైనింగ్ లేదా బ్లాడర్ డ్రిల్ అంటారు. అర్జ్ ఇన్కాంటినెన్స్ ఉన్నప్పుడు టాయిలెట్లోకి వెళ్లాక అక్కడ మూత్రవిసర్జన ఫీలింగ్ను నియంత్రించుకుంటూ క్రమంగా ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవాలి. ఫలితంగా చుక్కలు చుక్కలుగా రాలడం అన్నది క్రమంగా తగ్గుతుంది. ఇలా క్రమంగా బ్లాడర్పై నియంత్రణ సాధించవచ్చు. మందులు: ఒకవేళ బ్లాడర్ ట్రైనింగ్/బ్లాడర్ డ్రిల్తో ఫలితం లేకపోతే అప్పుడు యాంటీ మస్కారినిక్స్ / యాంటీకొలినెర్జిక్ అనే మందులను ఇస్తారు. ఇక బ్లాడర్, యుటెరస్, మలద్వారం కండరాలు బలం పుంజుకునేలా చేసే కొన్ని రకాల వ్యాయామాలు (పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్లు)తోనూ మంచి ఫలితం ఉంటుంది. ఇవీ విఫలమైతే కొన్ని శస్త్రచికిత్సల ద్వారా సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 11- ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో గడ్డలు ఏమిటీ సమస్య: గర్భసంచీలో పెరిగే హానికరం కాని గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి క్యాన్సర్గా మారవు. వీటినే యుటెరైన్ మయోమాస్, ఫైబ్రోమయోమాస్ లేదా లియోమయోమాస్ అంటారు. ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా క్రమంగా తగ్గిపోతాయి. గర్భసంచీలో అవి వచ్చే ప్రాంతాన్ని బట్టి వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, సబ్సిరోస్ ఫైబ్రాయిడ్స్, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అని పిలుస్తారు. ఎందుకు వస్తుంది: ఇవి పెరగడానికి నిర్దిష్ట కారణం తెలియకపోయినా... అదనపు కండ పెరగడం వల్ల ఇవి వస్తాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ పాళ్లు పెరిగినప్పుడు ఆ హార్మోన్ వల్ల వీటి పెరుగుదలకూ ప్రేరణ లభిస్తుంది. ఈస్ట్రోజెన్ సరఫరా తగ్గితే ఇవి కూడా కుంచించుకుపోతాయి. లక్షణాలు: ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే వీటి వల్ల కనిపించే లక్షణాలు బయటపడతాయి. కొందరికి ఇవి ఉన్నప్పటికీ వాటి ఉనికే తెలియదు. అందుకే వేరే సమస్య కోసం పరీక్షలు చేస్తుంటే కొందరిలో ఇవి ఉన్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా కనిపించే లక్షణాలు... రుతుస్రావం సమయంలో తీవ్రమైన రక్తస్రావం, నొప్పి సెక్స్ సమయంలో నొప్పి గర్భస్రావం లేదా గర్భధారణ జరగకపోవడం గర్భవతిగా ఉన్న సమయంలో సమస్యలు. పరీక్షలు: యోనిని పరీక్షించినప్పుడు డాక్టర్కు ఈ ఫైబ్రాయిడ్స్ చేతికి తగలవచ్చు. మరికొందరిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఇవి ఉన్నట్లు తెలియవచ్చు. ఎదుర్కొనేది ఎలా: ట్రానెగ్జామిక్ యాసిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కొన్ని గర్భనిరోధక మాత్రలు, లెవో నార్జెస్ట్రల్ ఇంట్రాయుటెరైన్ విధానలతో దీనికి చికిత్స చేయవచ్చు. ఇక చికిత్సతో తగ్గనప్పుడు కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియలు, ఎండోమెట్రియల్ అబ్లేషన్, యుటెరస్కు రక్తసరఫరా చేసే రక్తనాళాన్ని ఆటంకపరచి దానికి రక్తసరఫరాను ఆపే ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ వంటి ప్రక్రియలతో దీనికి చికిత్స చేయవచ్చు. 12- ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఏమిటీ సమస్య: ఇది చాలా ఇబ్బంది కలిగించే సమస్య. తినగానే టాయిలెట్కు వెళ్లాల్సి వచ్చే ఈ సమస్యతో సామాజికంగా చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఇందులో చాలా లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలకు కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించే అన్ని వైద్యపరీక్షల్లోనూ ఎలాంటి సమస్యలూ ఉన్నట్లు తేలదు. ఫలితాలన్నీ మామూలుగా ఉంటాయి. లక్షణాలు: పొట్ట నొప్పి, పొట్ట పట్టేసినట్లుగా ఉండటం మలబద్ధకం మలవిసర్జన తర్వాత కూడా ఇంకా కడుపు పూర్తిగా ఖాళీ కానట్లుగా ఉండటం నీళ్ల విరేచనాలు విరేచనాలు, మలబద్ధకం లాంటి విరుద్ధ లక్షణాలు ఒకదాని తర్వాత మరోటి కనిపించడం మలంలో బంక (మ్యూకస్) పడటం కడుపు ఉబ్బరంగా ఉండటం కడుపులో గ్యాస్ నిండటం / కింది నుంచి గ్యాస్ పోవడం పొట్టపై భాగంలో ఉబ్బరంగా/ఇబ్బందిగా అనిపించడం కొద్దిగా తిన్నా కడుపు నిండిపోయినట్లు ఉండి వికారం / వాంతి భ్రాంతి కలగడం ఎదుర్కొనేది ఎలా: దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కాకపోతే కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలులను అనుసరించడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. అవి... ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవడం తగిన వేళల్లో తినడం ఆహారంలో తగినంత పీచు ఉండటం కోసం పొట్టుతో కూడిన ఆహారధాన్యాలు, తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవడం రోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా మంచినీళ్లుతాగడం తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే కొన్నిసార్లు ఫైబర్ను మందుల రూపంలో తీసుకోవాల్సి రావచ్చు. లక్షణాలను బట్టి యాంటీ-డయేరియల్ మందులు, యాంటీ డిప్రెసెంట్స్, కడుపు పట్టేసిన ఫీలింగ్ను తొలగించేందుకు యాంటీ స్పాస్మోడిక్ మందులు అవసరం కావచ్చు. అవసరాన్ని బట్టి మానసిక చికిత్సలో భాగంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ), డైనమిక్ సైకోథెరపీ వంటి చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. 13- రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమిటీ సమస్య: ఇది మహిళల్లో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పుల రూపంలో కనిపించే సమస్య. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల మధ్యవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మన శరీరంలోని రోగ నిరోధకశక్తి మనకే వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కనిపించే ఆటో-ఇమ్యూన్ సమస్య ఇది. దీనివల్ల కీళ్లనొప్పులు, కీళ్ల కదలికలు తగ్గడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. లక్షణాలు: బాగా అలసటగా ఉండటం కీళ్లలో విపరీతమైన నొప్పులు కీళ్ల కదలికలు మందగించడం నిత్యం జ్వరం ఉన్నట్లుగా అనిపించడం (మలేయిస్) ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతుంది కండరాల నొప్పులు ఎదుర్కొనేది ఎలా: మన రోగనిరోధకశక్తి మనకే వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య కావడంతో దీనికి పూర్తిగా చికిత్సగాని, నిర్దిష్టమైన మందులుగాని అంతగా అందుబాటులో లేవు. అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రం కాకుండా చూసేందుకు, కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గించే మందులు, కీళ్లలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి చేసే చికిత్స ఉద్దేశం పరిస్థితిని అదుపు చేస్తూ, అది మరింత దిగజారకుండా చూడటమే. ఇందులో భాగంగా రక్తపరీక్షలు, ఇతరత్రా ప్రాథమిక పరీక్షలు కొన్ని క్రమం తప్పకుండా చేయించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా మందులనూ, మోతాదులనూ ఎప్పటికప్పుడు మార్చాల్సి రావచ్చు. 14- డిప్రెషన్ మానసిక వ్యాకులత ఏమిటీ సమస్య: డిప్రెషన్ (వ్యాకులత) అన్నది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే మానసిక సమస్య. నిజానికి ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి బయటకు తెలిసేలాంటి లక్షణాలతో (క్లినికల్ లక్షణాలతో) డిప్రెషన్ కనిపిస్తుంది. ప్రతి నలుగురు మహిళల్లోనూ ఒకరు జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు డిప్రెషన్కు లోనవుతుంటారు. లక్షణాలు: మానసికంగా కుంగిపోయినట్లుగా ఉండటం ఎప్పుడూ విచారంగా కనిపించడం జీవితంపై ఆసక్తి కోల్పోయినట్లుగా ఉంటూ, ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరిక తగ్గడం అస్థిమితంగా మారడం త్వరగా కోపం తెచ్చుకోవడం చాలాసేపు అదేపనిగా ఏడ్వటం ఎప్పుడూ అపరాధ భావనతో ఉండటం నిరాశాపూరితంగా ఆలోచించడం ఆకలి తగ్గడం, ఫలితంగా బరువు తగ్గడం అతిగా నిద్రపోవడం లేదా నిద్రలేమితో బాధపడటం నిద్రపట్టినా వేకువనే మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టకపోవడం ఆత్మహత్య దిశగా ఆలోచనలు రావడం దేనిపైనా దృష్టి నిలపలేకపోవడం, దృష్టికేంద్రీకరణ శక్తి తగ్గడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం ఎప్పుడూ తలనొప్పి, జీర్ణసమస్యలు, దీర్ఘకాలికంగా ఒంటినొప్పుల వంటి భౌతిక సమస్యలు ఉండటం. ఎదుర్కొనేది ఎలా: జీవితాన్ని ప్రయత్నపూర్వకంగా రసభరితంగానూ, ఆనందదాయకంగానూ మలచుకోవడం ద్వారా మనంతట మనమే ఈ సమస్యనుంచి బయటపడవచ్చు. దీనికి కావాల్సిందల్లా కొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంపొందించుకోవడమే. విచారం నుంచి బయట పడటానికి ఎవరికి వారుగా చేసుకోదగ్గ పనులు... ప్రతిరోజూ బిజీగా గడపడానికి వీలుగా ఏదో వ్యాపకాన్ని ఎంచుకుని దానిలో ఆసక్తికరంగా నిమగ్నం కావడం. ఏదైనా సాధించడానికి అనుగుణంగా మంచి లక్ష్యాన్ని ఎంచుకోవడం. దానికోసం కృషి చేయడం. ఇందులో భాగంగా మొదట చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని తేలిగ్గా అధిగమిస్తూ పోతూ క్రమంగా పెద్ద లక్ష్యాలను ఛేదించుకుంటూ పోవడం. నిత్యం వ్యాయామంతో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. అవి మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు. ఇక చికిత్సలో భాగంగా డాక్టర్ చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.