breaking news
first cry e-commerce company
-
త్వరలో ఐపీవోకి.. అంతలోనే రూ.300 కోట్ల షేర్లు అమ్ముకున్న సీఈవో..
పిల్లల దుస్తులు, ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫస్ట్క్రై’ (FirstCry) త్వరలో ఐపీవోకి రానుంది. అంతలోనే ఈ కంపెనీ సీఈవో దాదాపు రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు. కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఫస్ట్క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి ఐపీవో కోసం పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందు కంపెనీకి చెందిన 6.2 మిలియన్ షేర్లను విక్రయించారు. ఒక్కొక్కటి రూ.487.44 ధరతో మొత్తం రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. సీఈవో సుపమ్ మహేశ్వరి పబ్లిక్ ఇష్యూలో సెల్లింగ్ షేర్హోల్డర్గా కూడా నమోదు చేసుకున్నారని మనీకంట్రోల్ నివేదించింది. 6.2 మిలియన్లకు పైగా షేర్లను ఆఫ్లోడ్ చేయడానికి ముందు, సుపమ్ మహేశ్వరి కంపెనీలో 7.46 శాతం వాటాను (35,097,831 షేర్లు) కలిగి ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటా 5.95 శాతానికి (28,893,347 షేర్లు) తగ్గింది. ఐపీవోకి వచ్చే నాటికి ఫస్ట్క్రై కంపెనీ విలువ 3.5 నుంచి 3.75 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఐపీవో తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫస్ట్క్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సుపమ్ మహేశ్వరి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. బ్రెయిన్వీసా అనే కంపెనీతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన పిల్లల ఉత్పత్తుల విక్రయ సంస్థలు పరిమితంగా ఉన్నాయని గ్రహించి 2010లో అమితవ సాహాతో కలిసి ఫస్ట్క్రై కంపెనీని స్థాపించారు. ఇందులో మహీంద్ర అండ్ మహీంద్ర, సాఫ్ట్ బ్యాంక్ వంటివి కూడా పెట్టుబడులు పెట్టాయి. -
ఈ-కామర్స్ సంస్థ ఫస్ట్ క్రైలో రతన్ టాటా పెట్టుబడులు
న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులను కొనసాగిస్తూ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా ఈకామర్స్ సంస్థ ఫస్ట్క్రైలో ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్క్రైడాట్కామ్ బ్రాండ్ మాతృ సంస్థ బ్రెయిన్బీస్ సొల్యూషన్స్లో వ్యక్తిగత హోదాలో ఆయన పెట్టుబడులు పెట్టారు. అయితే, ఎంత ఇన్వెస్ట్ చేసినదీ వెల్లడి కాలేదు. తల్లులు, పిల్లలకు ఉపయోగపడే ఉత్పత్తులను ఫస్ట్క్రై ఆన్లైన్, ఆఫ్లైన్ మాధ్యమంలో విక్రయిస్తోంది. 2010లో కార్యకలాపాలు ప్రారంభించిన ఫస్ట్క్రైకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 నగరాల్లో 150 ఫ్రాంచైజీలు ఉన్నాయి. దీనికోసం బ్రెయిన్బీస్ ఇప్పటిదాకా 69 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. రతన్ టాటా వంటి దిగ్గజం ఇన్వెస్ట్ చేయడం తమ సంస్థకు మరింత ప్రయోజనం చేకూర్చగలదని బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ వ్యవస్థాపక సీఈవో సుపమ్ మహేశ్వరి తెలిపారు.