breaking news
Commercial transactions
-
ఆ భూములకు రైతు ‘బంద్’!
రవీంద్రనాథ్ (పేరు మార్చాం)కు హైదరాబాద్ శివారులో ఐదెకరాల భూమి ఉంది. దానికి వ్యవసాయ పట్టా ఉంది. ఆ భూమిలో విల్లాలు నిర్మించారు. కానీ వ్యవసాయ భూమిగా రికార్డుల్లో ఉండటంతో ఏటా ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుబంధు అందుతోంది. రికార్డుల ప్రకారం భూమిలో ద్రాక్ష తోట అని ఉంది. రాజశేఖర్ (పేరు మార్పు) పేరుతో రంగారెడ్డి జిల్లాలో పదెకరాల భూమి ఉంది. అంతా వ్యవసాయ పట్టా భూమి. కానీ ఆ భూమిలో పంటలు పండట్లేదు. వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. కానీ వ్యవసాయ పట్టా ఉండటంతో ఏడాదికి రూ. లక్ష రైతుబంధు అందుకుంటున్నాడు. రికార్డుల ప్రకారం అందులో కూరగాయల సాగు చేస్తున్నట్లు ఉంది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పట్టా ఉండి అందులో పంటలు పండించకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రైతుబంధు సొమ్ము అందుకుంటుండటంపై సర్కారు గుర్రుగా ఉంది. వాణిజ్య లావాదేవీలు, ఇతరత్రా అవసరాలకు వాడే భూములకు వ్యవసాయ పట్టా ఉంటే రైతుబంధును నిలిపేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలాంటి భూములు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలున్నాయో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. రైతుబంధు స్ఫూర్తికి విరుద్ధం 2018–19 వ్యవసాయ సీజన్ నుంచి రైతుబంధు ప్రారంభమైన విషయం తెలిసిందే. రైతుకు సాగు సమయంలో పెట్టుబడి ఖర్చుల నిమిత్తం అండగా ఉండాలని ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. మొదట్లో ఓ సీజన్కు ఎకరాకు రూ. 4 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ. 8 వేలు ఇచ్చింది. ఇప్పుడు సీజన్కు ఎకరాకు రూ. 5 వేలు ఇస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లకు పైగా రైతులకు సాయం చేసింది. ఈ ఏడాది యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు సంబంధించి 63 లక్షల మంది రైతులకు రూ. 7,412 కోట్లు అందజేసింది. 2021–22 వ్యవసాయ సీజన్లో మొత్తం రూ. 14,772 కోట్లు అందజేసింది. నాలా మార్పిడి చేయకుండా వ్యవసాయ భూమిగానే.. రైతుబంధును కొందరు ధనవంతులైన సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు, ఇతర ధనవంతులు కూడా తీసుకుంటు న్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే వీటిని ప్రభు త్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాణిజ్య కార్యకలా పాల్లో, వ్యవసాయేతర రంగాల్లో ఉన్న భూములకు రైతు బంధు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చర్చ జరగ డంతో దానిపై దృష్టి పెట్టింది. కొన్ని భూముల్లో పరిశ్రమలు, విల్లాలు, ఇళ్లు ఉన్నా వాటిని నాలా మార్పిడి చేయకపోవ డంతో వ్యవసాయ పట్టా భూములుగా చలామణి అవుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, వికారాబాద్ సహా అనేక జిల్లాల్లో ఇలాంటివి లక్షలాది ఎకరాలు ఉండొచ్చని అంటున్నారు. ఈ భూములు 10 లక్షల ఎకరాలు వెలుగుచూసినా ప్రభుత్వానికి ఏటా రూ. వెయ్యి కోట్లు ఆదా కానుంది. అయితే రైతుబంధు నిలుపుదలపై మాట్లాడటానికి వ్యవసాయాధికా రులు ఎవరూ సిద్ధంగా లేరు. రైతుబంధు విధాన నిర్ణయం తమ పరిధిలోది కాదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ వానాకాలం సీజన్ రైతుబంధును త్వరలో విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నారు. -
వాణిజ్య అవకాశాలను పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్ : ఇరు ప్రాంతాల నడుమ వాణిజ్య సంబంధాలకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు తమ దేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని పోలండ్ రాయబారి తోమస్జ్ లుకస్జక్ ఆహ్వానించారు. లుకస్జక్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 5, 6 తేదీల్లో బెంగళూరులో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘బారత్- మధ్య యూరోప్ వాణిజ్య సదస్సు’ రెండో విడత ఏర్పాట్లలో భాగంగా ఈ భేటీ జరిగింది. భారత్తో తాము ఏటా రెండు బిలియన్ల డాలర్ల విలువైన వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు లుకస్జక్ వెల్లడించారు. గృహోపకరణాలు, టెలివిజన్ల తయారీలో పోలండ్ ప్రపంచంలోనే అగ్రగామిగా వుందన్నారు. దీంతో జపాన్, కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలు పోలండ్లో పరిశోధన, అభివృద్ధి సంస్థలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. వ్యవసాయం, ఫర్నిచర్, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్ రంగాల్లో పోలండ్ ప్రతినిధుల బృందం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించింది. అక్కడున్న నైపుణ్య మానవ వనరులు, సరళీకృత విధానాలకు ఆకర్షితులై భారతీయులు కూడా పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ఆ బృందం ప్రస్తావించింది. తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం ప్రత్యేకతలను మంత్రి జూపల్లి పోలండ్ బృందానికి వివరించారు. ఇరు ప్రాంతాల నడుమ పెట్టుబడులకున్న అనుకూలతలు, మానవ వనరులు తదితరాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోనూ లుకస్జక్ బృందం భేటీ జరిపింది. ఇక్కడి అవకాశాలు, పారిశ్రామిక విధానంపై రాజీవ్ శర్మ పోలండ్ బృందానికి వివరించారు. పోచారంతో పోలండ్ రాయబారి భేటీ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్లో పోలండ్ రాయబారి థామస్ లుకాజుక్ తెలిపారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్స్లో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో ఆయన భేటీ అయ్యారు. గతంలో అమూల్ పాల ఉత్పత్తి సంస్థలో పెట్టుబడులు పెట్టామని, పన్నీర్, వెన్న తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించామని పేర్కొన్నారు. పోలండ్లో వ్యవసాయం, నీటి వనరుల సంరక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వ కృషి తదితర వివరాలను మంత్రికి వివరించారు. కాగా, నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఏర్పాటు చేసిన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల పోలండ్ రాజధానిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం కుదిరే అవకాశముందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి ప్రవీణ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు.