breaking news
Govind Pansare murder case
-
ప్రమాదకర ధోరణి కొనసాగుతోంది
ముంబై: దేశంలో ఉదారవాదులు, విమర్శకులను అందరినీ హతమార్చడం అనే ప్రమాదకరమైన ధోరణి కొనసాగుతోందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యల వల్ల దేశం అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలవుతోందని వెల్లడించింది. హేతువాదులు గోవింద్ పన్సారే, దబోల్కర్ల హత్యల విచారణల్ని కోర్టు పర్యవేక్షించాలని దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, జస్టిస్ భారతి దంగ్రేల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ‘దేశంలో ఉదారవాద విలువలకు, అభిప్రాయాలకు ఎలాంటి విలువ లేకుండా పోయింది. ప్రజలు తమ ఉదారవాద సిద్ధాంతాల ఆధారంగా దాడులకు గురవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కేవలం వీరే కాకుండా ఉదారవాదాన్ని నమ్మే వ్యక్తులు, సంస్థలను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని హైకోర్టు పేర్కొంది. పన్సారే, దబోల్కర్ల హత్యల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో పాటు మహారాష్ట్ర సీఐడీలు గురువారం చార్జిషీట్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా బలమైన సాక్ష్యాధారాలను సేకరించడంలో సీబీఐతో పాటు రాష్ట్ర సీఐడీ కూడా విఫలమయ్యాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
'బెదిరింపులకు భయపడను'
న్యూఢిల్లీ: బెదిరింపులకు భయపడనని ప్రముఖ మరాఠి జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లె స్పష్టం చేశారు. సామాజిక ఉద్యమకారుడు, సీపీఐ నేత గోవింద్ పన్సారే హత్య కేసులో నిందితుడు సమీర్ గైక్వాడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వచ్చిన వార్తలపై ఆయన ఈవిధంగా స్పందించారు. చాలా కాలంగా తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. తనకు రక్షణ కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా వద్దన్నానని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవింద్ పన్సారే హత్యకు గురైయ్యారు. ఈ కేసులో సనాతన సంస్థ సభ్యుడు సమీర్ గైక్వాడ్ ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. గైక్వాడ్ తర్వాతి టార్గెట్ నిఖిల్ వాగ్లె అని పోలీసులు కనుగొన్నారు. పన్సారేను హత్య చేసిన తర్వాత వాగ్లెను అంతం చేయాలని ప్లాన్ వేశాడని, అతడి ఫోన్ సంభాషణల ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు.