breaking news
Fractional ranks
-
రూ.10 లక్షలున్నా ప్రాపర్టీ కింగ్..!
ఓ ఇల్లు లేదా వాణిజ్య భవనానికి యజమాని అయితే ఆ దర్జాయే వేరు! స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా అండగా నిలిచే ప్రాపర్టీ ఉంటే చెప్పలేనంత నిశి్చంత. ప్రాపర్టీపై పెట్టుబడి ఎన్నో తరాలను ధనవంతులను చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, నేడు ఇళ్లు, వాణిజ్య స్థలాల ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలాల లభ్యత పెరగదన్నది వాస్తవం. కనుక ప్రాపర్టీ ఇక ముందూ పెట్టుబడుల పరంగా మెరుగైన సాధనమే అవుతుంది. భారీ పెట్టుబడి పెట్టలేని వారు సైతం ప్రాపర్టీకి సహ యజమాని అయ్యే అవకాశం కల్పిస్తున్నవే ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్’లు. ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్’కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్తోనే ప్రాపర్టీపై పెట్టుబడికి లభిస్తున్న అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది (గతంతో పోల్చితే) ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడికి వీలు కల్పించడం ఇందులో ఉన్న సౌలభ్యం. ఇదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అసలు ఈ సాధనం ఎలా పనిచేస్తుంది? ప్రయోజనాలు, పన్ను తదితర అంశాల గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి ఇదొక వినూత్న సాధనం. అధిక విలువ కలిగిన ప్రాపర్టీకి ఏ ఒక్కరో యజమానిగా కాకుండా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉమ్మడిగా వాటా కలిగి ఉండడం. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అంటే.. తమ వాటా మేరకు రాబడి అందుకోవచ్చు. ఇల్లు కొనుగోలుకు రూ.50 లక్షలు, ఇంకా ఎక్కువే పెట్టుబడి అవసరం. ఇక్కడ మాత్రం రూ.10 లక్షలు ఉన్నా సరే ఆ మేరకు వాటా లభిస్తుంది. ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోయిన ప్రాంతాల్లో పెట్టుబడికి ఎంతో అనుకూలం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ నిబంధనలు (సవరణ), 2014కు మార్పులు చేయడం ద్వారా సెబీ కొత్తగా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్) విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ను నియంత్రణల పరిధిలో మరింత మందికి చేరువ చేసేందుకు, పారదర్శకత, సౌలభ్యం కోసం తీసుకొచ్చింది. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (పాక్షిక యాజమాన్యం)ను ఆఫర్ చేసే ప్రతి ప్లాట్ఫామ్ కూడా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్)గా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కు బదిలీ చేస్తాయి. ఆఫీస్ వసతులు, గోదాములు, డేటా సెంటర్లు తదితర వాటిపై ఎస్పీవీ పెట్టుబడులు పెడతాయి. ప్రతి పెట్టుబడిదారుడికి వారి వాటా మేరకు డిజిటల్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. రాబడులను వారి వాటాకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. సెబీ నియంత్రణ ఎస్ఎం రీట్ సాధనాలు సెబీ పర్యవేక్షణ కింద పనిచేస్తుంటాయి కనుక రక్షణ ఉంటుంది. ‘‘ఈ ప్లాట్ఫామ్లు తమ నిర్వహణలోని ఆస్తుల విలువను రెండేళ్లకోసారి స్వతంత్రంగా మదింపు వేయించి, ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. పనితీరు, ఆస్తుల వివరాలు, రిస్్కలు, ప్రయోజన వైరుధ్యం తదితర సమాచారాన్ని వెల్లడించాలి’’ అని ట్రైలీగల్కు చెందిన కునాల్షా తెలిపారు. వీటిలో రకాలు.. నివాస భవనాలు: ఇందులో పెట్టుబడిపై అద్దె ఆదాయం మోస్తరుగా ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి విలువ సైతం వృద్ధి చెందుతుంది. వాణిజ్య ప్రాపర్టీలు: అధిక