-
అసెంబ్లీపైనే పార్టీల గురి
సాక్షి, ముంబై: ‘మిషన్-అసెంబ్లీ’ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీ లు సిద్ధమవుతున్నాయి. రోజురోజుకి మారుతున్న రాజకీయ పరి ణామాలపై దృష్టి కేంద్రీకరించిన అన్ని పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా మారడంతోపాటు ఐదు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్నాయి. సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. పార్టీలను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతోపాటు ప్రజాదరణ పొందేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని యోచిస్తున్నాయి. కొన్ని పార్టీలైతే అంతర్గత విభేదాలు, సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మార్పులు చేర్పులు చేపడుతున్నాయి. సీట్ల పంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇటు శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాని పార్టీల మహాకూటమితో పాటు కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమిలో విబేధాలున్నాయన్న సంగతి ఇప్పటికే పలుసందర్భాల్లో బహిర్గతమైంది. మహాకూటమి, డీఎఫ్ కూటములు పాత ఫార్ములాలతోనే కాకుండా అధిక స్థానాల కోసం ఎవరికివారు డిమాండ్ చేస్తున్నారు. మహాకూటమిలోని ఆర్పీఐ, స్వాభిమాని, శివసంగ్రామ్ తదితర పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలనేది ఇంకా తేలలేదు. అయి తే లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కొంత సీన్ మారింది. మహాకూటమిలోని బీజేపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామంటే, అవేమీ కుదరవు పాత ఫార్ములా ప్రకారమే ముందుకెళ్లాలని శివసేన అంటోంది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యేవరకు ఇరు పార్టీల అధిష్టానాలకు తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది. పైచేయి కోసం పోటీ... మహాకూటమిలోని శివసేన, బీజేపీలు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు శివసేన తన పట్టును నిలుపుకుని రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని చూస్తోంది. మరోవైపు బలం పెరిగిందని అంటున్న బీజేపీ ఎలాగైన ఈసారి అధిక స్థానాలు దక్కించుకుని సీఎం పీఠం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం అత్యధిక లోక్సభ స్థానాల్లో బీజేపీ, అత్యధిక అసెంబ్లీ సీట్లలో శివసేన పోటీ చేస్తూ వస్తున్నాయి. దీంతో 1995లో కేంద్రంలో బీజేపీకి ప్రధాని పదవి లభించగా, రాష్ట్రంలో శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభించింది. అయితే గత ఎన్నికల్లో ఈ సీన్ మారింది. 2009లో శివసేన 160 అసెంబ్లీ సీట్లు, బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేసింది. అయితే శివసేన కేవలం 44 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ మాత్రం 46 స్థానాల్లో గెలిచింది. దీంతో అధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ప్రతిపక్షహోదా మాత్రం దక్కింది. అయితే ఈసారి మళ్లీ లోక్సభ ఫలితాల అనంతరం ఎంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధిక అసెంబ్లీ స్థానాలు కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీలో అప్పుడే ముఖ్యమంత్రి ఎవరవుతారనే చర్చలు ప్రారంభమైనట్టు సమాచారం. మరోవైపు శివసేన మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అధిక స్థానాలు ఇచ్చేది లేదని, తమకే ఎక్కువ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో సీట్ల పంపకాలపై మహాకూటమిలో కూడా విభేదాలు ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. డీఎఫ్ కూటమిలోనూ విభేదాలు... లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ప్రజాస్వామ్య కూటమి(డీఎఫ్)లో ఆందోళనతోపాటు అసంతృప్తి కన్పిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అసెంబ్లీ పోరులో విజయం సాధించి రాష్ట్రంలో తమ పట్టును నిలుపుకునేందుకు డీఎఫ్ కూటమి ప్రయత్నిస్తోంది. అయితే సీట్ల పంపకాల విషయంలో మాత్రం వీరి మధ్య ఈసారి కూడా విభేదాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పరాజయంపై ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. మీ వల్లే మా పార్టీ ఓడిపోయిందంటే మీ వల్లేనని విమర్శించుకుంటున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా అసెంబ్లీలో ఈసారి అధి క స్థానాలు కావాలని కాంగ్రెస్, ఎన్సీపీలు డిమాండ్ చేస్తున్నాయి. అధిక స్థానాలు కేటాయించాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అంటున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 169 స్థానాల్లో, ఎన్సీపీ 114 స్థానాల్లో పోటీ చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 82, ఎన్సీపీ 62 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఈసారి రాష్ట్రంలో పట్టును నిలుపుకోవాలంటే అధిక స్థానాలు కావాలని ఇరు పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య సీట్ల పంపకాల విషయం తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. దూకుడు పెంచాలనుకుంటున్న ఎమ్మెన్నెస్ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కూడా అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల జరిగిన ఓటమిపై సమీక్ష నిర్వహించిన ఆ పార్టీ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలన్న దానిపై కూడా చర్చించింది. పార్టీ సీఎం అభ్యర్థిగా రాజ్ఠాక్రే పేరును ప్రతిపాదిస్తూ ఆ సమావేశంలో ఏకగ్రీవ తీర్మా నం చేశారు. అయితే దీనిపై రాజ్ఠాక్రే ఎలా స్పందిస్తారోనని ఆ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ మొత్తం 143 స్థానాల్లో పోటీ చేసింది. