breaking news
Galapagos Islands
-
అతిచిన్న ఆక్టోపస్
వాషింగ్టన్: సముద్ర జీవులైన ఆక్టోపస్లు సాధారణంగా ఒక మీటర్ పొడవు, 9 కిలోల వరకు బరువు ఉంటాయి. కానీ, కేవలం గోల్ఫ్ బంతి పరిమాణంలోని అతిచిన్న ఆక్టోపస్ను పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధకులు గుర్తించారు. ఈక్వెడార్ తీరానికి సమీపంలో గాలాపాగోస్ దీవుల వద్ద సముద్ర ఉపరితలం నుంచి 6 వేల అడుగుల లోతున చిమ్మచీకటిలో ఇది సంచరిస్తుండగా జాగ్రత్తగా బయటకు తీశామని చెబుతున్నారు. ఇది ఇప్పటిదాకా ఎవరికీ తెలియని కొత్తరకం ఆక్టోపస్ అని అంటున్నారు. గాలాపాగోస్ దీవులు అరుదైన జీవజాలానికి నిలయంగా మారాయి. భూమిపై మరెక్కడా కనిపించని వెయ్యికి పైగా వృక్ష, జంతు జాతులు ఇక్కడున్నాయి. ఈ ద్వీపాల చుట్టూ ఉన్న లోతైన జలాల్లో కొత్తరకం ఆక్టోపస్ ఉనికి తొలిసారిగా బయటపడింది. ఈ నీలి రంగు బుల్లి ఆక్టోపస్కు మైక్రోఎలిడోన్ గాలాపాగెన్సిస్ అని పేరుపెట్టారు. షికాగోలోని ఫీల్డ్ మ్యూజియం, చార్లెస్ డారి్వన్ ఫౌండేషన్, గాలాపాగోస్ నేషనల్ పార్క్ డైరెక్టరేట్లోని సైంటిస్టులు 2015 నుంచి సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. ఈవీ నాటిలస్ అనే అన్వేషణ నౌక ద్వారా లోతైన సముద్ర యాత్రలో ఆక్టోపస్ను మొదటిసారిగా గుర్తించారు. ఓడ నుంచి సిబ్బంది రిమోట్తో పనిచేసే అండర్వాటర్ రోబోను సముద్రం అడుగుభాగంలోకి పంపించారు. సముద్ర ఉపరితలం నుంచి 5,800 అడుగుల లోతులో ఒక పర్వతం సమీపంలో ఆక్టోపస్ను గమనించి, రోబోటిక్ వాహనాన్ని ఉపయోగించి పట్టుకున్నారు. గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉన్న నీలిరంగు చిన్న ఆక్టోపస్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. కొత్త ఆక్టోపస్ జాతిని అధ్యయనం చేయాలంటే సాధారణంగా దానికి కోసి చూడాల్సి ఉంటుంది. కానీ, గోల్ఫ్ బంతి పరిమాణంలోని ఆక్టోపస్ ఇదొక్కడే దొరకడంతో జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. మైక్రో సీటీ స్కానింగ్తో ఆక్టోపస్ శరీరం లోపలి భాగాలను పరిశీలించారు. 3డీ నమూనాను తయారు చేశారు. దానికి అధికారికంగా ఒక కొత్త జాతి ఆక్టోపస్గా ధ్రువీకరించారు. సువిశాలమైన మన భూగోళంపై ఇప్పటిదాకా మానవుడి దృష్టికి రాని జీవులు ఎన్నో ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. -
కుప్పకూలిన ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక నిర్మాణం
దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్న ద్వీపకల్పంలో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ప్రసిద్ధ పర్యాటక కట్టడం కుప్పకూలిపోయింది. వైల్డ్లైఫ్ ప్రియులకు ఇది చేదువార్తే. గాలాపోగోస్ ద్వీపంలో సహజసిద్ధ రాతి కట్టడం డార్విన్ ఆర్చ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ విషయాన్ని ఈక్వెడార్ పర్యాటక శాఖ అధికారికంగా ప్రకటించింది. సహజ సిద్ధ శిలా తోరణం ప్రస్తుతం రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తోంది. ఒకప్పుడు డార్విన్ ద్వీపంలో ఈ కట్టడం ఓ భాగంగా ఉందంట. కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఆ కట్టడం నీటిలోకి చేరిపోయింది. సముద్రపు నీటి మధ్యలో ఈ ఆర్చ్ అద్భుతంగా కనిపించేంది. ఈ కట్టడానికి జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్ డార్విన్ పేరు మీదుగా డార్విన్ ఆర్చ్ పేరు పెట్టారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో దీనికి చోటు కల్పించింది. గాలాపాగోస్ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అడ్వైంచర్స్, సాహసాలు చేయాలనుకున్న వారికి ఇది అనువైన ప్రాంతం. ఫొటో షూట్లకు పేరు పొందింది. డార్విన్ ఆర్చ్ కూలిపోయిందని ఈక్వెడార్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చారిత్రక సహజ కట్టడంలో ప్రస్తుతం రెండు స్తంభాలు మాత్రమే మిగిలి ఉందని చెబుతూ ఫొటోలు విడుదల చేసింది. The famed Darwin's Arch in the Galapagos Islands has lost its top, and officials are blaming natural erosion. The collapse was reported on Monday by the Ecuadorean Environment Ministry. pic.twitter.com/QeJZW8IIqp — CBS News (@CBSNews) May 19, 2021 కూలిన అనంతరం రెండు స్తంభాలుగా నిలిచిన సహజ శిలా తోరణం ‘డార్విన్స్ ఆర్చ్’ -
సముద్రమంత సంతోషం...
