breaking news
Dealing land
-
రెవె‘న్యూ’.. జగడం
* గంటాకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్లో మంత్రి అయ్యన్న మంత్రాంగం * భూ వ్యవహారంపై విజిలెన్స్ విచారణతో కలకలం * ఆర్డీవోపై వేటు కోసం వ్యూహం! * మంత్రుల మధ్య వేడెక్కుతున్న రాజకీయం సాక్షి, విశాఖపట్నం : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న రీతిలో మంత్రి అయ్యన్న బాణం సంధించారు. కోట్ల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా స్వామి భక్తిని ప్రదర్శించే అధికారులపై వేటుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు మంత్రి గంటాకు అనుకూలంగా ఉన్న అధికారులపై వేటుకు మార్గం సుగమం చేశారు. అదను చూసి వేసిన ఎత్తుకు మంత్రి గంటా బిత్తరపోవాల్సిన పరిస్థితి కల్పించారు. భీమిలి, పరవాడలలో భూ వ్యవహారాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జిల్లా రాజకీయ, అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఇప్పటికే ఉప్పూ నిప్పుగా ఉన్న అయ్యన్న, గంటాల మధ్య తాజా ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. ఇద్దరు మంత్రుల ఆధిపత్యపోరులో తాము అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు. జిల్లాలో పనిచేయడం కంటే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడం ఉత్తమమని కూడా భావిస్తున్నారు. జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ వ్యవహారం కథకమామిషు ఇదిగో ఇలా ఉంది... పరవాడ మండలంలో సర్వే నంబర్ 54లో 32.75 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఒక ప్రభుత్వ పెద్ద ఎప్పటి నుంచో కన్నేశారు. అదే విధంగా భీమిలి మండలం గంభీరంలో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూములను కూడా ఇదే రీతిలో ఆక్రమించాలని ఎప్పటినుంచో పథకం పన్నారు. ఈ భూములు ప్రస్తుతం రైతులు, స్థానికుల ఆక్రమణలో ఉన్నాయి. వీటిని ఎలాగైనా తన పరం చేసుకోవాలని కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో సదరు ప్రభుత్వ పెద్ద చక్రం తిప్పారు. తన అడుగులకు మడుగులొత్తే రెవెన్యూ అధికారి ద్వారా కథ నడిపించారు. గత ప్రభుత్వ హయాంలోనే గంభీరం వద్ద ఉన్న భూములను క్రమబద్ధీకరించుకున్నారని సమాచారం. పరవాడలో రైతుల ఆక్రమణలో ఉన్న భూములను ఇతరులకు విక్రయించుకునేందుకు అనుమతిచ్చే విషయం పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భూములను హస్తగతం చేసుకునేందుకు ఆ కీలక నేత, ఈయన తనకు అనుకూలుడైన రెవెన్యూ అధికారి ఒకరు సదరు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను టాంపరింగ్ చేసినట్టుగా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో జిల్లా ఉన్నతాధికారి ఒకరు తీవ్రంగా పరిగణించారు. కానీ ఆ కీలక నేత ఒత్తిడితో టాంపరింగ్ విషయం తెలిసినా సదరు అధికారి మిన్నకుండిపోయినట్టుగా తెలియవచ్చింది. భీమునిపట్నం మండలంలోని చిప్పాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 86/4, 184/6లలో ఉన్న భూముల రికార్డులను తారుమారు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ సర్వే నంబర్లో సుమారు 500 ఎకరాల్లో ఓ లేబొరేటరీ ఉండగా, మిగిలిన భూముల్లో అటవీ, విజయనగరం జిల్లా మాన్సాస్ భూములు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీఎం, డీప్యూటీ సీఎంలకు ఫిర్యాదుల వెల్లువెత్తడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీల్లో రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమైన సదరు రెవెన్యూ అధికారిపై ఈ విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో రెవెన్యూ శాఖలో కలకలం మొదలైంది. విచారణ పేరుతో సదరు అధికారిని బలవంతంగా పంపించేందుకే జిల్లాకు చెందిన కీలక మంత్రి పావులు కదిపినట్టుగా తెలుస్తోంది. -
ఆక్రమణదారులకు పరిహారం
‘హీరో’ భూముల వ్యవహారంపై హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: హీరో మోటో కార్ప్ లిమిటెడ్కు చిత్తూరు జిల్లా, సత్యవేడు మండల పరిధిలో కేటాయించిన భూమిలో అత్యధిక శాతం భూమి ఆక్రమణల్లో ఉందంటూ స్థానిక రాజకీయ నేతలు నమ్మిస్తున్నారని, ఆక్రమణదారులకు ప్రభుత్వం ద్వారా పరిహారం చెల్లించేందుకు రంగం సిద్ధం చేయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని చిత్తూరు జిల్లా, బుచ్చినాయుడు కండ్రిగ మండలానికి చెందిన కె.చంద్రమోహన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. సత్యవేడు మండల పరిధిలో హీరో మోటో కార్ప్కు ప్రభుత్వం 650 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. అందులో 632.96 ఎకరాల భూమి విషయంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ భూమిని థర్డ్ పార్టీకి కేటాయించవద్దని ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘హైకోర్టు ఆదేశాలున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని హీరో మోటో కార్ప్కు కేటాయించింది. ఆక్రమణదారులకు ప్రభుత్వం సైతం రాజకీయ నేతలు చెప్పిన విధంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. వారికి ఎకరాకు రూ. 1.6 లక్షల పరిహారం చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ కేటాయింపులను అడ్డంపెట్టుకుని స్థానిక అధికారులు, నేతలు ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి ఈ భూముల్లో అక్రమణదారులు ఎవరూ లేరు. కొందరు ప్రైవేటు వ్యక్తులు మాత్రమే యాజమాన్యపు హక్కులపై పోరాటం చేస్తున్నారు. ఆక్రమణదారులను చట్ట ప్రకారం ఖాళీ చేయించాలే తప్ప, వారికి పరిహారం చెల్లించడానికి వీల్లేదు. ఈ వ్యాజ్యం హీరో మోటో కార్ప్కు వ్యతిరేకం కాదు. ’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. తెలుగు తమ్ముళ్లపై మరో పిల్ సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద అర్హులను పరిశీలించేందుకుగాను ఏర్పాటు చేసిన గ్రామ కమిటీల్లో టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించడం చట్ట విరుద్ధమని, దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన గండి ప్రణీత్కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.