breaking news
CM Mamata
-
మరో తృణమూల్ ఎంపీ అరెస్ట్
రోజ్ వ్యాలీ చిట్ స్కాంలో సీబీఐ అదుపులో సుదీప్ ♦ పీఎంఓ ఒత్తిడితోనే: పశ్చిమబెంగాల్ సీఎం మమత కోల్కతా: చిట్ ఫండ్ స్కాంలో వారం తిరగక ముందే మరో తృణమూల్ కాంగ్రెస్ నేత అరెస్టయ్యారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాం కేసులో తృణమూల్ ఎంపీ, లోక్సభలో ఆ పార్టీ పార్లమెంటరీ నేత అయిన సుదీప్ బంధోపాధ్యాయ్ని సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఇక్కడి సీబీఐ ఆఫీసుకు వచ్చిన ఆయనను 4గంటలపాటు సదీర్ఘంగా విచారించి అనంతరం అదుపులోకి తీసుకుంది. ఆయన దర్యాప్తునకు సహకరించలేదని, రోజ్ వ్యాలీ కంపెనీ స్పాన్సర్ చేసిన విదేశీ పర్యటనపై ప్రశ్నలకు జవాబులివ్వలేదని సీబీఐ వర్గాలు చెప్పాయి. తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, ఎంపీలు సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఆయనను కలుసుకుని మద్దతు తెలిపారు. ఈ కేసులో ఆయనకు ఇదివరకు మూడుసార్లు దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. ఇదే స్కాంలో మరో తృణమూల్ ఎంపీ తపస్ పాల్ను శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుదీప్ అరెస్ట్తో రెచ్చిపోయిన తృణమూల్ అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు నగరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై రాళ్లు రువ్వి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ కార్యకర్తలు 15 మంది గాయపడ్డారని బీజేపీ తెలిపింది. మోదీ దమ్ముంటే అరెస్ట్ చేయండి సుదీప్ అరెస్ట్పై తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒత్తిడితోనే అరెస్ట్ చేశారని, మోదీని, అమిత్ షాను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దమ్ముంటే తనను, తమ పార్టీ ఎంపీలందర్నీ అరెస్ట్ చేయాలని ప్రధానికి సవాల్ విసిరారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిపై మోదీ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖలను ఉసిగొల్పుతూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘ఆయన ఇతరులను నోరుమూయించగలరు కానీ నన్ను కాదు. ప్రజల గొంతుకను నొక్కలేరు. ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది. నా చేతిలోనూ ప్రభుత్వం ఉంది. అల్లర్లకు పాల్పడ్డవారిని నేను అరెస్ట్ చేయించగలను. కానీ ప్రజాస్వామ్యంపై నాకు నమ్మకముంది కాబట్టి ఆ పని చేయలేదు’ అని అన్నారు. కాగా, అనధికార లెక్కల ప్రకారం రూ. 60వేల కోట్ల విలువైన రోజ్ వ్యాలీ చిట్ స్కాం దేశంలోనే అతి పెద్ద చిట్ ఫండ్ స్కాం అని భావిస్తున్నారు. -
భవిత తేలేది నేడే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి ♦ మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ♦ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల పాలక పక్షాల భవితవ్యం మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తరువాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. తదుపరి గంట వ్యవధిలోనే ఫలితాల సరళి ఏవిధంగా ఉన్నదీ తెలిసే వీలుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. మొత్తమ్మీద మధ్యాహ్నం మూడు గంటలకల్లా లెక్కింపు ప్రక్రియ దాదాపుగా పూర్తవుతుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా 8,300 మంది అభ్యర్థుల జాతకాలు తేలనున్నాయి. వీరిలో అస్సాం సీఎం తరుణ్ గొగోయ్, బీజేపీకి చెందిన సీఎం పదవి పోటీదారులైన సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వాస్, తమిళనాడు సీఎం జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, కేరళ సీఎం ఊమెన్ చాందీ, కేరళకు చెందిన సీపీఎం నేతలు వీఎస్ అచ్యుతానందన్, పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీపీఎం నేత సూర్యకాంత మిశ్రా, పుదుచ్చేరి సీఎం ఎం.రంగస్వామి ఉన్నారు. ఎగ్జిట్పోల్స్ నిజమవుతాయా?: అసెంబ్లీ ఎన్నికలపై వివిధ టీవీ చానళ్లు ఎగ్జిట్పోల్స్ నిర్వహించాయి. అయితే ఎంతవరకు ఇవి నిజమవుతాయనేది కొద్దిగంటల్లో స్పష్టమవనుంది. అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్పు తథ్యమని ఎగ్జిట్పోల్స్ చాటాయి. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఘంటాపథంగా చెప్పాయి. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్కు పరాభవం తప్పదని, అదేవిధంగా కేరళలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషించాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు భంగపాటు తప్పదని, డీఎంకే అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. బెంగాల్లో మాత్రం సీఎం మమత తిరిగి అధికారంలోకి వస్తారని ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. వామపక్షాలు, కాంగ్రెస్ కలసి పోటీపడినా ఉపయోగం ఉండదన్నాయి. ఇటీవల వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్కు ఈసారీ నిరాశే ఎదురవుతుందని విశ్లేషించాయి. ఆ పార్టీకి దక్కే ఏకైక ఉపశమనం పుదుచ్చేరిలో విజయం ఒక్కటేనని పేర్కొనడం తెలిసిందే.