breaking news
Community facilitators
-
గ్రామ సమాఖ్యలకు పచ్చదనం!
ఎచ్చెర్ల రూరల్: గ్రామస్థాయిలో వీలున్న అన్ని పదవులను తెలుగుదేశం కార్యకర్తలతో నింపేయాలని ఆ పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారు. ఇందుకోసం దొంగ సంతకాలు వంటి చర్యలకు సైతం దిగజారుతున్నారు. ఎచ్చెర్ల మండలంలో పొన్నాడ, ధర్మవరం సీఎఫ్(కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు)లను ఇదే రీతిలో తొలగించారు. పొన్నాడ సీఎఫ్ శ్రీనివాసరావును ఇప్పటికే తొలగించగా, తాజాగా ధర్మవరం సీఎఫ్ చెక్కా పార్వతి తొలగింపు వ్యవహారం సభ్యులంతా ఎదురు తిరగడంతో రచ్చకెక్కింది. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు గుండా కృష్ణవేణి దొంగ సంతకాలతో రూపొందించిన తీర్మానాన్ని ఎంఎంఎస్కు అందజేసి పార్వతిని తొలగించారని ధర్మవరం స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు ఆరోపించారు. కేశవరావుపేటలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయానికి మంగళవారం వారంతా వచ్చి పార్వతిని విధుల్లోకి తీసుకోవాలని, దొంగ సంతకాలతో తీర్మానాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న వారిని తొలగించాలని టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలకు ఇన్నాళ్లు కష్టపడి పని చేసిన సీఎఫ్లు బలి అవుతున్నారని ఆరోపించారు. తొలగింపునకు గురైన కృష్ణవేణి మాట్లాడుతూ ధర్మవరం క్లస్టర్లో ఉన్న 37 సంఘాల్లో 31 సంఘాలు తనకు మద్దతిస్తున్నాయని, అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల ఎరతో సంతకాలు తమ నుంచి సంతకాలు తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే సీఎఫ్ తొలగింపు కోసమని చెప్పలేదని సంఘాల అధ్యక్షులు స్పష్టం చేశారు. గ్యాస్ కనెక్షన్లు, రుణాలు ఇప్పిస్తామని, రుణమాఫీ వర్తింపజేస్తామని ఆశ చూపి తమ నుంచి సంతకాలు సేకరించారని ఆరోపించారు. ఉన్న పళంగా పార్వతిని తొలగించడం.. దీనికి ఆమె ఎదురుతిరిగి గత నెల 22వ తేదీన సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి ఆరా తీయడంతో ఈ విషయం బయటపడింది. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు గుండ కృష్ణవేణి గైర్హాజరైన ఈ సమావేశంలో పార్వతి మాట్లాడుతూ ఁనన్ను తొలగించాలని కోరుతూ మీరంతా సంతకాలు చేశారట.. నిజమేనా?రూ. అని ప్రశ్నించడంతో వారంతా అవాక్కయ్యారు. సంక్షేమ పథకాల పేరు చెప్పి సంతకాలు తీసుకున్నారని వారు వివరించడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ పార్వతి పలువురిని కలిసినా ఫలితం లేకపోయింది. దాంతో మంగళవారం సంఘాల అధ్యక్షులతో మళ్లీ సమావేశం నిర్వహించారు. దీనికి కూడా కృష్ణవేణి హాజరుకాలేదు. కాగా సమావేశానంతరం పార్వతితోపాటు సభ్యులందరూ మండల మహిళా సమాఖ్య కార్యాలయానికి వచ్చారు. వారు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న ఐకేపీ ఏపీఎం భాగ్యలత అక్కడి నుంచి జారుకున్నారు. ఐకేపీ ఏసీ రవికుమార్కు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆ సమయంలో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కృష్ణవేణి కార్యాలయంలోనే ఉన్నా బయటకు రాలేదు. దీంతో కార్యాలయం బయట సంఘాల అధ్యక్షులతో కలిసి పార్వతి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్సై ఉదయకుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఏం తప్పు చేసిందని పార్వతిని తొలగించారో చెప్పాలని, గ్రామంలో నిర్వహించిన సమావేశాలకు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు ఎందుకు హజరుకావటం లేదని ఆందోళనకారులు నిలదీశారు. సమాధానం చెప్పేంతవరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని కార్యాలయంలోనే ఉన్న గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కృష్ణవేణిను బయటకు తీసుకువచ్చారు. ఆమె వచ్చి గ్రామ పెద్దలతో చర్చించి, సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మా గోడును వినడానికి అధికారులు లేకుండా పోయారని.. ఎవరితో చెప్పుకోవాలని సభ్యులంతా వాపోయారు. ఈ విషయం సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎస్సై హమీ ఇవ్వటంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
