-
అమృత కాలంలో ఇదేనా వ్యవసాయం?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రూపొందించినట్లున్నా... వ్యవసాయానికి మాత్రం అన్యాయం జరిగింది. ఒకపక్క 2022–23 ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరం అని పేర్కొన్నా... బడ్జెట్లో మాత్రం పాత కేటాయింపుల కన్నా తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం. ఈ రంగానికి 2022–23లో రూ. 1.24 లక్షల కోట్లు కేటాయించగా... 2023–24కు గానూ రూ. 1.15 లక్షల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రైతు సగటు ఆదాయం దారుణంగా రూ.7 వేలకు మిం^è డం లేదు. కానీ వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగు తోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ ప్రస్తావించలేదు. భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలూ, పెరుగుతున్న పంట ఖర్చులూ వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమనీ జనవరి 31న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. ఇదే ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2020–21లో వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతానికి పెరిగాయి. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2021–22లో రూ. 18.6 లక్షల కోట్లకు పెరిగాయి. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్థిరమైన పెరుగుదల వల్ల 2021–22 లో 315.7 మిలియన్ టన్నులకు ఉత్పత్తి చేరింది. 2021–22 నాలుగో ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి ఏటేటా పెరుగుతోంది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గత ఐదేళ్లలో సగటున 23.8 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉంది. మారుతున్న వాతావరణం... వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపు తోందని చెప్పిన నివేదిక ఆహార ఉత్పత్తి పెరిగిందనీ చెబుతోంది. కానీ రైతుల పరిస్థితి మీద అంచనా మాత్రం వేయలేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. రైతు సగటు ఆదాయం చాలా దారుణంగా రూ.7 వేలు మించని వైనం ప్రస్తావించలేదు. వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని ఆర్థిక సర్వే చెప్పినా, బడ్జెట్లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులను తగ్గించారు. 2022–23లో రూ. 1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24కి వచ్చేటప్పటికి రూ. 1,15,531.79 కోట్లకు తగ్గించారు. పశుగణాభివృద్ధికీ, మత్స్య రంగానికీ కలిపి రూ. 6,576.62 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం ఈ రంగాలకు ఇచ్చింది రూ. 5,956.70 కోట్లు. వ్యవసాయ పరిశో ధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. గతేడాది ఇచ్చింది రూ. 8,513.62 కోట్లు. మొత్తం మీద వ్యవసాయ రంగానికి గతేడాది కన్నా రూ. 8,468.21 కోట్లు – దాదాపు 7 శాతం తగ్గించారన్నమాట. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం. ప్రధాన మంత్రి రైతులకు అందిస్తున్న రూ. 2 వేల నగదు సహాయం వల్ల రైతులకు నగదు సమస్య తీరిందనీ, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు వారి రోజువారీ వినియోగం, విద్య, ఆరోగ్యం ఇతర యాదృచ్ఛిక ఖర్చులను తీర్చడానికి సహాయపడిందనీ సర్వే తెలిపింది. ఏడాదికి కేవలం రూ. 2 వేలతో రైతుల సమస్య తీర్చిన ఈ గొప్ప పథకానికి బడ్జెట్లో కేటాయింపులు మాత్రం పెరగలేదు. పైగా తగ్గాయి. మొత్తంగా రూ. 8 వేల కోట్లు తగ్గించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, చేపల పెంపకంపై దృష్టి సారించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (రూ. 20 లక్షల కోట్ల) పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 18 లక్షల కోట్లు. ఇది లక్ష్యం మాత్రమే. రైతులకు బ్యాంకుల నుంచి, సంస్థాగత రుణాలు పలు కారణాల వల్ల అందడం లేదు. ప్రతి ఏటా ప్రకటించే రుణాల లక్ష్యం ఏ మేరకు సఫలం అయ్యిందీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పదు. రూ. 2,200 కోట్ల వ్యయంతో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలకు వ్యాధి రహిత, నాణ్యమైన మొక్కల లభ్యతను పెంచడానికి ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ కొత్త పథకానికి ప్రత్యేక కేటాయింపులు మాత్రం లేవు. కృషి ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ఖర్చు పెట్టవచ్చు. మత్స్యకారులూ, చేపల వ్యాపారులూ... సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికీ, మత్స్య ఉత్పత్తుల సరఫరా సామర్థ్యాలను మెరుగుపరచడానికీ, మార్కెట్ విస్తరించడానికీ ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ కొత్త ఉప పథకాన్ని రూ. 6,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. కాని మత్స్య శాఖ కేటాయింపులు మొత్తం రూ. 2,250 కోట్లు దాటలేదు. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకానికి ఇచ్చిన కేటాయింపు కేవలం రూ. 2,025 కోట్లు మాత్రమే. తరువాత పెంచుతారా అనే విషయంలో స్పష్టత లేదు. వ్యవసాయ రుణాలపై ఉండే 9 శాతం వడ్డీకి, 2 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది రూ. 