అద్దె ఆదాయం లభిస్తుంది. పెట్టుబడి విలువ వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రాపర్టీ కొంత కాలం పాటు ఖాళీగా ఉండడం వంటి కొన్ని రిస్్కలు ఇందులో ఉంటాయి. ఎమర్జింగ్ అస్సెట్ క్లాసెస్: గోదాములు, డేటా సెంటర్లు, కో–వర్కింగ్ స్పేస్లకు ఇవి వేదికగా ఉంటాయి. వీటిల్లో పెట్టుబడిపై అద్దె రాబడి స్థిరంగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువ. కనుక వసతులు ఖాళీగా ఉండకుండా అద్దె ఆదాయం స్థిరంగా లభిస్తుంది. పెట్టుబడులకు వైవిధ్యం రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పరంగా వైవిధ్యం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్తో సాధ్యపడుతుంది. భారీ పెట్టుబడి ఒకే ప్రాపర్టీకి పరిమితం కాకుండా చూసుకోవచ్చు. ఒకటికి మించిన ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆదాయంలో వైవిధ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే ప్రాంతం కాకుండా భిన్న ప్రాంతాల్లోని, భిన్న రకాల ప్రాపర్టీలపై (ఆఫీసులు, గోదాములు, ఇళ్లు) పెట్టుబడి పెట్టుకోవడం ఇందులో ఉన్న సౌలభ్యం. అయితే అన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు ఎస్ఎం రీట్లుగా నమోదై లేవు. పెట్టుబడి వృద్ధితోపాటు రాబడి స్థిరమైన ఆదాయానికితోడు పెట్టుబడి విలువ కూడా నిరీ్ణత కాలంలో ఎంతో కొంత వృద్ధి చెందుతుంది. ఆస్తులను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ప్రాపర్టీల నిర్వహణ, కిరాయిదారుల నుంచి అద్దెలు వసూలు, చట్టపరమైన ప్రక్రియలను అనుసరించడం తదితర బాధ్యతలన్నింటినీ వారు చూసుకుంటారు. కనుక పెట్టుబడిదారులకు ఈ తలనొప్పులేవీ ఉండవు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం 500–600 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.5,160 కోట్లు) ఉంటుందని ఖైతాన్ అండ్ కో పార్ట్నర్ హర్ష్ పారిఖ్ తెలిపారు. వచ్చే 8–10 ఏళ్లలో 5 నుంచి 5.5 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.47,300 కోట్లు) చేరుకుంటుందని అంచనా వేశారు.పెట్టుబడికి ముందు చూడాల్సినవి.. → ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు సెబీ వద్ద నమోదయ్యాయా? లేవా అన్నది తప్పకుండా చూడాలి. అంతేకాదు ప్రాపర్టీ సైతం రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. లీజు డాక్యుమెంట్లు, యాజమాన్యం వివరాలను సరి చూసుకోవాలి. → కొన్ని ప్లాట్ఫామ్లపై పెట్టుబడికి లాకిన్ పీరియడ్ ఉంటోంది. దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. → సొంతంగా ప్రాపర్టీ కొనుగోలుకు భారీ పెట్టుబడి అవసరం. కావాలనుకున్నప్పుడు వేగంగా విక్రయించడ అన్ని వేళలా సాధ్యపడదు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అయినా లేదా ఎస్ఎం రీట్లు అయినా కొంచెం వేగంగా విక్రయించుకోవచ్చు. → కొన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు (సెబీ వద్ద నమోదు కాని) రూ.5 లక్షల నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నాయి. వీటి రిజిస్ట్రేషన్, వాస్తవికత తెలుసుకున్న తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్ లేదా రీట్ల్లో ఈ తరహా రిస్క్ ఉండదు. కానీ సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో లేవు. అదే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు చాలా ఉన్నాయి. → కనీస పెట్టుబడి అన్నది ప్లాట్ఫామ్ ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ ప్లాట్ఫామ్లోనూ రూ.10 లక్షలే ఉండాలని లేదు. → ఎంపిక చేసుకునే ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది? అక్కడ లీజుకు ఉన్న డిమాండ్ ఏ పాటిది? భవిష్యత్తులో బలమైన వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమేనా? తదితర అంశాలను పరిశీలించాలి.