breaking news
centennial celebrations
-
చికాగోలో ఘనంగా సాయి మహా సమాధి వందేళ్ల వేడుకలు
చికాగో: సాయి మహా సమాధి అయి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది మొత్తం ‘శతాబ్ధి సోహాల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని యూఎస్ సాయి సంస్థాన్ నిర్ణయించింది. ఈ సందర్బంగా చికాగోలోని సాయిబాబా మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతోపాటు, రథయాత్ర, వంద నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో బాబాకు అభిషేకం నిర్వహించారు. అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా చెప్పిన సూక్తులను, సాయి మహాత్యం గురించి నిర్వహకులు భక్తులకు వివరించారు. శతాబ్ది సోహాలలో భాగంగా ఆధ్యాత్మికత, అన్నదానం, పిల్లలకు ప్రేమ, సంస్కృతికై ఆరాధన, అవసరమున్న వారికి సహాయపడటం వంటి ఐదు నినాదాలతో ముందుకు సాగనున్నారు. సాయి మందిరంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా పలు ఆరాధన కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలు ఆలయంలో వంద పుష్పపు మొక్కలు నాటారు. అభిషేకం ఆత్మశుద్ధి, పుష్పాభిషేకం, ముక్తాభిషేకం, బిక్షా జోలితో పాటు దసరా వేడుకలు కూడా జరిపారు. శ్రీ సాయిసచ్ఛరితం విశిష్టతను తెలిపేలా భక్తులు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. -
తెలుగువారి ఛాతి రెండంగుళాలు పెరిగింది!
ఈతడు లేకపోతే తోటరామునికి రాకుమారి దక్కేదే కాదు. ఈతడు లేని పక్షంలో ప్రహ్లాదునికి హరిదర్శనం అయ్యేదే కాదు. ఇతను లేకపోతే ‘మిస్సమ్మ’కు ‘ఎం.టి.రావు’తో పెళ్లగునా ఏమి? గుండమ్మ ఇతని వల్లనే లెంపలు వేసుకున్నది. ఇతని వల్లే గదా తాతను నిర్లక్ష్యం చేసిన తండ్రికి మనవడు బుద్ధి చెప్పగలిగినది. స్వయంప్రకాశం కలిగిన హీరోలు చాలా మంది ఉండొచ్చు. కాని స్వయంప్రకాశం కలిగిన కేరెక్టర్ ఆర్టిస్టు ఇతడే. తెలుగువారి ఛాతి ఇతడి వల్ల రెండంగుళాలు పెరిగింది.. అప్పుటికి... ఇప్పటికి... ఈ వందేళ్లకు... మరో వందేళ్లకు కూడా. ఎస్.వి.ఆర్కు కైమోడ్పుల వీరతాడు. తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్లు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. మరి ఎస్.వి.ఆర్? గుండెకాయ. ‘నీవేనా నను పిలిచినది... నీవేనా నను కొలిచినది’.... ప్రియదర్శినిలో కనిపిస్తున్న సావిత్రిని చూస్తూ కళ్లు ఎగరేస్తూ అక్కినేని పాడుతున్నాడు. ప్రేక్షకులు మైమరిచి చూస్తున్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’.... వెన్నెల సరోవరంలో సంధ్యను తోడు తీసుకుని రెల్లు పొదల మీదుగా ఎన్.టి.ఆర్ నౌకా విహారానికి బయలుదేరాడు. ప్రేక్షకులు ముచ్చటపడి చూస్తున్నారు. ఈ ముచ్చట... ఈ మైమరుపు... సరే. సినిమాకు ఇవి కావాల్సిందే. కాని చాలవు. ఏం కావాలి? అదిగో అటు చూడండి. మహాఘటం మోగుతోంది. ఘణఘణఘణ మూర్ఛనలు పోతోంది. అసుర గణాలు మెడలోని ఎముకలు పైవస్త్రాలు సర్దుకుంటూ అదుపాజ్ఞలలోకి వచ్చి వినయంగా వరుసదీరి నిలుచుంటున్నాయి. ‘ఘటోత్కచ.. ఘటోత్కచ... ఘటోత్కచ’... ప్రేక్షకులు తుళ్లిపడ్డారు. విశ్రాంతిగా ఉంచిన చేతులను దగ్గరకు చేర్చి పెద్దగా చప్పట్లు కొట్టారు. నిటారుగా కూర్చున్నారు. బొటన వేలు చూపుడు వేలు కలిపి నోటిలోని గాలిని ఈలగా మార్చారు. ఎస్.