breaking news
cow shelter
-
గోశాలలు కాసుల కురిపిస్తాయా?
బెంగళూరు: భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో కొత్త విప్లవానికి గోశాలలు కేంద్రబిందువుగా మారగలవా? ఒకప్పుడు అమూల్ సహకార మోడల్ దేశంలోని కోట్లాది పాల రైతుల జీవితాలను మార్చినట్లే.. ఇప్పుడు గోశాలలను ఆధారంగా చేసుకుని కొత్త సహకార ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చనే ప్రతిపాదన ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.భారతదేశంలో ప్రస్తుతం సుమారు 7,676 నమోదిత గోశాలలు ఉండగా, అనధికారిక ఆశ్రయాలు, పింజరపోల్స్ కలిపితే వాటి సంఖ్య 15 వేల వరకు ఉండొచ్చని అంచనా. అయితే వీటిలో చాలా గోశాలలు పెరుగుతున్న పశుగ్రాస ఖర్చులు, వైద్య సంరక్షణ వ్యయాలు, మార్కెట్ సౌకర్యాల కొరత, నాణ్యత నియంత్రణలో లోపాలు, విభిన్నంగా పనిచేయడం వంటి కారణాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా చాలా వరకు విరాళాలపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి.ఈ పరిస్థితిని మార్చేందుకు 'నేషనల్ గోశాల కోఆపరేటివ్ మోడల్' అనే కొత్త ఆలోచనను నిపుణులు ముందుకు తెస్తున్నారు. ఇందులో ప్రతి గోశాల విడివిడిగా పనిచేసే కేంద్రంగా కాకుండా, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద సహకార వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది. గోశాలలు కేవలం పశు సంరక్షణ కేంద్రాలుగా కాకుండా, దేశీయ ఆవు ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేకరణ కేంద్రాలుగా మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు.ఈ ప్రతిపాదన ప్రకారం ప్రాంతీయ స్థాయిలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ, లాజిస్టిక్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు. వెటర్నరీ కళాశాలలు ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిరోధక చర్యలు, శాస్త్రీయ సహకారం అందించవచ్చు. అలాగే ఈ-కామర్స్ వేదికల ద్వారా గోశాలల్లో తయారయ్యే ఉత్పత్తులను నేరుగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు.ఈ మోడల్లో కేవలం పాల ఉత్పత్తులకే పరిమితం కాకుండా గోమయం(పేడ), గోమూత్రం ఆధారిత ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్లు, సహజ వ్యవసాయ ఉత్పత్తులు, వెల్నెస్ ఉత్పత్తులు వంటి రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పాలు ఇవ్వని ఆవులను ఆర్థిక భారంగా భావిస్తున్న పరిస్థితిని మార్చి, వాటినీ గ్రామీణ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మార్చవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రతిపాదనను జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్డీఆర్ఐ)కు చెందిన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఆదర్శ గౌడ ముందుకు తెచ్చారు. గోశాలలను ఒక సమగ్ర సహకార వ్యవస్థలో అనుసంధానం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త అవకాశాలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.గోశాలలను ఒక సమగ్ర సహకార వ్యవస్థలో అనుసంధానం చేయగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పశు సంక్షేమం, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ ఆదాయ వనరులు కూడా బలోపేతమవుతాయి. గోశాలలను వాణిజ్యీకరించడం లక్ష్యం కాదని, వాటిని ఆర్థికంగా స్వావలంబన చేయడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.మొత్తానికి, అమూల్ మాదిరిగా గోశాలల చుట్టూ కూడా ఒక సమగ్ర సహకార వ్యవస్థను నిర్మించగలిగితే.. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.:::డాక్టర్ ఆదర్శ గౌడ -
బీజేపీ ఉమాభారతి సంచలన ప్రకటన
బోఫాల్: బీజేపీ ఫైర్బ్రాండ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్లో లిక్కర్ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారామె. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లిక్కర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. ఇకపై గో శాలల కింద మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టానంటూ ప్రకటించారామె. మధ్యప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కారణమని బలంగా నమ్ముతున్నారామె. ఈ క్రమంలో బోఫాల్ అయోధ్య నగర్లోని ఓ ఆలయం వద్దకు చేరుకుని(సమీపంలోని లిక్కర్ షాప్ ఉంది) నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలన్న డిమాండ్తో ఆమె దీక్ష కొనసాగించారు. మంగళవారం ఆ దీక్ష ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఆమె మధుశాలా మే గోశాల(లిక్కర్ దుకాణాల్లో గో శాల) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారామె. రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, అదే రాముడి గుడి దగ్గర్లో లిక్కర్ దుకాణాలు(ఓర్చా ప్రాంతంలో పరిస్థితిని ఉదాహరిస్తూ..) పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె మధ్యప్రదేశ్ సర్కార్ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకు.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పించడం నిజమైన అభివృద్ధి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక.. పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వర్గంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. మద్యం నిషేధంపై ఉద్యమించినంత మాత్రానా నాకు ప్రధాని పదవి దక్కుతుందా?.. ఇది చాలా విడ్డూరంగా ఉంది.. ఒక వర్గం ఇలా ప్రచారం చేయడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. లిక్కర్ పాలసీ కోసం ఎదురు చూపులు ఉండబోవని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లిక్కర్ షాపులను దగ్గరుండి తానే గోశాలలుగా మారుస్తానని ఆమె ప్రకటించారు. అలాంటి దుకాణాల బయట 11 ఆవుల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తన బృందానికి ఆదేశాలు జారీ చేశానని.. తనను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారామె. ఈమధ్యే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన ఉమాభారతి.. లిక్కర్ పాలసీలో కొన్ని సవరణలు సూచిస్తూ.. కొత్త విధానం తేవాలని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు కూడా. అయితే.. ఆచరణలోనే అది కనిపించలేదు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
ఆవుదూడలకు ఇక ఆ బాధ ఉండదు..!
