breaking news
E.jaganmohan
-
చదువుతోనే సంపూర్ణ అక్షరాస్యత
ఆదిలాబాద్ అర్బన్ : అందరూ చదువుకుంటేనే సంపూర్ణ అక్షరాస్యత సాధించవచ్చని కలెక్టర్ ఎం.జగన్మోహన్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం సాక్షరభారత్, జన్ శిక్షణ సంస్థాన్(ఎన్జీవో) ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా విద్యార్థులు, అధికారులు సాక్షరభారత్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వచ్చారు. కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. వయోజన విద్య ద్వారా, కస్తూరిబా బాలికా విద్యాలయాల ద్వారా డ్రాపౌట్ పిల్లలకు విద్యను అందించుట, సాధారణ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించుట వంటివి చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరిస్తే అక్షరాస్యత సాధనలో మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. చదువుకున్న ప్రతీ ఒక్కరూ చదువు రాని వారికి చదువు చెప్పాలని కోరారు. మహిళల అక్షరాస్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతో ప్రజలందరిలో జాతీయ భావం పెరుగుతుందని అన్నారు. ఆర్డీవో సుధాకర్రెడ్డి, వయోజన విద్య ఉప సంచాలకులు శ్రీనివాస్రెడ్డి, జన శిక్షణ సంస్థాన్ కార్యదర్శి సురేందర్, సభ్యులు రాజేశ్వర్, గంగాధర్, అలీబాన్, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల యజమానులు పాల్గొన్నారు. -
పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఆదిలాబాద్ అర్బన్ : పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న జాతీయ జెండా ఎగురవేస్తారని తెలిపారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ శాఖల అధికారులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా శకటాలు రూపొందించాలన్నారు. శకటాల ఏర్పాట్లను అదనపు జేసీ పర్యవేక్షిస్తారని చెప్పారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని, దీనికి డ్వామా పీడీ ఇన్చార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి కార్యక్రమాలపై మంగళవారం సాయంత్రంలోగా ఒకపేజీకి మించకుండా మంత్రి సందేశం తయారు చేసి పంపాలన్నారు. వివిధ ఆస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, దీనిని సీఈవో స్టెప్ పర్యవేక్షిస్తారని తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను డీపీఆర్వో చూస్తారని చెప్పారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, అదనపు జేసీ రాజు, డీఆర్వో ప్రసాదరావు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, అధికారులు పాల్గొన్నారు.