breaking news
convent
-
తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ((ITCX) జరగనుంది. 2025 ఫిబ్రవరి 17 -19 తేదీల మధ్య అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శన (ఐటీసీఎక్స్) ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.ఆలయ నిర్వాహకులు, ప్రతినిధులు జనవరి 31, 2025లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఒక్కో ఆలయానికి ఇద్దరు ప్రతినిధులకు వసతి కూడా ఉంటుంది. అదనపు ట్రస్టీలు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్షాప్లు, ప్రత్యేక మాస్టర్క్లాస్లు, ప్రెజెంటేషన్లు, వర్క్షాప్లు , మాస్టర్క్లాస్లు - ఆలయ చర్చలు ఉంటాయి. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుండి హిందూ,సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థల నుండి కీలక ప్రతినిధులు పాల్గొననున్నారు. మూడు రోజుల స్మారక కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1581కి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశమవుతారు.టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి నేతృత్వంలో జరుగుతున్న ఈ మైలురాయి కార్యక్రమానికి ప్రసాద్ లాడ్ (ఐటీసీఎక్స్ 2025 చైర్మన్,మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు) సహ-నాయకత్వం వహిస్తున్నారు "ఇన్క్రెడిబుల్ ఇండియా" కార్యక్రమం కింద భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖసహకారంతో ఆలయాల కుంభమేళా నిర్వహిస్తున్నామని గిరేష్ కులకర్ణి ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఎడిషన్ 2023లో వారణాసిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
విశాఖపట్నంలో మరో ఫ్లైఓవర్!
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరో ఫ్లైఓవర్ రాబోతోంది. ఇప్పటికే ఆశీలుమెట్ట నుంచి రైల్వేస్టేషన్ వరకు ఒకటి, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వెళ్లేందుకు మరొక ఫ్లైఓవర్ ఉన్నాయి. ఎన్ఏడీ జంక్షన్లో మరో ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతోంది. తాజాగా కాన్వెంట్ జంక్షన్ నుంచి విశాఖ పోర్టు వరకు మరో కొత్త ఫ్లైఓవర్ రానుంది. దీంతో విశాఖలో ఫ్లైఓవర్ల సంఖ్య నాలుగుకు చేరుతుంది. కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టులో దీనిని నిర్మించనుంది. ఈ వంతెనకు రూ.60 కోట్లు వ్యయం కానుంది. ఇందులో సివిల్ పనులకు రూ.44.32 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం వ్యయంలో సగం సొమ్మును కేంద్ర ప్రభుత్వం, మిగిలిన సగం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), విశాఖ పోర్టు ట్రస్టు (వీపీటీ)లు సంయుక్తంగా భరిస్తాయి. ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు వరకు ఉన్న రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డులో ప్రమాదాల బారిన పడి ఏటా సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారు. పది మందికి పైగా గాయాలపాలవుతున్నారు. పైగా ఈ రోడ్డులో వాహనాల సంఖ్య పెరిగిపోతుండడంతో ట్రాఫిక్ రద్దీ అధికమవుతోంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో కేంద్రం దీనిని సాగరమాల ప్రాజెక్టులో చేర్చింది. కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు లోపల ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు 724 మీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ను నిర్మిస్తారు. ఇందుకోసం ఇటీవల టెండర్లను కూడా పిలిచారు. వీటిలో అత్యల్పంగా కోట్ చేసిన సంస్థకు నెలాఖరుకల్లా టెండరు ఖరారు చేయనున్నామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. -
ఊరంతటికీ టీచర్లు
