-
సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం
ఒంగోలు టౌన్: జిల్లాలో రెండు విడతలుగా 22 రోజులపాటు జరిగిన జన్మభూమి - మాఊరు సభల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు సూక్ష్మ ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1030 పంచాయతీలు, 225 మునిసిపల్ వార్డుల్లో 1255 గ్రామసభలు నిర్వహించామన్నారు. మొత్తం 2 లక్షల 80 వేల అర్జీలు వచ్చాయన్నారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి లక్షా 2 వేల 38 అర్జీలు, పింఛన్లకు సంబంధించి 55,703 అర్జీలు, పౌరసరఫరాల శాఖకు 42,650 అర్జీలు, హౌసింగ్ 38,469 అర్జీలు, ఉపాధి హామీ పథకానికి 11,754 అర్జీలు, మునిసిపాలిటీలకు 5 వేల అర్జీలు వచ్చాయన్నారు. ఈ అర్జీల్లో వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ పరంగా ఎన్ని ఉన్నాయో గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో వారి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాకుండా కొత్త వనరులు సమీకరించే దానిపై కూడా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అర్జీదారులందరి నుంచి ఆధార్ నంబర్ తీసుకోవడంతోపాటు వారి సెల్ఫోన్ నంబర్లు కూడా సేకరించినట్లు తెలిపారు. అర్జీల పురోగతిపై సంబంధిత సెల్ఫోన్కు ఎస్ఎంఎస్లు పంపించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి వివరాలు ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్లో బోగస్ను నియంత్రించేందుకు వీలు కలుగుతుందన్నారు. జన్మభూమి గ్రామసభల్లో 2 లక్షల 56 వేల మందికి 41.75 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పథకం కింద పంపిణీ చేసినట్లు వివరించారు. లక్షా 16 వేల 817 మందికి వృద్ధాప్య పింఛన్లు, 83 వేల 25 మందికి వితంతు పింఛన్లు, 6,107 మందికి చేనేత పింఛన్లు, 18,101 మందికి అభయహస్తం పింఛన్లు, 31,673 మందికి వికలాంగ పింఛన్లు అందించినట్లు వివరించారు. 79 వేలు తొలగింపు.. 27 వేలు పునరుద్ధరణ: పింఛన్లకు సంబంధించి జిల్లాలో 79 వేల మంది పేర్లను తొలగించామని కలెక్టర్ వెల్లడించారు. ఆ తరువాత వాటిని విచారించి 27 వేల పింఛన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. మిగిలిన పింఛన్లు విచారణలో ఉన్నట్లు తెలిపారు. పింఛన్లకు అర్హులైనప్పటికీ జాబితాలో లేనివారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి అందించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి కమిటీ వాటిని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి పంపిస్తోందన్నారు. వాటన్నింటినీ విచారించిన తరువాత అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని విజయకుమార్ వివరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వచ్చాయని, వాటిలో ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చినవి అధికంగా ఉన్నట్లు చెప్పారు. ఆధార్ అనుసంధానంలో ముందంజ: ఆధార్ అనుసంధానం విషయంలో జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉందని కలెక్టర్ వెల్లడించారు. రేషన్కార్డులు, స్కాలర్షిప్లు, విద్యార్థుల నమోదుకు సంబంధించి మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానంలో గతంలో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 82.15 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా చేరిందన్నారు. పట్టాదారు పాస్పుస్తకాలకు సంబంధించిన 1బీ ఖాతాలను క్రాస్ చెక్ చేయకపోవడంవల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. చీరాల మండలంలో 80 శాతం టాలీ కాని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొత్తగా వివరాలు తీసుకుంటూ పాత వాటిని పరిశీలిస్తూ అప్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పెండింగ్లో ఉంటే ఇరువర్గాల వారిని పిలిచి చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నట్లు చెప్పారు. ప్లేట్లెట్ మిషన్ను అడుగుతూనే ఉన్నాం: ఒంగోలు రిమ్స్లో ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు విషయమై ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నామని కలెక్టర్ తెలిపారు. రిమ్స్ డెరైక్టర్కు చెప్పి మరోమారు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించానన్నారు. తాను కూడా ఈ విషయాన్ని స్వయంగా సంబంధిత మేనేజింగ్ డెరైక్టర్తో మాట్లాడినట్లు చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దృష్టికి కూడా ప్లేట్లెట్ మిషన్ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. జెడ్పీ చైర్మన్కు సంబంధించి అఫీషియల్ ఆర్డర్ చూస్తే చెబుతాను: జిల్లా పరిషత్ చైర్మన్కు సంబంధించి తాజాగా వచ్చిన అఫీషియల్ ఆర్డర్ చూస్తే దాని గురించి చెబుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈదర హరిబాబు తిరిగి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన పైవిధంగా స్పందించారు. కోర్టు ఏ డెరైక్షన్ ఇస్తే దానిని అమలు చేయాల్సి ఉందన్నారు. ఈదర హరిబాబు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న విషయం తనకు తెలియదన్నారు. విలేకరుల సమావేశంలో సీపీవో పీబీకే మూర్తి, పశుసంవర్ధకశాఖ జేడీ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. -
అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి గ్రీన్సిగ్నల్
ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ఎట్టకేలకు అనుమతి లభించింది. మొత్తం 543 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అంగీకరించారు. జిల్లాకు 601 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను ప్రభుత్వం ఆగస్టులో మంజూరు చేసింది. సెప్టెంబర్ మొదటి వారంలో పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 601 పోస్టులకు 543 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 58 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. మొదట ఒక జాబితాను అధికారులు ఆమోదించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యులు, ఇతర సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. దీంతో మొదటి ఎంపికను నిలిపివేసి మళ్లీ అర్హులైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. అన్ని మండలాల నుంచి దరఖాస్తులను ఒంగోలు తెప్పించి మెరిట్ జాబితా తయారు చేసి రోస్టర్ ప్రకారం ఎంపిక చేశారు. మొత్తం 601 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల్లో 543 భర్తీ చేశారు. 58 ఖాళీగా మిగిలిపోయాయి. సెకండరీ గ్రేడ్, భాషా పండితుల పోస్టుల్లో నియమితులయ్యే ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.5 వేలు చొప్పున, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమితులయ్యే వారికి నెలకు రూ.7 వేల చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. వీరు పోస్టుల్లో చేరిన తేదీ నుంచి మూడు నెలల పాటు కొనసాగుతారు. నియామకాలు ఇలా.. జిల్లాలో పుల్లలచెరువు మండలంలో అత్యధికంగా 45 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఎంపిక చేశారు. దొనకొండ మండలంలో 39 మంది, సీఎస్ పురం మండలంలో 36, పామూరు మండలంలో 34, యర్రగొండపాలెం మండలంలో 33, త్రిపురాంతకం మండలంలో 30, పెదదోర్నాల మండలంలో 29, కురిచేడు మండలంలో 28, పీసీ పల్లి మండలంలో 20, కొనకనమిట్ల మండలంలో 17, కనిగిరి, మార్కాపురం, పెదారవీడు మండలాల్లో 12 మంది చొప్పున, హెచ్ఎం పాడు మండలంలో 11, ముండ్లమూరు, వెలిగండ్ల మండలాల్లో 10, మార్టూరు మండలం 9, తర్లుబాడు, జరుగుమల్లి, సంతమాగులూరు, బేస్తవారిపేట మండలాల్లో 8 మంది చొప్పున, చీమకుర్తి, పర్చూరు, తాళ్లూరు మండలాల్లో ఆగురుగు చొప్పున, పొదిలి మండలం ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు. కొత్తపట్నం మండలంలో అతి తక్కువగా కేవలం ఒకే ఒక అకడమిక్ ఇన్స్ట్రక్టర్ను ఎంపిక చేశారు. మిగిలిన మండలాల్లో ఒకరి నుంచి నలుగురి వరకు నియమితులయ్యారు. -
పింఛన్లపై స్పష్టత ఇవ్వండి
ఒంగోలు టౌన్ : పింఛన్ల మంజూరుకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును కోరారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి జరగనున్న జన్మభూమి-మన ఊరు, పారిశుధ్యం, పింఛన్ల పంపిణీ తదితరాలపై సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేయనున్న పింఛన్లు, డ్వాక్రా బజార్ల నిర్వహణ, డ్వామా నిబంధనల్లో స్పష్టత ఇవ్వాలన్నారు. 