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన రాజ్ఠాక్రే పార్టీ 13 స్థానాలు కైవసం చేసుకోవడంతోపాటు పలు స్థానాల్లో రెండు, మూడు స్థానాలను దక్కించుకుంది. ఈ ఫలితాలతో మంచి ఉత్సాహంలో ఉన్న ఎమ్మెన్నెస్కి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవకపోయిన పోటీ చేసిన 13 స్థానాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. అయితే ఈసారి పది లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన ఎమ్మెన్నెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ఫలితాలతో నిరాశలో ఉన్న పార్టీ కార్యకర్తలు, పదాధికారుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు రాజ్ఠాక్రేతోపాటు పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రాజ్ఠాక్రే అనేక ప్రాంతాల్లో పర్యటించి పదాధికారులు, కార్యకర్తల మనోబలాన్ని పెంచడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరితోనైన పొత్తు పెట్టుకుని పోటీ చేయాలా, ఒంటరిగా బరిలోకి దిగాలా..? అనే దాని పై స్పష్టత లేదు. అయితే పలుమార్లు ఒంటరిగానే బరిలోకి దిగుతానని రాజ్ఠాక్రే ప్రకటించినా అసెం బ్లీ ఎన్నికల వరకు ఏమీ జరుగుతుందనేది చూడాలి. -
గరంగరంగా కేబినెట్ భేటీ
ముంబై: లోక్సభ ఎన్నికల్లో అధికార డీఎఫ్ కూటమి దారుణ పరాభవం అనంతరం జరిగిన తొలి రాష్ట్ర కేబినెట్ సమావేశం గరంగరంగా సాగింది. ఈ ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ముందుకు సాగని అభివృద్ధి పనుల గురించి గళమెత్తారు. ఈ సమావేశానికి ఛగన్ భుజ్బల్, సురేశ్ దాస్, సునీల్ తట్కరే, శివాజీరావ్ మోఘే కూడా హాజరయ్యారు. రాయ్గఢ్ స్థానం నుంచి శివసేన ఎంపీ అనంత్ గీతే చేతిలో ఓడిన తట్కరే మాట్లాడుతూ దిగ్గి పోర్టు అభివృద్ధిలో జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులు చేపట్టిన డెవలపర్కు నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీడ్లో బీజేపీ నేత గోపీనాథ్ ముండే చేతిలో ఓడిన దాస్ మాట్లాడుతూ మరాఠ్వాడా ప్రాంతంలో నీటి కొరత సమస్యను లేవనెత్తారు. దీనిని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర మంత్రులు వివాదాస్పద టోల్ వసూలు గురించి ఘాటుగా మాట్లాడారు. నాగపూర్ లోక్సభ పరిధిలోకి వచ్చే తన నియోజకవర్గంలో ప్రత్యర్థి, బీజేపీ నేత గడ్కారీ 12 వేల ఓట్ల ఆధిక్యత రావడంతో పదవికి రాజీనామా చేసిన ఉపాధి హామీ పథక మంత్రి నితిన్ రౌత్ గరంగరంగానే మాట్లాడారు. రాష్ట్రంలో జాతీయ న్యాయ పాఠశాల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యాన్ని లేవనెత్తారు. అడ్మిషన్ విధానాన్ని ప్రారంభించేందుకు కేబినెట్లో ప్రతిపాదన పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబై, నాగపూర్, ఔరంగాబాద్లో ఈ న్యాయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. బుల్దానా, నాగపూర్, వార్ధా జిల్లా సహకార బ్యాంక్ల ఆర్థిక ఇబ్బందులపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. రూ.260 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. చేపల్లో వ్యాధులు త్వరితగతిన గుర్తించేందుకు పాల్ఘర్లో ల్యాబోరేటరీ ఏర్పాటుకోసం పది ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు సిబ్బందికి పోస్టింగ్లను ఇవ్వనుంది. ఈ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించేందుకోసం నాగపూర్ రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ పదోన్నతులను రాష్ట్ర డీజీపీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుంది. రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఈ పదోన్నతులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అధిష్టానం తీరే కొంపముంచింది: చవాన్ సాక్షి, ముంబై: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాభవంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పదవికి రాజీనామా చేయాలని అటు ప్రతిపక్షంతో పాటు ఇటు అధికార పక్షంలోని నేతల నుంచే డిమాండ్ పెరుగుతోంది. దీంతో తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో ఏమో అనుకున్నాడో గానీ ఈ ఓటమికి కారణం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో ఆఫ్ ది రికార్డ్గా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడానికి అధిష్టానమే కారణమని చవాన్ చేతులెత్తేశారు. విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన అవినీతి, వెలుగులోకి వచ్చిన కుంభకోణాలు ఓటమికి కారణాలయ్యాయని వివరణ ఇచ్చారు. అందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల తర్వాత చవాన్ రాజీనామా చేయాలని అయన వ్యతిరేకులతోపాటు అనుకూలురు కూడా పట్టుబట్టారు. శాసనసభ ఎన్నికలు మరో ఐదు నెలల్లో జరగనున్నాయి. చవాన్ రాజీనామా చేస్తే కనీసం ఈ ఐదు నెలల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని అనేకమంది ప్రముఖులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయినా చవాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. నాయకత్వం మారే అవకాశాలు లేకపోవడంతో సీఎం కూడా ధైర్యంగా ఉన్నారు. చివరకు ఓటమిని కాంగ్రెస్ అధిష్టానంపై నెట్టేసి చేతులెత్తేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఓటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక చాలెంజ్గా పరిణమించనుంది. ఇప్పటినుంచే సాధ్యమైనన్ని ప్రజోపయోగ పనులు చేపట్టాలనుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 240 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులు వెనకబడడం చింతించాల్సిన విషయమ’ని చవాన్ అంగీకరించారు. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలా...? లేక మరొకరిని నియమించాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఒకవేళ సీఎం పదవి నుంచి తొలగిస్తే తన రాజకీయ భవిష్యత్పై కూడా నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించినట్లు ఆయన వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement