breaking news
CM Ramnesh
-
భలే మంచి లంచ్ బేరం
సాధారణంగా ఒక హోటల్లో లంచ్ చేస్తే సుమారు రూ.500 బిల్లు అవుతుంది.. అదే స్టార్ హోటల్ అయితే రూ.1000 నుంచి రూ.1500. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ నేతల ఇళ్లల్లో మాత్రం లంచ్ ఖరీదు రూ.లక్షల్లోనే ఉంటుంది. లంచ్ ఒక్కటే కాదు.. టీ, టిఫిన్, డిన్నర్ ఏదైనా చాలా ఖరీదు చేసేశారు. ఇంతకీ ఈ లక్షల రూపాయల లంచ్ గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక సమరం సమీపిస్తున్న తరుణంలో ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఓట్ల రాజకీయంతో పనికాదని గ్రహించి.. నోట్ల రాజకీయాలకు తెర తీసింది. ప్రత్యర్థి పార్టీ నేతలను లంచ్, డిన్నర్కి పిలిచి బేరాలు పెడుతోంది. సర్పంచ్ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి వరకూ ఒక్కొక్కరికీ ఒక్కో రేటు నిర్ణయించేస్తోంది. ఇందులో సిద్ధ హస్తుడుగా ఉన్న గంటా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకొని.. అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు ఇదే ఫార్ములా అవలంబిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలను సంతలో పశువుల్లా బేరాలాడి కొనేస్తే చాలని లెక్కల్లో తలమునకలయ్యారు. లంచ్, డిన్నర్ పేరుతో లక్షలు ముట్టజెబుతున్నారు. గంటా రూటే సేపరేట్ టీడీపీ పెద్దల కాళ్లా వేళ్లా బతిమాలి ఎట్టకేలకు భీమిలి టికెట్ సాధించుకున్న గంటాకు ఎన్నికలంటే డబ్బుతో గెలవడమే అనే నైజం. ప్రజలన్నా నాయకులన్నా ఆయన దృష్టిలో ఓటును, వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనస్తత్వం కలవారు. రూ.500కి వెయ్యకపోవచ్చు.. రూ.వెయ్యికి వెయ్యకపోవచ్చు.. రూ.2 వేలు.. ఇలా.. ఏదో ఒక నంబర్ దగ్గర ఓటరు తనకు లొంగుతారనే విర్రవీగే మనస్తత్వంతో రాజకీయాలు చెయ్యడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఇదే మాదిరిగా చోటా మోటా నాయకులకు సైతం వెలకడుతున్నారు. గంటా ఒక్కరే కాదు టీడీపీ నుంచి టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్క నాయకుడూ ఇదే రీతిలో ఆలోచిస్తూ రాజకీయాలి్న, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. విలువలు అమ్ముకుంటూ రాయ‘బేరాలు’ వెన్నుపోటు రాజకీయాలు మొదలైనప్పటి నుంచి విలువలను విడిచిపెట్టి అడ్డగోలుకు కేరాఫ్గా మారిపోయింది టీడీపీ. అంతా ఆ తాను ముక్కలే అన్నట్లుగా పార్టీలలో ఉన్నవారంతా కనీస విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారు. డబ్బుతోనే ఏదైనా సాధ్యమనే అహంకారంతో విర్రవీగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థులు తమ ఇంటికి లేదా సమీపంలో ఉన్న ఓ హోటల్కి భోజనానికి ఆహ్వానించడం.. రాయ‘బేరాలు’ మాట్లాడుకోవడమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. బేరం కుదిరిన వెంటనే చోటా నేతలు కండువాలు కప్పేసుకుంటున్నారు. ►చోడవరంలో టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజు ఇటీవలే పలువురు ప్రత్యర్థి పార్టీ నేతలను నోట్ల కట్టలతో కొనుగోలు చేసుకున్నారు. ►పాయకరావుపేటలో వంగలపూడి అనిత.. ఓ హోటల్లో సామాజికవర్గ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులను ఆత్మీయ సమావేశం పేరిట ఆహా్వనించారు. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతూ సర్పంచ్కు రూ.2 లక్షలు, ఎంపీటీసీ సభ్యుడికి రూ.5 లక్షలు, 100 ఓట్లు ప్రభావితం చేసే సామాజికవర్గ నాయకుడికి రూ.5 లక్షలకు బేరం పెట్టేసుకున్నారు. ►పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు సైతం అదే రాయబేరాలు సాగిస్తున్నారు. ఈయన రూ.లక్ష నుంచి తన బేరాలు మొదలు పెడుతున్నారు. ►ఇవి కేవలం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గడపగడపకు వెళ్లి ప్రజలకు ఇంకా అందించాల్సిన మౌలిక సదుపాయాలు, వారి అభిప్రాయాలు సేకరిస్తుంటే.. టీడీపీ అభ్యర్థులు మాత్రం.. నేతల కొనుగోలులో బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.2 కోట్లకు డీల్..! భీమిలి నియోజకవర్గంలో జరిగిన బేరం ఖరీదు అక్షరాలా రూ.2 కోట్లు. ఇక్కడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుడి మద్దతును టీడీపీ నేతలు కోరారు. అతడు ఒప్పుకోలేదు. బతిమలాడారు.. లంచ్, డిన్నర్కు ఆహా్వనించారు. పనవ్వలేదు. స్వయంగా వాళ్లే భోజనానికి వెళ్లారు. అర కోటి నుంచి బేరం మొదలైంది... చివరికి రూ.2 కోట్లకు డీల్ కుదిరింది. అక్కడికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే భీమిలిలో ఓ జెడ్పీటీసీ సభ్యుడికి రూ.10 లక్షల ధర పలికింది. మరికొందరు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు బేరాలు కుదిరినట్లు తెలిసింది. కొంతమంది మాజీ నేతలు, పలుకుబడి ఉన్న నేతలకు కూడా మరో రేటు ఫిక్స్చేసినట్లు సమాచారం. సీఎం రమేష్ రాకతో పెరిగిన రేట్లు 300 మంది రౌడీ మూకలను వెంటబెట్టుకొని అనకాపల్లిలో అడుగుపెట్టిన మాజీ టీడీపీ, ప్రస్తుత బీజేపీ నేత సీఎం రమేష్ రాకతో.. ఆయా ప్రతినిధులు తమ రేట్లను అమాంతం పెంచేసుకుంటున్నారు. తమను నమ్ముకొని ఉన్న ప్రజలను పక్కన పెట్టేసి.. తమకింత ఇస్తే చాలు.. మీ పార్టీ కండువా కప్పేసుకుంటామంటూ బేరాలాటలో మునిగితేలుతున్నారు. ఎన్నికల సమయంలో డబ్బులకు అమ్ముడుపోయి.. పార్టీ కండువాలు మార్చేసుకుంటూ.. టీడీపీ పంచన చేరుతున్న నేతలను చూసి జనం ఛీ కొడుతున్నారు. ఇలాంటి వారినా మనం సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపించామా అని అసహ్యించుకుంటున్నారు. -
మంత్రి వర్సెస్ ఎంపీ..!