గలపగోస్ దీవులు నాలుగు కాళ్లతోనూ ఈదే చిన్నసైజు తిమింగలాల్లాంటి సీ లయన్స్... కాలిఫోర్నియా, జపాన్ సముద్రాల్లోనూ కనిపిస్తాయి. కానీ ఈక్వెడార్లోని గలపగోస్ దీవుల సీ లయన్స్ ప్రత్యేకతే వేరు. వీటిని చూస్తూ స్నోర్కెలింగ్ చేయటం... మన వెంటే నీలి పాదాల బూబీస్ (పక్షులు) ఎగరటం... ఈ గలపగోస్ దీవుల్లోనే సాధ్యం. ఈక్వెడార్ తీరానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. 10 రోజుల క్రూయిజ్ను బుక్ చేస్తే... బోలెడన్ని బీచ్లు, గుహల్ని చూసేయొచ్చు. 32 మందితో ప్రయాణించే చిన్న క్రూయిజ్ నౌకలు ఇక్కడి ప్రత్యేకత. దార్లో చల్లారిపోయిన అగ్నిపర్వతాన్ని, పెంగ్విన్లను... ఇంకా ఎన్నెన్నో ప్రాణుల్ని చూడొచ్చు. అలా కాదనుకుంటే మూడు ప్రధాన దీవుల్లో బస చేస్తూ... అక్కడి వన్యప్రాణి సంపదను చూడొచ్చు. గలపగోస్కు వెళ్లేదెలా? * హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు లేవు. కానీ ఢిల్లీ, ముంబయి నుంచి ఉన్నాయి. కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.1.6 లక్షల నుంచి 1.8 లక్షల మధ్య ఉంటాయి. * గలపగోస్ కాస్త ఖరీదైన యాత్రే. ఇక్కడి హోటళ్ల ధరలు కూడా రోజుకు ఒకరికి కనీసం 250 నుంచి 300 డాలర్ల మధ్య ఉంటాయి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.15వేలు. * స్థానికంగా ప్యాకేజీలు కూడా లభిస్తాయి. ఈ ప్యాకేజీల్లో కొంత తక్కువ ధర ఉండే అవకాశముంటుంది. ఏ సీజన్లో వెళ్లొచ్చు? డిసెంబరు-మే: ఇది వర్షాకాలం. దాదాపు రోజూ ఎప్పుడో ఒకప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. కాకపోతే నీళ్లు కాస్త వెచ్చగా ఉంటాయి. దీంతో డైవింగ్, స్నోర్కెలింగ్ చేయటం సులువు. చేపలకు, తాబేళ్లకు ఇది గుడ్లుపెట్టే సమయం. వాటిని చూడొచ్చు. ఎక్కువ జంతుజాలం కనిపించదు. మే- డిసెంబరు: నీళ్లు చల్లగా ఉంటాయి. ఎప్పుడూ మేఘాలుంటాయి కానీ వర్షం పడటం అరుదు. సముద్రంలో జంతుజాలం ఎక్కువగా ఉంటుంది. యాత్రికులకు ఇదే సరైన సమయమని అనుభవం ఉన్న డైవర్లు చెబుతారు. కాకపోతే ఆ చల్లటి నీళ్లలో డైవింగ్, స్నోర్కెలింగ్ చేయటమంటే కొంత సాహసమే.