2 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలి : సీఎస్ అక్టోబర్ 2వ తేదీ నుంచి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. జన్మభూమి-మన ఊరు కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో పండగ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించాలన్నారు. అక్టోబర్ రెండవ తేదీ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించడానికి మండలానికి ఒక ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో పైపులైన్ల లీకేజీలు, డ్రెయిన్ల మరమ్మతులు 48 గంటల్లో పూర్తిచేసి వెబ్సైట్లో ఫొటోలు పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ యాకూబ్ నాయక్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, డీఆర్డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ పోలప్ప, జెడ్పీ సీఈఓ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల ఫిర్యాదులను ఎంపీడీఓకు తెలపాలి పింఛన్లపై ఫిర్యాదులు ఉంటే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు అప్పీలు చేసుకోవాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ సూచించారు. కొనకనమిట్ల మండలానికి చెందిన కొంతమంది తమకు పింఛన్లు రావడం లేదని సోమవారం కలెక్టర్ను ఆయన ఛాంబర్లో కలిసి ఫిర్యాదు చేశారు. అర్హులమైన తమను జాబితా నుంచి తొలగించి, అనర్హుల పేర్లను జాబితాలో చేరుస్తున్నారన్నారు. స్పందించిన కలెక్టర్ పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులను మండల స్థాయిలో ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలించి చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. -
సమాజం కోసం జీవించిన జాషువా
ఒంగోలు టౌన్ : గుర్రం జాషువా తన కోసం కాకుండా సమాజం కోసం జీవించారని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 119వ జయంతి సభను ఆదివారం స్థానిక ప్రకాశం భవనం ఆవరణలో నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజైరెప్రసంగిస్తూ జాషువా సరళమైన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేలా కవితలుగా రాశారన్నారు. తన కవిత్వం ద్వారా సామాజిక మార్పు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా అందుకున్న గొప్ప వ్యక్తి జాషువా అని కలెక్టర్ పేర్కొన్నారు. జాషువా జీవితం, ఆయన రాసిన కవితలపై అధ్యయనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జాషువా జయంతి కార్యక్రమాల ద్వారా కవితలను ప్రచారం చేసేందుకు మరింత మందికి స్ఫూర్తి ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి జీవీ శేషు మాట్లాడుతూ గుర్రం జాషువా పద్యాలు అజరామరమన్నారు. బండారు రామారావు, చీమకుర్తి నాగేశ్వరరావు వంటివారి కంఠం నుంచి జాషువా పద్యాలు రావడంతో వాటికి మరింత ఖ్యాతి వచ్చిందన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ మాట్లాడుతూ చరిత్రను గుర్రం జాషువా తిరగరాశారని కొనియాడారు. దళిత సాహిత్యానికి దిక్సూచిగా నిలిచారన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ గుర్రం జాషువా అంటరానితనాన్ని అజెండాగా చేసుకొని కవిత్వాలు రాశారన్నారు. అస్పృశ్యత వంటి చట్టాలను పటిష్టంగా అమలు చేయడమే జాషువాకు నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో అభ్యుదయ కవులు దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, కత్తి కల్యాణ్, కొలకలూరి స్వరూపరాణి, దళిత నాయకులు తాటిపర్తి వెంకటస్వామి, తేళ్ల భాస్కరరావుమాదిగ, బి.ఏసుదాసుమాదిగ, పల్నాటి శ్రీరాములు, చప్పిడి వెంగళరావు, ముప్పవరపు గోపి, సుజన్మాదిగ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు తదితరులు ప్రసంగించారుప్రకాశం అక్షర విజయం పేరుతో స్వల్ప కాలంలో లక్షలాదిమంనని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్కు జాషువా సాహితీ సాంస్కృతిక సమాఖ్య తరఫున జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. తొలుత ప్రకాశం భవనం ఆవరణలోని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీటీఏ ఆధ్వర్యంలో.. ఒంగోలు వన్టౌన్ : మహాకవి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం స్థానిక సావిత్రిబాయి పూలే భవన్లో జరిగిన సమావేశంలో బీటీఏ జిల్లా అధ్యక్షుడు బి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, మానవతావాదాన్ని తనదైన శైలిలో బహిర్గత పరిచి జాషువా చరిత్ర సృష్టించారని కొనియాడారు. జిల్లాలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ప్రగతిశీల అధ్యయనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బీటీఏ సభ్యులు తెలుగు కళామండలిగా ఏర్పడాలని నిర్ణయించారు. తెలుగు కళామండలి అడహక్ కమిటీ కన్వీనర్గా సీహెచ్ పెదబ్రహ్మయ్య, చైర్మన్గా ఎం.భాస్కరరావు, కో కన్వీనర్లుగా మాలకొండయ్య, దాసరి జనార్దనరావు, దార్ల కోటేశ్వరరావులను నియమించారు. కార్యక్రమంలో జగన్మోహన్, జాలాది మోహన్, బి.