breaking news
D Sridhar Babu
-
గూగుల్ మ్యాప్స్లో హైదరాబాద్ మెట్రో రియల్ టైమ్ సేవలు
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకల సమయాలు ఇకపై గూగుల్ మ్యాప్స్లో రియల్ టైమ్గా కనిపిస్తాయని తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మెట్రో సేవలకు సంబంధించిన సమగ్ర డేటాను ప్రభుత్వం ఓపెన్, స్టాండర్డ్ జీటీఎఫ్ఎస్ ఫార్మాట్లో విడుదల చేయడంతో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఓపెన్ డేటా తెలంగాణ పోర్టల్–హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంయుక్తంగా సిద్ధం చేసిన పూర్తి జీటీఎఫ్ఎస్ డేటాసెట్లో మూడు కారిడార్లు, 118 స్టేషన్లు, వారానికి 6,958 ట్రిప్ల వివరాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. జీటీఎఫ్ఎస్ విశిష్టత ఏంటంటే.. మెట్రో షెడ్యూల్లో మార్పులు, ఆలస్యాలు జరిగితే అవి ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్స్, ఇతర యాప్లతో సమకాలీకరణ అవుతాయని.. దీంతో ప్రయాణికులు రియల్ టైమ్ రైలు రాకపోకల సమాచారం, మార్గాలు, స్టేషన్ వివరాలు వేగంగా తెలుసుకోగలరని ఆయన తెలిపారు. “హైదరాబాద్ నగర రవాణాలో ఇది ఒక పెద్ద మైలురాయి. ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించే కీలక నిర్ణయం’’ అని శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఓపెన్ డేటా ఆధారంగా డెవలపర్లు కొత్త ప్రయాణ ప్రణాళిక యాప్లు, యాక్సెసిబిలిటీ టూల్స్ రూపొందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.గ్రేటర్ హైదరాబాద్లో టీఎస్ఆర్టీసీ నడిపే బస్సుల కోసం 50,807 వారాంత ట్రిప్లు, 5,920 స్టాప్లను కలిగిన జీటీఎఫ్ఎస్ డేటాసెట్ కూడా పూర్తికావచ్చిన దశలో ఉందని మంత్రి తెలిపారు. అది విడుదలైన తర్వాత మెట్రో–బస్సు ప్రయాణాల కోసం ఒకే ప్లాట్ఫారమ్లో సమగ్ర మార్గనిర్దేశం లభ్యం కానుంది. దీంతో ఫస్ట్-మైల్, లాస్ట్-మైల్ కనెక్టివిటీ మెరుగవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో డేటా ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ చర్యలు అనుసంధానమై ఉన్నాయని శ్రీధర్ బాబు చెప్పారు. దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా ఉన్న హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో సుమారు 69 కిలోమీటర్లపాటు నడుస్తోందని తెలిపారు. -
టీపీసీసీ రేసు నుంచి మరొకరు ఔట్: పోటీలోలేనట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి డి.శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఆ పదవి రేసులో కూడా తాను లేనని పేర్కొన్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా పాయింట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. -
ఆ తప్పులు తహసీల్దార్లు చేయరా?
సాక్షి, హైదరాబాద్: ‘వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి తహసీల్దార్లపై భారం వేయడం ఎంత వరకు సమంజసం. వీఆర్వోలే కాదు తహసీల్దార్లు కూడా అవినీతి దుకాణం తెరిచారు. కొంతమంది వీఆర్వోలు చేసిన తప్పులకు వీఆర్వోలందరిపై అవినీతి ముద్ర వేయడం సరికాదు. వీఆర్వోలు చేసిన తప్పులనే తహసీల్దార్లు చేయరని గ్యారెంటీ ఏంటి? తహసీల్దార్లు, అదనపు కలెక్టర్లు కూడా ఏసీబీకి పట్టుబడుతున్నారు కదా. అధికారులను కాదు, వ్యవస్థను మార్చాలి. రైతుల నుంచి డబ్బులు అడిగే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి. వ్యవసాయ భూముల సర్వే చేస్తాం అని సీఎం ప్రకటించారు. దేవాదాయ, ల్యాండ్ సీలింగ్, అసైన్డ్ భూములను కూడా సర్వే చేస్తారా?’అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా బిల్లుకు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. న్యాయపర చిక్కులు రాకుండా చూడాలి: శ్రీధర్బాబు కొత్త రెవెన్యూ చట్టం అమలుకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్బాబు పేర్కొన్నారు. చట్టంలో పలు మార్పులను సూచించారు. 8లక్షల ఎకరాల పట్టా భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించిందని, వీటిపై నిర్ణయం తీసుకోవాలని.. సర్వే, సెటిల్మెంట్ తర్వాతే మ్యుటేషన్ చేయాలని స్పష్టంచేశారు. -
అప్పుడు లేని మాంద్యం ఇప్పుడెలా?