అయోధ్య : నగరంలోని ఆవులకు భలే వెచ్చటి రోజులు వచ్చాయి. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్లోని గోశాలల్లో ఉండే ఆవులు, దూడలు, ఎద్దులకు చలివేయకుండా గరం కోట్లు వేయనున్నట్టు కమిషనర్ నీరజ్ శుక్లా తెలిపారు. పవిత్ర భూమిలో ఉన్న షెల్టర్లలో ఉన్న గోవుల సంరక్షణే తమ కర్తవ్యమని వెల్లడించారు. 1200 ఆవులు, 700 ఎద్దులు, లేగదూడలు గల బైసింగ్పూర్ గోసంరక్షణ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. మొదట 100 ఆవులకు స్వెటర్ల కోసం ఆర్డర్ ఇచ్చామని అన్నారు. నవంబర్ చివరి నాటికి అవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రెండు మూడు దశల్లో పూర్తిస్థాయిలో స్వెటర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.జూట్తో తయారు చేసే.. వీటి ధర ఒక్కోటి రూ.250-300 ఉంటుందని శుక్లా పేర్కొన్నారు. లేగదూడలకు మూడు వరుసలు, ఆవులకు రెండు వరుసలు, ఎద్దులకు ఒక వరుస జూట్ స్వెటర్లు తయారు చేయిస్తామని అన్నారు. చలి తీవ్రత పెరిగినప్పుడు గోవుల రక్షణకు షెల్టర్ల వద్ద మంటకూడా రాజేస్తామని శుక్లా చెప్పారు. అయోధ్య కార్పొరేషన్లో ఉన్న గోసంరక్షణ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని నగర మేయర్ రుషికేష్ ఉపాధ్యాయ్ అన్నారు. మరిన్ని గోసంరక్షణ కేంద్రాలు నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు. -
ఆవులపై విష ప్రయోగం జరగలేదు
సాక్షి, విజయవాడ: కొత్తూరు తాడేపల్లిలోని గోసంరక్షణశాలలో ఆవుల మృతికి టాక్సిసిటీ కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పశుసంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. అయితే, టాక్సిసిటీ అంటే విష ప్రయోగం కాదని, విషతుల్యమైన పదార్థాలు కారణమని ఆయన చెప్పారు. పచ్చగడ్డిలో పాస్ఫరస్, నత్రజని శాతం ఎక్కువైనా టాక్సిసిటీ కారణమయ్యే అవకాశముంటుందని తెలిపారు. ఆవులపై విషప్రయోగం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మృతిచెందిన ఆవుల పోస్టుమార్టం నివేదిక మంగళవారం వస్తుందని, వారంలోపు ఫోరెన్సిక్ నివేదిక కూడా రానుందని దామోదర్ నాయుడు వెల్లడించారు. కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలోని దాదాపు 80కిపైగా గోమాతలు ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణ వేగవంతం ఆవుల మరణంపై పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనపై గోశాల నిర్వాహకులు చెప్తున్న విషయాలపై పోలీసులు సంతృప్తి చెందడం లేదు. ఈ ఘటన వెనుక వాస్తవాలు వెలికితీసేందుకు రహస్య విచారణ చేపట్టారు. గోవులు మృతిచెందిన రోజు సాయంత్రం నుంచి రాత్రివరకు గోశాలలో ఎవరెవరు ఉన్నారు?. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా?. పశుగ్రాసం విషతుల్యం అయిందా? చనిపోయిన గోవులు మాత్రమే ఆ గ్రాసం తిన్నాయా? అది సాధ్యమా? పనికట్టుకుని ఎవరైనా గోవులకు విషతుల్యమైన ఆహారం అందేలా చేశారా? ఒకవేళ పశువైద్యులు అనుమానిస్తున్నట్లు అధిక ఆహారం వల్లే గ్యాస్ ఏర్పడి మృత్యువాత పడ్డాయా? విషపూరితమైన లేత జున్నుగడ్డిని గోవులకు ఎవరైనా పెట్టారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆవుల మృతి చెందిన ఘటనపై విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. గో సంరక్షణ సమితి కార్యదర్శి సాబు గోవిందకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 9వ తేదీ రాత్రి గడ్డి తిన్న ఆవులు మృతి