breaking news
gomti river front
-
వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!
వాటర్ ఉమన్ నదుల గొప్పతనం గురించి చెప్పమంటే మాటల్లో ఎన్ని అయినా చెబుతాం. అలాంటి పుణ్య నదులు నిర్లక్ష్యం బారిన పడి జీవం కోల్పోయే పరిస్థితిలో ఉంటే మాత్రం పట్టించుకోము. ఈ ధోరణికి భిన్నమైన మహిళ శిర్ప పథక్. ఉత్తర్ప్రదేశ్కు చెందిన శిర్పకు నదులు అంటే ఇష్టం. వాటికి సంబంధించిన పురాణ కథలు అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న పుణ్యనది గోమతి సంరక్షణ కోసం వెయ్యిన్కొక్క కిలోమీటర్ల పాదయాత్ర చేసింది... సన్నని ప్రవాహమై బయలుదేరే గోమతి ప్రయాణంలో బలపడుతుంది. ‘ప్రయాణం గొప్పతనం బలం’ అని ఆ నది మౌనంగానే చెబుతుంది. అందుకేనేమో ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదానికి బలం ఇవ్వడానికి పాదయాత్ర చేసింది శిర్ప పథక్. పారిశ్రామిక వ్యర్థాలు, నివాసాలలో నుంచి వచ్చే మురుగు నీరు... మొదలైన వాటి వల్ల గోమతి అనేక ప్రాంతాలలో కలుషితం అవుతుంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం జరగడం లేదు. ‘గంగానదితో పోల్చితే గోమతి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది’ అని నివేదికలు తెలియజేస్తున్నాయి. ‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన నదిని మనమే రక్షించుకుందాం’ అంటుంది శిర్ప. పంచతత్వ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన శిర్ప పథక్ ‘వాటర్ ఉమన్’గా పేరు తెచ్చుకుంది. ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదంతో పదిహేను జిల్లాలలో ఊళ్లు, పల్లెలు, పట్టణాల గుండా సాగిన పాదయాత్రలో ఆ పుణ్యనది ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసింది. ‘పరిస్థితి ఇది. మనం చేయాల్సింది ఇది’ అంటూ స్పష్టంగా చెప్పింది. ప్రతిరోజు 30 నుంచి 35 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసింది. ‘నది ఒడ్డున మొక్కలు నాటుదాం’ అని ప్రజలతో ప్రమాణం చేయించింది. శిర్ప వెంట ప్రజలు వచ్చేవాళ్లు. పర్యావరణ సంబంధిత విషయాలను చర్చిస్తూ ఆమె పాదయాత్ర ముందుకు సాగేది. ‘ఆక్రమణలను అడ్డుకుందాం. పుణ్యనదిని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, అధికారులతో మాట్లాడేది. ఈ పాదయాత్రలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేసుకున్నారు. ‘నా పాదయాత్రలో భాగంగా నది చుట్టు పక్కల ప్రాంతాలలో నివసించే ఎంతోమందితో మాట్లాడాను. నది పరిస్థితి తెలిసినప్పటికీ ఏంచేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేశాను’ అంటుంది శిర్ప. శిర్ప విషయానికి వస్తే... నదుల సంరక్షణ గురించి పల్లెలు, పట్టణాల గుండా యాత్ర చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో నర్మద నది సంరక్షణ కోసం 3600 కిలోమీటర్ల యాత్ర చేసింది. ‘నదులకు ఏమైతే మనకేమిటి? మనం హాయిగానే ఉన్నాం కదా అనే భావన నుంచి బయటికి రావాలి. నదుల మనుగడలోనే మనుషుల మనుగడ ఉంది. ప్రకృతి వనరులే మన శక్తులు. నదులకు ముప్పు వాటిల్లితే మన కుటుంబ పెద్దలకు ముప్పు వాటిల్లినట్లుగా భావించి తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి. మనిషికి రక్తం ఎంత అవసరమో నది ఆరోగ్యానికి కలుషితం కాని నీరు అంతే అవసరం’ అంటోంది శిర్ప. ఉత్తర్ప్రదేశ్లోని బుదౌన్ జిల్లాకు చెందిన శిర్ప ఉన్నత చదువులు చదివింది. ‘ఏదో ఒక ఉద్యోగం చేయడం కంటే నదుల పరిరక్షణకు నా వంతుగా ఏదైనా చేస్తాను’ అంటూ ప్రయాణం మొదలు పెట్టింది. ఆ ప్రయాణం వృథా పోలేదని ఎన్నో ఊళ్లలో వచ్చిన మార్పు