శోభన్బాబు, నారాయణ, కృష్ణమూర్తి, విజయబాబు, వీరనారాయణ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో.. ఒంగోలు : భారతీయ జనతాపార్టీ ఎస్సీ మోర్చా నగర కమిటీ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 119వ జయంతి కార్యక్రమం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కమిటీ నగర అధ్యక్షుడు ముదవర్తి బాబూరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జాషువా తన రచనలతో దళితులు, బడుగుల్లో చైతన్యం నింపారని, పట్టుదల, స్వయంకృషితో అనేక బిరుదులు సాధించారని, గబ్బిలం వంటి మహా రచనల ద్వారా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. అటువంటి మహానేత స్ఫూర్తిగా ప్రస్తుత ప్రైవేటు విద్యాలయాల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేయాలని, అందుకు అవసరమైతే ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, మువ్వల వెంకటరమణారావు, జిల్లా అధ్యక్షుడు కనమాల రాఘవులు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రాజధనవర్మ, నగర అధ్యక్షుడు ఎస్కే ఖలీఫతుల్లా, ముస్లిం మైనార్టీ జిల్లా ఇన్చార్జి వి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక ధరలకు అమ్మితే చర్యలు
కందుకూరు : విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కందుకూరు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలుశాఖల పనితీరుపై అధికారులతో ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీఏ మురళీకృష్ణని ఆదేశించారు. ఎక్కడైనా ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్కి తరలినా, అధిక ధరలకు అమ్మినా సంబంధిత వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. డివిజన్ పరిధిలో వరి తక్కువగా సాగయ్యే కారణాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ మొత్తం మీద 28 శాతం లోటు కనిపిస్తుండగా, గుడ్లూరు, వలేటివారిపాలెం మండలాల్లో అత్యధికంగా 56 శాతం లోటుందని చెప్పారు. దొనకొండ మండలంలో 10 వేల హెక్టార్లలో పంట సాగు కావల్సి ఉండగా కేవలం 5 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయన్నారు. దీంతో ఆయా మండల వ్యవసాయశాఖ అధికారులు మాట్లాడుతూ వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల పంటలు సాగు కాలేదని కలెక్టర్కి వివరించారు. నాగార్జున సాగర్ కాలువ పరిధిలో ప్రస్తుతం నీరు వదులుతున్నందున వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల వారీగా పంటల సాగు వివరాలను నెలాఖరులోపు అందించాలని ఆదేశించారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి కరువు మండలాలను ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపుతారన్నారు. కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని పశు సంవర్ధకశాఖ జాయింట్ డెరైక్టర్ రజనీకుమారిని ఆదేశించారు. సూక్ష్మసేద్యం పథకం కింద సెప్టెంబర్ నెలాఖరు నాటికి 868 హెక్టార్లు లక్ష్యం కాగా, 1530 హెక్టార్లలో లబ్ధిదారులను గుర్తించినట్లు ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్రావు వివరించారు. వచ్చే నెలాఖరుకు మొత్తం 2150 హెక్టార్ల లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. మత్య్సశాఖ అధికారులపై ఆగ్రహం: మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు జులై ఒకటో తేదీ నాటికి లెసైన్స్లు పునరుద్ధరించాల్సి ఉండగా, నేటికీ రెన్యువల్ చేయకపోవడంపై కలెక్టర్ ఆశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోకుండా ఏదైనా ఉపద్రవం వచ్చినా, సమస్య వచ్చినా వారిని ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. మత్య్సకారులందరికీ అవగాహన కల్పించి వెంటనే లెసైన్స్లు పునరుద్ధరించాలని ఆదేశించారు. తీరప్రాంతాల్లో మత్య్సకారులు చేపలు ఎండబెట్టుకునేందుకు డ్రైయింగ్ ప్లాట్ఫాంలు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో... పొదిలి మండలం ఉప్పలపాడు, శింగరాయకొండ, చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో శిశుమరణాలు అధికంగా నమోదు కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణులను, శిశువులను జాగ్రత్తగా గుర్తించి పేర్లు నమోదు చేయాలని, వారికి ఎప్పటికప్పుడు మందులు, వ్యాక్సిన్లు అందజేసి మాతృ, శిశుమరణాలను అరికట్టాలని ఆదేశించారు. ప్రతి బిడ్డని గుర్తించి వ్యాక్సిన్లు వేయాలని వలస వెళ్లిన కుటుంబాల వారు ఆయా ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీపీవో పీబీకే మూర్తి, ఎల్డీఎం నరశింగరావు, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకులు జెన్నమ్మ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement