breaking news
the Commissioner and Director of Municipal Administration
-
క్యాష్ కొట్టు.. పోస్ట్ పట్టు
జూనియర్లకే లెసైన్సింగ్ ఆఫీసర్ పోస్టులు నిబంధనలకు తూట్లు కౌన్సిల్కు సిద్ధమైన ఫైల్ విజయవాడ సెంట్రల్ : అక్కడ జీవోలతో పనిలేదు. కొంచెం రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారులను మెప్పించగల సత్తా, కాస్త కాసులిస్తే చాలు అడ్డదారిలో పోస్ట్ను పట్టేయొచ్చు. హెల్త్ అసిస్టెంట్ల నియామకానికి సంబంధించి కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) జారీ చేసిన 780 జీవోను పక్కన పడేసిన ప్రజారోగ్య శాఖాధికారులు అదే జీవో లెసైన్సింగ్ ఆఫీసర్ల పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఫైల్ సిద్ధం చేయడం వివాదాస్పదమైంది. ఈ పోస్ట్ల పంపకానికి సంబంధించి భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్ఓ) ట్రేడ్ లెసైన్స్ మంజూరుకు సంబంధించి లెసైన్సింగ్ ఆఫీసర్లను నియమించాల్సిందిగా ప్రభుత్వం జీఓ 780 ను జారీచేసింది. సీనియర్ శానిటరీ సూపర్వైజర్లను లెసైన్సింగ్ ఆఫీసర్లుగా నియమించాలని జీవోలో పేర్కొన్నారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్లతో పోస్టుల్ని భర్తీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎగరేసుకుపోయారు సర్కిల్-1కు ఓబేశ్వరరావు, సర్కిల్-2కు శ్రీధర్, సర్కిల్-3కి నారాయణను లెసైన్సింగ్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఫైల్ సిద్ధం చేశారు. ప్రస్తుతం వీరు శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న డివిజన్లలో ఇన్చార్జి బాధ్యతలను మురళీ, సోమరాజు, ఎం.వెంకటే శ్వరరావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరు మలేరియా ఇన్స్పెక్టర్లుగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల అనుగ్రహంతో కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు రెండు, మూడు డివిజన్లకు ఇన్చార్జీలుగా వ్యవహరించడం కొసమెరుపు. భర్తీకాని హెల్త్ అసిస్టెంట్ పోస్టులు జీవో 780 ప్రకారం హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా గత ఏడాది సీడీఎంఏ ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్ బైపీసీ లేదా ఎంపీసీ చదివి, డిప్లమో ఇన్ శానిటేషన్ కోర్సు పూర్తిచేసిన ప్రజారోగ్యశాఖ ఉద్యోగులను హెల్త్ అసిస్టెంట్లుగా నియమించాల్సిందిగా జీవోలో పేర్కొన్నారు. 43,84 జీవోల వివాదం నడస్తున్న దృష్ట్యా హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం లేదని చెబుతూ ప్రజారోగ్య శాఖాధికారులు కాలం వెళ్లబుచ్చుతున్నారు. నగర పాలక సంస్థలోని 24 హెల్త్ అసిస్టెంట్ పోస్టుల్లో 2000వ సంవత్సరం నుంచి ఇన్చార్జీలతో నడిపిస్తున్నారు. -
ప్రచార పటాటోపం !