చెందాయని గోశాల సూపర్వైజర్ ఫోన్చేసి తమకు సమాచారం అందించాడని, దాంతో తామంతా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించామని గోవింద్కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గోశాలను సందర్శించిన కమలానంద భారతీ స్వామి వీహెచ్పీ నేతలతో కలిసి కొత్తూరు తాడేపల్లిలోని గోశాలను భువనేశ్వరి మఠం పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి సందర్శించారు. గోశాలలో జరిగిన సంఘటన హృదయాన్ని కలచివేసిందని ఈ సందర్భంగా కమలానంద భారతీ స్వామి పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఖననం చేసిన గోమాతలకు శాంతి పూజలు చేయించాలని నిర్వాహకులకు సూచించారు. -
గోశాలలో ఘోరం..
లక్నో : అయోధ్యలోని గోశాలలో ఆవుతో లైంగిక చర్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్తాలియా బాబా ఆశ్రమ్ నిర్వహిస్తున్న ఈ గోశాలలో ఈ ఘాతుకానికి పాల్పడుతూ నిందితుడు రాజ్కుమార్ వాలంటీర్లకు పట్టుబడ్డాడు. గోశాలలోని సీసీటీవీ ఫుటేజ్లో నిందితుడు పలు ఆవులపై లైంగిక దాడులకు పాల్పడటాన్ని గమనించిన వాలంటీర్లు అతనిపై నిఘా ఉంచి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించే ముందు వాలంటీర్లు చితకబాదారు. జంతువులపై క్రూరంగా వ్యవహరించినందుకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అయోధ్య ఎస్పీ జోగేంద్ర కుమార్ తెలిపారు. ఏడు ఆవులపై వరుసగా నిందితుడు అనాగరిక చర్యకు తెగబడినట్టు సీసీటీవీ ఫుటేజ్లో వెల్లడైందని గోశాల నిర్వాహకులు రాందాస్ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నానో తనకు తెలియలేదని, తనను పట్టుకున్న ప్రజలు, పోలీసులు తనను తీవ్రంగా కొట్టడం మినహా తనకు ఏమీ గుర్తులేదని నిందితుడు రాజ్కుమార్ చెప్పుకొచ్చాడు. -
పశువధ నిషేధంపై బెంగళూరులో ఆందోళనలు
బెంగళూరు : దేశవ్యాప్తంగా పశువధ నిషేధం ఆదేశాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. రోడ్లపైకి భారీగా చేరుకున్న ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశువధపై ఆంక్షల విషయంలో మోదీ సర్కార్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
ములాయం కొడుకు గోశాలకు సీఎం యోగి
-
ములాయం కొడుకు గోశాలకు సీఎం యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్ ఇంటికి వెళ్లనున్నారు. ప్రతీక్ యాదవ్ నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్(గోశాల)ను సందర్శించనున్నారు. ఇందులో ప్రతీశ్ చాలా గోవులను సాకుతూ పెద్ద గోశాలగా మార్చారు. సహజంగానే సన్యాసి అయిన యోగి ఆదిత్యానాథ్కు గోవులంటే అమితమైన ప్రేమ. వాటిని హింసించేవారంటే ఆయనకు ఏ మాత్రం నచ్చదు. గోవును మాతగా ఆయన భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో గొప్ప గోశాల అయిన కన్హా ఉపవాన్ను యోగి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రతీక్, ఆయన భార్య అపర్ణా యాదవ్తోపాటు ములాయం సింగ్ సింగ్ ఆయన భార్య సాధనా యాదవ్ కూడా అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రి యోగిని కలిసి శుభాభినందనలు తెలియజేయనున్నారు. శుక్రవారం పదిగంటల ప్రాంతంలో కన్హా ఉపవాన్ను యోగి సందర్శించే అవకాశం ఉంది. గోశాలను సందర్శించిన తర్వాత ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన 20 నిమిషాలపాటు ప్రతీక్ దంపతులు తదితరులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.