డ్వాక్రా మహిళపై.. ఒత్తిళ్ల కత్తి
ఎచ్చెర్ల క్యాంపస్:ఎన్నికల హామీగా టీడీపీ తెరపైకి తెచ్చిన డ్వాక్రా రుణాల మాఫీపై అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో స్వయంశక్తి సంఘాల మహిళల పరిస్థితి ఇరకాటంలో పడింది. టీడీపీ ఇచ్చిన హామీ మేరకు గత మార్చి నుంచి సుమారు నాలుగు నెలలుగా స్వయంశక్తి సంఘాలు రుణ వాయిదాల చెల్లింపు నిలిపివేశాయి. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తుండగా, కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు సైతం డ్వాక్రా మహిళల ఇళ్లకు వెళ్లి మరీ రుణ వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో సుమారు 45 వేల స్వయం సహాయక సంఘాలు ఉండగా సుమారు 35,683 సంఘాలు రూ.713 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నాయి. సీనియారిటీని బట్టి ఒక్కో సంఘం రూ. 50 వేల నుంచి రూ. 6 లక్షల వరకు తీసుకున్నాయి. గత నాలుగు నెలలుగా ఈ సంఘాలు వాయిదాలు చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. డ్వాక్రా సంఘాలు రెండు రకాల బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుంటాయి. సభ్యుల పొదుపు రూపంలో నెలనెలా చెల్లించే రూ.30 నుంచి రూ.50 మొత్తాల జమకు ఒక ఖాతా, తీసుకున్న రుణ వాయిదాలు నెలనెలా జమ చేసేందుకు మరో ఖాతా నిర్వహిస్తుంటాయి. నెలవారీ పొదుపు సొమ్ము చెల్లించకపోతే సంఘం రద్దయ్యే ప్రమాదమున్నందున వాటిని మాత్రం అన్ని సంఘాలు ఠంచనుగా చెల్లిస్తున్నాయి. రుణ వాయిదాల చెల్లింపులు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి. పెరుగుతున్న ఒత్తిళ్లు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం.. బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో బ్యాంకర్లు రుణాలు చెల్లించాలని సంఘాలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికితోడు పథకాన్ని పర్యవేక్షిస్తున్న ఇందిర క్రాంతి పథం కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు గ్రామాలకు వెళ్లి రుణ బకాయిలు చెల్లించాలని సంఘాల లీడర్లను కోరుతున్నారు. పనిలో పనిగా ఇంకో సూచన కూడా చేస్తున్నారు. రుణ వాయిదాలను వాయిదాల పాస్ పుస్తకంలో కాకుండా పొదుపు పుస్తకంలో జమ చేయించమంటున్నారు. రుణాలు మాఫీ కాకపోతే పొదుపు ఖాతాలోని ఈ సొమ్మును బ్యాంకులు తీసుకుంటాయని, అలా కాకుండా మాఫీ అమలైతే పొదుపు సంఘాలకే ఆ మొత్తాలు ఉండిపోతాయని బ్యాంకర్ల సూచనగా చెబుతున్నారు. ఎక్కువ కాలం వాయిదాలు చెల్లించకపోతే ఆర్థిక భారం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో జిల్లా మహిళా సమాఖ్యతోపాటు 38 మండల సమాఖ్యలు, 1101 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ రుణ వాయిదాలు చెల్లించకూడదని నిర్ణయించుకున్నాయి. ఐకేపీ సీఎఫ్లు కూడా మొదట వాయిదాలు కట్టొద్దని చెప్పినా.. ఇప్పుడు చెల్లించమంటుండటం చర్చనీయాంశంగా మారింది. ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేట, కేశవరావుపేట, చిలకపాలెం, ఇబ్రహీంబాద్ తదితర గ్రామాల్లో సీఎఫ్లు పొదుపు ఖాతాలో రుణ వాయిదాలు జమ చేయాలని సంఘాల సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా అంతటా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. వాయిదాలు చెల్లించ మంటున్నారు వాయిదాలు కట్టమని సీఎఫ్ ఒత్తిడి తెస్తున్నారు. పొదుపు పుస్తకంలో జమ చేయమని సూచిస్తున్నారు. లేదంటే మొత్తం ఒక్కసారి చెల్లించాల్సి వస్తుందని.. భారం అవుతుందని భయపెడుతున్నారు. భవిష్యత్తులో రుణం కూడా మంజూరు కాదని హెచ్చరిస్తున్నారు. ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాం. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. -ఉర్లాపు పున్నమ్మ, ఫరీదుపేట