Domestic retail sector
-
రిటైల్ ఇన్వెస్ట్టర్లు తగ్గేదేలే... ఈక్విటీల్లోకి రూ.39,688 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో కొన్ని నెలలుగా ఈక్విటీలు బేలచూపులు చూస్తుంటే.. దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు ‘తగ్గేదేలే’ అంటూ కొత్త పెట్టుబడులతో పరిణతి చూపుతున్నారు. ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు నిదర్శనంగా ‘సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ (సిప్) రూపంలో జనవరిలోనూ ఈక్విటీ పథకాల్లోకి రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు డిసెంబర్ నెలలో వచ్చిన రూ.26,459 కోట్లతో పోలి్చతే కేవలం రూ.59 కోట్లే తగ్గాయి. ఇక జనవరి నెలలో అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.39,688 కోట్లుగా ఉన్నాయి. 2024 డిసెంబర్ నెలలో వచ్చిన రూ.41,156 కోట్లతో పోల్చి చూస్తే 3.56% తగ్గినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) జనవరి నెల గణాంకాల ను తాజాగా విడుదల చేసింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ డిసెంబర్తో చూస్తే 4% తగ్గి రూ.30.57 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈక్విటీ, డెట్ ఇలా అన్ని రకాల నిర్వహణ ఆస్తుల విలువ జనవరి చివ రికి రూ.67.25 లక్షల కోట్లకు చేరింది. డిసెంబర్ చి వరికి ఈ విలువ రూ.66.93 లక్షల కోట్లుగా ఉంది. దీర్ఘకాల దృక్పథం.. ‘‘మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ సిప్ రూపంలో రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అస్థిరతల్లోనూ పెట్టుబడులు కొనసాగించేందుకు, సంపద సృష్టికి కమ్రశిక్షణతో కూడిన దీర్ఘకాల విధానం అనుసరించే దిశగా ఇన్వెస్టర్లలో అవగాహనకు ఇక ముందూ మా ప్రయత్నాలు కొనసాగుతాయి’’అని యాంఫి సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ ఆస్తుల విలువ రూ.13.12 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఈక్విటీ నిర్వహణ ఆస్తుల్లో సిప్కు సంబంధించే 40 శాతానికి పైగా ఉండడం గమనార్హం. జనవరిలో కొత్తగా 30.7 లక్షల ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) నమోదయ్యాయని, మార్కెట్ దిద్దుబాటు నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ఈక్విటీ నిర్వహణ ఆస్తుల విలువ 4 శాతం తగ్గడానికి మార్కెట్లలో ఆటుపోట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూనియన్ బడ్జెట్ ముందు అప్రమత్తతను కారణాలుగా ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సీఈవో జతిందర్ పాల్ సింగ్ పేర్కొన్నారు.విభాగాల వారీగా.. → సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.9,016 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. డిసెంబర్లో ఇదే విభాగంలోకి రూ.15,331 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → మిడ్క్యాప్ విభాగంలోకి రూ.5,148 కోట్లు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.5,721 కోట్లను ఆకర్షించింది. → అస్థిరతలు కాస్త తక్కువగా ఉండే లార్జ్క్యాప్ విభాగంలోకి పెట్టుబడులు పెరిగాయి. డిసెంబర్లో రూ.2,010 కోట్లు రాగా, జనవరిలో రూ.3,063 కోట్లకు చేరాయి. → ఫ్లెక్సిక్యాప్ ఫండ్స్ సైతం అంత క్రితం నెలతో పోలి్చతే జనవరిలో 20 %అధికంగా రూ.5,697 కోట్లను ఆకర్షించాయి. → డెట్ ఫండ్స్లోకి నికరంగా రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఈ విభాగం నుంచి రూ.1.27 కోట్లను ఉపసంహరించుకున్న ఇన్వెస్టర్లు జనవరిలో మళ్లీ అంతే మేర తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు) ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంత గరిష్ట స్థాయిలో రూ.3,751 కోట్లను ఆకర్షించాయి. ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు స్పష్టమవుతోంది. -
