breaking news
driking water project
-
వేసవికి ముందే ‘చంపా’ ఎడారి..!
సాక్షి, నెల్లిమర్ల: జిల్లాలోనే అతిపెద్ద నది చంపావతి వేసవికి ముందే పూర్తిగా ఎండిపోయింది. ఇంకా వేసవికాలం ప్రారంభం కాకముందే నీరులేక వెలవెలబోతోంది. పలుచోట్ల చుక్కనీరు కూడా లేకుండా ఎడారిని తలపిస్తోంది. దీంతో రానున్న నిండు వేసవిలో నదిలోని భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా కానుంది. జిల్లాలోనే అతిపెద్దదైన చంపావతి నది ఏడు మండలాల్లో ప్రవహిస్తోంది. మెంటాడ మండలం ఆండ్ర కొండల్లో పుట్టిన నది ఆ మండలంతో పాటు గజపతినగరం, బొండపల్లి, గుర్ల, నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ మండలాల గుండా ప్రవహించి చింతపల్లివద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిపై ఆండ్ర రిజర్వాయర్తో పాటు కుమిలి గ్రోయిన్, డెంకాడ ఆనకట్ట తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలోని మండలాలతో పాటు అదనంగా విజయనగరం, నెల్లిమర్ల మున్సిపాలిటీలకు, గరివిడి, భోగాపురం మండలాలకు తాగునీటిని అందించే పథకాలు నదిలోనే ఉన్నాయి. సుమారు 8లక్షల మందికి నదిలోని పథకాలు తాగునీటిని అందిస్తున్నాయి. వేసవిలో అప్పుడప్పుడూ నీటి సరఫరాలో సమస్యలు తలెత్తినా, చాలావరకు ఇబ్బంది ఉండదు. తాగునీటికి ఇబ్బందే.. ఈ ఏడాది మాత్రం వేసవిలో తాగునీటి పథకాలు చాలా వరకు పడకేసే ప్రమాదముంది. ఇంకా వేసవి ప్రారంభం కాకముందే నదిలో నీరు పూర్తిగా ఎండిపోయింది. వాటర్ గ్యాలరీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో తప్ప చాలాచోట్ల నదీగర్భం ఎడారిని తలపిస్తోంది. రానున్న వేసవిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే అవకాశముందని నీటిసరఫరా విభాగం అధికారులు అంటున్నారు. ముఖ్యంగా విజయనగరం పట్టణానికి సరఫరా చేసే రామతీర్థం మంచినీటి పథకంతో పాటు నెల్లిమర్ల మున్సిపాలిటీకి చెందిన పథకాలన్నీ పడకేసే ప్రమాదం పొంచి ఉంది. వరుణుడు కరుణించి అడపాదడపా వర్షాలు కురిస్తేగాని ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు. -
రాజకీయాల్లో అస్పృశ్యులు ఉండరు
నాగ్పూర్: రాజకీయాల్లో ఎవరూ అస్పృశ్యులు కారని కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో, సామాజిక సేవలో ఎవరినీ అస్పృశ్యులుగా చూడొద్దు’ అని అన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సరసన పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్కారీకి చెందిన వివాదాస్పద పూర్తి గ్రూపు కంపెనీ శనివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పవార్ పాల్గొన్నారు. డొల్ల కంపెనీల పెట్టుబడుల వ్యవహారంలో పూర్తి గ్రూపు చిక్కుకోవడం, ఫలితంగా గడ్కారీ బీజేపీ సారథ్యం నుంచి తప్పుకోవడం తెలిసిందే. కాగా తమ కంపెనీ ఎస్సార్ గ్రూప్తో కలసి దేశవ్యాప్తంగా వంద పెట్రోల్ బంకులు ప్రారంభించనున్నట్లు గడ్కారీ తెలిపారు. ఈ బంకుల్లో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ప్రభుత్వ చమురు కంపెనీలు అమ్మే ధరకంటే రూ.2 తక్కువకే అమ్మనున్నట్లు వెల్లడించారు. పూర్తి కంపెనీ చెరకు పిప్పి, జీవ వ్యర్థ్యాలతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది. కాగా, గడ్కారీ చిన్న సాగునీటి ప్రాజెక్టులతో స్వల్పకాలంలోనే సత్ఫలితాలు సాధిస్తున్నారని పవార్ పొగిడారు. పెట్రోల్లో ఇథనాల్ కలిపితే విదేశీ మారక ద్రవ్యాన్ని మిగుల్చుకోవచ్చని, అయితే ప్రభుత్వ చమురు కంపెనీలు మాత్రం ఇందుకు విముఖంగా ఉన్నాయని పవార్, గడ్కారీలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి ప్రఫుల్ పటేల్ కూడా పాల్గొన్నారు.