breaking news
develpment works
-
లక్షల్లో వచ్చినా ఇబ్బంది ఉండొద్దు: యాదాద్రిపై సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: ‘‘లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సరిపోవాలి. కరోనా అదుపులోకి వచ్చినందున రెండున్నర నెలల్లో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలి..’’ అని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరంగల్ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం 6.20 గంటలకు యాదాద్రికి చేరుకున్నారు. ఆలయంతోపాటు రింగ్రోడ్డు పక్కన జరుగుతున్న గండి చెరువు, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, లక్ష్మి పుష్కరిణి పనులను పరిశీలించారు. యాదగిరిగుట్ట పట్టణంలో చేపట్టిన రింగ్రోడ్డుతో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పనులను పరిశీలించి.. తొలుత గుట్ట కింద పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.. తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ క్యూలైన్లలో నడుస్తూ చూశారు. తూర్పు రాజగోపురం, సుదర్శన గోపురాలతోపాటు మేలిమి వర్ణంతో ధగధగలాడుతున్న ప్రధానాలయ గోపురాలను, విద్యుత్ దీప కాంతులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఆ విద్యుత్ దీపాల సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రధానాలయం లోపల యాలీ పిల్లర్లు, ఆళ్వార్ మండపాలను పరిశీలించారు. గర్భాలయంలో స్వామివారికి మొక్కి హారతి తీసుకుని పడమర రాజగోపురం నుంచి బయటికి వచ్చారు. కొండపై ఉన్న గెస్ట్హౌస్కు చేరుకుని, సుమారు రెండు గంటల పాటు అధికారులతో సమీక్షించారు. రింగ్రోడ్డు లోపల ఆలయ నిర్మాణాలే.. రింగ్ రోడ్ పరిధిలో ఉన్న భూములపై వెంటనే డీజీపీఎస్ సర్వే నిర్వహించాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రింగ్ రోడ్ పరిధి లోపల కేవలం ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. పనుల్లో అలసత్వం పనికిరాదని, ఆలయం లోపల, ఆలయానికి అనుబంధంగా జరుగుతున్న ఇతర నిర్మాణ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్ బిల్డింగ్, ఎస్కలేటర్లు, ఆర్నమెంటల్ ఎలివేషన్, లాండ్ స్కేపింగ్, బీటీ రోడ్, పుష్కరిణి, కల్యాణ కట్ట, పార్కింగ్, ఇతర నిర్మాణాల పనులపై వివరంగా చర్చించారు. మొత్తంగా రెండున్నర నెలల్లో ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. పనులు వేగంగా జరగని చోట వర్కింగ్ ఏజెన్సీలను మార్చాలన్నారు. టెంపుల్ టౌన్లో చేపట్టే కాటేజీల నిర్మాణానికి వైటీడీఏ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి, అద్భుతంగా నిర్మించే వర్కింగ్ ఏజెన్సీలకు పనులను అప్పగిస్తామని తెలిపారు. ఒకసారి ఆలయం ప్రారంభమైతే భక్తులు భారీగా వస్తారని.. అందుకు అనుగుణంగా నిర్మాణాలు, ఇతర ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్డిపో, బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి విడుదల చేస్తామని, వారంలోగా నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ గుట్టపై బాలాలయంలో లక్ష్మీనర్సింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సోమవారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం, ఏకాదశి కలసి రావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా సీఎం కేసీఆర్ గిరి ప్రదక్షిణ మాదిరిగా యాదాద్రి చుట్టూ ప్రత్యేక కాన్వాయ్లో రెండుసార్లు తిరిగారు. -
అభివృద్ధి పనుల టెండర్లలో రింగ్?
రూ.4.26 కోట్ల పనుల్లో కాంట్రాక్టర్ల ప్రయత్నం కోల్సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో ఇటీవల పిలిచిన రూ.4.26 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు రింగ్కు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 13వ, 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు ఎస్సీ, జనరల్ ఫండ్ నిధులు రూ.4.26 కోట్లతో 52 అభివృద్ధి పనుల కోసం ఆన్లైన్లో ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈనెల 2న టెండర్లకు షెడ్యూల్ దాఖలు చేయడానికి చివరి గడువు విధించగా, ఆ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో కాంట్రాక్టర్లు వాయిదా వేయాలంటూ వినతిపత్రం సమర్పించారు. దీంతో అధికారులు బుధవారానికి వాయిదా వేశారు. సమయం పొడిగించడంతో కాంట్రాక్టర్ల మధ్య రాజీయత్నాలు జరుపుకోవడానికి మార్గం సులువైంది. మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్లు మార్కండేయకాలనీలోని ఓ రహస్య ప్రాంతంలో మంతనాలు జరిపారని తెలిసింది. కాంట్రాక్టర్లు అందరూ సయోధ్యతతో ఉంటేనే అనుకున్న వారికి పనులు వస్తాయని వారు చర్చించుకున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లు ఏ రేట్లకు షెడ్యూల్ దాఖలు చేశారన్న విషయం బుధవారం సాయంత్రం తెలియనుంది. -
రిమ్మనగూడకు మంత్రి వరాలు
గజ్వేల్: గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి మంత్రి హరీశ్రావు వరాలు కురిపించారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సందర్భంలో గ్రామసర్పంచ్ పోచి చిన్నరాములు, గ్రామస్తులు చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా గ్రామానికి రూ. 10లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ. 10లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, ఈద్గా నిర్మాణం కోసం రూ. 2లక్షలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు అదనపు గదుల నిర్మాణానికి నిధులు, లైబ్రరీ, యూత్ బిల్డింగ్ కోసం రూ. 10లక్షలు, రిమ్మనగూడ-కోనాపూర్ బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు విడుదల చేస్తామని ప్రకటించగానే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కొడకండ్ల గ్రామంలోనూ పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు.