breaking news
Fakenotes
-
దొంగ నోట్ల ముఠా అరెస్టు
ఆరుగురు రిమాండ్, పరారీలో ఒకరు రూ.లక్షా ఐదు వేల నకిలీ కరెన్సీ స్వాధీనం ల్యాప్టాప్, ప్రింటర్స్, పేపర్స్, కలర్స్ సీజ్ సూర్యాపేట మున్సిపాలిటీ : దొంగ నోట్లను చెలమాణి చేస్తున్న ఓ ముఠాను సూర్యాపేట పోలీసులు అపులోకి తీసుకున్నారు. ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సునీతామోహన్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కష్టం లేకుండా సులభంగా సంపాదించాలనే దురాలోచనతో ఆత్మకూర్.ఎస్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన కప్పల విజయ్, మానుపురి వరప్రసాద్, హైదరాబాద్లోని రామంతపూర్కు చెందిన రాపోలు శ్రీనివాస్ అతడి తమ్ముడు సురేందర్, వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరుకు చెందిన తెడ్డు ప్రభాకర్, నర్సింహులగూడెంకు చెందిన గొడుగు రామకృష్ణ, అక్బర్ నకిలీ నోట్లను తయారీ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన ఈ దందాకు రాపోలు శ్రీనివాస్ ప్రధాన సూత్రదారిగా వ్యవహరించాడు. అయితే ఈ నోట్ల చెలామణిని నల్లగొండ, వరంగల్ జిల్లాలకు విస్తరించేందుకు యత్నించే క్రమంలో సూర్యాపేట పోలీసులు ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేయగా, నర్సింహులగూడెంకు చెందిన అక్బర్ పరరీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితులు చిక్కారిలా... ఆత్మకూర్.ఎస్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన కప్పల విజయ్ కొత్త బస్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తుండంతో పోలీసులు పట్టుకుని తనిఖీ చేయగా అతడి వద్ద ఎనిమిది నకిలీ రూ.500 నోట్లు లభించాయి. అతడిని విచారించగా గ్రామానికి చెందిన మానుపురి వరప్రసాద్, రామంతాపూర్కు చెందిన రాపోలు శ్రీనివాస్ పేర్లు బయటపడ్డాయి. సుమారు 350 నకిలీ రూ.500 నోట్లను తెచ్చిన వరప్రసాద్ 70 నోట్లను మార్చాడు. అనంతరం 270 నోట్లను కాల్చివేసి, 10 నోట్లు విజయ్కు ఇచ్చినట్టు విచారణలో తేలింది. విజయ్, వరప్రసాద్లను అదుపులోకి తీసుకున్న అనంతరం రామాంతపూర్లోని శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ ఉన్న శ్రీనివాస్తో పాటు అతడి తమ్ముడు సురేందర్, నకిలీ నోట్లు తీసుకెళ్లేందుకు వచ్చిన వరంగల్కు చెందిన తెడ్డు ప్రభాకర్, గొడుగు రామకృష్ణ పట్టుబడ్డారు. ఈ దాడిలో రూ.లక్షా ఐదు వేల నకిలీ కరెన్సీ, లాప్టాప్, ప్రింటర్స్, పేపర్స్, కలర్స్, కట్టర్, కలర్ జీరాక్స్, రెండు నర్సింగ్ సర్టిఫికెట్లు, మగధ యూనివర్సిటీకి చెందిన నకిలీ లెటర్హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీ నోట్ల తయారీలో మరో నింధితుడు అక్బర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, నకిలీ నోట్ల తయారీ కేసును చాకచక్యంగా ఛేదించిన ఐడీ పార్టీ సిబ్బంది శనగాని వెంకన్నగౌడ్, చామకూరి శ్రీనివాస్గౌడ్, కరుణాకర్, కృష్ణ, రాజులకు రివార్డు కోసం ఎస్పీకి సిఫారస్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ మొగలయ్య, ఎస్ఐ క్రాంతికుమార్, శనగాని వెంకన్నగౌడ్, చామకూరి శ్రీనివాస్గౌడ్, ఇరుగు బాబు, భద్రారెడ్డి, రవినాయక్, వీరన్న పాల్గొన్నారు. -
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
–రూ.18.91 లక్షలు, ప్రింటర్ స్వాధీనం –నిందితులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే –వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాంగోపాల్రావు మిర్యాలగూడ అర్బన్ దొంగనోట్లను ప్రింట్ చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు వ్యక్తులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 18.91 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాంగోపాల్రావు కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వెల్ధుర్తి మండలం, కండ్లకుంట గ్రామానికి చెందిన సుదెనబోయిన అమరయ్య రెండు నెలల క్రితం విజయవాడలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద కలర్ ప్రింటర్, కటింగ్మిషన్ కొనుగోలు చేశాడు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు దొడ్డామార్కొండారెడ్డి, తాటిపర్తి పాపిరెడ్డిలతో పాటు వెల్ధుర్తి మండలం గంగలకుంటకు చెందిన బత్తుల శ్రీరాములు ముఠాగా ఏర్పడ్డారు. గ్రామంలో దొంగనోట్లు ముద్రిస్తే అందరికీ తెలస్తుందని, ప్రస్తుతం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామంలో నివాసముంటున్న గుంటూరు జిల్లా కండ్లకుంట గ్రామానికి చెందిన చెన్నుపల్లి యశోద వద్దకు చేరుకున్నారు. కొంతకాలంగా ఆమె ఇంట్లోనే దొంగనోట్లు ముద్రించి చుట్టుపక్కల గ్రామాల్లో చలామణి చేస్తున్నారు. సిగరేట్ ప్యాకెట్ కొనుగోలు చేస్తూ.. ఈ ముఠా సభ్యులు చాకచక్యంగా నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడం గ్రామంలో కిరాణం షాపు వద్దకు టీవీఎస్ అపాచీ బైక్పై ముగ్గురు వ్యక్తులు వచ్చి పెద్దగోల్డ్ఫాక్ సిగరేట్ డబ్బా కొనుగోలు చేసి రూ.500ల నోట్ ఇచ్చారు. కాగా ఆ నోట్ను తీసుకున్న కిరాణషాపు నిర్వాహకురాలు బెల్లంకొండ కాశమ్మ నోట్ను తన కూమారుడు సైదులుకు చూపించింది. ఆ నోట్ను నకిలీదని గుర్తించగానే ఆ ముఠా సభ్యులు బైక్పై పరారయ్యారు. దీంతో కిరాణషాపు నిర్వహకుడు గ్రామస్తుల సహకారంతో వారిని వెంబడించారు. దామరచర్ల సమీపంలో వారిని పట్టుకుని దామరచర్ల పోలీస్స్టేషన్లో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో దొంగనోట్లు ముద్రించి చలామణి చేస్తూ పట్టుపడిన వారిని, వారికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వివరించారు. జల్సాలకు అలవాటు పడిన వీరు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. వారి నుంచి హెచ్పీ కలర్ ప్రింటర్తో పాటు పేపర్కటింగ్ మిషన్, అపాచిబైక్, రూ.18.91లక్షలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ రవీందర్రెడ్డి, వాడపల్లి ఎస్ఐ చరమందరాజు పాల్గొన్నారు.