breaking news
Director K.Viswanath
-
కె విశ్వనాథ్.. ఆయన సృష్టించిన అద్భుత స్త్రీ పాత్రలివే..!
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు అరచేతులు అడ్డుపెడుతుంది ఒక స్త్రీ. ఒక గొప్ప నాట్యకారుడి అంతిమ రోజులను అర్థమంతం చేస్తుంది మరో స్త్రీ. తనలోని కళను తాను కనుగొనడానికి గొప్ప సంఘర్షణ చేస్తుంది ఒక స్త్రీ. వ్యసనపరుడైన భర్తను సంస్కరించడానికి ఎడబాటు నిరసనను ఆశ్రయిస్తుంది మరో స్త్రీ. ప్రేమకు కులం లేదు అనే స్త్రీ... వరకట్నం వద్దు అనే స్త్రీ.. మందమతితో జీవితాన్ని పునర్నిర్మించుకునే స్త్రీ. అతడు చూపిన స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు. భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు. అలాంటి వారి పాత్రలను తీర్చిదిద్దిన కె.విశ్వనాథ్ సినిమాలను ఓసారి గుర్తు చేసుకుందాం. ‘శంకరాభరణం’లో మంజుభార్గవి ఆమెకు సంగీతం, నృత్యం అంటే ప్రాణం. కాని తల్లి ఆమెను ఒక వేశ్యను చేయాలనుకుంటుంది. బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిగేలా చూస్తుంది. ఆమె కడుపున నలుసు పడుతుంది. కాని అది ఇష్టం లేని సంతానం. ఒక పాము కాటేస్తే వచ్చిన గర్భం. పుట్టబోయేది కూడా పామే. ఆమె అబార్షన్ చేయించుకోదు. ఆత్మహత్య చేసుకోదు. ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు సంగీతం నేర్పిస్తుంది. తరువాత తను దేవుడిగా భావించే శంకరశాస్త్రి దగ్గరకు పంపి ఆయన శిష్యుడిగా మారుస్తుంది. బయట దారిలో కనిపిస్తే ‘పాము’ పామే అవుతుంది. కాని శివుని మెడలో ఉండి కనిపిస్తే ‘శంకరాభరణం’ అవుతుంది. అథోముఖమైన తన జీవితాన్ని ఊర్థ్వంలోకి మార్చుకుని సంతృప్తి పొందిన ఆ స్త్రీ ‘శంకరాభరణం’లో మంజుభార్గవి. ఆ పాత్రను అంత తీక్షణంగా, ఔన్నత్యంగా తీర్చిదిద్దినవారు దర్శకడు కె.విశ్వనాథ్. ఒక కళాకారున్ని తెలుసుకోవాలంటే అతడు పుట్టించిన పాత్రలను చూడాలి. మహిళల పట్ల అతడి దృక్పథం తెలియాలంటే అతడు సృష్టించిన మహిళా పాత్రలను చూడాలి. కె.విశ్వనాథ్ సృష్టించిన మహిళా పాత్రలు ప్రేక్షకులకు నచ్చిన పాత్రలు. ప్రేక్షకులు మెచ్చిన పాత్రలు. అంతేకాదు పరోక్షంగా తమ ప్రభావాన్ని వేసే పాత్రలు. ‘శుభలేఖ’ సినిమాలో సుమలత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత లెక్చరర్. ఎంతో చక్కని అమ్మాయి. ఆమెతో జీవితం ఏ పురుషుడికైనా అపురూపంగా ఉండగలదు. కాని ఆమెను కోడలిగా తెచ్చుకోవడానికి బోలెడంత కట్నం అడుగుతాడు ఆ సినిమాలో పెద్దమనిషి సత్యనారాయణ. డబ్బు, కానుకలు, కార్లు... ఒకటేమిటి అడగనిది లేదు. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? సుమలత తిరగబడుతుంది. సంతలో పశువును కొన్నట్టు వరుణ్ణి కొననని చెప్పి సంస్కారం ఉన్న వ్యక్తి హోటల్లో వెయిటర్ అయినా సరే అతణ్ణే చేసుకుంటానని చిరంజీవిని చేసుకుంటుంది. మనిషికి ఉండాల్సిన సంస్కార సంపదను గుర్తు చేస్తుంది ఈ సినిమాలో సుమలత. ‘సాగర సంగమం’లో జయప్రద ‘సాగర సంగమం’లో జయప్రద ఫీచర్ జర్నలిస్ట్. చదువుకున్న అమ్మాయి. భారతీయ కళలు ఎంత గొప్పవో తెలుసు. అందుకే కమల హాసన్లోని ఆర్టిస్ట్ను గుర్తించింది. అతన్ని ఇష్టపడటం, కోరుకోవడం జరక్కపోవచ్చు. అతడి కళను ఇష్టపడటం ఆపాల్సిన అవసరం లేదని గ్రహిస్తుంది. విఫల కళాకారుడిగా ఉన్న కమల హాసన్ చివరి రోజులను అర్థవంతం చేయడానికి అతడిలోని కళాకారుణ్ణి లోకం గుర్తించేలా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. తన కుమార్తెనే అతని శిష్యురాలిగా చేస్తుంది. ఆమె