breaking news
Ex captain Sourav Ganguly
-
రాజకీయాలకు నో... కోచింగ్కు సై!
కోల్కతా: రాజకీయ రంగంలో అడుగుపెట్టే ఆసక్తి లేదని భారత మాజీ కెశ్చిన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన అనంతరం వివిధ రూపాల్లో ఆటతో మమేకమై ఉన్న ‘దాదా’... భవిష్యత్తులో టీమిండియాకు కోచ్గా కనిపించే అవకాశాలు లేకపోలేదన్నాడు. వచ్చేనెలతో 53వ పడిలోకి అడుగు పెట్టనున్న గంగూలీ... తాజాగా ఓ పాడ్కాస్ట్లో వివిధ అంశాలపై వివరంగా మాట్లాడాడు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ... ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు ఈ ‘బెంగాల్ టైగర్’ చిరునవ్వుతో ‘ఆసక్తి లేదని’ బదులిచ్చాడు. ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినా తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టబోనని గంగూలీ వెల్లడించాడు. 2018–19, 2022–24 మధ్య ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు టీమ్ డైరెక్టర్గా పనిచేసిన గంగూలీ... భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడంపై సుముఖత వ్యక్తం చేశాడు. ‘2013లో పోటీ క్రికెట్ నుంచి తప్పుకున్నా. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టా. ఆ తర్వాత కూడా వేర్వేరు పాత్రల్లో పనిచేస్తున్నందు వల్ల టీమిండియా కోచింగ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా వయసు ఎక్కువేం కాదు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. బోర్డు అధ్యక్షుడిగా మహిళా క్రికెట్కు వెన్నుదన్నుగా నిలవడం సంతృప్తిగా ఉంది. ప్రస్తుతం గంభీర్ తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లు ఓడినా... అతడి కోచింగ్లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలోనూ టీమిండియా మంచి ప్రదర్శన చేస్తోంది. ఆట పట్ల అతడి నిబద్ధత చాలా గొప్పది. కోచ్గా అతడి వ్యవహార శైలిపై అవగాహన లేకపోయినా... ఆటగాడిగా అతడితో కలిసి ఆడాను. ముక్కుసూటి వ్యక్తి. ఆటగాళ్ల నుంచి తాను ఏం కోరుకుంటున్నాడో దాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలడు. చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాడు. ఆటగాడిగా ఉన్న సమయంలో నాతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్ల పట్ల గంభీర్ చాలా గౌరవంగా ఉండేవాడు. కోచ్గా బాధ్యతలు చేపట్టి దాదపు ఏడాదే అవుతోంది. నేర్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరముంది’ అని గంగూలీ వివరించాడు. రోహిత్, కోహ్లి... 2027 వన్డే వరల్డ్కప్ ఆడటం కష్టమే గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం టి20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి... తాజాగా టెస్టు ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరూ 2027 జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్లో పాల్గొనడంపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీ సమయానికి రోహిత్ 40 ఏళ్లు, కోహ్లి 38 ఏళ్లలో ఉండనున్నారు. ఆలోపు భారత జట్టు 9 ద్వైపాక్షిక సిరీస్ల్లో కలుపుకొని మొత్తం 27 వన్డే మ్యాచ్లు ఆడనుంది. అంటే రోహిత్, కోహ్లి ఏడాదికి అటు ఇటుగా 15 మ్యాచ్ల చొప్పున ఆడనున్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ... ‘మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏడాదికి 15 మ్యాచ్లు ఆడటం అంత సులువు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న వాళ్లిద్దరికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వారే నిర్ణయం తీసుకుంటారు. కోహ్లి వంటి కళాత్మక ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. కాస్త సమయం పడుతుంది’ అని అన్నాడు. ఇక భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్పై ‘దాదా’ ప్రశంసలు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో యువీ అత్యంత ప్రతిభావంతుడని కొనియాడాడు. ‘దేశానికి రెండు ప్రపంచకప్లు అందించడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. 2007 టి20 వరల్డ్కప్, 2011 వన్డే ప్రపంచకప్లో అతడు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఎందులో చూసుకున్నా అతడు అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అయితే టెస్టు క్రికెట్లో అతడికి తగినన్ని అవకాశాలు రాలేదు. ద్రవిడ్, సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ల మధ్య నలిగిపోయాడు’ అని చమత్కరించాడు.వచ్చే ఏడాది చివర్లో ‘దాదా’ బయోపిక్ ఇక తన బయోపిక్ వచ్చే ఏడాది చివరి వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయని గంగూలీ వెల్లడించాడు. ‘స్క్రిప్ట్ వర్క్, ప్రి ప్రొడక్షన్కు ఎక్కువ సమయం పడుతుంది. వచ్చ ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లొచ్చు. అంతా సిద్ధమైతే షూటింగ్కు ఎక్కువ సమయం పట్టదు’ అని సౌరవ్ వెల్లడించాడు. భారత క్రికెట్ గతిని మార్చిన ‘దాదా’ బయోపిక్లో బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు నటిస్తున్నాడు. -
‘గులాబీ’ గుబాళిస్తుంది!
పింక్ బంతిపై గంగూలీ నమ్మకం కోల్కతా: క్రికెట్లో గులాబీ బంతుల వినియోగాన్ని కొత్త ఆకర్షణగా భావించాలని, ఈ ప్రయోగం మన దేశంలో కూడా విజయవంతమవుతుందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయ పడ్డారు. భారత్లో పింక్ బంతిని ఉపయోగిస్తూ తొలి డే అండ్ నైట్ మ్యాచ్ రేపటినుంచి ఈడెన్గార్డెన్స్లో నాలుగు రోజుల పాటు జరగనుంది. భవానీపూర్ క్లబ్, మోహన్ బగాన్ జట్ల మధ్య ఈ ‘క్యాబ్’ సూపర్ లీగ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. మ్యాచ్ కోసం పింక్ కూకాబుర్రా బంతిని వాడనున్నారు. మరో వైపు భారత టాప్ స్పిన్నర్ అశ్విన్కు ఈ బంతినిచ్చి అది ఎలా టర్న్ అవుతుందో పరీక్షించాలని వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. ఈ నాలుగు రోజుల మ్యాచ్ మధ్యాహ్నం 2.30నుంచి రాత్రి 9 వరకు స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కూడా కానుంది.