breaking news
comitions
-
వసూళ్ల ‘రాజ్’
- పంచాయతీరాజ్లో పర్సెంటేజీల పర్వం - అంగన్వాడీ భవన నిర్మాణ కాంట్రాక్టర్ల నుంచి వసూలు - లబోదిబోమంటున్న కాంట్రాక్టర్లు - పనుల నాణ్యతకు తిలోదకాలు అనంతపురం సిటీ : పంచాయతీ రాజ్ శాఖలో ‘వసూళ్ల రాజాలు’ హల్చల్ చేస్తున్నారు. ప్రతి పనికీ ‘రేటు’ కడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే బిల్లులు పెండింగ్ పెడుతున్నారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. అధికారులు మొదలుకుని అటెండర్ల వరకు ప్రతిఒక్కరికీ వారి ‘స్థాయి’ని బట్టి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. వసూళ్ల రాజాలను సంతృప్తి పరిచే క్రమంలో పనుల నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామీణరోడ్లు, కోల్డ్స్టోరేజీలు, అంగన్వాడీ, హాస్టల్ భవన నిర్మాణాలు తదితర పనులు చేపడుతున్నారు. ప్రతి పనిలోనూ అధికారులు ముక్కుపిండి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 851 అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని 29 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పుతో నిర్మించాలి. ఒక్కో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.7 లక్షలు కేటాయించింది. భవనం పైకప్పు వరకు నిర్మాణానికి రూ.5 లక్షలు , పైపనులకు రూ.2 లక్షల ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. ఈ మొత్తంతో నిబంధనల మేరకు పనులు చేపడితే భవనాలను దృఢంగా నిర్మించవచ్చు. అయితే.. వసూళ్ల రాజాలు ఇందులోనూ కక్కుర్తి పడుతున్నారు. పనుల నాణ్యత దేవుడెరుగు..తమ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే బిల్లు చేయడం లేదు. ఒక్కో భవన నిర్మాణంపై ఏకంగా రూ.లక్ష దాకా చేతులు తడపాల్సి వస్తోందని అనంతపురం సబ్డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో భవన నిర్మాణం చేపట్టిన ఓ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్కు భవన నిర్మాణ అనుమతులు వచ్చి ఐదు నెలలు అవుతోంది. టాప్ లెవల్ వరకు పనులు చేశారు. ఇప్పటిదాకా రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేశారు. మరో రూ.2.50 లక్షలు అయ్యే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఐదు నెలలుగా ఈ పని కోసం తిరిగినందుకు రూ.లక్ష దాకా అయ్యిందని చెప్పారు. కేవలం ఫైలు కదిలించేందుకే రూ.78 వేలు మామూళ్లు ఇచ్చుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ‘ఎంతో కొంత మిగులుతుందనే ఆశతో ఈ కాంట్రాక్ట్ తీసుకున్నా. తీరా చూస్తే చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తోంది. బుద్ధుంటే పంచాయతీరాజ్ పనులు చేయకూడదు. ఏదో తెలీక పని తీసుకుని నష్టపోయా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్నిబట్టే పంచాయతీరాజ్ శాఖలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల పర్సెంటేజీల కారణంగా పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. మరీముఖ్యంగా అంగన్వాడీ భవనాలను పలుచోట్ల నాసిరకంగా నిర్మిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. చిన్నారుల జీవితాలతో ముడిపడిన ఈ భవన నిర్మాణాల నాణ్యతపై కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అధ్యయన కేంద్రాల అక్రమార్జన
- ‘మెయింటెనెన్స్’ పేరిట వసూళ్ల పర్వం - ఒక్కో విద్యార్థిపై రూ.3వేల నుంచి రూ.5వేలు అదనపు భారం - రూ.15వేలు కడితే పరీక్ష రాయాల్సిన పని కూడా లేదట! - మూడు పువ్వులు ఆరు కాయలుగా విద్యా వ్యాపారం ........................................................... కర్నూలు జిల్లాలోని ఒక అధ్యయన కేంద్రంలో ప్రణతి అనే విద్యార్థిని దూరవిద్య ద్వారా డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ కేంద్రం నిర్వాహకులు ఆమెకు ఫోన్ చేసి డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు ఉంటాయని, రూ.3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఫీజు మొత్తం చెల్లించేశాం కదా, ఇదెందుకు అని అడిగితే పరీక్షల నిర్వహణకు సవాలక్ష ఖర్చులు ఉంటాయని, ఎందరినో ప్రభావితం చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అడిగిన డబ్బులు చెల్లించకపోతే హాల్టికెట్ ఇవ్వబోమన్నారు. ఒక్క ప్రణతి విషయంలోనే కాదు... సింహభాగం దూరవిద్య అధ్యయన కేంద్రాల నిర్వాహకులు అందరూ ఇదే బాటలో నడుస్తున్నారు. ........................................................... ఎస్కేయూ : ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించనున్నారు. ఈ సమాచారాన్ని ఎస్కేయూ ఉన్నతాధికారులు ఆయా అధ్యయన కేంద్రాలకు ముందస్తుగా అందించారు. ఈ నేపథ్యంలో వాటి నిర్వాహకులు మెయింటెనెన్స్ పేరిట వసూళ్లు మొదలెట్టేశారు. కోర్సు ఫీజు కట్టిన విద్యార్థి అదనంగా రూ.3 వేల నుంచి రూ.5వేలు కడితేనే కానీ హాల్టికెట్ ఇచ్చేది లేదంటున్నారు. హాల్టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచకుండా నేరుగా అధ్యయన కేంద్రాలకు పంపుతుండటం వల్ల వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మరీ విడ్డూరం ఏమిటంటే.. ఒక్కో పేపరుకు రూ.3 వేలు చొప్పున 5 పేపర్లకు రూ.15 వేలు కడితే విద్యార్థులు పరీక్షలు కూడా రాయాల్సిన పని లేదట. నిర్వాహకులే వారి స్థానంలో మరొకరిని పంపి పరీక్షలు రాయించే ఏర్పాట్లు చేస్తున్నారన్న విమర్శలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి. అధ్యయన కేంద్రాల నిర్వాహకులు ఇలా ఏటా అక్రమంగా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 212 అధ్యయన కేంద్రాలలో 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఎస్కేయూ దూరవిద్య విభాగానికి వచ్చే నికర ఆదాయం కన్నా అధ్యయన కేంద్రాల అక్రమార్జన కనీసం అంటే రెట్టింపు ఉంటుందనేది పరిశీలకుల అంచనా. ఫీజులో 20 శాతం ఇస్తున్నా... ప్రతి డిగ్రీ అడ్మిషన్కు విద్యార్థి వర్సిటీకి చెల్లిస్తున్న కోర్సు ఫీజులో 20 శాతం అధికారికంగా అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు చెల్లిస్తున్నారు. ఇవి కాక పరీక్ష నిర్వహణ కేంద్రానికి సంబంధించిన అన్ని రకాల ఖర్చులూ వర్సిటీ చెల్లిస్తుంది. అయినప్పటికీ వారు విద్యార్థుల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారు. వీటిపై ఎస్కేయూ దూరవిద్య విభాగం పూర్తిగా నియంత్రణ కోల్పోవడం వల్లే పరిస్థితి ఇలా తయారైందన్న విమర్శలూ లేకపోలేదు. గతేడాది కొన్ని పరీక్ష కేంద్రాలకు మాత్రమే పరిశీలకులను నియమించారు. వారు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో అధ్యయన కేంద్రాల అక్రమార్జన యథేచ్ఛగా సాగింది. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు దూరవిద్య విభాగం అధికారులు తగిన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.