వి.రంగారావు ప్రత్యక్షమయ్యాడు. సినిమాకు ఈ ఊపు కావాల్సింది. అప్పటికే జనం దగ్గర వీరతాళ్లు ఉన్నాయి. అక్కినేనికి, ఎన్టిఆర్కు వేయగలిగినన్ని వేసి మిగిలినవన్నీ ఎస్.వి.రంగారావు మెడలో వేశారు. హైహై నాయకా. హోయ్ హోయ్ నాయకా. ‘మాయాబజార్’లో హీరో ఎవరు అనేది నేటికీ పెద్ద పజిల్. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, సావిత్రి... కాని ప్రధానవాటా ఎస్.వి.ఆర్ పట్టుకుపోయాడని అభిమానులు చెప్పుకుంటారు. ‘అయ్యారె అప్పళాలు.. పులిహోర దప్పళాలు’... తేన్పులు వచ్చేవరకు రకరకాల పాత్రలతో ప్రేక్షకుల ఉదరాన్ని నింపిన మహావంటగాడు ఎస్.వి.ఆర్. దేశభాషలందు తెలుగు లెస్సే. కాని దేశ నటులలో ఎస్.వి.ఆర్ లెస్స. ‘నర్తనశాల’లో ఎన్.టి.ఆర్ హీరో. అంత పెద్ద వీరుడు– అర్జునుడు– మారువేషంలో బృహన్నలలా మారి విరాట్ రాజు కొలువులో తల దాచుకుని ఉన్నాడు. ధర్మరాజుగా మిక్కిలినేని చేతగాని పెద్దమనిషి. భీముడు గాడిపొయ్యి దగ్గర కండలు కరిగిస్తున్నాడు. వీళ్లు వీరులు. పరాక్రమవంతులు. వీళ్ల గొప్పతనం చూడటానికే ప్రేక్షకులు సినిమాకు వచ్చారు. కాని ఏం చేస్తాం? అందులో గెస్ట్రోల్ లాంటిది ఉంది. కొంచెం సేపు కలకలం సృష్టించే పాత్ర ఉంది. అది వేరెవరో వేస్తే ఎలా ఉండేదో. ఎస్.వి.ఆర్ వేశాడు. విరాట్రాజు కొలువులో చెప్పాపెట్టని తుఫానులా అడుగుపెట్టాడు. పాట పాడుతున్న పాంచాలిని, అదే సైరంధ్రిని, అదే సావిత్రిని చూసి, మనసుపడి ‘ఎంతకాలమైంది ఈ అలివేణి అంతఃపురంలో అడుగుపెట్టి’ అన్నాడు. చూడండి వింత. దీనికి కొంతకాలం ముందే ఇదే సావిత్రిని ‘మిస్సమ్మ’లో ఇదే ఎస్.వి.ఆర్ కన్నకూతురిలా చూస్తూ ‘అమ్మి’.. ‘అమ్మి’ అని అనురాగంగా పిలుస్తూ ఉంటే తండ్రి అంటే ఇలా ఉండాలి అనుకున్నారు జనం. అదే ఎస్.వి.ఆర్ క్షణాల్లో మారి అదే సావిత్రిపై వక్రదృష్టి పెట్టి సొంతం చేసుకోవడానికి ఆత్రపడుతూ రాక్షసుడిలా మారుతుంటే ‘అమ్మో... కీచకుడంటే ఇలా ఉంటాడా’ అనుకున్నారు జనం. ‘నా గర్వము సర్వము ఖర్వము అయినది’ అని అంతెత్తు మనిషి సావిత్రి ముందు మోకరిల్లడం చూస్తే కోపానికి బదులు జాలి కలిగితే ఆ దోషం ప్రేక్షకులది కాదు పాత్రది కాదు... దానిని వేసిన ఎస్.వి.ఆర్ది. ‘ఆరో భర్తగా నన్ను కూడా కట్టుకో. తప్పులేదులే’ సావిత్రిని వేధించిన ఎస్.వి.ఆర్ కామంతో పాటు వెర్రి వ్యామోహం కూడా ప్రదర్శిస్తాడు. చివరకు అతి బలాఢ్యుడైన భీమసేనుడి చేతిలో ఊపిరి కోల్పోతాడు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. 1964లో ‘జకార్తా’లో ‘ఆఫ్రో–ఆసియా ఫిలిమ్ ఫెస్టివల్’ జరిగి అందులో 24 దేశాలు పోటీ పడితే అందులో ‘నర్తనశాల’ కూడా పాల్గొంటే అవార్డు కమిటీ ఆ సినిమాతో పాటు అన్ని సినిమాలను జల్లెడ పట్టింది. ఈ 24 దేశాల నుంచి ఉత్తమ నటుడుగా ఎవరిని ప్రకటించాలి? వేదిక మీద పేరు పిలిచారు. సామర్లకోట వెంకట రంగారావు. ఒక తెలుగువాడికి అంతర్జాతీయంగా మొదటిసారి చప్పట్లు వినిపించిన సందర్భం అది. జూదంలో ఓడిపోయాక తల