breaking news
expansion of road works
-
‘వేగం’ తగ్గిన... ఫోర్వే..!
అత్యంత కీలకమైన పనిగా భావిస్తున్న భూత్పూర్ - మహబూబ్ నగర్ రోడ్డు విస్తరణ పనులు అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు చందాన సాగుతోంది. విస్తరణ వేగమందక అవస్థలు పెరుగుతున్నాయి. రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. మలుపుల వద్ద ప్రణాళిక లేకుండా పనులు చేయడంతో ప్రమాదాల బెడద పొంచి ఉంటుందన్న ఆరోపణలున్నాయి. మహబూబ్నగర్ వ్యవసాయం : ప్రయాణికుల కష్టాలు తీర్చుతుందని భావిస్తున్న భూత్పూర్-మహబూబ్నగర్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న అధికారులు అసలు ఇబ్బందులను గుర్తించి పరిష్కరించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ మార్గాన్ని రూ. 31 కోట్లతో విస్తరించేందుకు గత ప్రభుత్వం హయాంలోనే నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు పూర్తైమార్చి నెల నుండి కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల తొలగింపు పూర్తయింది.సివిల్ పనులను ముగ్గురు కాంట్రాక్టర్లు దక్కించుకోగా అందులో ఇద్దరు పనులు చేపడుతున్నారు. బాలాజీనగర్ స్టేజీ నుండి అమిస్తాపూర్ శివారులోని సాక్షి గణపతి దేవాలయం వరకు పనులు జరుగుతున్నాయి.అక్కడి నుండి భూత్పూర్ చౌరస్తా వరకు ఇంకా పనులు మొదలు కావాల్సి ఉంది. మరోవైపు కల్వర్టులను నిర్మించే పనికూడా సాగుతోంది. మలుపులతోనే అసలు బెడద.. ఈ పనులను చేపడుతున్న కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్న మలుపులను సరిచేయకుండానే విస్తరణ సాగిస్తుండడంతో అది ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఈ మార్గంలో దాదాపు 8కిపైగా మలుపులు ఉన్నాయి. వాటిలో నాలుగు అతి ప్రమాదకరమైనవి. ఆయా చోట్ల గతంలో భారీ ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. ఇలా బాలాజీనగర్ స్టేజీ, గోమతి ధాబా, అక్కడికి సమీపంలోని మరో మలుపు, పాలకొండ వంతెన, అమిస్తాపూర్ శివారులోని సాక్షి గణపతి దేవాలయం దగ్గర ఉన్న బ్రిడ్జి వద్ద , అమిస్తాపూర్ నుండి భూత్పూర్ మార్గంలో గ్రామ శివారున ఉన్న మలుపులు అతి ప్రమాద కరమైనవిగా భావిస్తుంటారు. వీటిని తక్షణం సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ఈ రోడ్డుపై ఉన్న రెండు వంతెనల పనులకు టెండర్లు పూర్తికాకపోవడంతో విస్తరణపై ప్రభావం చూపనుంది.పాలకొండ స్టేజీ ,అమిస్తాపూర్ గ్రామం వద్ద ఉన్న వంతెనల వెడల్పు చేసేందుకు ఇంకా టెండర్లు ఇంకా చేపట్టలేదు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి ఇంకా నెలరోజులు పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దుమ్ము కొడుతున్నారు... రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా వేసిన డెబ్రిస్పై వెను వెంటనే నీరు చల్లక పోవడంతో .వాటిపై సమయానుకూలంగా నీరు చల్లకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటోంది. దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. విద్యుత్తు స్తంభాలూ తొలగించలేదు... ఈ రోడ్డుకు ఇరువైపుల ఉన్న విద్యుత్ స్తంబాలు రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకిగా మారాయి.వీటికి టెండర్లు పూర్తయినా ఇప్పటి వరకు సంబంధిత కాంట్రాక్టర్లు పనులను మొదలు పెట్టడం లేదు.ఇవీ పనుల ఆలస్యానికి ఓ కారణంగా చెప్పవచ్చు. డిసెంబర్కల్లా పూర్తిచేస్తాం... రాష్ట్ర విభజన నేపథ్యంలో బ్రిడ్జి టెండర్లకు కొంత జాప్యం ఏర్పడింది.కొన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలకు టెండర్లు పూర్తయినా పనులు మొదలు కాలేదు.రోడ్డుకు కుడివైపున పైపులైను ఉండడంతో మలుపుల వద్ద సరిచేయడం కుదరడం లేదు.సాధ్యమైనంత వరకు మలుపుల వద్ద సరిచేసేందుకు కృషి చేస్తాం.ఈ ఏడాది డిసెంబర్ నెల చివరికల్లా పనులు పూర్తిచేసే అవకాశం ఉంది. - సంధ్య, ఏఈఆర్ అండ్ బీ మహబూబ్నగర్ -
కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి
ఒంగోలు, న్యూస్లైన్ : కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై కలెక్టర్, నగర పాలకసంస్థ ప్రత్యేకాధికారి విజయకుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మిని ఆదేశించారు. అద్దంకి బస్టాండ్ నుంచి బైపాస్ రోడ్డు వరకూ 1230 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మించాల్సి ఉండగా కేవలం ఉత్తరం వైపు 960 మీటర్లు, దక్షిణం వైపు 740 మీటర్లు మాత్రమే రోడ్డు ఎందుకు నిర్మించారని కలెక్టర్ ప్రశ్నించారు. కేవలం మార్జిన్ ఉన్నంత వరకే సిమెంట్ రోడ్డు నిర్మించడం సరికాదంటూ ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోడ్డు ఆక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు 3 రోజుల్లో నోటీసులు అందించాలని ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే నోటీసులు ఇస్తున్నామని యజమానులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒంగోలు ఊరచెరువులో నూతనంగా నిర్మిస్తున్న చేపల మార్కెట్ పనులు ప్రారంభించి రెండేళ్లయినా పనులు పూర్తికాకపోవడానికి కారణం కేవలం నిర్లక్ష్యమేనన్నారు. బాధ్యులైన ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో లీజుకు ఇచ్చిన షాపులు యజమానుల ఆధీనంలో కాకుండా బినామీ చేతుల్లో ఉంటే లీజులు రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహించాలని సూచించారు. నగరపాలక సంస్థలో నిర్మించే రోడ్లకు సైడు కాల్వలు అనుసంధానం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. చెత్త చెదారాలను రహదారుల వెంట వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జాతీయ రహదారి వెంబడి ఉన్న చెత్తను 3 రోజుల్లో తొలగించాలని చెప్పారు. నగరపాలక సంస్థలో ఎంతమంది సిబ్బంది ఉండాలి.. ఎంతమంది ఉన్నారనే విషయాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లో పంపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.