ఎవరికి అనుకూలం? స్థిరమైన ఆదాయం కోరుకునే విశ్రాంత జీవులు, ఇతరులు ఎవరికైనా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ లేదా ఎస్ఎం రీట్లు అనుకూలమే. సంప్రదాయ ఈక్విటీలు, డెట్ సాధనాలకు అదనంగా వైవిధ్యం కోసం అనుకూలిస్తాయి. ‘‘అద్దె రూపంలో 8–9 శాతం రాబడులు ఎంతో మెరుగైనవి. పైగా ఈ రాబడి ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. ఏటా 5 శాతం మేర పెరుగుతూ ఉంటుంది’’ అని ‘ప్రాపర్టీ షేర్’ సహ వ్యవస్థాపకుడు కునాల్ మోక్తాన్ వివరించారు. ఏడాది మించిన పెట్టుబడి దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎం రీట్లు పంపిణీ చేసే డివిడెండ్లపై పన్ను లేదు. వడ్డీ ఆదాయం మాత్రం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి. ఎస్ఎం రీట్ – రీట్ → రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) అన్నది ఒక కంపెనీ. ఆదాయాన్నిచ్చే వాణిజ్య ఆస్తులను నిర్వహిస్తుంటుంది. షేర్ల మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అయిన రీట్లను ఒక్క యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. సిప్ మాదిరే ప్రతి నెలా కొద్ది మొత్తం పెట్టుబడులకు లిస్టెడ్ రీట్లకు అనుకూలమైన సాధనం. ఇవి పెద్ద స్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. నేరుగా కాకుండా పరోక్షంగా అన్ని ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు మధ్య, చిన్నస్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో ఇన్వెస్టర్ ఎంపిక మేరకు ఒక ప్రాపర్టీ లేదా ఒకటికి మించిన ప్రాపర్టీల్లో పెట్టుబడులకు వీలుంటుంది. ఒక విధంగా ఇది ప్రత్యక్ష పెట్టుబడి. ఒకటికి మించిన ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉండదు. ప్రతీ ప్రాపర్టీకి విడిగా సర్టిఫికెట్ జారీ చేయాల్సిందే. → ఎస్ఎం రీట్లు రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. రెగ్యులర్ రీట్లు రూ.500 కోట్లకు పైగా విలువైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. → ఎస్ఎం రీట్లలో తమకు ఇష్టమైన ప్రాపర్టీని ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ప్రాపర్టీ వారీగా విడివిడిగా ఉంటుంది. రీట్లో ఇందుకు అవకాశం లేదు. → ఎస్ఎం రీట్లలో కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. రెగ్యులర్ రీట్లలో కనీసం ఒక యూనిట్ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు కనీసం 5–6 ఏళ్లు, అదే రెగ్యులర్ రీట్లు అయితే మరింత దీర్ఘకాలం కోసం ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ఎందుకు? అసలు ప్రాపర్టీపై ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? రాబడి కోసమా, సంపద సృష్టి కోసమా అన్నది తేల్చుకోవాలి. ఎందుకంటే రాబడి, పెట్టుబడి విలువ వృద్ధి కోరుకునే వారికి ఈ తరహా డిజిటల్ రియల్ ఎస్టేట్ సాధనాలే అనుకూలం. ఒకవేళ సొంత వినియోగం కోసం అయితే నేరుగా ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఒక ప్రాపర్టీని సొంతంగా కొనుగోలు చేసుకోవడానికి పెద్ద మొత్తం పెట్టుబడి కావాలి. అంత స్తోమత లేని వారికి ఈ తరహా సాధనాలు అనుకూలం. పైగా పెట్టుబడులు అన్నీ ఒకే విభాగంలో ఉండరాదు. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం చక్కని సమతూకంతో, రిస్క్ పరంగా మెరుగైన ప్రణాళిక అవుతుంది. రియల్ ఎస్టేట్పై పెట్టుబడికి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ లేదా రీట్లను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనికంటే ముందు రిస్క్లు, సానుకూలతలు, ప్రతికూలతలను సమగ్రంగా తెలుసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పాక్షిక పెట్టుబడుల్లో మిలీనియల్స్
