breaking news
Childrens performances
-
సంస్కారంతోనే గౌరవం...
నవీముంబై పోలీస్ కమిషనర్ కె.ఎల్.ప్రసాద్ ఉద్బోధ * ఘనంగా ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వార్షికోత్సవం * ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు సాక్షి, ముంబై: సంస్కారం లేని మనిషికి సమాజంలో విలువ ఉండదని నవీముంబై పోలీస్ కమిషనర్ కె.ఎల్.ప్రసాద్ వ్యాఖ్యానించారు. వడాలాలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఎస్) వార్షికోత్సవం శనివారం ఉదయం మాటుంగాలోని శణ్ముఖానంద హాలులో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె.ఎల్.ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చిన్నారుల్లో నైతిక విలువలను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తాము ఎక్కడ చదివామా అన్నది ముఖ్యం కాదని.. లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అనే విషయంపై విద్యార్థులు దృష్టిపెట్టాలని సూచించారు. ఏఈఎస్ నుంచి మరో అబ్దుల్ కలాం రావాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. అంతకుముందు ఇటీవల పెషావర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో బలైపోయిన విద్యార్థుల మనశ్శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీలలిత పాఠశాల వార్షిక రిపోర్టు చదివి వినిపించారు. తర్వాత స్కూల్ మ్యాగజిన్ పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం ఈ యేడాది మెరిట్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీవిద్యార్థులకు షీల్డు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రీ ప్రైమరీ మొదలుకొని కళాశాల విద్యార్థుల వరకు అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నాటిక, నృత్య కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సెకండరీ విద్యార్థులు ప్రదర్శించిన ‘ఔరా అమ్మక్క చెల్లా.. ఆలపించి నమ్మడమెల్ల’ అనే దాండియా పాటపై శ్రీకృష్ణుడు, గోపికల నృత్యం సమయంలో హాలు ఆహూతుల కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. ఇంటి నుంచి బయటపడ్డ ఆడ పిల్లలు రోడ్డుపై అత్యాచారాలు, వేధింపుల నుంచి ఎలా బయటపడి ఇంటికి చేరుకుంటున్నారనే అంశంపై కాలేజీ విద్యార్థులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన నాటిక ఆహూతులను ఎంతో ఆకట్టుకుంది. చివరగా వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఏహెచ్ఎం ఎన్.అన్నపూర్ణ చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన పదవీ విమరణ చేసిన ప్రధానోపాధ్యాయులకు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన హెడ్ క్లర్క్ సుశీల, ఉపాధ్యాయులు సింగ్, పురుషోత్తంరెడ్డి, ఇతర ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి ఏఈఎస్ చైర్మన్, బోర్డు ఆఫ్ ట్రస్టీ ఎం.వి.పాపారావు, అధ్యక్షుడు సి.స్వరూప్రావు, ప్రధాన కార్యదర్శి పి.ఎం.రావు ధన్యవాదాలు తెలిపారు. -
పిల్లలు కాదు.. పిడుగులు
* సృజనాత్మకతకు అద్దం పట్టిన విద్యార్థులు * మ్యూజిక్, గానంలో ప్రతిభ * నృత్యాలతో అదరగొట్టిన చిన్నారులు * కథలతో ఆకట్టుకున్న పిల్లలు కొత్తగూడెం : పిల్లలు కాదు. పిడుగులు అన్న విధంగా ఆ చిన్నారుల ప్రదర్శనలు సాగాయి. జాతీయస్థాయి బాలోత్సవ్లో చిన్నారులు ఒకరిని మించి ఒకరు ప్రదర్శనలు ఇచ్చిన ఔరా అనిపించారు. ఒకరిని మించిన ప్రతిభతో మరొకరు వారి సృజనాత్మకతను చాటిచెప్పారు. మూడు రోజుల పాటు కొత్తగూడెం పట్టణంలో క్లబ్లో నిర్వహించిన జాతీయస్థాయి బాలోత్సవ్(అంతర్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు) విజయవంతంగా ముగిశాయి. చివరి రోజైన మూడో రోజు ఎనిమిది విభాగాల్లో పోటీలు జరుగగా సుమారు ఐదు వేల మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. భరతనాట్యం సీనియర్స్ విభాగంలో 150 మంది, కూచిపూడి సీనియర్స్ విభాగంలో 160 మంది, జానపద నృత్యం గ్రూప్ విభాగంలో 80 మంది, అనగ అనగా కథ చెబుతా విభాగం సబ్ జూనియర్స్లో 70 మంది, మట్టితో బొమ్మలు చేద్దాం సీనియర్స్ విభాగంలో 50 మంది, దాశరధి కవితలు సీనియర్స్ విభాగంలో 90, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ రాగా విభాగంలో 120 మంది, తాళా విభాగంలో 150 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు. సంగీతం.. గానంలో... చివరిరోజు నిర్వహించిన ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ విభాగంలో విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు. కీబోర్డ్, గిటార్, వీణ, పియానో, ఫ్లూట్ తదితర ఇన్స్ట్రుమెంట్స్తో వినసొంపైన రాగాలను పలికించారు. ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ అంశంలో రాగ, తాళా విభాగాల్లో పోటీలు నిర్వహించడంతో సుమారు 270 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సినీ, లలిత, జానపద గీతాలాపన పోటీల్లో సైతం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిభ చూపారు. నృత్యాలతో అధరగొట్టిన పిల్లలు.. జానపదం, శాస్త్రీయ నృత్యం.. ఏ నృత్యమైనా మేం రెడీ అంటూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జానపద నృత్యం జూనియర్స్, సీనియర్స్ విభాగాలతోపాటు గ్రూప్ డాన్స్ విభాగంలో పోటీలు జరిగాయి. కూచిపూడి, భరతనాట్యం అంశాల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జానపద పోటీల్లో సుమారు 500 మంది పోటీపడగా శాస్త్రీయ నృత్య విభాగంలో సుమారు 300 మందికి పైగా పోటీపడ్డారు. కథలతో ఆకట్టుకున్న చిన్నారులు... నేడు కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్కు అలవాటుపడిపోయిన చిన్నారులు కథల పోటీల్లో పాల్గొని తమ జ్ఞానాన్ని చాటుకున్నారు. అమ్మమ్మ, తాతయ్యలు చెప్పిన నీతి కథలను వింటూ నిద్రపోయే చిన్నారులు అవే కథలను పోటీల్లో చెప్పి ఆకట్టుకున్నారు. చందమామ కథలు, నీతి కథలు, చరిత్రను తెలియజేసే పలు కథలను ఎంతో వినసొంపుగా చెప్పారు. అదేవిధంగా దాశరధి కవితలు అనే అంశంలో సైతం విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.