23 వేల కోట్లు. పోయిన ఏడాది సవరణ ద్వారా ఈ పథకానికి ఇచ్చింది రూ. 22 వేల కోట్లు – పెంచింది కేవలం 4.5 శాతం మాత్రమే. ఈ పథకం ద్వారా ఎంత మంది రైతులు లబ్ధి పొందు తున్నారు? బ్యాంకు రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ ఈ వడ్డీ రాయితీ అందడం లేదు. వడ్డీ రాయితీ నేరుగా రైతులకు కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రుణదాతలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు తమ నిధుల వినియోగంపై వడ్డీ రాయితీ... ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల రీఫైనాన్సింగ్ కోసం నాబార్డ్కు ఇస్తారు. ఇదివరకు, 3 శాతం వడ్డీ రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 3 శాతం ఇచ్చేది. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇవ్వడం లేదు. రైతు మీద వడ్డీ భారం 7 నుంచి 9 వరకు ఉంటుందని మనకు అర్థమవుతోంది. స్పష్టంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయ లేదు. రుణ వ్యవస్థలో చిన్న, సన్నకారు రైతుల సంఖ్యను పెంచడానికీ, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచాలనీ రిజర్వ్ బ్యాంకు నిర్ణయించిందనే ప్రకటన చూశాం. దీనికీ బడ్జెట్ కేటాయింపులకూ సంబంధం లేదు. వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగుతోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కుంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలో, ఇటు కేంద్ర బడ్జెట్లోనూ ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం, వారి సమస్య పరిష్కారానికి తగిన విధంగా స్పందించక పోవడం వ్యవసాయ ఆధారిత సమాజంలో పెను విషాదం. డా. దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
ప్రపంచాన్ని నియంత్రించే వేదిక
దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడుగులు వేస్తున్నది. ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ తమ సభ్యులు ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రపంచంలో జరిగే కార్పొరేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. గత నాలుగు దశాబ్దాలుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల్లో వేలాది మంది అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు,బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు, దేశాధినేతలు, ఆర్థిక, వాణిజ్య మంత్రులు, ధనిక దేశాల విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు. అన్ని ప్రధాన అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా అక్కడికి వెళ్తుంటారు. ఇంతమంది నాయకులు, ప్రముఖులు అక్కడ పోషించే పాత్ర ఏమిటో తెలియదు. ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పరు. ఈ సంవత్సరం కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు దావోస్(స్విట్జర్లాండ్) పోతున్నారు– మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. తెలంగాణా నుంచి దావోస్ ప్రతి సమావేశంలో పాల్గొనే మంత్రి గారు వెళ్తున్నారు. ఈ సమావేశాలు నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక ప్రైవేటు సంస్థ. దీని ఆలోచనలు, వ్యూహాలు తెలుసుకోవడం అవసరం. సాధారణంగా ప్రపంచంలో రెండు పెట్టుబడిదారీ నమూనాలు ఉన్నాయి. మొదటిది: చాలా పాశ్చాత్య సంస్థలు స్వీకరించిన ‘షేర్ హోల్డర్ క్యాపిటలిజం’. దీని ప్రకారం ఒక కార్పొరేషన్ ప్రాథమిక లక్ష్యం దాని లాభాలను గరిష్ఠంగా పెంచడం, తద్వారా వాటాదారు లకు లాభాలు పంచడం. రెండవ నమూనా: ‘స్టేట్ క్యాపిటలిజం’. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వమే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. చైనా, ఇంకా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ తరహ వ్యవస్థ ఇటీవల ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రెండింటికి భిన్నంగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధినేత క్లాస్ శ్వాబ్ ప్రతిపాదించిన మూడవ తరహా ‘స్టేక్ హోల్డర్ పెట్టుబడిదారీ విధానం’లో ప్రైవేట్ కంపెనీలకు సమాజం, పర్యావరణం పట్ల బాధ్యత ఉంటుంది. ఇది ఒక విధంగా మన దేశంలో అమలవుతున్న సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ) లాంటిది. ఇది మంచిదేగా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తున్నది. వైఫల్యం చెందినప్పటికీ ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తూ, ప్రపంచ పరిపాలన మీద దృష్టి పెడుతున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ సమస్యలో అయినా ‘డబ్ల్యూఈఎఫ్’ సభ్యులు తమ ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ ఆలోచనలతో క్లాస్ శ్వాబ్ రాసిన పుస్తకం: ‘ది గ్రేట్ రీసెట్’. దీనిలో భాగస్వామ్య పెట్టుబడిదారీ విధానంతో పాటు తనదైన మార్క్సిజం బ్రాండ్తో ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్మించాలని పిలుపు ఇచ్చాడు. దశాబ్దాలుగా ఒక క్లబ్ మీటింగ్ తరహాలో ఇక్కడ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. నయా ఉదారవాదం పునాదిగా కార్పొరేట్ వాణిజ్య ఒప్పందాల వ్యాప్తి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేయడం ఇక్కడి ప్రక్రియలో భాగం. ప్రపంచ వాణిజ్య మార్కెట్లకు దన్నుగా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను ప్రోత్సహించడానికి ఈ సమావేశాలను వాడుకుంటున్నారు. వాస్తవానికి, ఈ ఆర్థిక వేదిక ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచీకరణ ద్వారా ఉన్నత వర్గాల, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడ టమే. 