వొంచుకుని నిలబడాలి. భార్యను కూడా పణంగా పెట్టాక పౌరుషాలు కట్టిపెటాలి. కౌరవుల కొలవులో పాండవులు కట్టుబట్టలతో మిగిలారు. అయినా కసి చాలని దుర్యోధనుడు ద్రౌపదిని, ఏకవస్త్రను, భర్తల నిర్వాకాన్ని విని స్థాణువైన సాధ్వీమణిని నిండు సభకు దుశ్శాసనునిచే ఈడ్చుకొచ్చేలా చేసి పాండవులను పరాభవించడానికి ఆమెను తన తొడ మీద కూర్చోమన్నట్టుగా సైగ చేస్తే భర్తగా ఉన్న భీమసేనునికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం సహజం. ‘ఒరే దుర్యోధన’... అని ఆ పాత్ర ధరించిన ఎన్.టి.ఆర్ పళ్లు పటపటకొరుకుతుంటే థియేటర్లో ఉన్న ప్రేక్షకులు కూడా కోపంతో మండిపోవాలి. కాని అలా జరగలేదు. దుర్యోధనుడైన ఎస్.వి.ఆర్ అంతటి ఆగ్రహాన్ని లెక్క లేనట్టుగా పూచికపుల్లలా తీసి అవతల పారేసి ‘బానిసలు... బానిసలకు ఇంతటి అహంభావమా’ దర్పం ప్రదర్శిస్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. పాత్ర ఓడిపోయి నటుడు గెలిచిన సందర్భం అది. తెలుగువారికే సొంతమైన ముచ్చట. ‘పాండవవనవాసం’లో ఎస్.వి.ఆర్ కలిగించిన ఆనందం. మనిషితో వైరానికి మరో మనిషి చాలు. కాని శ్రీహరితో వైరానికి మహా రాక్షసుడు కావాలి. అంతెత్తు మనిషి. విశాలమైన కళ్లు. ఖంగున మోగే కంఠం. మీసాలు కూడా ప్రదర్శించగల పౌరుషం... ఆ విగ్రహం కలిగినవాడు కనుకనే ఎస్.వి.ఆర్ హిరణ్యకశిపుడు అయ్యాడు. భస్మాసురుడు అయ్యాడు. కంసుడు అయ్యాడు. రావణాసురుడు అయ్యాడు. ‘ఏడీ చూపించు నీ హరిని’ అంటూ ‘భక్త ప్రహ్లాద’లో ఎస్.వి.ఆర్ స్తంభం వైపు చూపితే స్తంభాన్ని పెకలించుకుని నృసింహుడు ప్రత్యక్షమైతే హరితో అతడు తాడోపేడో తేల్చుకుంటాడేమో అని భయం వేస్తుంది. అది అక్కడ కనిపించిన రాక్షస వీరత్వం. అంతటి రాక్షస పాత్రలలో ఎస్.వి.ఆర్ను చూసినా కూడా ప్రేక్షకులకు కలిగేది ద్వేషం కాదు భక్తే. సి.హెచ్.నారాయణరావు తెలుగు వెండి తెరకు తొలి అందాల నటుడు. కాని ఆయన ప్రభ ఎన్.టి.ఆర్ రావడంతోనే కనుమరుగు అయ్యింది. అలాగే తెలుగు తెర మీద ఎందరో ప్రతిభావంతమైన కేరెక్టర్ ఆర్టిస్టులు గోవిందరాజుల సుబ్బారావు, ముదిగొండ లింగమూర్తి, ముక్కమల, సిఎస్ఆర్, నాగయ్య... వీరందరినీ దాటేసి ముందుకు వచ్చినవాడు ఎస్.వి.ఆర్. ‘దొంగరాముడు’ నాటికి తెలుగువారి స్టార్ విలన్గా ఉన్న ఆర్.నాగేశ్వరరావు ఎస్.వి.ఆర్ ప్రతాపానికి ‘మాయాబజార్’లో ‘మరి మన తక్షణ కర్తవ్యం’ అనుకుంటూ ఉండే కర్ణుడి పాత్రలో లుప్తమవడం కచ్చితంగా గమనించి తీరాలి. రంగారావు మింగేస్తాడు. అది ఆయన బలం. రంగారావు నమిలేస్తాడు. అందుకే సాటి ఆర్టిస్టులకు జంకు. ‘షావుకారు’లో సున్నపు రంగడు, ‘పాతాళభైరవి’లో నేపాళ మాంత్రికుడు, ‘బంగారుపాప’లో కోటయ్య, ‘సంతానం’లో గుడ్డి రంగయ్య, ‘పెళ్లి చేసి చూడు’లో ‘వియ్యన్న’... ఈ పాత్రలన్నీ ఎస్.వి.రంగారావును తిరుగులేని కేరెక్టర్ ఆర్టిస్టుగా నిలబెట్టాయి. అప్పటికి ‘బాడీ లాంగ్వేజ్’ అనే మాట తెలియదు. కాని ఆ బాడీ లాంగ్వేజ్తోనే తాను కావలసిన పాత్రలా మారిపోతున్నాని ఎస్.వి.