ఏకలవ్య శిష్యరికం
ఆధునిక భారతదేశంలో ఏకలవ్యుడు దళిత, గిరిజన హక్కులకు ఆదర్శంగా ప్రత్యేకంగా నిలిచాడు. ఏకలవ్యుని గౌరవార్ధం, కేంద్ర ప్రభుత్వం భారతీయ గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను‘ నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు క్రీడలలో అసాధారణ విజయాలు సాధించిన 19 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులకు, వ్యక్తులకు ఏకలవ్య పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఇది ఇలా ఉండగా హర్యానాలోని గురగ్రామ్ లో ఏకలవ్యునికి అంకితం చేయబడిన ఆలయం ఒకటి ఉంది. ఆ గ్రామంలోని కాండ్సప్రాంతంలో ఆలయాన్ని అక్కడి గ్రామస్తులు అప్పట్లో నిర్మించారు. ఈ ఆలయం వద్దనే ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురువైన ద్రోణాచార్యుడికి సమర్పించినట్లు చారిత్రాత్మక ఆధారం. ఏకలవ్యుడంటే తెలియని వాళ్లు...గురు దక్షిణగా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి ఇచ్చిన విషయం గురించి వినని వారు బహుశా ఉండరేమో.... దీక్ష... పట్టుదల...అంకిత భావం... ఎనలేని గురుభక్తితో కాదు పొమ్మన్నా సరే... ఆ గురువునే మట్టిబొమ్మగా మలుచుకొని ఒక గొప్ప విలువిద్య కారుడుగా మహాభారతంలో పేరుగాంచిన మేటి విలుకాడే ఏకలవ్యుడు....నిషాదుల రాజు హిరణ్యధన్వుని కుమారుడే ఏకలవ్యుడు. కౌరవ పాండవులకు ఆస్థాన గురువైన ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలన్నది ఏకలవ్యుని ఆకాంక్ష. అయితే ఏకలవ్యుని సామర్థ్యాన్ని గమనించిన ద్రోణాచార్యుడు అతనికి తగిన శిక్షణ ఇస్తే అతడు విలువిద్యలో కౌరవ, పాండవ రాకుమారులను మించిపోతాడని, దాంతో తాను భీష్మునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమోననే ఉద్దేశ్యంతో ఏకలవ్యుని తన శిష్యునిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు అందుకు ఏమాత్రం నిరాశపడక గురువుపై ఉన్న అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో ద్రోణాచార్యుని మట్టిబొమ్మను తయారు చేసుకొని స్వీయ శిక్షణతో గొప్ప విలుకాడుగా పేరుగాంచాడు.ఒకసారి ఒక వేట కుక్క ఏకలవ్యుడిని చూసి మొరగడంతో ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరిచి ఉండగానే దానికి ఏమాత్రం హాని కలగకుండా ఏడు బాణాలు వేశాడు. ఎంతో నైపుణ్యంతో వేసిన బాణాలను చూసిన అర్జునుడు నిరాశకు లోనై ద్రోణాచార్యునికి విషయాన్ని తెలిపాడు. అనంతరం ఏకలవ్యుని కలిసిన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుని ఏకాగ్రతను గుర్తించి అభినందిస్తాడు. అయితే తన ప్రియ శిష్యుడైన అర్జునుని మేటి విలుకానిగా తీర్చిదిద్దుతానని తాను అర్జునునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అనే ఉద్దేశ్యంతోనూ, అతను తనను గురువుగా భావించి నేర్చుకున్న విలువిద్యకు తగిన గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలు కోరతాడు, ఏమాత్రం సంకోచించకుండా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి గురువైన ద్రోణాచార్యునికి సమర్పిస్తాడు ఏకలవ్యుడు. గురువుతో ప్రత్యక్ష సంబంధం లేకుండానే ఆ గురువును ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడలలో నడుస్తూ స్వయంగా విద్యను నేర్చుకునే వారిని ఏకలవ్య శిష్యులు అనే నానుడి అలా వచ్చింది. అమృత బిందువులు – ఆలోచన లేని స్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని ఓటమి వీటివల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది.– ‘మన సంబంధం ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులవుతారు. మన విలువలు సుఖ దుఃఖాలతో ముడిపడిన వారంతా ఆత్మ బంధువులవుతారు.– సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శ్రపాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సాయం చేసే స్థాయికి మనం ఎదగాలి.– మనం గెలిస్తే మనవాళ్ళకి మనమేంటో తెలుస్తుంది. మనం ఓడిపోతే మనవాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది.– చిన్నప్పుడు దేన్నయినా పట్టుకుని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నయినా తట్టుకుని నిలబడాలి.→ ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. – సి. ఎన్. మూర్తి సీనియర్ పాత్రికేయులు