రాకముందు అతడు తాగుబోతు. కాని మరణించే సమయానికి గొప్ప కళాకారుడు. స్త్రీ కాదు లత. ఒక్కోసారి పురుషుడే లత. ఆ లతకు ఒక దన్ను కావాలి. ఆ దన్ను జయప్రదలాంటి స్త్రీ అని ఆ సినిమాలో విశ్వనాథ్ చూపిస్తారు. ‘సప్తపది’లో ఆ అమ్మాయి అతడి కులాన్ని చూడదు. అతడి చేతిలోని వేణువునే చూస్తుంది. ఆ వేణునాదాన్నే వింటుంది. ఏడడుగుల బంధంలోకి నడవాలంటే కావాలసింది స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే పరస్పర ప్రేమ, గౌరవం. అంతే తప్ప కులం, అంతస్తు కాదు. సంప్రదాయాల కట్టుబాట్లు ఉన్న ఇంట పుట్టినా హృదయం చెప్పిందే చేసిందా అమ్మాయి. ఆమె ప్రేమను లోకం హర్షించింది. స్వర్ణకమలం’లో భానుప్రియ యువతకు లక్ష్యం ఉందా? కళ పట్ల అనురక్తి ఉందా? తమలోని కళను కాకుండా కాసులను వెతికే వేటను కొనసాగిస్తే అందులో ఏదైనా సంతృప్తి ఉందా? ‘స్వర్ణకమలం’లో గొప్ప నాట్యగత్తె భానుప్రియ. కాని ఆ నాట్యాన్ని ఆమె గుర్తించదు. ఆ కళను గుర్తించదు. ఒక కూచిపూడి నృత్యకళాకారిణిగా ఉండటం కన్నా హోటల్లో హౌస్కీపింగ్లో పని చేయడమే గొప్ప అని భావిస్తుంది. ఆ అమ్మాయికి ధైర్యం ఉంది. తెగువ ఉంది. చురుకుదనం ఉంది. టాలెంట్ ఉంది. స్వీయజ్ఞానమే కావాల్సింది. కాని చివరలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. తను గొప్ప డ్యాన్సర్ అవుతుంది. మూసలో పడేవాళ్లు మూసలో పడుతూనే ఉంటారు. కొత్తదారి వెతికినవారు భానుప్రియ అవుతారు. మీరు మాత్రమే నడిచే దారిలో నడవండి అని చెప్పిందా పాత్ర. ‘స్వాతిముత్యం’లో రాధిక లైఫ్లో ఒక్కోసారి ఆప్షన్ ఉండదు. మనం టిక్ పెట్టేలోపలే విధి టిక్ పెట్టేస్తుంది. ‘స్వాతిముత్యం’లో రాధికకు భర్త చనిపోతాడు. ఒక కొడుకు. ఆ కష్టం అలా ఉండగానే మందమతి అయిన కమల హాసన్ తాళి కట్టేస్తాడు. అంతవరకూ ఆమె జీవితం ఏమిటో ఆమెకు తెలియదు. ఇప్పుడు ఒక మీసాలు లేని, ఒక మీసాలు ఉన్న పిల్లాడితో కొత్త జీవితం నిర్మించుకోవాలి. ఆమె నిర్మించుకుంటుంది. అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అడ్డంకులను జయించుకుంటూ అతడి ద్వారా తన జీవితాన్ని జయిస్తుంది. స్థిర సంకల్పం ఉంటే కష్టాలను దాటొచ్చని చెబుతుంది. కె.విశ్వనాథ్ మహిళా పాత్రలలో స్వాతిముత్యంలో రాధిక పాత్ర మర్చిపోలేము. 'శృతిలయలు' లో సుమలత ‘శృతిలయలు’లో సుమలత భర్త రాజశేఖర్. కళకారుడు. కాని స్త్రీలోలుడు అవుతాడు. వ్యసనపరుడవుతాడు. లక్ష్యరహితుడవుతాడు. అతన్ని సరిచేయాలి. దానికి ఇంట్లో ఉండి రాద్ధాంతం పెట్టుకోదు ఆమె. కొడుకును తీసుకుని దూరం జరుగుతుంది. హుందాగా ఉండిపోతుంది. ఎదురు చూస్తుంది. ఏ మనిషైనా బురదలో ఎక్కువసేపు ఉండలేరు. రాజశేఖర్ కూడా ఉండలేకపోతాడు. మగాడికి గౌరవం కుటుంబంతోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం భార్య సమక్షంలోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం ఒక లక్ష్యంతో పని చేయడమే అని గ్రహిస్తాడు. ఆమె పాదాల దగ్గరకు తిరిగి వస్తాడు. విశ్వనాథ్ సృష్టించిన స్త్రీలు లౌడ్గా ఉండరు. కాని వారు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు. సమాజంలో స్త్రీలకు ఉండే పరిమితులు వారికి తెలుసు. కాని వాటిని సవాలు చేయడం పనిగా పెట్టుకోకుండా ఆ ఇచ్చిన బరిలోనే ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటారు. విశ్వనాథ్ స్త్రీలు తెలుగుదనం చూపిన స్త్రీలు. మేలిమిదనం చూపిన స్త్రీలు. అందమైన స్త్రీలు... రూపానికి కాని... వ్యక్తిత్వానికి కాని! -