పట్టణ ప్రాంత ప్రజలారా.. మీ సమస్యలేమిటో చెప్పండి.. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.. అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రచారం ఆర్భాటంగానే మిగిలింది. మున్సిపాలిటీల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రూపొందించిన ఆన్లైన్ విధానంపై ప్రజలకు అవగాహన కొరవడింది. దాంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులొస్తే పరిష్కరించడం తలకు మించిన భారమవుతుందని భావించారో ఏమో.. మున్సిపల్ అధికారులు దీనికి తగిన ప్రచారం కల్పించలేదు. దీంతో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టి నాలుగు నెలలైనా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించటం లేదు. చిలకలూరిపేట : మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, పైపులైన్ల లీకులు, మురుగునీటి పారుదల, రోడ్ల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలకశాఖ గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ఆర్వోసీ నం 12220/2014-డి పేరుతో సర్క్యులర్ జారీ చేసింది. సీడీఎంఏ వెబ్సైట్లో సిటిజన్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అనే నూతన విభాగాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్రప్రదేశ్లోని 111 మున్సిపాలిటీల్లో ఈ పద్ధతి అదే నెల 12వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా సమస్య, తీవ్రతను వివరిస్తూ ఒక ఫొటో జోడించి ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు. స్పందన ఏదీ..? జిల్లాలో సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి 2 తేదీ వరకు సిటిజన్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్కు గుంటూరు కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీల నుంచి 144 ఫిర్యాదులు మాత్రమే అందాయి. ఇందులో 121 పరిష్కారం అయ్యాయి. మిగిలిన 13 ఈ ఆన్లైన్ ఫిర్యాదులకు సంబంధం లేనివి. కార్పొరేషన్ పరిధి మినహాయిస్తే మిగిలిన మున్సిపాలిటీల్లో చిలకలూరిపేటలో అత్యధికంగా 18 ఫిర్యాదులు అందాయి. ఒక్క ఫిర్యాదు కూడా అందని మున్సిపాలిటీగా రేపల్లె నిలిచింది. ఈ గణాంకాలను చూస్తే ప్రజల నుంచి స్పందన కరువైందనేది స్పష్టమవుతోంది. మున్సిపాలిటీల్లో సమస్యలు లేకకాదు.. ఫిర్యాదు చేయడంపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఫిర్యాదు చేసేదిలా... ముందుగా సీడీఎంఏ.ఏపీ.జీవోవీ.ఇన్ అనే వెబ్సైట్లోకి ప్రవేశించిన అనంతరం ఎడమ వైపున ఉండే సిటిజన్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్పై క్లిక్ చేయాలి. కొత్త విండో తెరచుకొని సిటిజన్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్లో చెత్తబుట్ట, కాల్వల్లో మురుగు, పైపులైన్ లీకేజీ, రోడ్డుపై గుంత ఫొటోలు కనిపిస్తాయి. ఫిర్యాదు చేసే అంశంపై ఏ పరిధిలోకి వస్తుందో దానిపై క్లిక్ చేయాలి. ఉదాహరణకు పైపులైన్ లీక్పై ఫిర్యాదు చేయదలిస్తే వెబ్సైట్లో సూచించిన విధంగా పైపులైన్ లీకేజీ బొమ్మపై క్లిక్ చేయాలి. ఫిర్యాదు నమోదు చేయటానికి ఆరు అంశాలతో దరఖాస్తు ప్రత్యక్షమవుతుంది. ముందుగా ఫిర్యాదుదారుడు ఏ మున్సిపాలిటీకి చెందినదీ తెలపాలి. యూఎల్బీ నేమ్ అన్న సూచిక ఎదురుగా క్లిక్చేస్తే సమస్య ఏ మున్సిపాలిటీదో ఆ పేరు పేర్కొనాలి. అనంతరం ఫిర్యాదుదారుని పేరు, సెల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ(ఉంటే), సమస్య ఏప్రాంతానికి చెందినదో తెలపాలి. తరువాత సమస్య తీవ్రత తెలిపే ఫొటో జత చేయాలి. వీటిని పూర్తి చేసిన తరువాత సబ్మిట్ అన్న చోట క్లిక్ చేస్తే సెల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు నంబర్ వస్తుంది. ఇక్కడితో ఫిర్యాదుదారుడి పనిపూర్తవుతుంది. సమస్య పరిష్కరించి ఫొటో జత చేయగానే ఫిర్యాదు దారుని సెల్ఫోన్కు ఎస్ఎంఎస్, మెయిల్కు సమాచారం వస్తుంది. సమస్య పరిష్కారమైన తీరును సెర్చ్ గ్రీవెన్స్ స్టేటస్పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.