1990లో నెల్సన్ మండేలా జైలు నుండి విడుదలైనప్పుడు గనులు, బ్యాంకులు, గుత్తాధిపత్య పరిశ్రమలను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయం చేస్తుందని ప్రకటించారు. కాగా, అధ్యక్షుడైన వెంటనే 1992 జనవరిలో ‘డబ్ల్యూఈఎఫ్’ సమావేశాలకు హాజరై తన అభిప్రాయాలను మార్చుకుని ‘పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ’ను స్వీకరించారు. చైనా, వియత్నాం, కంబోడియా వంటి కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటే తమ దేశానికి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాయి. 1997లో అమెరికా రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ ‘దావోస్ మగవాడు’ (దావోస్ మ్యాన్) అనే పదాన్ని సృష్టించారు. ‘దేశ సరిహద్దులను కనుమరుగవుతున్న అవరోధాలుగా, జాతీయ ప్రభు త్వాలను గతానికి అవశేషాలుగా చూస్తూ– అటువంటి ప్రభుత్వాలకు ఉండే ఏకైక ఉపయోగకరమైన పని ఉన్నత వర్గాల పుడమి స్థాయి కార్యకలాపాలను సులభతరం చేయడమే అని నమ్మేవారు’ అంటూ ఈ పదాన్ని ఆయన విశ్లేషించారు. ఏటా దావోస్ సమావేశాలకు హాజరయ్యేవాళ్ళు తమ పరపతి, వనరులు పెంచుకోవడానికీ, ఇతరులతో కలిసి తమ ఆధిపత్యానికి అడ్డంకులు తొలగించుకోవడానికీ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. ఒకానొక సమావేశంలో, బోరిస్ బెరెజోవ్స్కీ నేతృత్వంలోని ఏడుగురు రష్యన్ నేతలు బోరిస్ యెల్ట్సిన్ తిరిగి ఎన్నిక కావడానికి నిధులు సమకూర్చాలనీ, ‘తమ దేశ భవిష్యత్తును పునర్నిర్మించడానికి’ కలిసి పనిచేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈ కూటమి అనుకున్నది సాధించింది. ఇది వారందరినీ ఇంకా ధనవంతులను చేసింది. 2009 సంవత్సరంలో అంతర్జాతీయ బ్యాంకులు, ప్రపంచ ఆర్థిక సంస్థలపై ప్రజలకు విశ్వాసం తగ్గినప్పటికీ, ప్రైవేటు ఆర్థిక సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడి దావోస్ పని చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫౌండేషన్ బోర్డు (దాని అత్యున్నత పాలక సంస్థ)లో ప్రపంచ కుబేరులు ఉన్నారు. 2002లో ఏర్పాటైన మరొక పాలక మండలి ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్’ను 100 మంది ప్రముఖులతో ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక సలహాలు ఇస్తూ, వార్షిక సమావేశ ఎజెండా తయారీకి ఈ మండలి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. 2015 నాటికి ‘డబ్ల్యూఈఎఫ్’ వార్షిక వ్యూహాత్మక భాగస్వామి హోదా పొందాలంటే దాదాపు 7 లక్షల డాలర్ల రుసుము కట్టాలి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామి సభ్యులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్క్లేస్, బ్లాక్ రాక్, బీపీ, చెవ్రాన్, సిటీ, కోకాకోలా, క్రెడిట్ సూయిజ్, డ్యూష్ బ్యాంక్, డౌ కెమికల్, ఫేస్బుక్, జీఈ, గోల్డ్మాన్ శాక్స్, గూగుల్, హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్ ఛేజ్, మోర్గాన్ స్టాన్లీ, పెప్సికో, సీమెన్స్, టోటల్, యూబీఎస్ లాంటి సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలో జరిగే కార్పొరేట్, ఆర్థిక శక్తి ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ప్రతిఘటన ఉద్యమాల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ఆసక్తి చూపిస్తున్నది. 1999లో ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసనల నేపథ్యంలో ఈ ఆసక్తి స్పష్టమైంది. అప్పటి నిరసనల వల్ల సియాటెల్ నగరంలో కీలక వాణిజ్య చర్చలకు అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనలను పెరుగుతున్న ‘ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం’గా ‘డబ్ల్యూఈఎఫ్’ అభివర్ణించింది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో, లేదా నిరంకుశంగా అణిచివేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. 2001 జనవరిలో దావోస్ సమావేశాలకు అంతరాయం కలగకుండా అసాధారణ భద్రతా చర్యలు తీసుకున్నారు. దావోస్ పట్టణం చుట్టూ కాంక్రీట్ బ్లాక్లు అమర్చి, కంచెకు అవతలి వైపునే వేలాది పోలీసులు నిరసనకారులను నిలువరించారు. అదే సమయంలో, దావోస్కు ప్రతి వేదికగా బ్రెజిల్లోని పోర్టో అలెగ్రేలో ఏర్పడిన వరల్డ్ సోషల్ ఫోరమ్ కాలక్రమేణా బలహీనపడగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ బలపడింది. అన్ని దేశాల ఒప్పందం మేరకు ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవలి సంవత్సరాలలో బలహీనపడగా, ఒక ప్రైవేటు సంస్థ అయిన ‘డబ్ల్యూఈఎఫ్’ బలపడుతున్నది. తన దగ్గర ఉన్న కోట్లాది సొమ్ముతో అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. కరోనా మహమ్మారి గురించిన వివిధ దేశాల ప్రభుత్వాల స్పందనను, విధానాలను శాసించే స్థితికి కూడా ఈ సంస్థ చేరిందని వ్యాఖ్యానించేవారూ ఉన్నారు. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
ప్రకృతిపై ప్రభుత్వానికి పట్టింపు లేదా?