ఆర్కు తెలుసు. అందుకే ఆయన మంచివాడు, క్రూరుడు, ఇంటి పెద్ద, సంఘంలో మర్యాదస్తుడు. అందుకే ఆయన తెలుగుతో పాటు తమిళంలలో కూడా ఖ్యాతి గడించాడు. శివాజీ గణేశన్ ఆయనకు ఆప్తమిత్రడు. ఈ రెండు పులులు కలిసి తపాకీ పట్టుకుని అడవిలో మరో పులిని వేటాడిన ఉదంతం ఆ కాలానికి మిగిలిన ఒక అపురూపమైన ముచ్చట. ఎస్.వి.ఆర్ సీను ఎంతగా కబళించేవారంటే ఆయనతో కలిసి శివాజీ నటించాల్సి వస్తే ‘ఈ సీను నాకు వదిలిపెట్రా’ అని ఎస్.వి.ఆర్ని బతిమిలాడేవారట. ప్రతి ఆర్టిస్టుకు స్క్రీన్ మీద తానేమిటో చూపించాలని అహం ఉంటుంది. అందుకే ఎస్.వి.ఆర్ రిహార్సల్లో ఒకలాగా టేక్లో మరోలాగా చేసేవారట. రిహార్సల్స్లో ఆయన చేసిన పద్ధతికి ఫిక్స్ అయిన సహ నటీనటులు టేక్లో ఆయన చప్పున ధోరణి మార్చేసరికి ఖంగు తిని తెల్లబోవడం ఆనవాయితీగా ఉండేది. సావిత్రి కూడా ‘కన్ఫ్యూజ్ చేయకు బావా’ అని ముద్దుగా విసుక్కునేదని సినీ ముచ్చట. ఎంతటి గొప్ప నటుడైనా హాస్యం చేయకపోతే పరిపూర్ణమైన నటుడుగా గణింపబడడు. గొప్పనటులంతా మంచి హాస్యం చేసినవారే. ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’, ‘గుండమ్మ కథ’, ‘మంచి మనసులు’, ‘తోడి కోడళ్లు’... ఈ సినిమాలన్నింటా ఎస్.వి.ఆర్ సున్నితమైన హాస్యాన్ని చూపించారు. నేపాళ మాంత్రికుడిగా భయపెట్టిన వ్యక్తి సూర్యకాంతం మొగుడిగా చేతులు నలుముకుంటూ నిలబడి మెప్పించడం వింతే కదా. ‘కలసి ఉంటే కలదు సుఖం’, ‘వెలుగునీడలు’, ‘దసరాబుల్లోడు’.... ‘మాట్లాడరేమండీ’ అని సూర్యకాంతం అంటే ‘నిన్ను కట్టుకున్నాక ఎప్పుడు మాట్లాడాను కనుక’ అని ఎస్.వి.ఆర్ టైమింగ్తో అనడం తెలుగువారికి మాత్రమే సొంతమైన నటనా వినోదం. ఏడ్చే మగవాళ్లు బాగుండరని అంటారు. కాని ఎస్.వి.రంగారావు ఏడిస్తే మనకు ఏడ్పు వచ్చేది. ‘హరిశ్చంద్ర’, ‘ఆత్మబంధువు’, ‘లక్ష్మీ నివాసం’, ‘సుఖదుఃఖాలు’, ‘సంబరాల రాంబాబు’, ‘దసరాబుల్లోడు’... ఇవన్నీ ఆయన ప్రదర్శించిన కరుణ రసంతో కన్నీరు పెట్టించాయి. ‘పండండి కాపురం’లో ఆయన వంటి పెదనాన్నను పోల్చుకుని ప్రేక్షకులు ఉండరు. ‘తాత–మనవడు’లో అటువంటి తాతను చూసి శోకించని మనుమలూ ఉండరు. ‘బాబూ... వినరా... అన్నాదమ్ములా కథ ఒకటి’... ‘అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం’.... రేడియోల్లో నేటికీ మోగే ఈ గీతాలు ఎస్.వి.ఆర్. వేసిన భిక్ష. ఎస్విఆర్ తుపాకీ పట్టాల్సిన రోజులు వస్తే తుపాకి పట్టారు. ‘జగత్ జెట్టీలు’, ‘జెగత్ జెంత్రీలు’, ‘జెగత్ కిలాడీలు’... వీటితో పాటు ‘కత్తుల రత్తయ్య’, ‘దెబ్బకు ఠా దొంగల ముఠా’ వీటిలో మాస్గా నటించి మాస్ ప్రేక్షకులకు అలరించారు. ‘నా పేరు తెలుసుగా కత్తుల రత్తయ్య. పచ్చి నెత్తరు తాగుతా’ అని ఆయన చెప్పే డైలాగులు ఆ రోజుల్లో తొలి పంచ్ డైలాగులు. ‘డోంగ్రే’, ‘గూట్లే’, ‘జింగిడి’ ఇవన్నీ ఆయన పాపులర్ చేసిన తిట్లు. ‘ఏంటి బే’ అనేది అనగలిగేది వెండితెర మీద మొదటిసారిగా ఎస్.వి. రంగారావే. కాని ఎన్నిచేసినా ఎన్ని పాత్రలకు ముఖాన రంగు పూసుకున్నా అవన్నీ ఏనుగుకు వెలగపండులా ఆయన నట జఠరాగ్నికి ఆవిరి అయిపోయేవి. ‘ఈ దేశం నాకు చాలదు’ అనుకునేవాడాయన. ‘హాలీవుడ్లో నటించాలి... ఆస్కార్ సాధించాలి’ అని కూడా అనుకునేవాడు. కాని లక్షలాది ప్రేక్షకుల హృదయాలలో పర్మినెంట్ ట్రోఫీ తప్ప ఆయనకు వేరే ఏ ట్రోఫీ అందలేదు. ‘పద్మశ్రీ’ ఇస్తారటగా గొప్పవారికి. ఎస్.