breaking news
chinnamallayya
-
మాజీ ఎమ్మెల్యే దేశిని కన్నుమూత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య (86) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించినా కొద్దిసేపటికే మృతి చెందారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన చిన్న మల్లయ్య హైదరాబాద్లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య రాజేశ్వరి, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే .. గీతవృత్తి కార్మికుడి నుంచి దేశిని అంచెలంచెలుగా ఎదిగారు. సీపీఐ నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పటేల్, పట్వారీ, ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చి 1957లో తొలిసారి బొమ్మనపల్లి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ గ్రామానికి ఏకంగా 21 ఏళ్లు సర్పంచ్గా, హుస్నాబాద్ సమితి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 1978 సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఇందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గారు. 2001లో టీఆర్ఎస్లో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2003లో ఆవిర్భవించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2006లో టీఆర్ఎస్ను వీడి తెలంగాణ రైతాంగ సమితి ఏర్పాటు చేసిన దేశిని చినమల్లయ్య ఐదు జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి రైతు సమస్యలపై ప్రత్యేక ఉద్యమాలు నిర్వహించారు. ఏడాది క్రితం వరకు వామపక్ష ఉద్యమాలు, ‘టఫ్’లలో పనిచేశారు. అనారోగ్యం కారణంగా కొద్దిరోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారు. లెఫ్ట్ పార్టీల సంతాపం దేశిని మృతికి సీపీఐ, సీపీఎం సంతాపం ప్రకటించాయి. ఆయన బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఎంపీ బి.వినోద్ కుమార్ హైదరాబాద్లోని దేశిని ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆర్టీసీ బస్సుల్లో పయనం ప్రజాప్రతినిధిగా దేశిని చినమల్లయ్య నిరాడంబర జీవితం గడిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం తపించేవారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్ నుంచి కరీంనగర్కు, నియోజకవర్గ కేంద్రానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేవారు. నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో కరీంనగర్ గణేశ్నగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఉంటూ కలెక్టరేట్తోపాటు వివిధ కార్యాలయాలకు ఆటో రిక్షా, సైకిల్ రిక్షాలు, ద్విచక్ర వాహనాలపై వచ్చిన సందర్భాలు అనేకం. పీఏలు, అసిస్టెంట్లు లేకుండా స్వదసూర్తితో లేఖలు, వినతిపత్రాలు రాసేవారు. సీఎం కేసీఆర్ సంతాపం.. దేశిని చిన్నమల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి దేశిని క్రియాశీలక పాత్ర పోషించారంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
వీడిన మిస్టరీ
ఈపూరు రెండు నెలల క్రితం మండలంలో సంచలనం రేకెత్తించిన మహిళ అదృశ్యం కేసు మిస్టరీని బుధవారం పోలీసులు ఛేదించారు. రూరల్ సీఐ చిన్నమల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొగ్గరం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి కోటేశ్వరమ్మ(40), జూలై 14వ తేదీన గురజాలలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త హనుమంతరావు తన భార్య కోటేశ్వరమ్మ కనిపించడం లేదని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. హనుమంతరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం బొమ్మరాజుపల్లి కనుమ అటవీ ప్రాంతంలో మహిళ పుర్రె, ఎముకలు, అవశేషాలు వెలుగుచూడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేపట్టారు. కోటేశ్వరమ్మ భర్త హనుమంతరావు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించి ఆ ప్రాంతంలో ఉన్న చెప్పులు, చీరె, అవశేషాల ఆధారంగా మృతి చెందింది తన భార్యే అని గుర్తించాడు. తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఫిర్యాదు చేశాడు. మృతురాలి వంటిపై లక్ష్మీదేవి బొమ్మ ఉన్న ముత్యపు ఉంగరం, కాళ్ల పట్టాలు, సెల్ ఫోన్ ఉన్నాయని, వాటిని అపహరించడానికి ఆమెను హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సెల్ఫోన్ ఆధారంగా... అదృశ్యమైన అన్నవరపు కోటేశ్వరమ్మ(40) సెల్ ఫోన్ ఐఎంబీ నంబర్ ఆధారంగా పోలీసులు మిస్టరీని ఛేదించారు. కారంపూడి గ్రామానికి చెందిన టైర్ల కొట్టు వ్యాపారి ఆంజనేయులు వద్ద మృతురాలి కోటేశ్వరమ్మ సెల్ఫోన్ ఉందని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. మండలంలోని వనికుంట గ్రామానికి చెందిన బచ్చినబోయిన యోగయ్య (ఆటో యోగయ్య) సెల్ ఫోన్ను వెయ్యి రూపాయలకు విక్రయించారని చెప్పడంతో ఆటో డ్రైవర్ యోగయ్యను పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారించడంతో కోటేశ్వరమ్మ మృతిచెందిందని, బొమ్మరాజుపల్లి కనుమ అడవిలో ఆమె అవశేషాలు ఉన్నాయని తెలిపినట్టు తెలుస్తోంది.పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా మహిళ చెప్పులు, పుర్రె, చీర, అవశేషాలు లభించాయి. వనికుంటకు చెందిన యోగయ్య కొంతకాలంగా వినుకొండ పట్టణంలోని హనుమాన్నగర్ మూడవలైన్లో నివాసం ఉంటున్నాడు. గతంలో యోగయ్య వనికుంట గ్రామంలో కిరాణాషాపు నిర్వహిస్తుండగా బొగ్గరం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి కోటేశ్వరమ్మతో పరిచయమైందని, జూలై 14వ తేదీన గురజాల నుంచి కారంపూడి వచ్చిన కోటేశ్వరమ్మ తన ఆటోలో వచ్చిందని, మార్గంమధ్యలో బొమ్మరాజుపల్లి కనుమ వద్దకు రాగానే తలపై రాయితో మోది హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.