breaking news
Global Burden of Disease Study
-
Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
న్యూఢిల్లీ: మానవాళికి శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్(జీబీడీ)–2021 అధ్యయనం వివరాలను లాన్సెట్ జర్నల్లో ప్రచురించారు. ‘‘మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా సగటు జీవితకాలం ఐదేళ్ల దాకా పెరుగుతుంది. కానీ అదే సమయంలో వ్యాధుల ముప్పు కూడా బాగా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటివి ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్థూలకాయం, అధిక రక్తపోటు వంటివి బాగా వేధిస్తాయి’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ ముప్పును వీలైనంతగా తగ్గించుకోవచ్చని అధ్యయనం సూచించింది. అధ్యయనం ఇంకా ఏం తేలి్చందంటే... → సగటు జీవితకాలం పురుషుల్లో ఐదేళ్లు, మహిళల్లో నాలుగేళ్లు పెరుగుతుంది. స్త్రీలలో 71.1 నుంచి 76 ఏళ్లకు, పురుషుల్లో 76.2 నుంచి 80.5 ఏళ్లకు పెరుగుతుంది. → పూర్తి ఆరోగ్యవంతమైన జీవితకాలం ప్రపంచవ్యాప్తంగా సగటున 2.6 ఏళ్లు పెరుగుతుంది. ఇది 2022లో 64.8 ఏళ్లుండగా 2050 నాటికి 67.4 ఏళ్లకు చేరుతుంది. → భారత్లో 2050 నాటికి పురుషుల సగటు జీవిత కాలం 75 ఏళ్లకు కాస్త పైకి, మహిళల్లో 80 ఏళ్లకు చేరుకుంటుంది. → మన భారతదేశంలో ఆరోగ్యవంతమైన జీవితకాలం స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగానే ఉంటుంది. 2050 నాటికి 65 ఏళ్లు దాటేదాకా ఆరోగ్యంగా జీవిస్తారు. → జీబీడీ–2021 అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 11,000 సంస్థల సహకారం తీసుకున్నారు. 204 దేశాల నుంచి 371 రకాల వ్యాధులకు సంబంధించిన అంచనాలు, 88 రిస్క్ ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై జనంలో అవాగాహన పెరుగుతుండడం సగటు జీవితకాలం పెరుగుదలకు దోహదపడుతోంది. → జీవితకాలం పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాల మధ్య అసమానతలు చాలావరకు తగ్గుతున్నట్లు గుర్తించామని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్ ముర్రే చెప్పారు. → సగటు జీవనకాలం ప్రస్తుతం తక్కువగా ఉన్న దేశాల్లో 2050 నాటికి బాగా పెరగనుందన్నారు. హృద్రోగాలు, కరోనాతో పాటు తీవ్రమైన అంటు రోగాలతో పాటు పౌష్టికాహార లోపం తదితరాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుండటమే అందుకు కారణమని ముర్రే చెప్పారు. → భావి తరాలు స్థూలకాలం, అధిక రక్తపోటుతో బాగా బాధపడే ఆస్కారముందని అభిప్రాయపడ్డారు. -
ఈ ప్రపంచం రోగగ్రస్తం!
95 శాతం మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య * మూడో వంతు మందికి ఐదు కంటే ఎక్కువ వ్యాధులు * అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి వాషింగ్టన్: ప్రపంచ జనాభాలో ఏకంగా 95 శాతం మంది ప్రజలు రోగగ్రస్తులే! దాదాపు మూడొంతుల మందికి ఐదు కన్నా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరోగ్యవంతులు ఉన్నారు.1990-2013 సంవత్సరాల మధ్య కాలంలో ఆరోగ్య పరిస్థితులపై ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ(జీబీడీ)’ పేరుతో జరిగిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ఫలితాలు తాజాగా అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. 188 దేశాల నుంచి 35,620 వనరుల నుంచి సమాచారం సేకరించి పరిశోధించారు. సర్వేలోని ముఖ్యాంశాలు... ⇒ 2013 నాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మందిలో ఒకరు (4.3 శాతం) మాత్రమే ఉన్నారు. ⇒ ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది (230 కోట్లు) ఐదు కన్నా ఎక్కువ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. పది ఆరోగ్య సమస్యలు ఉన్నవారి సంఖ్య 1990-2013 మధ్యలో ఏకంగా 52 శాతం పెరిగింది. ⇒ 1990, 2013లో నడుం నొప్పి, కుంగుబాటు, రక్తహీనత, మెడ నొప్పి, వయసు సంబంధ వినికిడిలోపం వంటి సమస్యలే ఆరోగ్య నష్టాలకు అత్యధికంగా కారణమయ్యాయి. ⇒ 2013లో ప్రపంచ ఆరోగ్య నష్టాలకు ముఖ్యంగా నడుంనొప్పి, కీళ్లనొప్పి, కుంగుబాటు, ఆందోళన, డ్రగ్స్, ఆల్కహాల్ సంబంధిత అనారోగ్యాలే అధికంగా కారణమయ్యాయి. ⇒ ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యల వల్ల ప్రజలు తమ జీవితాల్లో నష్టపోయిన ఆరోగ్యకర సంవత్సరాలు 1990లో 21 శాతం కాగా, అది 2013 నాటికి 31 శాతానికి పెరిగింది. ⇒ 1990తో పోల్చితే 2013 నాటికి మరణాల రేటు కంటే అంగ వైకల్య రేటు చాలా నెమ్మదిగా తగ్గుతోంది.