breaking news
empty reservoirs
-
సింగూరు ఖాళీ చేసి.. మరమ్మతులు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలకు సాగు, తాగునీటిని సరఫరా చేసే కీలకమైన సింగూరు జలాశయాన్ని పూర్తిగా ఖాళీ చేసి, మరమ్మతులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ జలాశయానికి మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా జలాశయం తెగిపోయి దిగువ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశముందని ఇటీవల డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్ఆర్పీ) తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం మరమ్మతులకు ఉపక్రమించింది. డీఎస్ఆర్పీ గత మార్చి 23న సింగూరు జలాశయాన్ని సందర్శించి, దాని నిర్వహణలో లోపాల పట్ల తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేసింది. జలాశయాన్ని పూర్తిగా (క్రెస్ట్ లెవల్కి) ఖాళీ చేసే పనుల పర్యవేక్షణకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా.. నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) నేతృత్వంలో ఏడుగురు అధికారులతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ గత శనివారం మెమో జారీ చేశారు.జలాశయాన్ని ఖాళీ చేస్తే హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు తాగునీటి సరఫరాపై ఏర్పడే ప్రభావం, ప్రత్యామ్నాయ వనరులపై అధ్యయనం జరిపి వారంలోగా ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. కమిటీ నివేదిక అందిన తర్వాత జలాశయాన్ని ఖాళీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. జలాశయాన్ని ఖాళీ చేస్తే దాని కింద ఉన్న 40 వేల ఎకరాల ఆయకట్టుకు వచ్చే యాసంగిలో క్రాప్ హాలీడే ప్రకటించనున్నారు. డిసెంబర్లో పనులు ప్రారంభించి, 2026 జూలై నాటికి పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది.పనులు పూర్తికాకుంటే ఆ తర్వాతి వానా కాలం సీజన్లో సైతం పంటలకు క్రాప్హాలీడే ప్రకటించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ నివేదించింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు గ్రామంలో 29.91 టీఎంసీల సామర్థ్యంతో 1976లో సింగూరు జలాశయం నిర్మాణాన్ని ప్రారంభించగా, 1980లో పూర్తయింది.డ్యామ్ సేఫ్టీ హెచ్చరికలను విస్మరిస్తే విపత్తే..సింగూరు జలాశయం తీవ్ర ముప్పు ఎదుర్కొంటోందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చేసిన హెచ్చరికలను విస్మరిస్తే తీవ్ర విపత్తు చోటుచేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపా రుదల శాఖ నివేదించింది. ప్రభుత్వం సకాలంలో అనుమ తిస్తే డిసెంబర్లో పనులు ప్రారంభించి వచ్చే ఏడాది జూలై లో పూర్తి చేస్తామని తెలియజేసింది. అవసరమైతే ఇంకో సీజ న్ పనులు చేసుకుంటామని తెలిపింది.జలాశయం దీర్ఘ కాలిక భద్రతకు మరమ్మతులు నిర్వహించకతప్పదని స్పష్టం చేసింది. ‘సింగూరు జలాశయానికి ఎగువ మట్టి కట్టల (అప్ స్ట్రీమ్ ఎర్త్ డ్యామ్)కు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివి ట్మెంట్తో పాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమ య్యా యి. చాలా చోట్లలో అప్స్ట్రీమ్ స్లోప్కి రక్షణగా ఉండే రివిట్మెంట్ దెబ్బతిన్నది. ఒరిజినల్ డిజైన్ల ప్రకారం జలాశయంలో నిల్వలు 517.8 మీటర్లకి మించకుండా నిర్వ హించాలి. కానీ దీనికి విరుద్ధంగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను నిర్వహించాలని 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 885 జారీ చేసింది.ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి నిరంతరంగా 522 మీటర్ల మేర నిల్వలను కొనసాగిస్తుండటంతో జలాశయం తీవ్రంగా దెబ్బతిన్నది. అప్స్ట్రీమ్ రివి ట్మెంట్కు మరమ్మతులు నిర్వహించి, పూర్వస్థితికి పునరు ద్ధరించకపోవడంతో జలాశయం కట్టలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. అత్యవసరంగా రివిట్మెంట్కి మరమ్మతులు నిర్వ హించి, పునరుద్ధరించకపోతే ఏక్షణంలోనైనా మట్టి కట్టలకు గండిపడి లోతట్టు ప్రాంతాలను ముంచేసే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తి నష్టంతో పాటు జలాశయానికి తీరని నష్టం జరగనుంది.సింగూరు జలాశయానికి దిగువన ఉన్న మంజీర, నిజాంసాగర్ జలాశయాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న చెక్డ్యామ్లూ తెగిపోయి నష్టం తీవ్రత మరింత పెరుగుతుంది’అని డీఎస్ఆర్పీ తన నివేదికలో పొందుపరిచిన అంశాలను నీటిపారుదల శాఖ సర్కారు దృష్టికి తీసుకెళ్లి జలాశయాన్ని ఖాళీ చేసేందుకు అనుమతి కోరింది.శాశ్వత మరమ్మతులకు రూ.61.5 కోట్లు అవసరం..సింగూరు జలాశయానికి తక్షణ మరమ్మతులకు రూ.16.08 కోట్లు అవసరం కానుండగా, ఖాళీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. డీఎస్ఆర్పీ సిఫారసుల మేరకు శాశ్వత పునరుద్ధరణ పనులు నిర్వహించడానికి రూ.61.5 కోట్ల నిధులు అవసరమని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. -
ఎగువ నిండకుంటే.. దిగువ కన్నీరే!