'అలా అయితే.. కె విశ్వనాథ్ సగం హైదరాబాద్ కొనేసేవారు'
కళాతపస్వి కె విశ్వనాథ్ ప్రతి సినిమా ఆణిముత్యమే. అంతా దర్శక ప్రతిభతో సినిమాలు తెరకెక్కించారు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. మరి ఆయన తన సినిమాలకు తీసుకున్న పారితోషికం తీసుకునేవారు. అప్పట్లో ఆయన సినిమాలకు ఎంత పారితోషికం ఇచ్చేవారో ఓసారి పరిశీలిద్దాం. అలా అయితే కోట్ల బంగ్లా ఉండాల్సింది కె విశ్వనాథ్ మొదటి నుంచీ కొన్ని సిద్ధాంతాలకు పరిమితమైపోయారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకోకుండా ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమానే చేసేవారు. 'శంకరాభరణం' తర్వాతవచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుని ఉంటే.. అప్పటికే సగం హైదరాబాద్ కొనేసేవాడినని ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. ఆయన చేసినవన్నీ దాదాపు రిస్కీ ప్రాజెక్టులే. అందుకే ఏనాడూ భారీ పారితోషికాలు కావాలని డిమాండ్ చేసేవారు కాదట. వాళ్లు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకునేవారట. ఆయన జీవితం మొత్తం అలానే సాగిపోయింది. ఆయన సక్సెస్ రేటు, చేసిన సినిమాల సంఖ్యను బట్టి చూస్తే కచ్చితంగా ఫిల్మ్ నగర్లో కోట్లు విలువ చేసే బంగ్లా ఉండాల్సిందే. ఆ విషయంలో చాలా బాధ పడేవారు ఎందుకంటే ఇప్పుడున్నవాళ్లతో పోల్చు కుంటే చాలా బాధగా ఉంటుందని అనేవారు. అది మానవ నైజమని.. ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు కూడా ఎందుకు తీసుకోలేదు? అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటూందని చెప్పేవారు. మళ్లీ వెంటనే మనసుకు సర్ది చెప్పుకునేవారు. ఒక్కసారి ఆ డబ్బు మాయలో పడిపోతే సృజతనాత్మకత పక్కకు వెళ్లిపోతుందని ఆయన అభిప్రాయం. అందుకే ఓసారి చిరంజీవి ఆయనతో ఇలా అన్నారట. మేమంతా అండగా ఉంటాం. సొంతంగా సినిమా చేసుకోండి అన్నారట. అప్పుడు కె విశ్వనాథ్ తన వల్ల కాదని చెప్పేశారు. ఆయన అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా? అప్పట్లో కె.విశ్వనాధ్ తీసుకున్న పారితోషికంపై అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. ఈ విషయంపై ఆయనను ప్రశ్నిస్తే.. అది మీరడగకూడదు. నేను చెప్పకూడదని నవ్వుతూ సమాధానమిచ్చేవారు. నిజంగానే ఆయన పారితోషికం ఎప్పుడే గానీ ఎక్కువగా తీసుకునేవారు కాదట. ఒక్కోసారి ఆయన సినిమాల్లో పాటలకు ఆయనే నృత్య దర్శకత్వం చేయాల్సి వచ్చేది. దానికి అదనంగా పారితోషికం తీసుకోవచ్చు కానీ ఎప్పుడే కానీ అలా చేయలేదట. అయితే అప్పుడు అడిగి ఉండాల్సిందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుందని ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. ఆయన తన అనుభవాలతో పరిశ్రమలో అడగకపోతే అడగనట్టే ఉంటుంది. తొమ్మిది గంటలకు రావాల్సిన కారు రాకపోతే వెంటనే ఆటోలో వెళ్లేవారట. నాతో పాటు ఉన్న దర్శకులు ఎంత తీసుకుంటున్నారో కూడా ఎప్పుడేగానీ ఆరా తీసేవారు కాదట. మనకు భగవంతుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడని గట్టిగా నమ్మేవారు కె విశ్వనాథ్. అందుకే ఆయన కళామతల్లి బిడ్డగా కళాతపస్వి బిరుదు పొందారని అనిపిస్తోంది. -
బాసరలో 'కళాతపస్వి'
బాసర (ఆదిలాబాద్) : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు అలనాటి నటి మంజు భార్గవి (శంకరాభరణం ఫేం) కూడా ఉన్నారు. అనంతరం ఆలయ ఈవో ఏవీ రమణమూర్తి, ఆలయ చెర్మైన్ శరద్ పాఠక్ ఆయనను శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.