లక్ష కోట్ల డాలర్లకు భారత రిటైల్ రంగం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్లలో భారత్ ఒకటని అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ ప్రెసిడెంట్ డగ్ మెక్మిలన్ చెప్పారు. విశిష్టమైన దేశీ రిటైల్ రంగం .. 2025 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమించగలదని పేర్కొన్నారు. కన్వర్జ్ ః వాల్మార్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్ వైవిధ్యమైనది కావడంతో స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుందని సంస్థ సిబ్బందికి సూచించారు. దేశీ మల్టీ–బ్రాండ్ రిటైల్ రంగంలో నేరుగా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు లేనందున తాము ఇతర విధానాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నామని డగ్ వివరించారు. అమెరికా, చైనాలతో పాటు భారత్ కూడా టాప్ 3 మార్కెట్లలో ఒకటన్నారు. వాల్మార్ట్లో భాగమైన ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్పే మెరుగ్గా రాణిస్తున్నాయని, వీటికి భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారని డగ్ పేర్కొన్నారు. ‘ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం 3,00,000 పైచిలుకు విక్రేతలు ఉండగా, ఫోన్పే యూజర్ల సంఖ్య 30 కోట్ల పైచిలుకు ఉంది. రెండు సంస్థలూ గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. -
ఫ్యూచర్, భారతీ రిటైల్ వ్యాపారాల విలీనం
పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం; విలువ రూ.750 కోట్లు ⇒ రూ.15,000 కోట్ల సంస్థగా ఆవిర్భావం... ⇒ కిశోర్ బియానీ చేతికే పగ్గాలు... న్యూఢిల్లీ: దేశీ రిటైల్ రంగంలో మరో కీలకమైన, భారీ విలీనానికి బాటలు పడ్డాయి. కిశోర్ బియానీ సారథ్యంలోని ఫ్యూచర్ గ్రూప్.. తమ రిటైల్ వ్యాపారాన్ని మొత్తం భారతీ గ్రూప్నకు చెందిన రిటైల్ బిజినెస్తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరగనున్నట్లు ఈ డీల్ విలువ రూ.750 కోట్లుగా అంచనా. అంతేకాదు విలీనం తర్వాత రూ.15,000 కోట్ల విలువైన టర్నోవర్తోపాటు దేశంలోనే అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ సంస్థల్లో ఒకటిగా కూడా ఆవిర్భవించనుంది. మరోపక్క, విలీన సంస్థపై నియంత్రణ అంతా కిశోర్ బియానీకే దక్కనుంది. కాగా, ఆదిత్య బిర్లా గ్రూప్ తమ బ్రాండెడ్ అపారెల్ వ్యాపారాలన్నింటినీ విలీనం చేసి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మర్నాడే ఫ్యూచర్, భారతీ ఒప్పందం వెలువడటం గమనార్హం. డీల్ స్వరూపం ఇదీ... రెండంచెల్లో జరిగే ఈ ఒప్పందం ప్రకారం.. ఫ్యూచర్ గ్రూప్ తమ రిటైల్ వ్యాపారాన్ని విడదీసి భారతీ రిటైల్లో విలీనం చేస్తుంది. అదేవిధంగా భారతీ గ్రూప్ కూడా తమ రిటైల్ ఇన్ఫ్రా బిజినెన్ను విభజించి ఫ్యూచర్ రిటైల్లో కలిపేస్తుంది. ఈ విలీనం ద్వారా రెండు ప్రత్యేక కంపెనీలు(రిటైల్, ఇన్ఫ్రా) ఆవిర్భవిస్తాయని.. వీటి ఉమ్మడి