ఎగువన కర్ణాటకలోని రిజర్వాయర్లన్నీ ఖాళీ అవి నిండితేనే దిగువన జూరాల, శ్రీశైలం, సాగర్లకు నీరు పరిస్థితిని సమీక్షించిన సమీకృత నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ ఖాళీ రిజర్వాయర్లు, ఎల్నినో ప్రభావంపై ఆందోళన తాగునీటి అవసరాలకు 80 టీఎంసీల నిల్వ చేశాకే ఖరీఫ్కు నీరు! ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు తప్పని కటకట? హైదరాబాద్: కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయి. జలకళను కోల్పోయి నిర్జీవంగా మారడం రాష్ట్రాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ నీటి కొరత ఉండటం.. మరోవైపు ఈసారి ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడతాయన్న అంచనాల నేపథ్యంలో రాష్ర్ట వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రాజెక్టులు నిండకుంటే రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఒట్టికుండలుగా మారే ప్రమాదముంది. అదే జరిగితే వాటి కింద ఆయకట్టుకు సకాలంలో నీరివ్వడం గగనమే. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు అవసరాలపై సమీక్షించిన రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ సైతం ఖాళీ రిజర్వాయర్లు, ఎల్నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసింది. తాగునీటి అవసరాలను తీర్చేలా కనీసం 80 టీఎంసీల నీరు వచ్చేంత వరకు ఖరీఫ్కు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోరాదని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. అన్నీ ఖాళీయే.. కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. గోదావరి ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఎక్కడా ఖరీఫ్ సరిగా సాగలేదు. కృష్ణా పరిధిలో నీటి లభ్యత ఉన్నా విద్యుదుత్పత్తికి వినియోగించడంతో నిల్వలు తగ్గాయి. దీంతో మూడు ప్రాజెక్టుల పరిధిలోని మొత్తం నీటి నిల్వ 539.80టీఎంసీలకు గాను 175.25 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 204.59 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ఈసారి మరో 30టీఎంసీలు తగ్గిపోయింది. మరోవైపు ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఈ నేపథ్యంలో జూన్లో వర్షాలు సకాలంలో కురిసినా.. అక్కడి ప్రాజెక్టులు నిండి దిగువన మన ప్రాజెక్టులకు నీరు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. వర్షాలు సరిగా కురవకుంటే దిగువన మనకు మిగిలేది కన్నీరే. ఎల్నినో ఎఫెక్ట్.. ఇప్పటికే రిజర్వాయర్లన్నీ ఖాళీకావడానికి తోడు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం బలంగా ఉండే అవకాశముందన్న హెచ్చరికలు రాష్ట్రాన్ని కలవరపెడుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో నీటి పరిస్థితి, ఖరీఫ్ అవసరాలపై సమీక్షించిన రాష్ట్ర స్థాయి సమీకృత నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ సమావేశం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎల్నినో ప్రభావంతో ఒక్కో చోట భారీగా వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల అసలే పడవని.. అదే జరిగితే ప్రాజెక్టుల్లో నీరు చేరడం గగనమేనని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఖరీఫ్ ఆయకట్టును ముందస్తుగా నిర్ణయించడం సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యమిస్తూ.. ఎస్సారెస్పీలో 15 టీఎంసీలు, శ్రీశైలంలో 15, సాగర్లో 50టీఎంసీల మేర నీటి లభ్యత వచ్చాకే ఖరీఫ్ ప్రణాళికను తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే జరిగితే సాగర్ కింద 6.3లక్షల ఎకరాలు, జూరాల కింద లక్ష, ఎస్సారెస్పీ కింద మరో లక్ష ఎకరాలకు నీటి కటకట తప్పదు.