వి.రంగారావు ‘పద్మశ్రీ’ లేని పదింతల గొప్పవాడు. ఎస్.వి.ఆర్ దూకుడు తగ్గించడానికి ఇండస్ట్రీలో ఒకరిద్దరు పెద్దలు గుమ్మడి గారిని ప్రోత్సహించారన్నది వాస్తవం. కాని గుమ్మడిగారికి తన పరిమితులు తెలుసు. తను కేవలం గుమ్మడే. కాని ఎస్.వి.ఆర్? అశోక్ కుమార్లోని ఉదాత్తత, ప్రాణ్లో చతురత, ఓంప్రకాశ్లోని సౌమ్యం, ప్రేమ్నాథ్లోని ధిక్కారం కలగలిసిన నటుడు. అని గుమ్మడిగారే చెప్పేవారు. చెప్పి నమస్కరించేవారు. ఒకరిని కోల్పోయాక ఆ స్థానంలో మరొకరిని ప్రతిష్టించడం కష్టం. ఎస్.వి.ఆర్ వారసుడిగా తెలుగు ప్రేక్షకులు కొద్దో గొప్పో అంగీకరించగలిగినది కైకాల సత్యనారాయణనే. ఆ వరుసలో రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ వంటి ప్రతిభావంతమైన నటులను కూడా చూస్తున్నాం. రోజులు గడిచిపోయి ఉండవచ్చు. కాలం మారిపోయి ఉండవచ్చు. కాని ఒక సింహం గర్జించింది అన్న జ్ఞాపకం చెరిగిపోలేదు. ఇవాళ ఆ మహానటుడి శత జయంతి. ఆయన వదిలి వెళ్లిన పరంపరను చేతులు అడ్డుపెట్టుకుని కాపాడుకుంటామనే ఒప్పుదల చేస్తూ.... ఫైర్ ఆఫీసర్ నుండి ఫైర్ ఉన్న నటుడిగా... ఎస్.వి.రంగారావు స్వస్థలం కృష్ణా జిల్లా నూజివీడు. 1918 జూలై 3న జన్మించారు. కలిగిన కుటుంబం. తాత సర్జన్. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మద్రాసులో నానమ్మ దగ్గర ఉంటూ అక్కడే హైస్కూలు చదువు చదివారు. ఆంధ్రా తిరిగి వచ్చి డిగ్రీ పూర్తి చేశారు. ఫైర్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. మూడు నెలలకు మించి చేయలేకపోయారు. దగ్గర బంధువు తీసిన ‘వరూధిని’ (1947)లో మొదటిసారి హీరోగా నటించారు. అది ఫ్లాప్ అయింది. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుని మూడేళ్లు జంషడ్పూర్ వెళ్లిపోయారు. తిరిగి ‘పల్లెటూరి పిల్ల’తో రంగప్రవేశం చేశారు. ఈలోపే మేనమామ కుమార్తె లీలావతితో వివాహమయ్యింది. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ గట్టి పట్టు పట్టడంతో ‘షావుకారు’లో రౌడీ పాత్ర లభించింది. ఆ తర్వాత ‘పాతాళభైరవి’లోని నేపాళ మాంత్రికుడు పాత్రతో స్టార్డమ్ వచ్చింది. 1973లో ఆయనకు హైదరాబాదులో బైపాస్ సర్జరీ జరిగింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా షూటింగ్లో పాల్గొన్నారు. 1974 జూలై 18 మధ్యాహ్నం మూడు గంటల వేళ తిరిగి హార్ట్ ఎటాక్ రావడంతో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు కోటేశ్వరరావు కూడా చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్తో మరణించారు. కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. ఎస్.వి. రంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ సినిమా హీరోగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముక్కు మీద కోపం ఎస్.వి.