టర్నోవర్ రూ.15,000 కోట్లుగా ఉంటుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిశోర్ బియానీ విలేకరులకు తెలిపారు. రెండు విలీన సంస్థల్లో భారతీ రిటైల్కు 15 శాతం చొప్పున వాటా లభిస్తుంది. ముందుగా రూ.500 కోట్ల విలువైన షేర్లను... కొంతకాలం తర్వాత షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుండే రూ.250 కోట్ల విలువైన ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లు(ఓసీడీ) దక్కుతాయి. డీల్ ప్రకారం ఫ్యూచర్ రిటైల్ వాటాదారులకు ఒక్కో షేరుకి(రూ.2 ముఖవిలువ) భారతీ రిటైల్ నుంచి ఒక షేరు(1:1 నిష్పత్తి) కేటాయిస్తారు. ఇదేవిధంగా ఫ్యూచర్ రిటైల్ కూడా భారతీ రిటైల్ షేర్హోల్డర్లకు రూ.2 ముఖ విలువగల ఫుల్లీ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్లను 1:1 నిష్పత్తిలో జారీ చేస్తుంది. భారతీ రిటైల్ జారీ చేసే షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. ఇక ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లకు రెండు కొత్త సంస్థల్లో 46-47 శాతం చొప్పున వాటా లభిస్తుంది. ఉమ్మడి సంస్థకు మొత్తం 243 నగరాల్లో 570 స్టోర్లు ఉంటాయి. తాము రిటైల్ బిజినెస్ నుంచి వైదొలగడంలేదని.. ఈ వ్యూహాత్మక విలీనం ద్వారా మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే ఇరు కంపెనీల ప్రణాళిక అని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారతీ మిట్టల్ చెప్పారు. ఇరు కంపెనీల వాటాదారులు, కస్టమర్లకు ఈ డీల్తో మరింత ప్రయోజనం లభిస్తుందన్నారు. కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఇతరత్రా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ విలీన ఒప్పందం పూర్తవుతుంది. డీల్ నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ షేరు ధర 12 శాతంపైగా లాభపడి రూ.130 వద్ద స్థిరపడింది. ఒకానొకదశలో 18 శాతం ఎగసి రూ.137 గరిష్టాన్ని కూడా తాకింది. 2021కల్లా 4,000 చిన్న స్టోర్లు: బియానీ ఈ డీల్ తర్వాత కూడా భారతీ ఈజీడే చైన్ స్టోర్లు, తమ బిగ్బజార్ స్టోర్లు యథాతథంగా కార్యకలాపాలను కొనసాగిస్తాయని కిశోర్ బియానీ పేర్కొన్నారు. అయితే, 2021 నాటికి కొత్తగా 4,000 చిన్న స్థాయి రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది తమ ప్రణాళిక అని ఆయన వెల్లడించారు. ఉత్తరాదిలో ఈజీడే పేరుతో, దక్షిణ-పశ్చిమ భారత్లో నీల్గిరీస్, కేబీ బ్రాండ్తో ఈ కొత్త సోర్టు తెరుస్తామని తెలిపారు. వాల్మార్ట్తో క్యాష్ అండ్ క్యారీ వ్యాపార భాగస్వామ్యం నుంచి బయటికొచ్చేశాక.. పూర్తిస్థాయిలో రిటైల్ వ్యాపారం కోసం భారతీ గ్రూప్ అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా(ప్రధానంగా ఉత్తరాదిన) భారతీ రిటైల్ 210 ఈజీడే స్టోర్స్ను నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్ గ్రూప్ కూడా తమ ఫ్యాషన్ రిటైల్ చైన్ ప్యాంటలూన్స్లో మెజారిటీ వాటాను 2012లో ఆదిత్య బిర్లా గ్రూప్నకు విక్రయించిన తర్వాత వ్యాపారాన్ని స్థిరీకరించే పనిలోపడింది. ప్రస్తుతం బిగ్బజార్ పేరుతో హైపర్మార్కెట్లు, ఫుడ్బజార్ బ్రాండ్తో సూపర్మార్కెట్లతోపాటు వివిధ ఇతర రిటైల్ ఫార్మాట్లను ఫ్యూచర్ గ్రూప్ నిర్వహిస్తోంది. భారతీ రిటైల్కు ప్రస్తుతం రుణభారమేమీలేదు. ఇక కొత్తగా ఏర్పడే రిటైల్ సంస్థకు రూ.1,200 కోట్లు, ఇన్ఫ్రా సంస్థకు రూ.3,500 కోట్లు చొప్పున రుణ భారం ఉంటుంది.