ఆదర్శం గురువుది పాఠాలు చెప్పి ఊరుకునే మనస్తత్వమే అయితే పల్లెటూరి విద్యార్థులు పెద్దచదువులు చదవలేరు. బడికి వచ్చినవారికే నాలుగక్షరాలు నేర్పి పుస్తకం మూసేస్తే గ్రామం ఎన్నటికీ అభివృద్ధికి నోచుకోదు. పిల్లలకు చదువుతోబాటు దాని విలువ కూడా తెలియజెప్పే గురువులు కావాలి. ప్రైవేట్, కాన్వెంట్ చదువులదే రాజ్యమైన ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉన్నారు. విద్యకు దూరంగా ఉన్నవారిని బడికి తీసుకొచ్చి బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులున్నారు కనుకనే మారుమూల పల్లెల నుంచి మంచి ముత్యాలు పుట్టుకొస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కొత్తకోటపాడు గ్రామంలో ఓ ఇద్దరు ఉపాధ్యాయులు ఇటు పిల్లల్నీ, అటు తల్లిదండ్రుల్నీ కూడా విద్యావంతులుగా మారుస్తున్న వైనం తెలిస్తే వారికి చేతులెత్తి మొక్కకుండా ఉండలేం. గరిమెళ్ల అరుణ... కొత్తకోటపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని. సుధాలత టీచర్. ఐదు తరగతులకు వీళ్లిద్దరే టీచర్లు. ఈ ఇద్దరు టీచర్లు ఆ పాఠశాలకొచ్చి రెండేళ్లు దాటింది. ‘‘నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో పాఠశాలను, పిల్లల్ని చూసి చాలా ఆందోళనపడ్డాను. వీరికి కేవలం పాఠాలు మాత్రమే చె ప్పి వదిలేస్తే సరిపోదని మొదటిరోజే అర్థమయింది. దీనికి తోడు ఆ ఊరిలో ఎవరికీ కూడా చదువుపై పెద్దగా శ్రద్ధ లేదని తెలిసింది. ‘మాకు చదువు ముఖ్యం కాదు, ఏదో పిల్లలు నీడపట్టున ఉంటారనే ఉద్దేశ్యంతో బడికి పంపుతున్నాం’ అని గ్రామపెద్దలు చెప్పినపుడు మనసంతా చేదు తిన్నట్లయింది. వెంటనే నేను, సుధాలత కలిసి గ్రామపరిస్థితులపై మాట్లాడుకుని ఒక అవగాహనకొచ్చాం. పొద్దస్తమానం పాఠాలే చెబుతుంటే పిల్లలకు విసుగు పుడుతుంది. అందుకే వాటితో పాటు బొమ్మలు వేయించడం, పద్యాలు నేర్పడం, కథలు చెప్పడం, పాటలు పాడించడం వంటివి ప్రారంభించాం. దాంతో పిల్లలకి పాఠశాలపై ఆసక్తి పెరిగింది. అప్పటివరకూ ఏదో తప్పదన్నట్లుగా ఏడుపు ముఖంతో వచ్చేవారు కాస్తా ఉత్సాహంగా, సంతోషంగా బడికి రావడం మొదలుపెట్టారు’’ అంటూ తాను పాఠశాలలో అడుగుపెట్టినప్పుడున్న పరిస్థితులని గుర్తు చేసుకున్నారు అరుణ. గత ముప్పై ఏళ్లుగా అనేక ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అరుణ టీచర్కు పల్లెపాఠశాలలంటే ప్రాణం. ఆణిముత్యాలు... గడిచిన రెండేళ్లలో ఆ పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు పద్యాలు, పెయింటింగ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఊర్మిళ అనే మూడవతరగతి విద్యార్థిని పద్యాలు చెప్పడంలో మండలస్థాయిలో, పెద్దాపురం డివిజన్ స్థాయిలో బోలెడన్ని బహుమతులు గెలుచుకుని వీరి కృషికి గుర్తింపు తెచ్చింది. ‘‘నూటయాభై పద్యాలు...గుక్కతిప్పుకోకుండా చెప్పగలదు ఊర్మిళ. 2012లో తిరుపతి మహాసభలు జరిగిన సమయంలో మండలస్థాయిలో తను మొదటి బహుమతి గెలుచుకున్నప్పుడు మాకు చాలా ఆనందమేసింది. ఊర్మిళ గురించి పత్రికల్లో వచ్చినపుడు మమ్మల్ని అందరూ అభినందించారు. గంగాధర్ అనే నాలుగోతరగతి అబ్బాయి చిత్రలేఖనంలో చక్కని ప్రతిభ కనబరుస్తున్నాడు. సొంతంగా కథలు రాస్తూ వాటికి నప్పే బొమ్మలు కూడా గీస్తూ ఉపాధ్యాయుల మన్ననలతో పాటు బయటివారి మనసు కూడా గెలుచుకుంటున్నాడు. అమ్మ చేతిలోనే... బిడ్డ భవిష్యత్తు తల్లి చేతిలోనే ఉంటుందంటారు ఈ ఉపాధ్యాయులు. ‘‘అమ్మ కోరుకుంటే... అమ్మ పట్టుదలతో ఉంటే బిడ్డలు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. అందుకే మా దృష్టి మొత్తం పిల్లల తల్లులపై పెట్టాం. రోజూ పిల్లలకు పాఠాలు చెబుతూనే అప్పుడప్పుడు తల్లుల్ని కూడా పిలిపిస్తూ వారికి చదువు విలువను తెలియజేస్తున్నాం. మొదట్లో అంతగా ఆసక్తి చూపేవారు కాదు కానీ, మా కృషిని గుర్తించి క్రమేణా తల్లులందరూ కూడా తమ పిల్లలతో కలిసి బడికి రావడం మొదలుపెట్టారు’’ అంటూ తమ బోధన విశేషాలను చెప్పుకొచ్చారు అరుణ టీచర్. పాఠశాలలో హాజరుశాతం పెంచడం, పరిసరాల పరిశుభ్రత, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, పాఠశాలలో విద్యార్థులు సాధించిన ప్రగతిని, ఇతర విశేషాలని తల్లిదండ్రులతో పంచుకోవడం, పాఠశాల కార్యక్రమాలకు తల్లిదండ్రులు కూడా హాజరయేలా చూడటం... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రెండేళ్లలో ఈ ఇద్దరు టీచర్లు చాలా మార్పులు తీసుకొచ్చారు. పాఠశాలలో, ఊరివాళ్లలో ఈ ఉపాధ్యాయులు తీసుకొచ్చిన మార్పు గురించి ఆ ఊరి పెద్ద కె. శ్రీరామమూర్తి మాట్లాడుతూ... ‘‘గురువు తలుచుకుంటే ఎంతటివారినైనా మార్చగలరని అరుణ టీచర్, సుధాలత టీచర్ నిరూపించారు. మా ఊరంతా వారికి రుణపడి ఉంటుంది’’ అని అంటారు. చదువులమ్మపై ఉన్న అభిమానంతో రానూపోనూ రోజూ డెబ్భైకిలోమీటర్లు ప్రయాణించి మరీ ఈ ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఆలోచనలను కూడా మారుస్తుండడం ఎంతోమందికి ఆదర్శప్రాయం! - భువనేశ్వరి ఫొటోలు: లోలభట్టు శ్రీనివాసరాజు