కడప: అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకొని రాజకీయంగా పైచేయి సాధించాలనే లక్ష్యం ఆ ఇద్దరు నేతల్లో దాగి ఉంది. ఈక్రమంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదుల కత్తులు దూస్తున్నారు. అధిష్టాన పెద్దలకు నిజాయతీగా పార్టీ ఉన్నతి కోసం కష్టపడుతున్నామని భ్రమ కల్పిస్తున్నారు. ఈక్రమంలో ఎవరికి వారు వ్యక్తిగత పరపతి కోసం తాపత్రయం చూపుతున్నారు. వారే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి అనూహ్యంగా మంత్రి పదవి వరించింది. ఇకపై జిల్లాలో టీడీపీ మెరుగవుతుందని భావించిన అధిష్టానానికి అనతికాలంలోనే ‘కొరివితో తలగోక్కున్నామనే’ విషయం తేటతెల్లమైందని పరిశీలకుల భావన. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక అక్రమాల ఫలితం, ఎంపీ రమేష్ తోడ్పాటు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి వరించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆపై జిల్లాలో రాజకీయ పెత్తనం తన ద్వారానే ఉండాలనే తాపత్రయం మంత్రి ఆదికి మొదలైందని పలువురు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎస్పీ పీహెచ్డి రామకృష్ణ అవినీతికి పాల్పడుతున్నారని వివాదస్పద వ్యాఖ్యలు సైతం చేశారు. జిల్లాలో టీడీపీకి దశ–దిశ తానేనని చెప్పుకోవడం ఆరంభించారు. అధికారులపై, పార్టీపై పట్టు సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఎంపీపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు.... ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యాక చతురత ప్రదర్శించే ఎత్తుగడ చాపకింద నీరులా వ్యవహరించసాగారని పలువురు పేర్కొంటున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో తన కంటే కాస్తా పైచేయిలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ను కట్టడి చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎంపీ రమేష్ చర్యల వల్ల టీడీపీ అప్రతిష్టపాలు అయ్యే అవకాశం ఉంది. అందుకు కారణం ‘గాలేరు–నగరి సుజల స్రవంతి’ పథకం పనులేనని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎం రమేష్ కాంట్రాక్టు సంస్థ పనులు తీసుకొని వాటిని పూర్తి చేయడం లేదని, రెండేళ్లుగా పురోగతి లేదని, తద్వారా జిల్లాలో జీఎన్ఎస్ఎస్ పెండింగ్లో ఉండిపోయిందని వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రాజెక్టు పట్ల శ్రద్దతో ఉన్న విషయం ఉత్తుత్తిదేనని ఎంపీ రమేష్ చర్యల వల్ల ప్రజలు భావిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి ఆది ఫిర్యాదుతో వెంటనే ముఖ్య మంత్రి చంద్రబాబు స్పందించి ఎంపీ రమేష్కు ఫోన్ చేసి జీఎన్ఎస్ఎస్ కాంట్రాక్టు పనులు గురించి ఆరా తీసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎంపీ రమేష్ జిల్లాకు చెందిన మంత్రి ఫిర్యాదు చేశారని తెలుసుకొని తనపైనే ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, నాకే స్వయంగా చెప్పిఉండొచ్చు కదా అని ప్రశ్నించినట్లు టీడీపీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. ఎంపీ ఇఫ్తార్కు మంత్రి గైర్హాజర్... రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ముస్లిం మైనార్టీలకు ప్రొద్దుటూరులో మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్గజపతిరాజు హాజరయ్యారు. కాగా జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ కార్యక్రమానికి గైర్హాజర్ అయ్యారు. మంత్రి, ఎంపీ మధ్య విభేదాలు పొడచూపడంతోనే ఇఫ్తార్కు రాలేదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎంపీ రమేష్ సైతం వ్యక్తిగత పరపతి కోసమే కేంద్ర మంత్రి పాల్గోనేలా వ్యవహరించారని పలువురు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఎంపీ రమేష్పై మంత్రి ఆది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎంపీ వర్గీయులు మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు సన్నహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆధారాలతో సహా నిరూపించేందుకు తెరవెనుక కసరత్తు ఆరంభించినట్లు సమాచారం. ఇటీవల ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీపై ఆరోపణలు చేశారని, అలాగే జిల్లాలో మార్కెఫెడ్ యంత్రాంగంపై ఆరోపణలొస్తే మధ్య దళారుల ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని పలు ఆరోపణలు సన్నద్ధం చేశారు. వీటన్నిటికి ఆధారాలు సమకూర్చి నేరుగా ముఖ్యమంత్రికి చేర్చాలనే దిశగా పావులు కదుపుతోన్నట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాలకంటే వ్యక్తిగత ప్రయోజనాలకే మంత్రి ఆది ప్రాధాన్యత ఇస్తున్నారని రుజువు చేసేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.