రంగారావులో రకరకాల మూడ్స్ ఉండేవని అంటారు. ఒక్కోసారి ఆయన షూటింగ్ మానేసి వారం పది రోజుల పాటు తన ఫామ్ హౌస్కు పరిమితమయ్యేవారట. షూటింగ్ మధ్యలో కూడా మూడ్ పాడైతే వెళ్లిపోయేవారట. ఆయనకు మంచి మూడ్ లేకపోతే చిన్న సీన్ కూడా ఎక్కువ టైమ్ పట్టేది. హుషారుగా ఉంటే చాలా పెద్ద సీన్ను కూడా లంచ్ టైమ్కే క్లోజ్ చేసేసేవారట. ఆయన హాస్య ప్రియుడు. ఛలోక్తులు విసరడం, సరదాగా ఉండటం ఇష్టపడేవారు. సాటి ఆర్టిస్టులు ఆయన మూడ్స్ను గమనించుకుని మసలేవారు. జమున, వాణిశ్రీ వంటి హీరోయిన్లు ఆయనను డాడీ అని పిలిచేవారు. ఎస్.వి.ఆర్.కు రేలంగి అంటే ఇష్టం. ఆయనతో బాగా చనువుగా ఉండేవారు. ఇంటికి రాకపోకలు సాగించిన నటులలో అల్లు రామలింగయ్య ఒకరు. సావిత్రి ఇల్లు, ఎస్.వి.ఆర్. ఇల్లు ఎదురుబొదురుగా ఉండేవి. ఎస్.వి.ఆర్.కు కుక్కలన్నా, పక్షులన్నా ఇష్టం. తన నివాసంలోని సర్వెంట్ క్వార్టర్స్ దగ్గర దాదాపు 2 బెడ్ రూమ్ హౌస్ అంత షెడ్ కట్టి పక్షులను, బాతులను పెంచేవారు. ఆయన దగ్గర ఉన్న జర్మన్ షపర్డ్ కుక్కలలో ఒకటి ఆయన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఆయన చనిపోయిన కొద్ది రోజులకే తానూ ప్రాణం విడిచింది. భోజన ప్రియుడు ఎస్.వి.రంగారావు భోజన ప్రియుడు. మాంసాహారాన్ని బాగా ఇష్టపడేవారు. తను లొకేషన్లో ఉంటే మూడు నాలుగు హోటళ్ల నుంచి నాన్వెజ్ తెప్పించి సహ నటులకు వడ్డించేవారు. తినండి తినండి.. మీరు అడిగితే ప్రొడ్యూసరు ఇవన్నీ తెప్పించడు అని అనేవారు. ఈ భోజన ప్రియత్వమే ఆయనకు స్థూలకాయం తెచ్చిపెట్టింది. మద్యపాన ప్రియత్వం కూడా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని చెప్పవచ్చు. స్మోకింగ్ కోసం రకరకాల లైటర్స్ని సేకరించేవారు. గుండమ్మ కథ నర్తనశాల కుమార్తెలు, కుమారుడుతో ఎస్.వి.ఆర్. దంపతులు (చిన్నపిల్లాడు ఎస్.వి.ఆర్. మేనల్లుడు) – కె -
3న ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు
ఎంతమంది నటీనటులు ఉన్నా ‘విశ్వ నట చక్రవర్తి’ ఒక్కరే. వెండితెర విలక్షణ నటునిగా సినీ పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టిన ఆ మహానటుడు యస్వీ రంగారావు. 1918 జూలై 3న ఆయన జన్మించారు. జూలై 3వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ‘సంగమం’ సంస్థ ఆధ్వర్యంలో యస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ‘సంగమం’ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు, సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జూలై 3న సాయంత్రం 5 గంటలకు ఎస్వీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్గారు, కె.వి.రమణాచారిగార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. యస్వీఆర్తో కలిసి నటించిన వారితో పాటు తర్వాత కాలంలో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను సత్కరిస్తున్నాం’’ అన్నారు. -
‘శతాబ్ది’ కలిగేనా లబ్ధి..?
⇒ నాలుగేళ్లుగా నిలిచిపోయిన అధ్యాపక నియామకాలు ⇒ కాంట్రాక్టుపై 1800మంది ఉద్యోగులు, 600మంది అధ్యాపకులు ⇒ పర్మినెంట్ చేయాలని ఎదురుచూపులు తార్నాక: ఒక వైపు శతాబ్ది ఉత్సవాల వైపు పరుగులు తీస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ.. మరోవైపు బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో వర్సిటీ బోధనా, పరిశోధనా రంగంలో కొంత వెనుకబాటుకు గురవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యాపకుల కొరతను తీర్చేందుకు శాశ్వత ప్రాతిపదికన భర్తీ ప్రక్రియ చేపట్టని అధికారులు.. కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన సాగిస్తూ వర్సిటీని ముందుకు నెట్టుకొస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కొనసాగుతున్న తమను ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా పర్మినెంట్ చేసి శాశ్వత భృతి కల్పిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నామని కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. వేతనాలు చాలా తక్కువ... వర్సిటీలో పర్మినెంట్ అధ్యాపకులతో పోటీపడి విధులు నిర్వర్తిస్తూ వర్సిటీని కాపాడుకుంటూ వస్తున్న ఉద్యోగులు, అధ్యాపకుల వేతనాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్న తొలి రోజుల్లో అధ్యాపకులు పరిపాలనా భవనం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వం ఉద్యోగాలు పర్మినెంట్ చేసేందుకు కావాల్సిన సాధ్యాసాధ్యలపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేసి వారిని ఆందోళన నుంచి తప్పించారు. తగ్గిన ప్రొఫెసర్ పోస్టులు... వర్సిటీలో పదవీ విరమణ పొందుతున్న అధ్యాపకుల సంఖ్య పెరుగుతుండటంతో కొన్ని విభాగాలకు అధ్యాపకులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు అధ్యాపకులతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఒక్క ప్రొఫెసర్ కూడా లేని విభాగాలు ఎనిమిది వరకు ఉన్నాయి. సైకాలజీ విభాగంలో 11 మందికి గాను ఇద్దరే అధ్యాపకులు ఉన్నారు. జియో ఫిజిక్స్లో 24 పోస్టులకు గాను ముగ్గురే ఉన్నారు. ఉర్దూ విభాగంలో 19మందికి గాను నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. నియామకాలు లేవు.. ఓయూలో 12 ఏళ్లుగా బోధనేతర సిబ్బంది నియామకాలు లేవు. ఆయా విభాగాల్లో ఉన్నవారికి పదోన్నతులు కల్పించడంతో ఏర్పడిన ఖాళీల్లో కాంట్రాక్టు ఉద్యోగులను భర్తీ చేసి పనులు కొనసాగిస్తున్నారు. అధ్యాపకుల విషయానికొస్తే 1989, 1993, 1997లో అధ్యాపక నియామకాలు చేపట్టారు. నియామకాల్లో కొన్ని కోర్టు వివాదాల కారణంగా అన్ని పోస్టులను భర్తీ చేయలేదు. తరా>్వత 2007లో, 2013లో తిరిగి నియామకాలు చేపట్టినా ఖాళీలన్నీ భర్తీ కాలేదు. పనిచేస్తున్న అధ్యాపకులు 585 మందే.. మొత్తం 56 విభాగాలకుగాను మంజూరైన అధ్యాపక పోస్టులు 1267. అయితే ప్రతియేటా పదవీ విరమణ పొందడం, మరో వైపు నియామకాలు లేకపోవడంతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఓయూలో శాశ్వత ప్రాతిపదికన 585 అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో 600 మంది అధ్యాపకులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వివిధ విభాగాల్లో మరో 1800 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఇది విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుంది. మాపై దయ చూపండి... శతాబ్ది ఉత్సవాల సందర్బంగానైనా కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(కాంట్రాక్టు) అధ్యక్షుడు డాక్టర్ ఏ.పరశురాములు డిమాండ్ చేస్తున్నారు. -
