breaking news
government issued cards
-
మున్సి‘పాలకులు’ వచ్చేశారు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు కమిషనర్లను, ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో నస్పూర్, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మేజర్ గ్రామ పంచాయితీలను మార్చి నెలాఖరులో మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిన వెంటనే మున్సిపాలిటీలుగా మారుతాయని ప్రకటించింది. బుధవారంతో గ్రామాల్లో సర్పంచ్ల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేకాధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేశారు. కొత్త వాటితో కలుపుకుని ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 12కు పెరగనుంది. ప్రస్తుతం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, కాగజ్నగర్, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలుగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లను, ప్రత్యేకాధికారులను సైతం ఎంపిక చేసి, హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. తహసీల్దార్లకే కమిషనర్ బాధ్యతలు ఉమ్మడి ఆదిలాబాద్లో కొత్తగా ఏర్పాటైన ఐదు మున్సిపాలిటీలకు కమిషనర్లుగా ఆయా మండలాల తహసీల్దార్లనే ఎంపిక చేశారు. వీరంతా ఆగస్టు 2వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. నస్పూర్కు ఇన్చార్జిగా ఉన్న మంచిర్యాల తహసీల్దార్ కుమారస్వామికి కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇక నుంచి రెండు మండలాలకు తహసీల్దార్గా, నస్పూర్ మున్సిపల్ కమిషనర్గా వ్యవహరించాల్సి ఉంటుంది. చెన్నూర్ మున్సిపాలిటీ కమిషనర్గా ఆ మండల తహసీల్దార్ శ్రీనివాస్ వ్యవహరిస్తారు. లక్సెట్టిపేట తహసీల్దార్ రాజేశ్వర్ కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీకి కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. క్యాతనపల్లి మున్సిపాలిటీకి మందమర్రి తహసీల్దార్ ఇంతియాజ్ అహ్మద్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్కు ఆ మండల తహసీల్దార్ ఆరె నరేందర్ కమిషనర్లుగా వ్యవహరించనున్నారు. స్పెషలాఫీసర్లుగా జిల్లా స్థాయి అధికారులు మున్సిపాలిటీల ప్రత్యేకాధికారులుగా ఆర్డీవో స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. నస్పూర్కు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్యామలాదేవి, చెన్నూర్కు జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, క్యాతనపల్లికి మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, లక్సెట్టిపేట మున్సిపల్ ప్రత్యేకాధికారిగా జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్యకు బాధ్యతలు అప్పగించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ స్పెషలాఫీసర్గా ఆర్డీవో ప్రసూనాంబ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మున్సిపాలిటీలకు చైర్పర్సన్ ఉండనందున అభివృద్ధి పనులకు సంబంధించిన అన్ని నిర్ణయాలు వీరే తీసుకుంటారు. నేటితో సర్పంచుల పాలనకు వీడ్కోలు గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఆగస్టు ఒకటితో ముగుస్తోంది. ఈ మేరకు అన్ని గ్రామాల్లో వీడ్కోలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామ సర్పంచులకే ప్రత్యేక అధికారాలు ఇచ్చి కొనసాగించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆగస్టు 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి గ్రామ పంచాయతీలు వెళ్లనున్నాయి. ప్రభుత్వం సాధారణ ఎన్నికలను గడువు కన్నా ముందే ఈ సంవత్సరం డిసెంబర్లో నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ఆరు నెలల వరకు తప్పనిసరి కానుంది. ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని 1508 గ్రామ పంచాయతీలకు గాను పదవీకాలం మిగిలి ఉన్న ఐదు జీపీలను మినహాయించి 1503 మంది స్పెషలాఫీసర్లను నియమించారు. వీరు కూడా 2వ తేదీ నుంచి పాలన పగ్గాలు చేపట్టనున్నారు. కొత్త మున్సిపాలిటీలకు పాలకులు వీరే! మున్సిపాలిటీ కమిషనర్ ప్రత్యేకాధికారి నస్పూరు కుమారస్వామి శ్యామలాదేవి చెన్నూరు శ్రీనివాస్ సంజీవరెడ్డి క్యాతనపల్లి ఇంతియాజ్ అహ్మద్, శ్రీనివాస్ లక్సెట్టిపేట రాజేశ్వర్ వీరయ్య ఖానాపూర్ నరేందర్ ప్రసూనాంబ -
గొత్తికోయల గూడు కూల్చుతున్నారు..
నిరాశ్రయులను చేస్తున్న అటవీశాఖ అధికారులు ఏటూరునాగారం: పొట్ట చేతపట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయల బతుకులు దుర్బరంగా మారుతున్నాయి. అటవీ శాఖ అధికారుల వేధింపులతో వారి జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వరంగల్ జిల్లాలోని తాడ్వాయి, మంగపేట మండలాల్లో మంగళ, బుధవారాల్లో గొత్తికోయలు వేసుకున్న గుడిసెలను అధికారులు ధ్వంసం చేశారు. అడ్డువచ్చి న వారిని విచక్షణరహితంగా కొట్టారు. వారి సామగ్రిని విసిరేశారు. తాడ్వాయి మండలం లింగాల పంచాయతీ పరిధిలోని మొం డ్యాలతోగు వద్ద సుమారు 30 మంది గొత్తికోయ కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నా యి. మంగళవారం అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు డోజర్తో వారు వేసుకున్న గుడిసెలను కూలి వేశారు. సామగ్రిని చిందరవందర చేశారు. సెల్ఫోన్లో ప్రజాసంఘాలు, తదితరులకు సమాచారం ఇస్తున్నాడని మామిడి కోసయ్య అనే గొత్తికోయపై దాడిచేసి కొట్టారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ(కేశవపురం)లో 20 గొత్తికోయ కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాయి. బుధవారం అటవీశాఖ అధికారులు దాడి చేసి వారి నివాసాలను ధ్వంసం చేశారు. ఆహార సామగ్రిని పారబోశారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చింతలపాడు, మామిడిగూడెం, గంటల కుంట, గుర్రాలబావి, ఐలాపురం కొత్తూరు, దొడ్ల కొత్తూరు, మం గపేట మండలంలోని రేగులగూడెం, కేశవపురం, తాడ్వాయి మండలం లవ్వాల, కొండపర్తి, చింతలమోరి గ్రామాల్లో.. అటవీ ప్రాం తాల్లో సుమారు 3,500 మంది గొత్తికోయలు పదేళ్లు వలస వచ్చారు. ఆయా ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న గొత్తికోయలు అటవీలో దొరికే తునికిపళ్లు, విప్పపూవ్వు, చీపురు పుల్లలు, తమకు తెలిసిన వ్యవసాయంతో కాలం గడుపుతున్నారు. అయితే, అడవిలో చెట్లను నరికివేస్తున్నారని అటవీశాఖ అధికారులు గొత్తికోయలపై దాడులు చేస్తున్నారు. తమకు పట్టాలు ఇవ్వాలని ఐటీడీఏకు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ కార్డులు జారీ చేసినా ... ఆయా మండలాల్లో నివాసం ఉంటున్న గొత్తికోయలకు ప్రభుత్వం ఓటర్, ఆధార్, రేషన్కార్డులు జారీ చేసింది. అడవిలో జీవించేహక్కు ఉన్న తమకు ప్రభుత్వం కార్డులను జారీ చేసిన విషయాన్ని అట వీ అధికారులు గుర్తించడంలేదని గూడేల పెద్దలు నాగరాజు, జోగయ్య, కోసయ్య అంటున్నారు.