breaking news
Chairman Pratap C Reddy
-
అపోలో ప్రతాప్ రెడ్డికి గుండెపోటు
సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. చెన్నైలోని థౌజండ్ లైట్స్లో ఉన్న అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చెన్నై తేనాంపేటలోని నివాసంలో శుక్రవారం రాత్రి ఆయనకు శ్వాస సమస్య తలెత్తింది. వెంటనే గుండెపోటు రావడంతో స్పృహ తప్పారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు. యాంజీయోగ్రామ్, బీపీ, మధుమేహం తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఐసీయూ నుంచి వీఐపీ వార్డుకు మార్చారు. ప్రతాప్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
ఇంటి వద్దకే అపోలో వైద్య సేవలు
రూ. 50 కోట్లతో హోమ్కేర్ యూనిట్ త్వరలో అన్ని ప్రధాన పట్టణాలకూ విస్తరణ మూడు నెలల్లో 10,000 పడకల మార్కు అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ గ్రూపు నుంచి సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్సానంతరం హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే వైద్యసేవలను అందించేలా హోమ్కేర్ సేవలను ప్రారంభిస్తున్నట్లు అపోలో గ్రూపు ప్రకటించింది. ప్రస్తుతం చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కతాలకు విస్తరిస్తామని అపోలో గ్రూపు ఫౌండర్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. శనివారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. దీనివల్ల రోగులకు చికిత్స వ్యయం తగ్గి, తొందరగా కోలుకుంటారన్నారు. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత హాస్పిటల్లో ఉంటే రోజుకు సగటున రూ. 10,000 అవుతుందని, కానీ అదే ఇంటివద్ద అంతే నాణ్యమైన సర్వీసులను రూ. 3,500కే పొందవచ్చన్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ ఆక్యుపెన్సీ రేషియో 80 శాతంగా ఉండి చాలా మందికి చికిత్స అందించలేకపోతున్నామని, ఈ హోమ్కేర్ వల్ల మరింత మందికి చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు. రూ.50 కోట్లతో ఏర్పాటు చేసిన అపోలో హోమ్ హెల్త్త్కేర్ ప్రత్యేక కంపెనీ అని తెలిపారు. రూ. 1,400 కోట్లతో నిర్మించిన 4 ఆస్పత్రులు మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. విశాఖ, ముంబై, బెంగళూరు, గువాహటిల్లో వీటిని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి అందుబాటులోకి వస్తే అపోలో పడకల సంఖ్య 10,000 మార్కును అధిగమిస్తుందన్నారు.