breaking news
Disability certification
-
ప్రతి దివ్యాంగుడికి విశిష్ట గుర్తింపుకార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రతి దివ్యాంగుడికి విశిష్ట వికలత్వ ధ్రువీకరణకార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి పౌరుడికి ఆధార్కార్డు ఇస్తున్నట్లుగా దేశంలోని దివ్యాంగులకు యూనిక్ డిజెబులిటీ ఐడీ(యూడీఐ) జారీచేస్తోంది. ఈ కార్డుల జారీ నేపథ్యంలో రాష్ట్రంలోని వికలాంగులకు ప్రకత్యేక పరీక్షలు లేకుండా సదరం(వికలత్వ ధ్రువీకరణ) సర్టిఫికెట్లతో వీటిని అనుసంధానం చేయాలని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు ఉన్న వారందరికీ స్వయంచాలిక(ఆటోమెటిక్) పద్ధతిలో వీటిని జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సదరం సర్వర్ను కేంద్ర ప్రభుత్వ పోర్టల్కు అనుసంధానం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకం కోసం సదరం సర్టిఫికెట్లను జారీచేస్తోంది. ఈ ధ్రువీకరణపత్రం ఆధారంగానే పింఛన్లు జారీచేస్తున్నారు. కనీసం 50 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,98,656 మంది సదరం సర్టిఫికెట్లు తీసుకున్నట్లు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది చివరికల్లా నూరు శాతం కార్డులు జారీ యాభై శాతం కంటే తక్కువ వికలత్వం ఉన్నవారికి ఈ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది దివ్యాంగులు ఈ జాబితాలోకి రాలేదని దివ్యాంగుల సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సదరం సర్టిఫికెట్లు పొందిన ప్రతిఒక్కరికీ యూడీఐ కార్డులు జారీ చేయనున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ చెబుతోంది. ఇప్పటికే పలువురికి కార్డులు జారీ చేయగా, ఈ ఏడాది చివరికల్లా నూరు శాతం కార్డులు జారీ చేసేలా ఆ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేస్తున్న యూడీఐ కార్డులను దేశంలో ఎక్కడైనా గుర్తింపుకార్డు కింద పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ కార్డుకు ఆధార్ నంబర్ను కూడా అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం అమలు చేసే పథకాలకు ఈ కార్డులే ప్రామాణికం కానున్నాయి. -
పింఛను పెరుగుతుందనే ఆశతో
ఏలూరు (వన్టౌన్) : వైకల్య ధ్రువీకరణ కోసం జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో గురువారం నిర్వహించిన సదరం శిబిరాలు వికలాంగులు పోటెత్తారు. గతంలో ఈ శిబిరాలకు 100 నుంచి 150 మంది వచ్చేవారు. అయితే ప్రస్తుత టీడీపీ సర్కారు వికలాంగులకు పింఛను రూ.1500కు పెంచుతామని ప్రకటించిన నేపథ్యంలో ఈ శిబిరాలకు కుటుంబ సభ్యులతో కలిసి వేలాదిగా హాజరయ్యారు. అంతేకాకుండా శిబిరాల నిర్వహణలో, ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం కూడా రద్దీకి కారణంగా చెబుతున్నారు. ఇటీవల పింఛన్ల సర్వేలో అనర్హత వేటు పడిన కొందరు ధ్రువీకరణ పత్రాల కోసం శిబిరాలకు తరలివచ్చారు. ఇదిలా ఉండగా, శిబిరాలకు వచ్చిన వికలాంగులను నియంత్రించడం నిర్వాహకులకు కష్టసాధ్యమైంది. ఆయా ఆస్పత్రుల్లో సాధారణ ఓపీ సేవలకు కొంత ఆటంకం ఏర్పడింది. రోగులు నానాయాతన పడ్డారు. నేడు, రేపు మళ్లీ పరీక్షలు భీమవరం అర్బన్ : స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని గురువారం నిర్వహించిన సదరం శిబిరానికి సుమారు 500కు పైగా వికలాంగులు పరీక్షలు నిమిత్తం వచ్చారు. దీంతో అక్కడ స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. సరైన క్యూ విధానం లేకపోవడం, సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో వికలాంగులు అవస్థలు పడ్డారు. 2010 సంవత్సరానికి సంబంధించిన వికలాంగ ధృవీకరణపత్రాలు జారీలో జాప్యం వల్లే రద్దీకి కారణమని అధికారులు చెబుతున్నారు. వీరు కూడా గురువారం శిబిరానికి హాజరయ్యారని అంటున్నారు. శిబిరంలో కొంతమందినే పరీక్ష చేసి మిగిలిన వారికిసీరియల్ నంబర్లు ఇచ్చి పంపించివేశారు. వీరిని శుక్రవారం, సోమవారం నిర్వహించే క్యాంపులో నిర్దారణ పరీక్షలు చేస్తామని వారికి తెలిపారు. 274 మందికి వైకల్య పరీక్షలు తణుకు అర్బన్ : తణుకులో ప్రతి వారం సదరం శిబిరం నిర్వహస్తున్నా గురువారం ఒక్కసారిగా వెయ్యి మంది వికలాంగులు రావడంతో వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు అవస్థలు పడ్డారు. వికలాంగులు భారీగా క్యూలో నిలబడ్డారు. ఊహించని విధంగా వచ్చిన సిబ్బందిని చూసి డీఆర్డీఏ సిబ్బంది ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆస్పత్రి ఆవరణలో టెంట్లు వేయించారు. అప్పటివరకు వికలాంగులు, వారి బంధువులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. కాగా, శిబిరానికి వచ్చిన 1000 మందిలో 274 మంది వికలాంగులకు వికలాంగత్వ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆర్థోపెడిక్ 131, కంటికి సంబంధించి 77, చెవిటి, మూగ వికలాంగులు 66 మందికి పరీక్షలు చేశారు. మిగిలినవారికి ఆసుపత్రి ఆవరణలో శుక్ర, శనివారాలు కూడా శిబిరం నిర్వహిస్తామని సదరం ఏపీఎం బాలకోటయ్య చెప్పారు. ఇందుకోసం మిగిలిపోయిన వికలాంగులు ఎవరు ఏరోజు రావాలో తేదీ ప్రకారం కూపన్లు అందచేశామని పేర్కొన్నారు.