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడులు యువ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గ్రిప్ ఇన్వెస్ట్ తెలిపింది. పాక్షిక పెట్టుబడుల్లో (ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్) మిలీనియల్స్ ఇన్వెస్టర్ల సంఖ్య 60 శాతం ఉందని వెల్లడించింది. గ్రిప్ ఇన్వెస్ట్ వేదికగా 26,000 పైచిలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. ‘మిలీనియల్స్ తమ పెట్టుబడి పోర్ట్ఫోలియోలను వైవిధ్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారుల నుండి వచి్చనవి 60 శాతం ఉన్నాయి. జెన్ ఎక్స్ కస్టమర్లు 20 శాతం మంది ఉన్నారు. 21 ఏళ్లున్న పెట్టుబడిదారులు పాక్షిక అధిక–దిగుబడి ఆస్తులను ఎంచుకుంటున్నారు. గ్రిప్ ఇన్వెస్ట్ ప్లాట్ఫామ్లోని 77 శాతం మంది కస్టమర్లు డూ–ఇట్–యువర్సెల్ఫ్ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్వెస్టర్లు వ్యక్తిగత పరిశోధన ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో భారత్లోని మిలీనియల్స్ ఉత్సుకత చూపిస్తూనే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు’ అని గ్రిప్ ఇన్వెస్ట్ వివరించింది. 1981–1996 మధ్య జని్మంచినవారిని మిలీనియల్స్గా, 1960 మధ్య కాలం నుంచి 1980 ప్రారంభంలో పుట్టినవారిని జెన్ ఎక్స్గా పరిగణిస్తారు. -
రాష్ట్ర విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులు
జేఈఈ మెయిన్ ర్యాంకులు ఇచ్చేందుకు సీబీఎస్ఈ ఓకే: * కేంద్రం స్పందించింది.. అందరిని ఒప్పించాం * 4వ తేదీన ర్యాంకుల కేటాయింపు * 4, 5 తేదీల్లోనే ఆప్షన్లు ఇచ్చుకోవాలి * మొదటి దశలోనే సీట్ల కేటాయింపు * ఇది రాష్ట్ర ఇంటర్ బోర్డు తప్పిదమే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు ర్యాంకులు ఇచ్చేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అంగీకరించింది. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులను (ఉదాహరణకు 100వ ర్యాంకు ఇదివరకే ఒకరికి ఇచ్చి ఉంటే.. ఇప్పుడు రాష్ట్ర విద్యార్థికి కూడా అదే ర్యాంకు వస్తే అతనికి 100.1గా ఫ్రాక్షనల్ ర్యాంకు కేటాయిస్తారు) కేటాయించనుంది. ఈ మేరకు వివరాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం హైదరాబాద్లో వెల్లడించారు. విద్యార్థులు 4, 5 తేదీల్లోనే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, మొదటి దశలోనే సీట్లు పొందవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చూసేందుకు చర్యలు చేపట్టామని.. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్లో ఆలిండియా ర్యాంకుల ఖరారుకు జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీగా తీసుకుంటారు. ఈ సారి రాష్ట్ర ఇంటర్ బోర్డు కొందరు విద్యార్థుల మార్కులను సీబీఎస్ఈకి ఇవ్వకపోవడం వల్ల వారికి ర్యాంకులను కేటాయించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశం మేరకు ఉన్నతాధికారులు గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ మానవ వనరుల శాఖ, సీబీఎస్ఈ అధికారులతో చర్చించి, ర్యాంకుల కేటాయింపునకు ఒప్పించారు. రాష్ట్ర విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నట్లుగా సీఎస్ఏబీ కోఆర్డినేటర్ ఎంపీ సింగ్ గురువారం రాత్రే ఇంటర్బోర్డుకు ఈమెయిల్ చేశారు. బోర్డు తప్పిదం వల్లే.. రాష్ట్ర ఇంటర్ బోర్డు పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కడియం శ్రీహరి తెలిపారు. ‘‘ఇంప్రూవ్మెంట్, ఇతర విద్యార్థుల మార్కులను సీబీఎస్ఈకి