తెలియజేస్తుంది. నదిలో నీళ్లు మాత్రమే కాదు ఆ నది కార్చే కన్నీళ్లు కూడా ఉంటాయి. నీళ్లు అందరికీ కనిపిస్తాయి. కన్నీళ్లు కొందరికి మాత్రమే కనిపిస్తాయి. ఆ కొందరు అందరిలో అవగాహన రావడం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి ఒక వ్యక్తి... వాటర్ ఉమన్ శిర్ప పథక్. ‘నా వల్ల ఏమవుతుంది అనే మాట బలహీనమైది. నా వల్ల కూడా అవుతుంది అనేది బలమైనది. బలమైన మాటే మన బాట అయినప్పుడు మార్పు సులభం అవుతుంది’ అంటుంది శిర్ప పథక్. (చదవండి: చిద్విలాస చిత్రగణితం! మ్యాథ్స్తో ఆర్ట్ను మిళితం చేసే సరికొత్త ఆర్ట్!) -
సైకిల్ తొక్కి క్రికెట్ ఆడిన మాజీ సీఎం
లక్నో : సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రత్యేక బంగ్లా ఖాళీ చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం సామాన్య ప్రజలతో సరదాగా గడిపారు. ఈ రోజు ఉదయం గోమతి నది తీరంలోని వాకర్స్తో కలసి సైకిల్ తొక్కారు. అలాగే వారితో పాటు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత అక్కడి యువతతో కలసి క్రికెట్ ఆడారు. అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పుడు గోమతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అఖిలేశ్తో అక్కడివారు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. సమాజ్వాదీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మరొకటైన జ్ఞానేశ్వర్ మిశ్రా పార్క్ను శనివారం సందర్శించిన అఖిలేశ్ ప్రభుత్వ సౌకర్యాలు శాశ్వతం కాదన్నారు. సుప్రీం కోర్టుపై గౌరవంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసినట్టు తెలిపారు. -
అఖిలేశ్ ప్రాజెక్టుపై సీఎం యోగి టఫ్ రివ్యూ
లక్నో: అభివృద్ధి చేయడంతోపాటు రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడమే తన లక్ష్యం అని ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. గత 150గంటల్లోనే 50 నిర్ణయాలు అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న ఆయన తాజాగా అవినీతిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తొలి కొరడా దెబ్బను మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ పెట్ ప్రాజెక్టు అయిన గోమతి రివర్ ఫ్రంట్పై ప్రయోగించారు. అనూహ్యంగా ఆ ప్రాజెక్టు అనుమతులు, నిర్వహణా బాధ్యతలు చూస్తున్న అధికారులతో సమావేశం అయ్యారు. ఈ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట అక్కడ నిర్మించిన ల్యాండ్ స్కేప్లు, సైక్లింగ్ ట్రాక్లు, ఇతర డిజైన్లు ఏవీ కూడా ఆదిత్యనాథ్ను పెద్దగా ఆకర్షించలేదు. పైగా ఆ ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు అక్కడ పూర్తయిన పనులకు పొంతన లేకుండా పోయింది. దీంతో ప్రత్యేక సమావేశం అయిన ఆదిత్యానాథ్ అవినీతిని తాను ఏ మాత్రం సహించబోనని హెచ్చరించారు. రెండేళ్లుగా నిర్మిస్తున్న ఈప్రాజెక్టుకు మొత్తం రూ.1500కోట్లు కేటాయించగా అందులో రూ.1427 కోట్లను ఇప్పటికే ఖర్చు చేశారు. అయితే, పనులు మాత్రం కేవలం 60శాతం మాత్రమే పూర్తయ్యాయి. పనుల నాణ్యతతోపాటు, వ్యయంలో కూడా తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన ఆదిత్యానాథ్ ప్రాజెక్టు వివరాలు మొత్తం అడిగారు. డబ్బును ఎలా ఖర్చు చేశారనే విషయాలు తనకు తెలియజేయాలని ఆదేశించారు. తన పరిపాలనలో 18గంటలపాటు అధికారులు ఎప్పుడంటే అప్పుడు పనిచేయాల్సిందేనని ఆదేశించిన యోగి ఆ విధంగానే ముందుకు వెళుతున్నారు. గోమతి ప్రాజెక్టును నమామి గంగే ప్రాజెక్టుకు అనుసంధానించి గంగా శుద్ధి కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.