breaking news
district rural development department
-
చివరి గింజనూ కొనాల్సిందే
* రైతు వెనుదిరిగితే బాధ్యత మీదే * తేమ శాతం నిబంధన తప్పని సరి * రైతులకు ‘మద్దతు’ ఇవ్వండి * అధికారులను ఆదేశించిన డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి సిద్దిపేట జోన్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతు వెనుదిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని, రైతులు పండించిన పంట దళారుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ (డీఆర్డీఏ పీడీ) సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక స్త్రీ శక్తి భవన్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం వినూత్నంగా వరి తరహాలోనే మొక్కజొన్నకు 3 గ్రేడింగ్లను అమలు చేస్తోందన్నారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయని, నవంబర్ 1 నుంచే స్లాబ్ విధానం ద్వారా 3 గ్రేడింగ్లో రైతు మక్కను కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ -గ్రేడ్కు రూ.1,310, బీ- గ్రేడ్కు రూ. 1,230, సీ- గ్రేడ్కు రూ. 1,180 చెల్లించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం, మక్క గింజలను నిబంధనలకు అనుగుణంగా తేమ శాతాన్ని పరీక్షించాలన్నారు. చెత్త, పొల్లు, తేమ శాతం పేరిట రైతు ధాన్యాన్ని తిరస్కరించ వద్దన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైతు ధాన్యంతో తిరిగి వెనక్కి వెళ్లకుండా స్థానిక కేంద్రాల్లోనే విక్రయించేలా నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అంతకుముందు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్థానిక అధికారులు డీఆర్డీఏ పీడీకి పలు సమస్యలు విన్నవించారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పరీక్షించే మిషన్లు కాలం చెల్లినవిగా ఉన్నాయని, దీంతో తేమ శాతం గుర్తింపు ఇబ్బందిగా మారుతోందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా కొన్ని కేంద్రాల్లో ఏఈఓలు అదనపు బాధ్యతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఒక్కొక్కరికి ఆరు కొనుగోలు కేంద్రాల్లో శాంపిల్స్ పరీక్షించాల్సిన ఉండడంతో కొంత జాప్యం ఏర్పడుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన మార్క్ఫెడ్ డీఎం నాగమల్లిక వెంటనే అలాంటి కేంద్రాల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో తేమ శాతాన్ని పరీక్ష మిషన్లను మార్చుతామన్నారు. ధాన్యం పరీక్ష సమయంలో గింజ పరిమాణం, సైజు, నల్ల మచ్చల పేరిట తిరస్కరించవద్దని, గ్రేడింగ్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆమె సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం ఎంతైనా కొనాల్సిందేనని అందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం పుష్కలంగా విడుదల చేసిందన్నారు. ఈ ఏడు రైతులకు ఆన్లైన్ విధానంలో డబ్బులు చెల్లిస్తున్నందున బిల్లుల చెల్లింపులలో నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఇక సిబ్బంది కొరతపై డీఆర్డీఏ పీడీ స్పందిస్తూ, సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమేనని, స్థానిక సమస్యలను సమయ స్ఫూర్తితో అధిగమించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ఒకే సారి రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకురాకుండా వారిలో అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గోదాంల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖతగా ఉందని, స్థానికంగా ప్రైవేటు గోదాములను జిల్లా అధికారులు పరీశీలిస్తున్నారని త్వరలో నిల్వ సమస్య పరిష్కారం కానుందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించే అధికారులు, ఆయా శాఖల సిబ్బంది సెలవులకు దూరంగా ఉండాలని, ధాన్యం, మక్కలు పెద్ద ఎత్తున వస్తున్న క్రమంలో సిబ్బంది ఓపికతో పని చేయాలని సూచించారు. సమావేశంలో ఏపీడీ వెంకటేశ్వర్లు, డీఎల్సీఓ ప్రసాద్, జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్న ఐకేపీ, డీసీసీబీ, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూనే రైతుకు ప్రభుత్వం మద్ధతు ధర అందేలా సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, మార్క్ఫెడ్ డీఎం నాగమల్లికలు స్పష్టం చేశారు. శనివారం వారు సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్ల కోసం విస్తృతంగా కేంద్రాలను ఏర్పాటు చేసి ఐకేపీ, సహకార సంఘాల ద్వా రా పెద్ద ఎత్తున కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా రైతు ఖాతాలో చేరే విధంగా ఆన్లైన్ విధానాన్ని జిల్లాలో ఇటీవలే మంత్రి హరీష్రావు ప్రారంభిచారన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి దళారుల ప్రమేయం లేకుండా చూస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వరి, మక్క కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించామని, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామన్నారు. మక్కగింజ నిల్వల కోసం గోదాముల్లో అనువైన సాంకేతిక పరికరాలను అమర్చడం జరుగుతుందన్నారు. దీని ద్వారా మక్క గింజల్లో నాణ్యత లోపం ఉన్నప్పటికి నిల్వ పరిమితి కాలం ఎక్కువైన గింజ నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. ఆ దిశగా మార్క్ఫెడ్ శాఖ ప్రత్యేక చర్యలను చేపడుతుందని స్పష్టం చేశారు. సిద్దిపేట డివిజన్ పరిధిలో 69 వరి, 41 మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తుందన్నారు. సమావేశంలో డీఆర్డీఏ ఏపీడీ వెంకటేశ్వర్లు, డీఎల్సీఓ ప్రసాద్ పాల్గొన్నారు. -
నంబర్ 1
సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)కిచ్చే బ్యాంకు లింకేజీ రుణాల్లో జిల్లా సరికొత్త రికార్డు సాధించింది. వార్షిక సంవత్సరం ముగింపునకు మరో రెండు నెలలు గడువున్నప్పటికీ నిర్దేశించిన లక్ష్యాన్ని అప్పుడే అధిగమించింది. జిల్లాలో 2013-14 వార్షిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన రుణ లక్ష్యాన్ని పూర్తిచేసి రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,614 స్వయం సహాయక సంఘాలకు రూ.214.87కోట్ల లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. వార్షిక సంవత్సరం చివరినాటికి మరో రూ. 25 కోట్ల లింకు రుణాలు ఇచ్చేందుకు ఆ శాఖ అధికారులు పరుగులు పెడుతున్నారు. లక్ష్యానికి మించి రుణాలు... జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 9,141 ఎస్హెచ్జీలకు రూ.228.98 కోట్లు ఇచ్చేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 4,999 ఎస్హెచ్జీలకు రూ.119.06 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటివరకు 8,614 సంఘాలకు రూ.214.87 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇందులో 142 సంఘాలకు రూ.5.03కోట్లు రెన్యువల్ కింద మంజూరు చేయగా.. మిగతా రుణాలన్నీ కొత్తగా ఇచ్చినవే. రికవరీల్లో జోష్.. మంజూరులో భేష్.. స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న లింకు రుణాల రికవరీ ఆశాజనకంగా ఉంది. దాదాపు 92శాతం క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నట్లు ఐకేపీ అధికారులు అంతర్గతంగా చేసిన సర్వేలో తేలింది. రివకరీలు క్రమం తప్పకుండా వస్తున్నందునే రుణ మంజూరు ప్రక్రియ వేగిరంగా పూర్తవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వార్షిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో దాదాపు 93శాతం రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు రూ.25కోట్ల రుణాలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. వార్షిక సంవత్సరం ముగిసేనాటికి మరికొన్ని సంఘాలకు కూడా రుణాలు ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.