ఇవ్వలేదు. బోర్డు నుంచి ఇచ్చిన సీడీలో 68 వేల మంది మార్కులు ఉన్నాయి. దాదాపు 1,188 మంది విద్యార్థుల మార్కుల వివరాలు లేవు. బోర్డు అధికారులు ఇది సరిచూసుకోలేదు. అందుకే ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపాను. వారు సీబీఎస్ఈ చైర్మన్తో చర్చించారు. ఆమె ముందు అంగీకరించలేదు. దీంతో మానవ వనరుల శాఖ కార్యదర్శి సుభాష్ కుంతియాతో చర్చించి, పరిస్థితిని వివరించడంతో ఆయన రాత పూర్వకంగా సీబీఎస్ఈకి ఆదేశాలు జారీచేశారు. అప్పుడు ర్యాంకులు ఇచ్చేందుకు సీబీఎస్ఈ చైర్మన్ అంగీకరించారు. దీంతో అధికారులు విద్యార్థుల మార్కుల జాబితాను సీబీఎస్ఈకి అందజేశారు. తర్వాత సీఎస్ఏబీ కోఆర్డినేటర్ ఎంపీ సింగ్తో చర్చించారు. ఈనెల 4వ తేదీ ఉదయానికల్లా విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులను ఇస్తే తాము మొదటి దశ కౌన్సెలింగ్లోనే పెడతామని చెప్పారు. అందుకు సీబీఎస్ఈ అంగీకరించింది. మన రాష్ట్రం నుంచి మిస్ అయిన వారిలో దాదాపు 130 మందికి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు పరిధిలోకి వస్తామని, ఏపీ విద్యార్థులు తెలంగాణ బోర్డు పరిధిలోకి వస్తామని తప్పుడు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ సమస్యను కూడా అధికారులు గుర్తించి సరిచేశారు.’’ అని చెప్పారు. రెండు రోజులే గడువు.. విద్యార్థులకు 4వ తేదీన ఉదయం సీబీఎస్ఈ ర్యాంకులను ప్రకటిస్తుందని కడియం చెప్పారు. అయితే ఇప్పటికే ఒక ర్యాంకు వేరే వారికి వచ్చి, మన విద్యార్థికి అదేర్యాంకు వస్తే ఫ్రాక్షనల్ ర్యాంకు ఇస్తారని, దాని ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు. ఆప్షన్లు ఇచ్చుకునేందుకు 4, 5 తేదీలు మాత్రమే గడువు ఉందని.. ఈ విషయాన్ని గమనించాలని విద్యార్థులకు సూచించారు. 7వ తేదీన మొదటి దశ సీట్ల కేటాయింపులో రాష్ట్ర విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారని చెప్పారు. ఈ తప్పిదానికి బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని కడియం పేర్కొన్నారు. అయితే ముందుగా విద్యార్థుల సమస్య పరిష్కారం కావాలని, ర్యాంకులు రావాలని చెప్పారు. 7వ తేదీ తరువాత దీనిపై దృష్టి పెడతామని, అలాగే బోర్డులో జరుగుతున్న వరుస తప్పిదాలపై విచారణ జరిపించి చర్యలు చేపడతామని తెలిపారు. ‘ఫ్రాక్షనల్’తో న్యాయం జరిగేనా? ఫ్రాక్షనల్ ర్యాంకుల కేటాయింపుతో విద్యార్థులకు సీట్ల కేటాయింపులో న్యాయం జరుగుతుందా అన్నదానిపై ఆందోళన నెలకొంది. ఫ్రాక్షనల్ ర్యాంకుల్లో భాగంగా ఇదివరకు ఒక విద్యార్థికి 50వ ర్యాంకు వచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్ర విద్యార్థికి 50.1 ఫ్రాక్షనల్ ర్యాంకు ఇస్తారు. లెక్క ప్రకారమైతే ఇద్దరి ర్యాంకు ఒక్కటే. కానీ సీట్లు కేటాయించే సమయంలో వీరిలో ఎవరికి ముందు ప్రాధాన్యం ఇస్తారన్న దానిపై ఆందోళన నెలకొంది. అయితే ఒకే ర్యాంకు ఉన్న వారిలో పేరు వరుస క్రమాన్ని పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాయిస్తారా, లేదా ఆయా సబ్జెక్టుల్లో, పేపర్లలో వచ్చిన మార్కులను ప్రాధాన్య క్రమంలో చూసి సీట్లను కేటాయిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. విద్యార్థుల ఆందోళన రాష్ట్ర ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని జేఈఈ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. గురువారం హైదరాబాద్లో నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేశారు. విద్యార్థుల మార్కులను సీబీఎస్ఈకి పంపకపోవడంతోనే ర్యాంకులు రాలేదని వాపోయారు. అధికారులు తప్పులు చేసి సాంకేతిక కారణాలను సాకుగా చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.