breaking news
corporate school fees
-
‘ఫీజులుం’పై సీఎం మౌనం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారని, దాని వెనుక ఏం లాలూచీ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రైవేటు విద్యార్థుల తల్లిదండ్రులు బండి సంజయ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేవలం మూడు నెలల క్లాసులకు మొత్తం ఏడాది ఫీజు వసూలు చేయడం మానేయాలని కార్పొరేట్ కాలేజీలను హెచ్చరించారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధించడం మానకపోతే భారతీయ జనతా యువమోర్చా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ సంస్థలు... టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్తో బుడతడి సందడి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బాలుడు నర్సింహ ఆదివారం హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కలిశాడు. ఇటీవల బాన్సువాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ ప్రసంగిస్తుండగా నర్సింహ శ్రద్ధగా విని.. అనంతరం దానిపై స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో బాలుడిని బండి సంజయ్ ఆదివారం హైదరాబాద్కు పిలిపించి అతన్ని ఎత్తుకోవడంతో పాటు కలసి భోజనం చేశారు. కుటుంబ నేపథ్యం అడిగి తెలుసుకొని కొత్త దుస్తులు అందించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని, చదువుకయ్యే ఖర్చు భరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామన్నారు. -
ఆన్లైన్ ఫీ‘జులుం’.. ఐడీ, పాస్వర్డ్ల నిరాకరణ
సాక్షి, సిటీబ్యూరో: అధికారికంగా విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభమే కాలేదు. అసలు ఈ ఏడాది అవుతుందో.. కాదో? అనే అంశంపై స్పష్టత కూడా రాలేదు. కానీ నగరంలోని పలు కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు మాత్రం ఆన్లైన్ టీచింగ్ పేరుతో తరగతులను ప్రారంభించాయి. పది రోజులైందో లేదో అప్పుడే ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించాల్సిందిగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లించని వారికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ల జారీని నిలిపివేస్తున్నాయి. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగుతున్నాయి. తాజాగా హిమాయత్నగర్లోని ఓ కార్పొరేట్ స్కూలు యాజమాన్యం ఇదే అంశంపై ఒత్తిడి తీసుకురాగా, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే.. తెలంగాణ వ్యాప్తంగా 34 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో 15 లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నారు. నగరంలో సుమారు 25 ఇంటర్నేషనల్ స్కూళ్లున్నాయి. నాలుగు వేలకుపైగా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. 80 శాతం మంది విద్యార్థులు వీటిలోనే చదువుతున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.రెండు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇక కార్పొరేట్ స్కూళ్లలో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, షూ, యూనిఫాం, స్టేషనరీ అదనం. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం మార్చి 22 నుంచి అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏటా జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది వైరస్ దృష్ట్యా.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అసలు ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందో లేదో చెప్పడం కూడా కష్టమే. కానీ ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు మాత్రం ఇప్పటికే ఆన్లైన్ బోధన పేరుతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. విద్యార్థులకు ‘ఈ’ పాఠాలను తప్పనిసరి చేశాయి. యూనిఫాం వేసుకుంటేనే కంప్యూటర్ ముందు కూర్చోవాలనే నిబంధనలు కూడా పెట్టేశాయి. పాఠశాల వేదికగా పెద్దపెద్ద స్టేషనరీలు తెరిచి, స్కూలు ప్రాంగణంలోనే పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్స్, షూ, యూనిఫాం, స్కూలు బ్యాగులు.. టిఫిన్ బాక్స్లు.. ఇలా అన్ని వస్తువులను యథేచ్ఛగా విక్రయిస్తున్నాయి. ఇదే అంశాన్ని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీజులను నిరసిస్తూ హిమాయత్నగర్లో ఓ స్కూల్ ఎదుట పేరెంట్స్ నిరసన(ఫైల్) పిల్లలకు కంటి, వెన్నెముఖ సమస్యలు.. ఆన్లైన్ క్లాసులతో పిల్లలు మూడు నుంచి నాలుగు గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చొవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వెన్నునొప్పితో పాటు ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూడటంతో కంటిచూపు దెబ్బతింటోంది. చాలామంది విద్యార్థులు తలనొప్పి, వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అంతేకాదు.. టీచర్ చెప్పేది సరిగా అర్థం కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ బోధనలో ఎప్పటికప్పుడు అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తల, వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వస్తున్న పిల్లల సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని నగరానికి చెందిన ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ సుబ్బయ్య స్పష్టం చేశారు. అంతరాలు పెరుగుతాయి రాజ్యాంగం కల్పించిన రైట్ టు ఎడ్యుకేషన్ హక్కును కార్పొరేట్ స్కూళ్లు కాలరాస్తున్నాయి. ఆన్లైన్ పాఠాల పేరుతో సమాజంలో అంతరాలను మరింత పెంచుతున్నాయి. ఈ విధానంతో సంపన్నులకే చదువుకునే అవకాశం ఉంటుంది. పేదలకు నష్టం వాటిల్లుతుంది. విద్యార్థుల మధ్య అంతరాలు పెంచుతున్న ఆన్లైన్ పాఠాలను నిషేధించాలి. ఈ అంశంపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తాం. – వెంకట్, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్అసోసియేషన్ ప్రతినిధి సగం జీతాలతో.. ఫీజులెలా కడతాం? మా కూతురు హిమాయత్నగర్లోని ఓ ప్రైవేటు స్కూళ్లో చదువుతోంది. వారం రోజులుగా ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు. అప్పుడే ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించాలంటూ ఫోన్ చేస్తున్నారు. లాక్డౌన్తో మా కంపెనీ సగమే జీతమే ఇస్తోంది. ఇలు గడవడమే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే ఫీజులు ఎలా చెల్లించగలం. ఆన్లైన్లో చెప్పే క్లాసులు అర్థం కావడం లేదు. ఏదైనా అనుమానం ఉంటే ఎవరూ నివృత్తి కూడా చేయడం లేదు. – ఓ స్టూడెంట్ తల్లి -
స్కూల్ ఫీజులపై ఏమైనా చెప్పాలనుకుంటున్నారా...
హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లు విచ్చిలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులపై మరో పోరుకు స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటైన జేఏసీ కార్యాచరణ రచించింది. ఇప్పటికే పలు రూపాల్లో అధిక ఫీజుల వసూళ్ల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. తాజాగా బహిరంగ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి మాజీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎం. బుల్గయ్య తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆ జేఏసీ చైర్ పర్సన్ అరవింద జటా, సెక్రటరీ జనరల్ నాగటి నారాయణ పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఫీజు వసూలును నియంత్రిస్తామని ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని వారు పేర్కొన్నారు. చివరకు అసెంబ్లీలో సైతం మాటిచ్చినా ఇంతవరకు కదలిక లేదన్నారు. దీంతో స్కూళ్లు ఫీజులను మరింత పెంచాయని, తల్లిదండ్రులపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ బహిరంగ విచారణ చేపట్టామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ వాణి వినిపించాలని పిలుపునిచ్చారు.