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కింద ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో లేని మాంద్యం ఇప్పుడెలా వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సైతం బడ్జెట్లో ఎక్కడా మాంద్యం గురించి ప్రస్తావించలేదని తెలిపారు. కానీ ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం 15 నెలల నుంచి మాంద్యం ఉందని చెప్పి బడ్జెట్కు కోత పెట్టారని విమర్శించారు. ఆదివారం శాసనసభలో బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడారు. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు 30 శాతం తగ్గాయని చెబుతున్నారని, కానీ మాంద్యానికి ఇది ప్రామాణికం కాదని తెలిపారు. రెవెన్యూ మిగులు ఉన్న సమయంలో రాష్ట్ర బడ్జెట్ ఎలా తగ్గిందో చెప్పాలన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో కీలకమైన విద్యా శాఖకు 24 శాతం, వైద్యానికి 25 శాతం, గ్రామీణాభివృద్ధికి 32 శాతం తక్కువగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం చూసే చేరాం: ఎమ్మెల్యే గండ్ర టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుల సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని, రైతు బంధుతో రైతుల్లో ధీమా పెంచారని తెలిపా రు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోందని, దాన్ని చూసే 12 మంది కాంగ్రెస్ సభ్యులం టీఆర్ఎస్లో చేరామన్నారు. -
నాంపల్లిలో టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్ : విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు పేద, మధ్య తరగతి వర్గాలు భరించలేవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. శనివారం విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా నాంపల్లి చౌరస్తాలో టీ.కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్బాబు, అంజన్కుమార్ యాదవ్, గండ్ర వెంకట రమణారెడ్డి ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఇతర పార్టీలతో కలసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఛార్జీలు పెంచడమా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి... శ్రీధర్బాబు, అంజన్కుమార్ యాదవ్, గండ్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గోషామహాల్ పీఎస్కు తరలించారు. -
పొమ్మనే హక్కు ఎవరికీ లేదు: శ్రీధర్బాబు
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో స్థిరపడిన ఇతర ప్రాంతాలవారిని వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ లేదని మంత్రి డి. శ్రీధర్బాబు అన్నారు. మల్లాపూర్ వీఎన్ ఆర్ గార్డెన్లోని పీవీ నరసింహారావు ప్రాంగాణంలో ఆదివారం బ్రాహ్మణ ‘కార్తీక వన సమారాధన-బ్రాహ్మణ సమేళనం’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హారైన మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో సెటిలర్ల హక్కులకు ఎలాంటి భంగం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తెచ్చి వనభోజనాలు ఏర్పాటు చేసిన సంఘం నాయకులను అభినందిచారు. అనంతరం బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వేమురి ఆనంద సూర్య మాట్లాడుతూ ప్రతేడాదిలాగే ఈ ఏడాది కూడా వనభోజనాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆటలపోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ అంజన్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ దిలీప్కుమార్, వైఎస్సార్సీపీ నాయకుడు జనక్ప్రసాద్, మాజీ డీజీపీ అరవిందరావు, నమస్తే తెలంగాణ ఎండీ రాజం, విజయరాజం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, రామచంద్రన్, దైవజ్ఞశర్మ, తులసి శ్రీనివాస్, కొత్త రామరావు తదితరులు పాల్గొన్నారు.