రాష్ట్రమంతా పండుగలా జరపాలి
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి: కేసీఆర్ విశ్వవిద్యాలయం గత వైభవాన్ని తిరిగి తేవాలి అందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని నూతన తెలంగాణ రాష్ట్రంలో తిరిగి నెలకొల్పాలన్నారు. ఏప్రిల్లో నిర్వహించే ఈ ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో సీఎం సోమవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉట్టి పడాలని ఈ సందర్భంగా చెప్పారు. ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ ప్రాంగణంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న కాలేజీలు, హైదరాబాద్లోని నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ తదితర కాలేజీల్లోనూ పండుగ శోభ కనిపించాలన్నారు. కాకతీయ తదితర యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉత్సవాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ యూనివర్సిటీలో చదివి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వివిధ రంగాలకు చెందిన వారందరినీ ఆహ్వానించి గౌరవించాలని సూచించారు. అన్ని యూనివర్సిటీల వీసీలతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ‘‘ఉత్సవాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానించాలా? ఏర్పాట్లు, కార్యాచరణ ఎలా ఉండాలి? గతంలో దేశంలో శతాబ్ది ఉత్సవాలు చేసుకున్న యూనివర్సిటీలు ఎలా నిర్వహించాయి..? తదితర అంశాలన్నీ పరిశీలించాలి. ఉత్సవాల నిర్వహణపై సమగ్ర నివేదిక అందజేయాలి’’అని డిప్యూటీ సీఎం కడియం, ఎంపీ కేకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీని ఆదేశించారు. వర్సిటీల్లో మౌలిక వసతులు కల్పించాలి ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప యూనివర్సిటీల్లో ఒకటిగా వెలుగొందిన ఉస్మానియా క్రమేణా తన వైభవాన్ని కోల్పోవడం దురదృష్టకరమని సీఎం అన్నారు. చారిత్రక ఘనతను తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోదని స్పష్టం చేశారు. తెలంగాణవ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. యూనివర్సిటీలను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా వైస్ చాన్స్లర్లు నడుం బిగించాలని సూచించారు. మెస్ చార్జీలతో సహా హాస్టల్ వసతులు తదితర అన్ని మౌలిక సౌకర్యాలను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీ కె.కేశవరావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, సలహాదారు పాపారావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితోపాటు, ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రరావు, కాకతీయ వర్సిటీ వీసీ సాయన్న, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్రెడ్డి, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ, తెలంగాణ వర్సిటీ వీసీ సాంబయ్య, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీ కవితా దర్యానిరావు, నల్సార్ యూనివర్సిటీ వీసీ ఫైజాన్ ముస్తఫా, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.