హైదరాబాద్ జీవనంలో అతి ముఖ్యమైన నీటి వనరుల నిర్వహణలో ఆధునిక ప్రభుత్వాలు తలా తోక లేని విధానాలతో భవిష్యత్తుని అగమ్య గోచరం చేస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇప్పుడు హుస్సేన్ సాగర్ దుఃస్థితి దిశగా పయనిస్తు న్నాయి. ప్రకృతితో కూడిన ప్రజా సంక్షేమ పాలన చేయకుండా ప్రకృతి వనరులను కైంకర్యం చేసుకుని, వ్యక్తిగత సంపద సృష్టించుకుంటున్నారు. జీవో 111 రద్దు చెరువులే అస్తిత్వంగా కలిగిన తెలంగాణా సంస్కృతి మీద దాడి. గొలుసు కట్టు చెరువుల ద్వారా తక్కువ ఖర్చుతో దాహార్తిని తీర్చే అవకాశం ఉండగా, ఈ వ్యవస్థను నాశనం చేస్తూ, గోదావరి నుంచి నీళ్ళు తెస్తున్నాం అనే కలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది. 1985కి పూర్వం చెరువులు, కుంటలు నగర నివాసితుల నీటి అవసరాలను తీర్చేవి. 400 యేండ్ల క్రితం తవ్విన హుస్సేనసాగర్ చెరువు ఒక 30 ఏళ్ళ కాలంలో క్రమంగా విషపూరితం అయిపొయింది. 1990 తరువాత అసలు ఆ నీటిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందూ, తరువాతా కూడా ప్రభుత్వాలు ఈ చెరువు పరిస్థి తిని మెరుగుపరచడంలో విఫలం అయ్యాయి. తాగు నీటికి కాకున్నా ఇతర అవసరాలకు వినియోగించే స్థాయికి కూడా తీసుకురాలేక పోవడం సాంకేతిక పరిమితులతో పాటు పరిపాలనా లోపం స్పష్టంగా కనపడుతున్నది. నగరం నడి బొడ్డున కాలుష్య జలాలతో నిండి ఉన్న చెరువుతో జీవించక తప్పని దుస్థితి తెలంగాణా ప్రజలకు వచ్చింది. ప్రకృతి వనరుల నాశనం వల్ల విపరీతంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. 1908లో మూసి నదికి వరదలు వచ్చి హైదరాబాద్ అతలా కుతలం అయ్యింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరదలను నివారించటానికి అప్పటి నిజాం ప్రభుత్వం మూసీ నది ఏర్పడక ముందు ఉన్న రెండు పాయల మీద రెండు చెరువులను నిర్మించింది. మూíసీ నది మీద నిర్మించిన ఉస్మాన్ సాగర్ చెరువు 1920లో పూర్తయింది. ఇది తరువాత గండిపేట్గా ప్రసిద్ధి చెందింది. పైన అనంతగిరి గుట్టల నుంచి జాలువారే ఈ నీళ్ళు గండిపేట్ నీళ్ళుగా ప్రాచుర్యం పొందాయి. ఇవి రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచివి అని నానుడి ఏర్పడింది. ప్రత్యేకంగా, తమ ప్రాంతంలో కలుషిత నీటితో సతమతమయ్యే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ నీటి ప్రాశస్త్యాన్ని గుర్తించారు. వలసలు ఈ ప్రాంతానికి ఆ కారణంగా కూడా జరిగి నాయి. ఈసా నది మీద కట్టిన హిమాయత్ సాగర్ చెరువు 1927లో పూర్తయింది. ఈ రెండు చెరువులు కట్టిన ప్రాథమిక ఉద్దేశం హైదరాబాద్ నగరాన్ని వరద నుంచి కాపాడటానికే. మంచి నీటిని అందించటం కూడా ఈ ప్రణాళికలో భాగమే. ఈ చెరువులు కలుషితం కాకుండా వీటి పరివాహక ప్రాంతంలో అప్పట్లోనే నిజాం ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. వీటి పరివాహక ప్రాంతంలో ఉన్న ఊర్లకు ఇవి వర్తింప జేశారు. అయితే ఆ పరిమితుల మీదా, వాటి ప్రభావం మీదా పూర్తి స్థాయి సమాచారం ఎక్కడా చరిత్రలో కనపడదు. హుస్సేన్ సాగర్ కలుషితం అయిన నేపథ్యంలో, ఈ జంట జలాశయాలు కూడా కలుషితం కావద్దనే ఉద్దేశంతో 1989లో ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది (జీవో 50. జనవరి 28. 1989). ఈ ఉత్తర్వు, ఈ జంట జలాశయాల నీటి పరివాహక ప్రాంతం మొత్తాన్నీ పరిరక్షించాలని నిర్దేశించింది. ప్రస్తుతం, ఈ ఉత్తర్వు పూర్తి ప్రతి అందుబాటులో లేదు. కానీ, దాని ప్రస్తావన తదుపరి ఉత్తర్వులలో ఉంది. దీనిలో ఉన్న అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో 1993లో ఒక సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన మొదటి నివేదిక ఆధారంగా 1994లో ఈ చెరువుల పరిరక్షణకూ, నీటి నాణ్యత రక్షణకూ ఇంకొక ఉత్తర్వు జారీ అయ్యింది (జీవో 192. మార్చ్ 31, 1994). ఈ కమిటీ ఇచ్చిన రెండవ నివేదిక ఆధారంగా 1996 మార్చ్ 8న ఇంకో కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అది 111 జీవోగా ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్తర్వులో పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాలలో కొత్త నిర్మాణాల మీద పరిమితులు విధించారు. పరిశ్రమల ఏర్పాటుని పూర్తిగా నిషేధించారు. వాణిజ్య భవనాల నిర్మాణం వద్దన్నారు. ఇండ్ల నిర్మాణం మీద, కొత్త లేఅవుట్ల మీద ఆంక్షలు పెట్టారు. మంచి నీటి చెరువులకు చేటు తెచ్చే కాలుష్య కార్యకలాపాలు నిర్దేశించే విధంగా ఈ ఉత్తర్వులు రూపొందించారు. ఈ ఉత్తర్వు ఒక విధంగా 314 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ వంటిది. కొంత జోన్ల గురించి ప్రస్తావన ఉన్నా, పూర్తిగా జోనల్ విధానం లేదు. గ్రామకంఠంలో ఆంక్షలు లేవు. కాకపోతే, అంతస్తుల మీద పరిమితులు ఉన్నాయి. ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’ కూడా నిర్వ చించారు. ఈ ఉత్తర్వు జారీ చేసిన రెండు నెలలలోనే ప్రభుత్వమే ఉల్లంఘనలకు నాంది పలికింది. ఒక పరిశోధన ల్యాబ్కు అనుమతిచ్చారు. అప్పట్లో ఇది ఎవరికీ తెలవదు. ఆ సంస్థ భవన నిర్మాణం 2002లో హిమాయత్ నగర్ గ్రామం దగ్గర మొదలు పెడితే తెలిసింది. ఇంకొక ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చారు. దాని మీద సుప్రీం కోర్టులో హోరాహోరీ పోరాటం జరిగింది. ఆఖరున సుప్రీం కోర్టు అన్ని కాలుష్య కార్యకలాపాలు నిలిపి వేయాల్సిందే అని 2000 సంవత్సరంలో తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ విమానాశ్రయం కూడా ఈ ఉత్తర్వు పరిధిలోకి వస్తుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ప్రభుత్వం ధారాదత్తం చేస్తే, అందులో 2 వేల ఎకరాలు 111 జీవో పరిధిలోకి వస్తుంది అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో వ్యాజ్యం వేస్తే, అనేక వాదనల తరువాత ఈ వ్యాజ్యం కొట్టివేశారు. అంతకు ముందే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవెలప్మెంట్ అథారిటీ పేరిట ఆ ప్రాంతంలో జోనల్ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ అథారిటీ పరిధిలో దాదాపు 1,700 ఎకరాలను బయో కన్జర్వేషన్ జోన్గా గుర్తించి (జీవో 111 పరిధిలో) నిర్మాణాల మీద పరిమితులు విధించారు. అయినా ఈ రెండు చెరువుల పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఆగలేదు. 2007లో ఈ విషయమై సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు అయ్యింది. అంతకుముందే 2005లో (జీవో 952. నవంబర్ 25, 2005) ప్రభుత్వం ‘ఈపీటీఆర్ఐ’, ‘ఏపీïపీసీబీ’లతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రెండు చెరువుల కట్ట దాటి కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ఆ మేరకు చెరువుల కట్ట కింద పారే మంచి నీటి కాలువలను సంరక్షించాలని ఇంకా కొన్ని అదనపు ఆంక్షలు చేరాయి. దాంతో ఇంకొక 86 గ్రామాలు దీని పరిధిలోకి వచ్చాయి. జీవో 111 కొనసాగించాలని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. 2015లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎదుట జీవో 111ను సవాలు చేస్తూ, అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నయంటూ వ్యాజ్యాలు వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వం 2016లో (జీవో 839. డిసెంబర్ 7, 2016) ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ఈ కమిటీ నిర్ణయం మేరకు తమ వాదన, నిర్ణయం ఉంటుందని కోర్టుకు తెలిపింది. కాగా ఆ కమిటీ 2019 వరకు నివేదిక ఇవ్వకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవటంతో ఎన్జీటీ 111 జీవో కొనసాగింపు ఉంటుందని తీర్పు ఇచ్చింది. ధనికులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ఇక్కడ వందల ఎకరాలు కొనుక్కుని ఫార్మ్హౌస్లు కట్టుకుని, నిర్మాణాల మీద ఉన్న ఆంక్షలను తుంగలో తొక్కారు. వీరిని నియంత్రించని ప్రభుత్వం చిన్న చితక కుటుంబాల మీద తన ప్రతాపం ఇప్పటికీ చూపెడుతోంది. వారి నిర్మాణాలకు ఎటువంటి ఆంక్ష లేకున్నా వారిని ఇబ్బంది పాలు జేస్తూ, పలుకుబడి ఉన్నవారు ఏమి చేసినా పట్టించుకోకపోవటం అలవా టైంది. ఈ విషయంగా జీవో 111 పట్ల అపోహలు పెంచారు. దీన్ని చూపెట్టి చిన్న, సన్నకారు రైతుల నుంచి భూమి బదలాయింపు చేసుకోవడం, అసైన్డ్ భూములను కబ్జా చేసుకోవడం మొదలైంది. ప్రశ్నించిన వారికి 111 బూచి చూపెట్టడంతో దాని పట్ల వ్యతిరేకత వచ్చింది. మీడియాలో కూడా అసందర్భ వ్యాఖ్యలతో అది ఇంకా పెరిగింది. తెరాస అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 చేవెళ్ళ ఎన్నికల బహిరంగ సభలో 111 జీవో ఎత్తివేతకు హామీ ఇస్తూ, ఎకరాకు రూ.20 లక్షల ధర కూడా ఇప్పిస్తానని ఒక విచిత్రమైన వాగ్దానం చేయడం ఆశ్చర్యపరిచింది. తరువాత కూడా చేవెళ్ళ, ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా దాన్ని ఎత్తివేస్తామని ప్రకటన చేస్తూనే ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఈ జీవో పట్ల వ్యతిరేక భావం పెంచి పోషిస్తున్న పరిస్థితి! 2022 మార్చి శాసనసభ బడ్జెట్ సమావేశాలలో చివరిరోజు ముఖ్యమంత్రి ఈ రెండు చెరువుల కాలం చెల్లిపోయింది కాబట్టి జీవో 111 ఎత్తివేస్తామని ప్రకటించారు. అయితే ఈ 111 ఎత్తివేత వల్ల 1,32,600 ఎకరాల ఆంక్షలు తొలిగిపోయి మార్కెట్లోకి వస్తాయి; దాని వలన రియల్ ఎస్టేట్ పరిస్థితి గందరగోళంగా మారు తుంది కాబట్టి ఒక నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. తదుపరి, ఈ హామీని కూడా తుంగలో తొక్కుతూ ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ సమావేశంలో జీవో 111 ఎత్తివేతకు తీర్మానం ఆమోదం పొందింది అని ముఖ్యమంత్రి పత్రికా సమావేశంలో ప్రకటించారు. నిపుణుల కమిటీ వేయకుండా, కమిటీ నివేదిక లేకుండానే తెలంగాణా మంత్రివర్గం జీవో ఎత్తివేతకు ఆమోదం తెలపడం విస్మయం కలిగించింది. అంత తొందరపాటు దేనికోసం అనే ప్రశ్న వచ్చింది. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన తరువాత చాలామంది నిపుణుల కమిటీ మీద ఆశలు పెట్టుకున్నారు. నిపుణుల కమిటీ ప్రజలతో సంప్రదింపులు చేయాలనీ డిమాండ్ చేశారు. ఆ ఆశలను తుంచివేస్తూ ఆకస్మికంగా ఏప్రిల్ 19న 111 జీవోను రద్దు చేస్తూ, 69 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దీని మీద ఉన్న తేదీ మాత్రం ఏప్రిల్ 12ది. వారం రోజుల ముందు జీవో వచ్చింది; లేదా, జీవోకి బ్యాక్ డేట్ ఇచ్చారు. కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నేపథ్యంలో ఈ వారం రోజుల ఆలస్యం అనుమానాలను రేకెత్తిస్తుంది. గందరగోళం ఏర్పడుతుంది అని స్వయంగా ముఖ్యమంత్రి జాగ్రత్త చెప్పి, నిపుణుల కమిటీ లేకుండా, శాస్త్రీయ నివేదిక మంత్రిమండలి ముందు పెట్టకుండా, వారం రోజులు ఆలస్యంగా ప్రజల ముందుకు కొత్త జీవో తేవడం వంటి చర్యల వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడింది. విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. తెలంగాణా రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమంలో అనేక అన్యా యాల ప్రస్తావన వచ్చింది. అందులో ఒకటి: హైదరాబాద్ నగరంలో స్థానికుల, మూలవాసుల నుంచి వలసదారులు ఏ విధంగా ప్రభు త్వాలను, అధికారులను అడ్డు పెట్టుకుని దోచుకున్నారనేది. తెలం గాణా రాష్ట్రంలో చెరువులను కాపాడుకోవాలనీ, హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెలంగాణా మూలవాసుల భాగస్వామ్యం పెంచాలనీ, తెలంగాణా భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకోవాలనీ ఆనాటి ఉద్యమం ఆకాంక్షించింది. తెలంగాణ అస్తిత్వం చెరువుల చుట్టూ ఉంది; ఇంకుడు గుంతలు కాదు, చెరువుల మీద ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఆధునిక అభివృద్ధి పేరిట జరుగుతున్న వనరుల దోపిడీని ప్రశ్నించడం మలి దశ తెలంగాణా ఉద్యమం కంటే ముందే పుట్టింది. జీవో 111 రద్దును తెలంగాణా సంçస్కృతి మీద దాడిగా భావించవచ్చు. తెలంగాణకు నీటి నిర్వహణలో ఎవరూ పాఠాలు చెప్పే పని లేదు. గొలుసు కట్టు చెరువుల ద్వారా హైదరాబాద్ వంటి మహా నగర దాహార్తిని తక్కువ ఖర్చుతో తీర్చే అవకాశం ఉండగా, తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవస్థను నాశనం చేస్తూ, గోదావరి నుంచి నీళ్ళు తెస్తున్నాం అనే కలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది. ఈ విపరీత అప్రజాస్వామిక, ప్రకృతి వ్యతిరేక చర్య వల్ల తెలంగాణా సాంస్కృతిక వారసత్వ సంపద మీద, భవిష్యత్తు తరాల నీటి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ రెండు చెరువుల వినాశనం తెలంగాణకే చేటు చేస్తుంది. వ్యాసకర్త: డాక్టర్ దొంతి నరసింహారెడ్డి విధాన విశ్లేషకులు -
జీవో 111ను రద్దు వినాశనానికి దారితీస్తుంది: రాజేంద్రసింగ్
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, నేల, నీటి పరిరక్షణ (సాయిల్, వాటర్ కన్జర్వేషన్)కు.. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు దోహదపడుతున్న జీవో 111ను రద్దు చేస్తే అది వినాశనానికి దారితీస్తుందని జల్ బారాదరి చైర్మన్, ‘వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని అధిక భాగం ‘సిమెంట్ కాంక్రీట్ జంగిల్’గా మారిపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 111ను ఎత్తేసి భారీ నిర్మాణాలకు అనుమతినిస్తే జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరిధిలోని ప్రాంతం అంతా బహుళ అంతస్తులు వెలసి.. అక్కడ కొత్తగా మరో పెద్ద కాం క్రీట్ అడవి ఏర్పడి వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. కర్బన ఉద్గారాలు, సిమెంట్ కట్ట డాల వల్ల ‘రేడియేషన్’ పెరిగి ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పచ్చదనానికి, జీవ వైవిధ్యానికి పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందన్నారు. నీటివనరులు, చెరువులు, వాగులు, గుంటలతో కూడిన భూమి ‘టైటిల్’ను ఎవరూ మార్చలేరని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు 2001 జూలై 6న తొలి తీర్పునిచ్చిందని తెలిపారు. ఆ తర్వాత వీటితోముడిపడిన వివిధ కేసులు, వివాదాలపై చెరువులు, వాగుల పరిరక్షణకు ఇప్పటిదాకా దేశ అత్యున్నత న్యాయ స్థానం వందకు పైగా తీర్పులిచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ జీవోను ఎత్తేయడాన్ని కోర్టులు అనుమతించే పరిస్థితి ఉండబోదని సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. పరిరక్షించుకోవాలి... ఒక్క హైదరాబాద్ మహానగరానికే కాకుండా యావత్ భారతావనికి గర్వకారణం, తలమానికంగా నిలుస్తున్న హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించుకోవాలి. పర్యావరణ వ్యవస్థలను కాపాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నగర ప్రజలకు ప్రాణ వాయువును అందించడంలో ఇవి గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ జలాశయాల నీటిని వాడడం లేదంటూ జీవో 111ను ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎంతో ఆందోళనకు గురిచేస్తోంది. ఈ జీవోను రద్దుచేసే యోచనను మానుకుని ఈ జలాశయాల సహజసిద్ధ క్యాచ్మెంట్ ఏరియా పరిరక్షణ ద్వారా సీఎం కేసీఆర్ మొత్తం దేశానికి ‘రోల్మోడల్’గా నిలవాలి. కేసీఆర్ తలుచుకుంటే ఈ 84 గ్రామాల్లోని క్యాచ్ మెంట్ ఏరియాల్లోని ప్రజలను మరోచోటికి తరలించి, ఆ ప్రాంతాన్ని పరిరక్షించవచ్చు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా.. కేసీఆర్ ఆ విధంగా చేయకపోతే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. అయితే జీవోపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన వెంటనే దానిని ఎత్తేస్తామని ప్రకటించడాన్నిబట్టి.. తాను నియమించిన కమిటీ ద్వారా అనుకూల నివేదికను ఇప్పించుకొని ఈ జీవోను ఎత్తేసేందుకే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమౌతోంది. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ ఎకో–సెన్సిటివ్ జోన్ క్యాచ్మెంట్ ఏరియా అయిన ఏడు మండలాలు 84 గ్రామాల్లో 1. 32 లక్షల ఎకరాలను జీవో 111 పరిధిలోకి తీసుకొచ్చారు. దీని కారణంగానే గత పాతికేళ్లలో జంటనగరాల అభివృద్ధి సాధ్యమైంది. హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న ఈ జలాశయాలను కాపాడుకుంటేప్రకృతి, పచ్చదనం, జీవ వైవిధ్యం, పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వారమవుతాం. కేసీఆర్కు లేఖ రాశా...: వందేళ్ల పాటు నీటిని కృత్రిమంగా ఈ చెరువుల్లోకి పంపింగ్ చేసేందుకు అవసరమైన నీరు అందుబాటులో ఉందని కేసీఆర్ చెప్పగలరా? సహజ వనరుల పరిరక్షణ, వాటిని మెరుగపరిచే విషయంలో రాజ్యాంగంలోని 48ఏ ఆర్టికల్కు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున దాని నుంచి తప్పించుకోలేదు. జీవో111ను ఎత్తేయడం సరికాదని, ఆ యత్నాన్ని విరమించుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్కు లేఖ కూడా రాశా. వరదల ముప్పు .. పర్యావరణ హననం హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించేం దుకు, తాగునీటి అవసరాలకు జంట జలాశయాలను నాటి నిజాం పాలకులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేసిన పక్షంలో చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతాయి. విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవంతులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వరదనీరు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లోకి చేరే దారిలేక లోతట్టు ప్రాంతాల వైపు మళ్లుతుంది. అప్పుడు భారీ వరదలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతాయి. మరోవైపు నగర తాగునీటి అవసరాలకు స్వచ్ఛమైన తాగునీరు మృగ్యమౌతుంది. ఇన్ఫ్లో చేరిక భారీగా తగ్గే ప్రమాదం ఉండడంతో సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పడతాయి. భూతాపం పెరుగుతుంది. కాలుష్యం పెరిగి ప్రజలు నివసించే పరిస్థితి ఉండదు. పర్యావరణ హననం జరుగుతుంది. – పర్యావరణవేత్త ప్రొఫెసర్ నర్సింహారెడ్డి -
గ్లైఫోసేట్పై దేశవ్యాప్త నిషేధం అత్యవసరం
గ్లైఫోసేట్.. ఇది కలుపును చంపే విష రసాయనం. దీన్ని చల్లితే కలుపుతో పాటు నేలపై ఉన్న అన్ని రకాల మొక్కలూ చనిపోతాయి. కలుపు తీయాలంటే కూలీలకు ఖర్చు అధికమవుతోందని గ్లైఫోసేట్ మందును చల్లుతున్నారు. కానీ, ఆరోగ్యం చెడిపోతే, చికిత్సకు ఇంకా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది అని రైతులు గ్రహించడంలేదు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా గ్లైఫోసేట్ ఉపయోగం మీద కొంత కాలం పాటు ఆంక్షలు విధిస్తున్నది. సాధారణంగా, పత్తి పంట కాలం అయిన జూన్ నుంచి అక్టోబర్ వరకు గ్లైఫోసేట్ అమ్మకాల మీద ఆంక్షలు పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా ఒకసారి ఆంక్షలు విధించాయి. కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే క్రమం తప్పకుండా 2018 నుంచి ప్రతి ఏటా ఆంక్షలు ప్రకటిస్తున్నది. అయితే, దురదృష్టవశాత్తూ, ఈ ఆంక్షల అమలు మాత్రం ఆశించిన మేరకు లేదు. ప్రతి ఏటా గ్లైఫోసేట్ అమ్మకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. దుకాణాలలో ఈ డబ్బాలు దొరుకుతూనే ఉన్నాయి. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం చట్టవిరుద్ధమైన బీజీ–3 పత్తి విత్తనాలను మన దేశంలో అక్రమంగా ప్రవేశపెట్టారు. కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే వీటి విస్తృతిని నివారించి, బాధ్యులమీద క్రిమినల్ చర్యలు చేపట్టలేదు. గ్లైఫోసేట్ అనేది పరాన్నజీవి వ్యవసాయ రసాయన ఉత్పాదన. జన్యుమార్పిడి విత్తనాల సాంకేతిక పరిజ్ఞానంపై స్వారీ చేస్తుంది. కలుపు రసాయనాలను తట్టుకునే విధంగా జన్యుమార్పిడి చేసిన (హెచ్.టి. బీటీ–3) అక్రమ పత్తి విత్తనాలతోపాటు గ్లైఫోసేట్ అమ్మకాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. పైగా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా చట్ట వ్యతిరేక బీజీ–3 పత్తి విత్తనాల మార్కెట్ 40 శాతానికి పెరిగిందని ఒక అంచనా. కేంద్రం చేతుల్లోనే అధికారం విత్తనాలను మార్కెట్ చేస్తున్న కంపెనీల మీద చర్యలు చేపట్టే ఉద్దేశం లేకపోవడంతో, మధ్యేమార్గంగా గ్లైఫోసేట్ను నియంత్రించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సు చేసింది. ఆ విధంగా గ్లైఫోసేట్ మీద ఆయా రాష్ట్రాల్లో కొద్ది నెలల పాటు ఆంక్షలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా గ్లైఫోసేట్ను నియంత్రించవచ్చు. అది అత్యంత ప్రమాదకారి అనుకుంటే నిషేధించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ‘మీకు అవసరం అనిపిస్తే నియంత్రించండి’ అని రాష్ట్రాలకు చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, పురుగు మందుల నియంత్రణ చట్టం కింద తన కున్న అధికారాలను, బాధ్యతలను నిర్లక్ష్యం చేసింది. పనిచేయని తాత్కాలిక ఆంక్షలు ఎనిమిదేళ్ల్ల క్రితం మన దేశంలో గ్లైఫోసేట్ పెద్దగా ఎవరికీ తెలియదు. చట్టపరంగా అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాల రాకతో దీని అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. వీటి వాడకాన్ని అరికట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వదిలిపెట్టింది. గ్లైఫోసేట్ ఉపయోగం మీద ఏటా కొద్ది నెలలు ఆంక్షలు పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తర్వులు జారీ చేస్తున్నది. కాగా, ఈ వ్యూహం పని చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా పురుగు మందును, పురుగు మందుల నియంత్రణ చట్టం–1968 ఉపయోగించి 60 రోజుల వరకు నిషేధించవచ్చు. పూర్తిగా నిషేధించే అధికారాలు మటుకు లేవు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పూర్తిగా, శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. అయితే, కేరళ, సిక్కిం రాష్ట్రాల మాదిరి కొన్ని అధికరణాల ద్వారా రాష్ట్రాలకు అవకాశం ఉంది. కేరళ రాష్ట్రం ఆ విధంగానే ఇదివరకు ఎండోసల్ఫాన్ మీద చర్యలు చేపట్టింది. గ్లైఫోసేట్ మీద కూడా పూర్తి నిషేధం అక్కడ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇచ్చిన ఉత్తర్వులలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. ప్రతి ఏటా ఆంక్షల తీవ్రతను నీరుగార్చే మార్పులు జరుగుతున్నాయి. పంట ఉన్న ప్రాంతంలో వాడవద్దు (జూన్ – అక్టోబర్ వరకు), పంట లేని ప్రాంతంలో వాడవచ్చు, విస్తరణ అధికారి నుంచి తీసుకున్న పత్రం ప్రకారమే అమ్మాలి, విస్తరణ అధికారులు గ్లైఫోసేట్ ఉపయోగాన్ని అరికట్టాలి.. వంటి ఆచరణ సాధ్యం కాని ఆంక్షలు ఈ ఉత్తర్వుల్లో ఉన్నాయి. ఆచరణాత్మక ప్రణాళికేదీ? తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఒక ఆచరణాత్మక ప్రణాళిక జిల్లాల వారీగా తయారు చేసి ఉండవచ్చు. 2018 ఉత్తర్వులలో పురుగు మందుల విక్రయదారులకు ఇచ్చే లైసెన్స్లో గ్లైఫోసేట్ పదాన్ని తొలగించాలన్నారే గానీ దాన్ని అమలు చేయలేదు. 2019లో ఆ పదాన్నే తీసివేశారు. పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా అనేక సూచనలు ఇచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. మన దేశంలో గ్లైఫోసేట్ ప్రభావంపై అధ్యయనాలు లేవు. అనేక గ్రామాలలో రైతులు పత్తి చేలల్లో గ్లైఫోసేట్ చల్లితే పంటంతా మాడిపోయిన ఉదంతాలు ఉన్నాయి. గ్లైఫోసేట్ వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. దీని ప్రధాన తయారీదారు అయిన బేయర్ కంపెనీ (ఇది వరకు మోన్సాంటో) మీద అమెరికాలో అనేక నష్ట పరిహారం కేసులు వేశారు. దేశవ్యాప్త నిషేధమే మార్గం చట్టవిరుద్ధమైన కలుపు మందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నంత కాలం తాత్కాలిక ఆంక్షలు పని చేయవు. ముందుగా బీజీ–3 విత్తనాల తయారీదారుల మీద, విక్రయదారుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. రైతులు, గ్రామీణుల ఆరోగ్య రక్షణకు, ఆర్థిక, పర్యావరణ కారణాల రీత్యా కూడా గ్లైఫోసేట్ తయారీ, దిగుమతి, ఎగుమతి, వాడకంపై కేంద్రం దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించడం తక్షణ అవసరం. - డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త: ప్రముఖ విధాన విశ్లేషకులు ఈ–మెయిల్: nreddy.donthi20@gmail.com
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement