breaking news
Generic version
-
మైలాన్ రెమ్డెసివిర్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్ ఔషధాన్ని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం మైలాన్ భారత్లో అందుబాటులోకి తెచ్చింది. డెస్రెమ్ పేరుతో కంపెనీ ఈ జనరిక్ వర్షన్ను రూపొందించింది. 100 ఎంజీ వయల్ను రూ.4,800లకు విక్రయించనున్నట్టు మైలాన్ ఇప్పటికే ప్రకటించింది. పిల్లలు, పెద్దల్లో కోవిడ్ అనుమానిత, నిర్ధారిత కేసులు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్సలో భాగంగా పరిశోధనాత్మక యాంటీ వైరల్ డ్రగ్గా రెమ్డెసివిర్ను ఉపయోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. తొలి బ్యాచ్ వయల్స్ను ఇప్పటికే మార్కెట్లోకి ప్రవేశపెట్టామని.. ఈ ఔషధానికి డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరాను పెంచుతామని కంపెనీ ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్స్ ప్రెసిడెంట్ రాకేశ్ బమ్జాయ్ వెల్లడించారు. ఔషధం సరఫరా వివరాల కోసం హెల్ప్లైన్ నంబరును సైతం కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరులోని ఇంజెక్టేబుల్ ఫెసిలిటీలో డెస్రెమ్ను మైలాన్ తయారు చేస్తోంది. ఈ ఔషధాన్ని ఇతర దేశాలకూ ఎగుమతి చేయనున్నట్టు సంస్థ తెలిపింది. రెమ్డెసివిర్ తయారీ, పంపిణీకై ఈ ఏడాది మే నెలలో యూఎస్కు చెందిన గిలియడ్ సైన్సెస్తో నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో మైలాన్ కూడా ఉంది. హెటిరో, సిప్లా ఇప్పటికే రెమ్డెసివిర్ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చాయి. -
నాట్కో, హెటిరోల నుంచి దేశీయ మార్కెట్లోకి హెపటైటిస్-సి జెనరిక్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెపటైటిస్-సి వ్యాధి చికిత్సకు వినియోగించే సొవాల్డి జెనరిక్ వెర్షను దేశీయ మార్కెట్లో విక్రయించడానికి నాట్కో ఫార్మా, హెటిరో ల్యాబ్స్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీజీసీ) అనుమతి మంజూరు చేసింది. అమెరికాకు చెందిన గిలీడ్ సెన్సైస్ హెపటైటిస్ -సి చికిత్సకు వినియోగించే ట్యాబ్లెట్లను సొవాల్డి బ్రాండ్ నేమ్తో విక్రయిస్తోంది. ఇప్పుడు వీటి జెనరిక్ వెర్షన్ను నాట్కో ‘సోఫాస్బువిర్’ పేరుతో త్వరలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. 28 ట్యాబ్లెట్ల ధరను రూ. 19,900గా కంపెనీ నిర్ణయించింది. ఈ మధ్యనే ఈ ఔషధాన్ని నేపాల్ విక్రయించడానికి నాట్కో ఫార్మాకి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఇదే జెనరిక్ ఔషధాన్ని ‘సొఫోవిర్’ పేరుతో ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హెటిరో ల్యాబ్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ జెనరిక్ ఔషధాన్ని 91 దేశాల్లో తయారు చేసి విక్రయించుకోవడానికి హెటిరో ల్యాబ్స్, నాట్కో ఫార్మాలు హక్కులు పొందాయి. ఈ వార్తల నేపథ్యంలో నాట్కో ఫార్మా గురువారం సుమారు 15 శాతం పెరిగి రూ. 2,057 వద్ద ముగిసింది.